‘పరావలయం’లో బలమైన అభివ్యక్తి

వస్తువును కవిత్వంగా మలచడం ఓ కళ. వస్తువు ఒక్కటే కాదు అభివ్యక్తి శిల్పం సైతం ప్రధానం. వస్తువు మీద మమకారంతో రచనకు పూనుకుంటే సరిపోదు. తమ లోలోపలి కలవరింతలను అందంగా, ఆర్ద్రంగా అభివ్యక్తం చేయాలన్న తపన కవులకు ఉండాలి. వ్యక్తుల గురించి రాసినా, సంఘటనల గురించి చెప్పినా, సామాజిక పరిణామాలపై స్పందించినా వస్తువును ఎంత పదునుగా, గుండెకు హత్తుకునేలా చెప్పారన్నదే కీలకం. ఈ విషయాన్ని గుర్తించిన కవులు అరుదుగా రాసినా బలంగా రాస్తారు. ఎందుకంటే కవిత్వం అన్నది ఎవరో ఎజెండా ఇస్తేనో, ఒక అంశాన్ని ఇస్తేనో రాసేది కాదు. రాయకుండా ఉండలేనితనమేదో ఒత్తిడి పెడితేనే రాయాలి. అలా రాసేదే అసలు సిసలు కవిత్వం. అలాంటి కవిత్వమే కాలం గడుస్తున్న కొద్దీ నిలబడి వెలుగుతుంది. ఆ కవిత్వం తాలూకు రసానుభూతి పాఠకులను తెలియని పరవశానికి లోను చేస్తుంది. ఈ తరహా కవిత్వం రాసే అరుదయిన కవి ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌. ఏకాంతంలో మనసు పెట్టి శ్రద్ధగా చదివితే ఎంత అందమైన అభివ్యక్తిని సాధించాడో కదా అనిపిస్తుంది. ‘పరావలయం’ లోని కవిత్వం ఇందుకు తార్కాణం. వైయక్తికమూ, సామాజికమూ అనే తేడా లేకుండా ఏ అంశాన్నయినా మనసుకు హత్తుకునేలా కవిత్వం చేసిన ప్రవీణ్‌ కౌశలం విస్మయానికి లోను చేస్తుంది.

ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌ నుంచి 2014లో ‘దు:ఖానంతర దృశ్యం’ కవితా సంపుటి వచ్చింది. 2021లో ఈ ‘పరావలయం’ వెలువడిరది. ఈ రెండు సంపుటాలలో ఎవరి ముందుమాటలు లేవు. కవికీ, పాఠకునికీ నడుమ పీఠికాకర్తల అడ్డుగా ఉండకూడదన్న ఇతని దృష్టి మెచ్చదగింది. కవిత్వం ద్వారానే కవిత్వతత్వం తెలియాలి. ఇందుకు అనువుగానే ప్రవీణ్‌ కవిత్వ సారం, సారాంశం ఏమిటో కవిత్వమే చెబుతుంది.

ప్రవీణ్‌ కవిత్వంలో బహుముఖ కోణాలున్నాయి. తెలంగాణ నేల తల్లి పలవరింతలు, రైతుల సంవేదనలు, ప్రకృతి, పర్యావరణం విధ్వంసం తాలూకు స్పందనలు, వ్యవస్థ వైఫల్యాలపై ధిక్కారం, పాలకుల దుర్మార్గ విధానాలపై ఆగ్రహం, మృత్యుశీతల స్పర్శకు సంబంధించిన ఆనవాళ్ళు… ఇంకా మరెన్నో అంశాలు ఇతని కవితా వస్తువులు.

ఏదీ పని గట్టుకుని, లేదా ఎజెండా పెట్టుకుని రాసినట్టుగా ఉండవు. రాయకుండా ఉండలేని అనివార్యతలోనే ఈ కవితలు కవి నుంచి వెల్లువెత్తాయని బోధపడుతుంది.

*

తెలంగాణ రాష్ట్ర సాకారంతోనే తెలంగాణ ప్రజల ఆశలు తీరలేదు. తెలంగాణను ఇంకా దోచుకోవాలనే పరాయి కుట్రలు ఆగలేదు. ఈ అంశాల మీద ఏ పార్టీ పేరు ప్రస్తావించకుండానే ఏయేశక్తులు ఎలాంటి కుయుక్తులు పన్నుతున్నాయో ‘జాగ్రత్త’ అనే కవితలో చెబుతారు.
“తెలంగాణ ఇంక తెలివితోనే ఉన్నది
నీ తొండి ఆటల తొడలు విరేచేందుకు
సాహసమై నిలబడ్డది” అని ఘంటాపథంగా చెప్పడం విశేషం.
తెలంగాణ ఉద్యమంలో జలవనరులు ప్రత్యేక నినాదం. అందుకే
‘నీటిజ్ఞాపకం’ అనే కవితలో
“అలుగు మీదుగా పారాల్సిన నీటిని
ఆత్మహత్యల ఉరితాళ్ళుగా
పేనిన సమైక్యవాదం
గొలుసుకట్టు చెరువుల
గొలుసులు తెంపి
ఊరుమ్మడి బతుకుల ఊపిరి
మింగిన ఉమ్మడి రాష్ట్రం” అంటూ సమైక్యరాష్ట్ర పాలనలోని పరిస్థితిని గుర్తు చేస్తాడు.

తెలంగాణ వచ్చాక “చెరువు ఊరికి చెలికాడు”గా పరిణమించిన వాస్తవాన్ని చెబుతూ `
“ఊరి పాదాలు చెరువు కట్ట మీద
కదలాడిన నీటి జ్ఞాపకం
చెరువు అంటే చనుబాల ధార
మత్తడి దునికితే పొలాల పులకరింత” అంటూ రాష్ట్ర సాధన అనంతర స్థితిని దృశ్యమానం చేయడం గమనార్హం.

“నది ఒకప్పుడు చుట్టపు చూపు
ఇవ్వాళ ఒట్టిపోయిన చెరువుల్లో
జల సిరులు కురిపించే ప్రజల కలల నీటి పువ్వు” అని ‘నీటిపువ్వు’ అనే కవితలో నదులు, నీళ్ళు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత కొత్త పుంతలు తొక్కిన చరిత్రను కవిత్వం చేయడం మెచ్చదగింది.

ఈ క్రమంలోనే ‘ఒక స్వప్నం తరువాత’ కవితలో
“నీరు ఎత్తు నెరుగు
తెలంగాణ పంటై వెలుగు” అని కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతీకగా తీసుకొని చెప్పడంలో సౌందర్యం వుంది.

తెలంగాణ నైసర్గికతకీ, సంస్కృతికీ ప్రతీక ‘బతుకమ్మ’. ‘పొత్తిళ్ళ స్పర్శ’ కవితలో బతుకమ్మ పండుగ సంరంభాన్ని రూపు గట్టిస్తూ పోరాటాలకు, బతుకమ్మకు, తెలంగాణ నేలకు ఉన్న అవినాభావ సంబంధాన్ని ప్రతీకాత్మకంగా చెప్పడం ఆకట్టుకుంటుంది.
“అనురాగ మందారాల్లో
అనుబంధ సింగారాల్లో
‘అమ్మ’ ఏడుపాయల జాతరై
నిత్యం బొనమెత్తుతూనే వుంది
గిరాయిపల్లి అడవుల మీదుగా
తంగేడు పూల వాసనై
గునుగు పూల నవ్వోలె
బతుకమ్మ ఆడుతూనే వుంది” అని కవిత్వీకరించడంలో విభిన్న ప్రతీకలు దాగున్నాయి. ఏడుపాయల జాతర ఓ సాంస్కృతిక ప్రతీక. ‘గిరాయిపల్లి’ ఉద్యమాలకు సూచిక. వీటిని ఒక కవితలో గుదిగుచ్చి చెప్పడం కవి ప్రతిభకు నిదర్శనం.

తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారమవడంతోనే అంతా ముగిసిపోలేదు. అస్తిత్వ చైతన్యం పదిలంగా ఉండాల్సిన అవసరాన్ని ‘అస్తిత్వపతాక’ కవిత ద్వారా గుర్తు చేస్తాడు ఈ కవి.
“అస్తిత్వపు జెండా అన్నీ చూస్తున్నది
ఎండిన నేలల్లో జల సిరులై పారుతుంది
చిగురించే అడవుల మీద పచ్చని గాలై ఊగుతుంది
పల్లెల వాకిట్లకు పండుగను మోసుకొచ్చింది
దోపిడీ గుండెలకు బల్లెమై బరి గీసింది” అని 2021 సెప్టెంబర్‌లో రాసాడు. తెలంగాణ అస్తిత్వాన్ని, పేరును పదేళ్ళు పాలించిన పార్టీ వదిలేసుకుంది. అయితే జనంలో మాత్రం ఆ అస్తిత్వ చైతన్యం మిగిలే వుంది. ఏ లక్ష్యాల కోసమయితే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారో, ఆ లక్ష్యాలు నెరవేరే వరకు ఈ అస్తిత్వ చైతన్యం తప్పనిసరి అవసరమన్న భావనను వ్యక్తం చేస్తున్నాడీ కవి.

*

ఈ సంపుటిలో మూడు స్మృతి కవితలు చక్కటి అభివ్యక్తితో ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా దాశరథి కృష్ణమాచార్య పేరును ప్రస్తావించకుండానే ‘దీపమాళిక’ అనే కవితని ఆయనకు నివాళిగా రాసిన తీరు ముచ్చట గొల్పుతుంది.
“గాయపడిన కవి హృదయం సాక్షిగా
మానవత్వపు మర్రి ఊడల మీదుగా
నీలి నీలి మేఘమై
వెండితెర వీణని పలికించినావు

*

నీ బాటన నిన్న నడిచింది జన తెలంగాణ
నేడు దివ్యమై వెలుగుతుంది మన తెలంగాణ” అంటూ ఇవాళ దాశరథి కవిత్వాన్ని గానం చేస్తూ, ఆయనను స్మరించుకుంటున్న తెలంగాణ వాస్తవికతను చెబుతాడు.
‘అతడు లేక పాట లేదు’ అనే కవితలో సినారె నిష్క్రమణ అనంతరం రాసిన కవితలో "పూల తేనెలను సిరాగా మార్చే సినారె ఏడని కా (క)లము కలవరపడుతున్నది పాటంటే అతడే అతడంటే పాటే ఇప్పుడు పాట అతడు లేక అంగట్లో కాటగలిసిన బాటయ్యింది" అంటూ సినారెకు నివాళులు అర్పిస్తాడు ప్రవీణ్‌. సినీనటి శ్రీదేవి మరణానంతరం రాసిన కవిత ‘శ్రీదేవి.' "వయసు గర్భ గుడిలోని బొట్టు నీవు నుదుటన అద్ది యవ్వనం గదిలోని కాటుక నీవు దిద్దుకున్నాక వెన్నెల నీ చూపుకై ఎదురు చూసింది" అనడం ఎంత అందమైన అభివ్యక్తి! అలాగే
“వసంతం వాకిట్లో నీవు రాలిపోయి
రంగుల లోకం నుండి నిష్క్రమించాక
పువ్వులు నీ వియోగాన్ని తట్టుకోలేక
కన్నీటి ధారలై కరిగిపోతున్నవి”
అంటూ అందమైన ప్రతీకల ద్వారా శ్రీదేవి ఆకస్మిక మరణం తాలూకు విషాదం మనసును ముప్పిరిగొనేట్టు చేస్తాడు.

*

కరోనా కల్లోలం, పాలకుల వైఫల్యం, వలస కార్మికుల వెతల నడకలు ఈ కవి దృష్టి నుండి తప్పించుకోలేదు.

ఆకస్మిక లాక్‌ డౌన్‌ పాలకుల నిర్లక్ష్యం, దుర్మార్గం ఫలితం. పెద్ద నోట్ల రద్దు కూడా అలాంటిదే. ఈ రెండిటిని ఒకే కవితలో ముడిపెట్టి చెప్పడం కవి అవగాహనను సూచిస్తుంది. అధికారంలో ఉన్నవారి దుర్మార్గపు విధానాల ఫలితాలను తెలియజేస్తున్నది.
‘కొంచెం ఉపశమనం కావాలి’ కవితలో
“నగరాల్లో వంతెనలై
దారుల మీద నున్నని రహదారులమై
కర్మాగారాల్లో పనిముట్లమై
పంటపొలాల్లో విత్తనాలమై
ఈ దేశానికి సంపదలమై
చివరకి రద్దు చేసిన పెద్ద నోట్లలా
వలస కార్మికులమై నడక
నడక నడక నడక…” అంటూ కాషాయ పాలకుల విధానాలు, చర్యలు ఎంత అమానవీయంగా ఉన్నాయో ఈ కవితలో నిక్షిప్తం చేస్తాడు.
‘నీళ్ళింకిన కళ్ళు ` నెత్తుటి పాదాలు’ కవితలో
“ఈ దేశానికి వెలుగులై మండిన వాళ్ళం
మా బతుకులో చీకటి నింపడానికి
మీకు సిగ్గనిపించడం లేదా?
ఇక మా నెత్తుటి పాదముద్రలు
ఎగిరే ఎర్ర జెండాలైతే
మేం వలస కార్మికులం కాదు
గురి తప్పని వడిసెల రాళ్ళవుతం” అని వలస కార్మికుల ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేయడంలో కవి అవగాహన పరిణతి తెలుస్తుంది. ఈ దేశంలో కార్మికుల పక్షాన నిలిచేది కమ్యూనిస్టులేనని, వారి పోరాటాల ద్వారానే సకల దోపిడీ పీడనలనుంచి విముక్తి లభిస్తుందన్న చైతన్యం, స్పష్టతని ఇవ్వడం ఈ కవితలోని సానుకూల అంశం.

ఈవిధంగా ఒక్కొక్క కవితా ఖండికని గమనించి విశ్లేషిస్తే వస్తు శిల్పాల సమన్వయం కనిపిస్తుంది. ఎంచుకున్న వస్తువును ఆర్ద్రమైన రీతిన కవిత్వం చేయడంలో చూపిన శ్రద్ధ తెలుస్తుంది. చాలా కవితల్లో అందమైన అభివ్యక్తులున్నాయి.
“నిద్ర ఒలికిన ఆ రాత్రంతా
ఆమె జ్ఞాపకాల్లో ఇటూ అటూ దొర్లుతుంటే
నాకు విరహపు మరకలు అంటుకున్నాయి” (స్వప్నం)

“ఒక వేకువ కోసం స్వప్నించీ స్వప్నించీ విసిగిపోయాను
విజయం కోసం తపించీ తపించీ అలసిపోయాను
ఇప్పుడు దు:ఖం జాడలేని నేల కోసం దేవులాడుతున్నాను
మరణం లేని రోజు కోసం నిరీక్షిస్తున్నాను” (దేవులాట)

“చెట్టంత మనిషి అంటాం… కానీ
మనిషి చెట్టును ఎప్పుడైనా సహించాడా!?
రంగు రంగుల పూల సుగంధ బంధాలను
ఏనాడైనా నిలుపుకున్నాడా!?” (బతుకు వరం)

ఇలా సాంద్రమైన అభివ్యక్తులు ఎన్నో ఈ కవిత్వలో అందంగా ఒదిగివున్నాయి. అనుభూతి పరవశానికి లోను చేస్తున్నాయి. అందుకే ఈ కవిత్వం మరల మరల చదవాలనిపిస్తుంది. కవిత్వ సుగంధం లేని ఒక్క కవితా ఖండిక కూడా ఈ పుస్తకంలో లేదు. చిక్కదనం, చక్కదనం, గాఢత, సాంద్రత కలగలసి ప్రతికవితను దీప్తిమంతం చేశాయి. నిర్వచనాలకు అందని సౌందర్యంతో అలరారుతున్నది. కవిత్వంలోని క్లుప్తత, సంక్షిప్తత ఈ గాఢతకు మూలం. భారీ ఉపమానాలు లేవు. వస్తువుకు నప్పని భాషా ప్రయోగాలు లేవు. పనిగట్టుకొని మాండలికాన్ని జొప్పించలేదు. పదబంధాలలో, భావచిత్రాలలో సహజమైన అలంకారాలు, ఉపమానాలు కనిపిస్తాయి. కనుకనే క్లిష్టత లేదు. సరళంగా ఉంటూనే ఓ మార్మిక సౌందర్యంతో హృదయాన్ని హత్తుకునేలా రాయడం ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌ కవితా కౌశలం. అందుకే ఇది మన సమయాన్ని సృజనాత్మకంగా మలిచే నిండైన కవిత్వం. మన ఏకాంతాన్ని పరిమళ భరితం చేసే కవిత్వ సంచయం.

జననం సూర్యాపేట. చదువు డిగ్రీ వరకు సూర్యాపేటలో. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీలో ఎం.ఏ రాజనీతి శాస్త్రంలో చేరారు. ఎం.ఏ.లో స్వామి రామానంద తీర్థ బంగారు పతక విజేత. అనంతరం బిసిజె, బి.ఇడి చేశారు. ఇప్పటివరకు పది పుస్తకాలు అచ్చయ్యాయి. కలం పేరుతో మరో రెండు పుస్తకాలు వచ్చాయి. ఒక కవితా సంపుటి, రెండు జీవిత చరిత్రలు. మరొకటి ప్రపంచ సాహిత్యంలోని మేలిమి రచయితల పరిచయ వ్యాసాలు. మిగతావి విమర్శనా వ్యాసంగానికి సంబంధించిన పుస్తకాలు, కథారచన ఇష్టమైన వ్యాపకం. రాసింది కొన్ని కథలే. 'సంవిధానం' కథా సాహిత్య వ్యాసాల సంపుటి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ విమర్శనా గ్రంథంగా పురస్కారం పొందింది. కవిత్వం, కథ, విమర్శ, జీవితచరిత్ర ప్రక్రియల్లో రచనలు చేస్తున్నారు. జర్నలిజంపై మమకారం, సాహిత్యంపై ఆసక్తి. చదువుకునే రోజుల్లో 'చైతన్యవాణి', 'ప్రజావాణి' లిఖిత పత్రికల నిర్వహణ. డిగ్రీలో ఉండగా 'స్రవంతి' సైక్లోస్టయిల్డ్ పత్రిక, పి.జి. అనంతరం 'ఉజ్వల' బులిటెన్ నిర్వహణలో కీలక భాగస్వామి. 'పాలపిట్ట బుక్స్' ఎడిటర్గా దాదాపు వందకు పైగా పుస్తకాలను ఎడిట్ చేశారు. 'పాలపిట్ట' మాసపత్రిక సంపాదకునిగా సాహిత్య జర్నలిజంలో కొత్త ఒరవడిని పాదుకొల్పారు. రచనలకు సంబంధించి వస్తే సాహిత్యం, సాహిత్యేతర రచనలు అనేకం చేశారు. సొంతంగా రాసిన వాటి కన్నా వివిధ కలం పేర్లతో చేసిన రచనలు అనేకం. వృత్తి: లెక్చరర్ కాబోయి జర్నలిస్టు అయ్యారు. ఉస్మానియాలో చదువుకునే రోజుల్లోనే కొంతకాలం 'సాయం కాలం' సాయంత్రపు దినపత్రికలో సబ్ ఎడిటర్గా ఉద్యోగం. పిజి పూర్తి చేశాక 'నలుపు' పక్షపత్రిక ఆరంభంలో కొన్నినెలలు ఉన్నారు. తర్వాత కొన్నాళ్ళు లెక్చరరుగా ఉద్యోగం. అనంతరం 'ఆంధ్రజ్యోతి' దినపత్రికలో చేరి నాలుగేళ్ళు పనిచేశారు. తర్వాత 'వార్త'లో చేరారు. వివిధ విభాగాల్లో పని చేసినప్పటికీ సుదీర్ఘకాలం పాటు 'వార్త' ఆదివారం ఎడిటర్గా ఉన్నారు. ఫీచర్ జర్నలిజంలో నవీన ధోరణులని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం 'నవతెలంగాణ' దినపత్రికలో అసిస్టెంట్ ఎడిటర్గా పని చేస్తున్నారు.

Leave a Reply