వరవరరావును చంపే కుట్ర చేస్తుంది రాజ్యం

ప్రముఖ విప్లవకవి, ప్రజా మేధావి వరవరరావును భీమాకోరాగావ్ కేసులో ముద్దాయిని చేసి గత ఇరవై నెలలుగా అక్రమ నిర్బంధంలో ఉంచింది రాజ్యం. ఎనభై ఏండ్లు దాటిన ఆయన ఆరోగ్యం గత కొన్ని నెలలుగా బాగా దెబ్బ తిన్నదని ఆయన కుటుంబసభ్యులు, సాహితీమిత్రులు, విప్లవాభిమానులు ఎంతో అందోళన చెందుతున్నారు. వీవీని తక్షణమే విడుదల చేసి మెరుగైన వైద్యం చేయించాలని ప్రజాస్వామికవాదులు, ప్రతిపక్ష రాజకీయ పార్టీల నేతలు, ప్రపంచ మేధావులు భారత ప్రభుత్వంలోని అన్ని విభాగాల ప్రతినిధులను డిమాండ్ చేశారు. వేడుకున్నారు. అయినా ఫలితం ఏమీ లేకుండా పోయింది. ఇప్పుడు పరిస్థితి మరింతగా చేజారిపోతుంది. వీవీ ఆరోగ్యం తీవ్రంగా క్షీణిస్తున్నదని తన సహచరి హేమలత గారికి చేసిన ఫోన్ కాల్ బట్టి అర్థమవుతుంది. “కరోనా కాలంలో మళ్ళెప్పుడు కలుస్తమో సార్ …” అని కొలిమిలో మే నెలలో రాశాను. కాని రాజ్య కరోనాతో వీవీ ప్రాణాలకు ముప్పు వచ్చే స్థితి వస్తుందనుకోలేదు.

ప్రజా జీవితంలో నుండి రాజ్యం చేతుల్లోకి బంధీగా పోయే వరకు వీవీకి వయస్సు మీదపడిన ఆనవాళ్ళు కనబడలేదు. ఆయన మాటలో, ప్రజా సమస్యల విశ్లేషణలో లోతు, పదును తగ్గలేదు. అతని ప్రాపంచిక దృక్పథం చెక్కుచెదరలేదు. తన కార్యరంగమైన సృజనాత్మక ధిక్కార మూలాలు వదులుకోలేదు. నిత్య విద్యార్థిగా చదువుకున్నడు, రాసుకున్నడు. ఎనిమిది పదుల వయస్సులో సహితం ఇరవై ఏండ్ల ఉత్సాహం. ఎక్కడా నిరాశ లేదు. దేనికీ పశ్చాత్తాపం లేదు. మాట మార్చింది లేదు. మాట తడబడింది తెలియదు. పొరాపాటు జరిగితే ఒప్పుకున్నాడు. వీలయితే దిద్దుకున్నాడు.

అతని ఆలోచనలలో సముద్రంలో ఉండే గంభీరత ఉంటుంది. ప్రవాహంలో ఉండే నిత్య చలనం ఉంటుంది. కొత్త విషయాలు వింటున్నప్పుడు మెరిసే అతని కళ్ళు, స్నేహితులు కలిసినప్పుడు విరిసే అతని చిరునవ్వు, అమరుల జ్ణాపకాలలో బోరుమనే అతని గొంతు… అన్నీ అతని పసితనపు ఆనవాళ్ళు. అతను వృద్దాప్యపు బాలుడు. ప్రజా ఉద్యమాల నెగడు. దాదాపు అరవై ఏండ్లుగా తెలుగు నేలపై మాత్రమే కాదు దేశంలో జరిగిన ప్రతి సామాజిక, రాజకీయ ప్రక్రియలకు సాక్షిగా ఉన్నాడు. కేవలం మౌన సాక్షిగా కాకుండా బాధితుల పక్షాన గొంతుకై నిలబడ్డాడు. చుట్టూ నిరాశల చీకటి కమ్ముకున్నా తాను కాగడా అయి వెలుగు దారులు చూపాడు. ఇదంతా ప్రజా ఉద్యమాలలో పనిచేసే ఎందరికో తెలిసిన విషయాలే.

వీవీలో మరో అబ్బురపరిచే అంశం అతని అద్భుత జ్ణాపకశక్తి. గొప్ప చారిత్రక క్రమాన్ని ఎంతగా విడమరిచి చెప్పగలడో, అంతే వివరంగా అనేక చారిత్రక సంఘటనల సూక్ష్మ విషయాలను పూసగుచ్చినట్లు చెప్పగల నేర్పరి. నలబై ఏండ్ల కిందటి ముచ్చటను సహితం తడి ఆరకుండా మన కండ్ల ముందు నిర్మాణం చేయగల సృజనకారుడు. నా స్వీయానుభవంలో ప్రపంచంలో ఎందరో మేధావులను చాలా దగ్గరగా చూశాను, కొందరితో కలిసి పనిచేశాను. కాని వీవీతో పోల్చదగ్గ ప్రజా మేధావిని ఇంతవరకు చూడలేదు. అది అతను నమ్మిన రాజకీయాల బలం.

జీవితమంతా ప్రజల కోసమే తపన పడిన అంత పెద్ద మనిషిని రాజ్యం కక్ష పూరితంగా హింసించడం ప్రజా నేరం. తనను నిజాయితీగా ఎదురుకోలేని పిరికి రాజ్యం తన ఆధీనంలో ఉండగానే చంపే కుట్ర చేస్తుంది. విషప్రయోగం చేసి ఎందరో ఉద్యమకారులను చంపగల్గిన రాజ్యం ఇప్పుడు వీవీ మీద కూడా అలాంటిదేదో చేసే వుండొచ్చని అనుమానం కల్గుతుంది. లేదంటే ఆ కంచుకంఠం ముద్దగా మారడమేంటి? ఒక ప్రవాహంలా సాగే మాట పదాల కోసం వెతుకులాడటం ఏంటి?

అరవై ఏండ్లుగా అలుపెరుగని ఆ స్వరం ఇలా మారుతుంటే హేమక్క ఎలా తట్టుకుంటుందో అనే ఆలోచన వస్తేనే గుండె తరుక్కుపోతుంది. ఇది కేవలం అక్క ఒక్కదాని పరిస్థితి కాదు. ఇది సామూహిక ఆవేదన. అందరం ఒక్క గొంతుగా నినదిస్తే కాని వీవీని కాపాడుకోలేము. న్యాయవ్యవస్థ ఇంకా బతికే ఉంటే ప్రజల గొంతుక వినితీరాలి. ప్రజల మనిషిని బతికించాలి.

ముఖ్యంగా, తెలంగాణ ప్రజలు (ఏ రాజకీయాలలో ఉన్నా) తమ నేల మీద పుట్టి, ఆ నేల విముక్తి కోసం అన్ని పోరాటాలలో అక్షరమై తిరుగాడిన కవిని, నాయకుడిని కాపాడుకోవడం తమ తక్షణ బాధ్యత.

వీవీని కాపాడుకుందాం. ప్రజా మేధావిని బతికించుకుందాం. భవిష్యత్తుకు భరోసా కలిగిద్దాం!

పుట్టింది చారకొండ (పాలమూరు). పెరిగింది అజ్మాపూర్ (నల్లగొండ). సామాజిక శాస్త్ర విద్యార్థి, ప్రజా ఉద్యమాల మిత్రుడు. అమెరికాలో అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా పనిచేస్తున్నాడు.

5 thoughts on “వరవరరావును చంపే కుట్ర చేస్తుంది రాజ్యం

  1. కరోనా మాటున హత్య చేసే కుట్రని కాదనలేం

  2. నూటికి నూరుపాళ్ళు సత్యం….వివి ప్రజల నిజమైన స్పందన!…… ప్రజా సంపద కూడా!…. ఆయన కోలుకోవాలి, త్వరగా విడుదల కావాలి!

  3. ముఖ్యంగా, తెలంగాణ ప్రజలు (ఏ రాజకీయాలలో ఉన్నా) తమ నేల మీద పుట్టి, ఆ నేల విముక్తి కోసం అన్ని పోరాటాలలో అక్షరమై తిరుగాడిన కవిని, నాయకుడిని కాపాడుకోవడం తమ తక్షణ బాధ్యత.

    వీవీని కాపాడుకుందాం. ప్రజా మేధావిని బతికించుకుందాం. భవిష్యత్తుకు భరోసా కలిగిద్దాం!

  4. ✊😡
    Maa Satyam
    My faith in Indian democracy and law has shattered badly and I am very disappointed about the role of NIA investigation farcical agencies,
    and Facade Indian judiciary system.
    They are very deeply sleeped in
    British – Indian bureaucracy system.
    I have no hope, but to appeal before your good self to provide varavara Rao, professor Sai Baba and others, provide a fair trial and give them honest justice. If you really fearless.
    9494052775

  5. ✊🚩😡
    మా సత్యం
    భారతీయ ప్రజాస్వామ్యం మరియు చట్టంపై నా విశ్వాసం బాగా దెబ్బతింది ,మరియు ఎన్ ఐ ఏ దర్యాప్తు వ్యంగ్య సంస్థల పాత్ర గురించి నేను చాలా నిరాశపడ్డాను,మరియు భారత న్యాయవ్యవస్థ,
    బ్రిటిష్ – భారతీయ బ్యూరోక్రసీ వ్యవస్థ లో వారు చాలా లోతుగా నిద్ర పోతు ఉన్నారు.
    నాకు ఆశ లేదు, కానీ వరవరావు, ప్రొఫెసర్ సాయి బాబా మరియు ఇతరులకు సత్యం పట్ల నిబద్ధతతో, విశ్వాసము తో కూడిన న్యాయం అందించాలని, న్యాయమైన విచారణను అందించాలని మరియు వారికి నిజాయితీగా న్యాయం చేయమని మీ ముందు విజ్ఞప్తి చేయడం. మీరు నిజంగా నిర్భయంగా ఉంటే.

Leave a Reply