ఒగ్గు చుక్క

అతనొక ఒగ్గు కథా పిపాసి. తన జానపద కళలతో నిత్యం ప్రజల పక్షాన వుండి ప్రజలను మేలుకొలుపుతూ, చైతన్యపరుస్తూ జానపద కళల్ని ప్రజలకు అంకితం చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే ‘‘కళ కళ కోసం కాదు, కళ ప్రజల కోసం’’ అని నమ్మి తన కళా జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారు. అన్ని ప్రభుత్వాలు, ప్రభుత్వ పాలకులు డా. చుక్కా సత్తయ్య గారి కళా ప్రతిభకు ముగ్దులై ప్రసంశలు, సన్మానాలు చేసినప్పటికీ నిత్యం ప్రజల సమస్యలను ఆకలింపుగా చేసుకొని ఆ సమస్యలను ఒగ్గు కథలో ఇమిడించుకొని ప్రజల పక్షాన పాలకుల్ని ప్రశ్నించాడు డా. చుక్కా సత్తయ్య.

ఒగ్గుకథను అనుసరించి ‘‘జన నాట్యమండలి’’ విప్లవ ఒగ్గు కథలను ప్రజా ఉద్యమాలపై మళ్ళించింది. అదే విధంగా ‘‘ప్రజా నాట్య మండలి’’, ‘‘ప్రజా కళా మండలి’ చుక్కా సత్తయ్య ప్రదర్శించే పల్లె సుద్దులను గొల్ల సుద్దులుగా చేసి సమాజంలో జరుగుతున్న అన్యాయం నుండి ప్రజలను చైతన్యపరుస్తున్నాయి. నాజర్‍ బుర్రకథ, జమిడికగా అన్ని కళారూపాలు డా. చుక్కా సత్తయ్య గారు ప్రదర్శించిన కళల ఉండి రూపాంతరం చెందిన ప్రజా కళలుగా ప్రజల గుండెల్లో జీవం పోసుకొని జీవిస్తున్నాయి.

‘రవి గాంచని చోట కవి గాంచును’’గా చుక్కా సత్తయ్య ప్రజల హృదయాల్లో సజీవంగా జీవిస్తున్నాడు జానపద కళలకు ప్రపంచ స్థాయిలో ఒక విప్లవాత్మకమైన గుర్తింపును, ప్రాముఖ్యతను తీసుకొచ్చాడు డా. చుక్కా సత్తయ్య.

ఒగ్గు కథ పితామహుడు మన డా. చుక్కా సత్తయ్య గారు జానపద కళల ప్రాముఖ్యతను ప్రపంచానికి చూపించిన కళా మహా(వీరుడు)నీయుడు డా. చుక్కా సత్తయ్య. ఉమ్మడి వరంగల్‍ జిల్లాలోని ప్రస్తుత జనగాం జిల్లా, లింగాల ఘణపురం మండలంలోని మాణిక్యపురం అనే చిన్న మారుమూల గ్రామంలోని సాయమ్మ – ఆగయ్య అనే దంపతులకు 29-03-1935 రోజున జన్మించారు. ఇతని ఇంటి పేరు ‘భైరంపల్లి’ తన నుదుట రెండు పాదాల మాదిరిగా చుక్క ఉండేది అలా చుక్క ఉండడం మూలంగా ఊర్లో అందరు ముద్దుగా చుక్కా సత్తయ్య అని పలకరించేవారు. కాలక్రమేపి ఆ పేరే సత్తయ్య ఇంటి పేరుగా మారింది. అపుడు అతను చుక్కా సత్తయ్యగా సమాజంచే పిలువబడ్డాడు. అతను 1వ తరగతి వరకు చదువుకున్నాడు. తనకు తానుగా తెలుగులో చదవటం, రాయటం నేర్చుకొని తనకున్న కళపై పట్టు తెచ్చుకున్నాడు. 11 యేండ్ల కే వివాహం జరిగింది. తన 14వ యేట నుండే (అప్పుడప్పుడే) జానపద ప్రదర్శనలు ప్రదర్శించటం సురువుజేసిండు. తను మొట్టుమొదటగా ‘‘కీళ్ళ గుర్రం’’ అనే కథలను ప్రదర్శించటం జరిగింది. కుటుంబ బాధ్యత, బతుకు దెరువు వీటి అన్నింటికి మించి తనకు కళపై ఉన్న మక్కువే హైదరాబాద్‍కు వచ్చేలా చేసింది. హైదరాబాద్‍కు వచ్చి వృష్ఠి కథలు, బీరప్ప కథలు, మల్లన్న కథలు, ఎల్లమ్మ కథలు, ఒగ్గు కథలపై ప్రదర్శనలు ఇవ్వటం జరిగింది. తన మానవ జీవిత జీవనాన్ని కళా జీవితంగా మరియు కళా జీవిగా పేరుగాంచాడు. ప్రజలు తమ బతుకు భారాన్ని మోస్తూ పొద్దంత చెమట చుక్కలను చిందిస్తూ శ్రమించేవారు అయన శ్రమకు తగిన ఫలితం దక్కక శ్రామికులు శ్రమ దోపిడికి గురవుతున్న ఈ సమాజంలో జానెడు పొట్టకు సగం డొక్కను నాలుగు మెతుకులతో నింపుకుంటు కొండల్ని సైతం పిండి చేయగలిగే బక్క జీవులు వారి రెక్కల్ని నమ్ముకొని బ్రతుకీడుస్తున్న ప్రజలు వారి శ్రమను, అలసటను మరియు వారు గురవుతున్న దోపిడి నుండి విముక్తి కల్గించాలి, సామాజిక చైతన్యం తేవాలనే తన ఆలోచనలు ఈ సమాజానికి అక్షర జ్ఞానం అవసరం అనే వైపు అడుగులు వేశాయి.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించుకుంటూ ఎన్నో కార్యక్రమాలు, ప్రదర్శనలు ఇచ్చాడు. సాధారణంగా పల్లెలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను గూర్చి ప్రజలకు అంతగా తెలియదు దానిని ఆసరాగా చేసుకొని పేద ప్రజల పొట్టకొట్టడానికి రక్తాన్ని పీల్చే జలగవలే అవినీతి నీచ రాజకీయ నాయకులు, అధికారులు వారి యంత్రాంగం కొమ్ముకాచుకొని ఉంటారు. రేపు రా.. మాపు రా… అంటు చెప్పకనే చెప్పుకుంటూ ప్రజలను ముప్పతిప్పలు పెట్టుకుంటు పాదాలకు రక్తం పేరుకునేలా తిప్పుకుంటారు. ఇక చేసేదేమి లేక పథకం అమలవుతుందనే గంపెడంత ఆశతో అడిగినంత కాకపోయిన ఎంతోకొంత లంచాన్ని ఇవ్వటానికి తట్టి చెంబులు అమ్మి కాళ్ళవేళ్ళ పడుతారు పీడిత ప్రజలు.

ఇలాంటి దుర్భర పరిస్థితి నుండి ప్రజలను మేల్కొలిపి విముక్తి చేయగలిగాడు సమాజానికి ఎనలేని కృషి చేశాడు డా।। చుక్కా సత్తయ్య. ప్రస్తుత సమాజంలో కొంత మంది బుద్ది జీవులు ఎట్లైన ఈ సమాజాన్ని మార్చాలి… మార్చాలి… మార్చాలి… అంటు రాజ్యాధికారంతోనే మార్పు సాధ్యమంటు ఊకదంపుడు ఉపాన్యాసాలు, మూటలకొద్ది కరపత్రాలు (రంగురంగుల) పంచుతూ దంచికొట్టె రాతలు రాస్తుంటారు కనీసం పనులు ఊరు తంగేళ్ళు కూడా దాటడం లేదు.

మార్పు తేవాలంటే చుక్కా సత్తయ్యలా ప్రజలతో ఏకమై, మమేకమై నిరంతరం ప్రజలతతో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ తనదైన శైలితో చైతన్య మార్గం వైపు తన గొప్ప సాహిత్యం, ఆటలు, పాటలను ప్రజలో ప్రయోగాత్మకంగా, ప్రత్యక్షంగా కళ్ళకు కట్టెవిధంగా (అద్దం పట్టినట్లు)గా సమసమాజ మార్పుకై బయలుదేరి తన కళలతో ప్రపంచానికి విపృత పరిచాడు. ఈయన కుల నిర్మూలన కోసం ఒగ్గుకథతో ప్రచారం చేశాడు. ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఉన్నత విద్య, ఫ్యామిలి ప్లానింగ్‍, చెడు అలవాట్లు, మద్యపానం మరియు మొదలగు వాటిపై తన ప్రదర్శనలు ఇచ్చి నిత్యం ప్రజలను ఆలోచించేలా చేసాడు. ఇతను ఇప్పటి వరకు దాదాపు 12000 కు పైగా ప్రదర్శనలు ఇచ్చారు.

డా. చుక్కా సత్తయ్య ప్రజలను రాత్రి బడులకు వెళ్ళేటట్టుగా తన ఆటలను, తన పాటలను జ్ఞానంతో, విజ్ఞానంలో ప్రజలకు సులభంగా ఆర్ధమయ్యే విధంగా పాటలకు బాణీలు అల్లుకొని (కట్టుకొని) ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రజలలో ప్రదర్శనలు ఇస్తూ ప్రజల చీకటి బతుకులలో తన ఆటపాటలు అక్షరం అయ్యి వెలుగులు నింపే వెన్నెలలు అయ్యాయి. సమాజంలో వుండే అన్ని సామాజిక వర్గాలు ముఖ్యంగా పీడిత ప్రజలకు జ్ఞానం తప్పనిసరి అని గ్రహించి వారి యొక్క ఆలోచనలు పూర్తిగా రాత్రి బడులకు వచ్చి చదువు నేర్చుకునేంతగా చుక్కా సత్తయ్య గారి ఆటపాటలు మరియు ప్రదర్శనలు ప్రజలను అంతగా ప్రభావితం చేయించబడ్డాయి. ఆయన పాటలు, ఆటలు పెట్టుబడి దారుల చేతిలో దోపిడికి, శ్రామిక, పీడిత సమాజ విముక్తికై అక్షరం రాని నిరక్ష్యరాస్య జీవితాలలో అక్షర వెలుగులు నింపాయి. ఆ అక్షరం అన్యాయాన్ని ఎదిరించే దిక్కార స్వరం అయింది. చుక్కా సత్తయ్య నిత్యం ప్రజలతో వుంటూ తన ఆట పాటలతో ప్రజలను ఆలోచించేలా చేశాడు. అందరిని ఆకట్టకున్నాడు. రోజంత కష్టపడి జానెడు పొట్టకు నాలుగు మెతుకులు తినుకుంటు శ్రమను మర్చిపోయేలా, ఆటపాటలతో ఆకర్షించే విధంగా ప్రజలను చదువుకునేలా ప్రోత్సహించారు.

శ్రమ జీవులలో మార్పు తేగల మరో మార్కస్, పూలే అయ్యాడు చుక్కా సత్తయ్య
విద్యలేని పేదవాడు మద్యరకం బీదవాడు
లోకంలో నీ బతుకు చీకటాయే కూలన్న
అక్షర ముక్క చదువకుంటే కష్టముండదన్న
కష్టమును తీరునంటరో మల్లన్న
రాత్రి బడికి పోదామురో గంట సేపు
మక్కజొన్న సేను వేస్తే నక్కలన్ని మేసిపాయే
కొప్పుగుడిసే కూలిపాయే ఎక్కడేమి లేకపాయే
పొట్టనిండ తిండి లేక కూలి జేయనేను బోతిరో లింగన్న
అనే పాటలతో చైతన్య పరిచేవాడు

20కు పైగా క్యాసెట్లు (ఆల్బం) తీసాడు. ఉమ్మడి వరంగల్‍ జ్లిలోని ప్రతి గ్రామంలో జానపద ఒగ్గు ప్రదర్శనలు ఇచ్చాడు. తెలంగాణలోని అన్ని జిల్లాలలో, భారతేదశంలోని మహారాష్ట్రం, అరుణాచల్‍ ప్రదేశ్‍, అస్సాం, సిక్కిం, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‍ ఇతర రాష్ట్రాలలో మరియు దేశాలలో కూడా తన ప్రతిభతో ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు అప్పటి ఎన్‍టిఆర్‍ హయంలో జిరగిన మహనాడులో అద్భుతమైన జానపద కళా ప్రదర్శనలు ఇచ్చి ఎన్‍.టి.ఆర్‍.ని ముగ్దున్ని చేసి తనకు తానై రంగస్థలంపైకి వచ్చి తనతోపాటు నృత్యం చేసే విధంగా ఆకట్టుకుంది.

ఈ విధంగా డా. చుక్కా సత్తయ్య ఎన్నో గొప్ప జానపద ప్రదర్శనలు ఇవ్వటం, పాటలు రాయటం, ఇలా సత్తయ్య గారి జీవితం ఒక గొప్ప జానపద ఘట్టంగా భావించవచ్చు.

పురస్కారాలు – గౌరవాలు:
-2004 లోని రాష్ట్రపతి అబ్దుల్‍ కలాం చేతుల మీదుగా ఇతని సంగీత సాహిత్యానికి (కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం) కేంద్ర సంగీత నాటక పురస్కారం చిరు నవ్వుతో పరకరిస్తూ వాలిపోయింది.

-2005లో అప్పటి ఉమ్మడి ఎ.పి. గవర్నర్‍ సుశీల్‍ కుమార్‍ షిండే చేతుల మీదుగా – కాకతీయ యూనివర్సిటి గౌరవ డాక్టరేట్‍ గంతులేసుకుంటూ చుక్కా సత్తయ్యను డా. చుక్కా సత్తయ్యగా గౌరవించింది.

-2012 లో తిరుపతిలోని ప్రపంచ తెలుగు మహాసభల్లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‍ ముఖర్జి సత్తయ్య గారి జానపద ప్రదర్శలనకు గాను బంగారు పథకం ఇచ్చి బంగారమొలె సత్కరించారు.

పి.వి. నర్సింహరావు, ఇందిరాగాంధీ, రాజీవ్‍ గాంధీ, సోనియా గాంధీ వంటి వ్యక్తులతో (నాయకులతో) గొప్పగా ప్రశంసలు, సన్మాన సత్కారాలు అందకున్నాడు.

ఇందిరాగాంధీ పాలన సమయంలో ప్రభుత్వ పథకాలను గూర్చి జన పదాలలోకి మార్చకొని ఒగ్గుకథ ప్రదర్శనలు ఇచ్చాడు వేల మంది శిష్యులను కూడా తయారు చేసాడు. అనారోగ్యంతో మరణించారు. ఈ విషాద ఛాయ కళా ప్రపంచానికి తీరని లోటును మిగిల్చింది. మనకు భౌతికంగా దూరంగా వున్న సత్తయ్య గారు ప్రాణం పోసిన జానపద కళలు వర్ధిల్లుతాయి. జానపద కళలతో జానపద కళలుగా సమాజంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చిన గొప్ప జానపద విప్లవ కళాకారుడు చుక్కా సత్తయ్యకు కన్నీటి జోహార్లు.

పుట్టింది ఉమ్మడి నల్గొండ జిల్లా, దత్తాయపల్లి(ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా). పరిశోధకుడు, కవి, గాయకుడు.
M.P.A, M.A చదివాడు. వివిధ పత్రికలు, అంతర్జాల పత్రికల్లో కవితలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి.

One thought on “ఒగ్గు చుక్క

Leave a Reply