కాలిఫోర్నియాలో ఘనంగా ‘వీక్షణం’ 100వ సాహితీ సమావేశం

కాలిఫోర్నియా బే ఏరియాలోని “వీక్షణం” సంస్థాపక అధ్యక్షులు డా. కె.గీత ఆధ్వర్యంలో 100 వ సాహితీ సమావేశం అంతర్జాల సమావేశం డిసెంబరు 12, 2020న విజయవంతంగా జరిగింది. డా. కె.గీత, కిరణ్ ప్రభ, వేమూరి వేంకటేశ్వర్రావు గార్లు స్వాగతోపన్యాసాలు చేశారు. ఈ సభకు విశిష్ట అతిథులుగా తానా పూర్వ అధ్యక్షులు జంపాల చౌదరి, వంగూరి ఫౌండేషన్ సంస్థాపకులు చిట్టెన్ రాజు వంగూరి విచ్చేసారు. ముందుగా జంపాల చౌదరి మాట్లాడుతూ ఏ సంస్థ విజయానికైనా పేషన్ కలిగిన సారధులు ముఖ్యమని పేర్కొన్నారు. చిట్టెన్ రాజు వంగూరి వీక్షణానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అమెరికాలోని రచయితలందరూ గొప్ప కథలు రాయాల్సిన ఆవశ్యకతని గుర్తుచేశారు. ఇటువంటి సాహితీ వేదికలు అందుకు స్ఫూర్తిదాయకాలవుతాయని అన్నారు.

ఆరు వేదికలుగా జరిగిన ఈ కార్యక్రమంలో తరువాత “డయాస్పోరా కథలు – స్థానిక కథా వస్తువులు” అనే చర్చా వేదికను మృత్యుంజయుడు తాటిపామల నిర్వహించారు. ఇందులో చిట్టెన్ రాజు వంగూరి, చంద్ర కన్నెగంటి, ఆరి సీతారామయ్య, వేమూరి వేంకటేశ్వర్రావు, అనిల్ రాయల్, డా. కె.గీత తదితరులు పాల్గొన్నారు. అర్థవంతంగా, ఆసక్తిదాయకంగా జరిగిన ఈ చర్చలో రచయితలు తమ సామాజిక పరిధిని పెంచుకున్నప్పుడే స్థానిక కథ వస్తువుల మీద రాయగలిగే అవకాశం ఉంటుందని సభ్యులు అభిప్రాయపడ్డారు.

అనంతరం కవి సమ్మేళనాన్ని మధు ప్రఖ్యా నిర్వహించారు. క్రాంతి శ్రీనివాసరావు, విన్నకోట రవిశంకర్, అనంత్ మల్లవరపు, ఇంద్రాణి పాలపర్తి, తమ్మినేని యదుకులభూషణ్, శ్రీధర్ రెడ్డి, ప్రసాద్ వరకూరు, చంద్ర హాస్, తాటిపర్తి బాలకృష్ణారెడ్డి, దాసరాజు రామారావు, నాగరాజు రామస్వామి, షంషా శశి ఇంగువ, దాలిరాజు, కృష్ణకుమార్ పిల్లలమఱ్ఱి, సురేంద్ర దారా వంటి 25 మందికి పైగా ప్రముఖ కవులు విభిన్నాంశాల మీద కవిత్వం వినిపించారు. తరువాతి కార్యక్రమం పత్రికా నిర్వహణ – స్త్రీల ప్రాతినిధ్యం చర్చా వేదికను శారద కాశీవఝల గారు నిర్వహించారు.

ఈ చర్చలో కాంతి పాతూరి (కాలిఫోర్నియా) కౌముది, లక్ష్మి రాయవరపు (కెనడా)తెలుగుతల్లి, దీప్తి పెండ్యాల (హ్యూస్టన్)మధురవాణి, డా. గీత (కాలిఫోర్నియా) నెచ్చెలి పత్రికాధిపత్యం వహిస్తూ పాలొన్నారు. స్త్రీలుగా పత్రిక నిర్వహణలో తమ అనుభవాలను సభలోని వారితో పంచుకుని కొత్తగా పత్రికా నిర్వహణలోకి అడుగుపెడుతున్న స్త్రీలకు ఆదర్శప్రాయంగా నిలిచారు. ఆ తర్వాత డా. రమణ జువ్వాడి ప్రత్యేక అతిథి ప్రసంగం చేశారు. కిరణ్ ప్రభ ఆధ్వర్యంలో జరిగిన సాహితీ క్విజ్, డా. కె.గీత పాడిన లలిత, జానపద గీతాలు అందరినీ విశేషంగా అలరించాయి. మధ్యాహ్నం నుండి నిరంతరాయంగా జరిగిన అష్టావధాన కార్యక్రమాన్ని రావు తల్లాప్రగడ గారు నిర్వహించారు. అవధాని శ్రీచరణ్ పాలడుగు గారిచే జరిగిన ఈ అష్టావధానంలో నాగ వెంకట శాస్త్రి ఆశీస్సులు అందజేయగా, ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ కీలకోపన్యాసం చేశారు. ఇందులో పృచ్ఛకులుగా రావు తల్లాప్రగడ, శ్రీ వికాస్ విన్నకోట, డా. కె.గీత, శ్యామ్ సుందర్ పుల్లెల, సుమలత మాజేటి, మధు ప్రఖ్యా, శారద కాశీవఝల గార్లు పాత్రలు వహించారు. రఘు మల్లాది సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. డా. కొండపల్లి నీహారిణి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సింగపూర్ శ్రీ సాంస్కృతిక కళాసారధి సంస్థాపకులు కవుటూరు రత్నకుమార్, ఆస్ట్రేలియా తెలుగు సమాఖ్య అధ్యక్షులు రావు కొంచాడ ప్రసంగించారు. ఈ సభకు డా. కె.గీత వందన సమర్పణ చేసి సభను ముగించారు. లక్ష్మి రాయవరపు, శ్రీదేవి యెర్నేని, కె.ఎస్.ఎం.ఫణీంద్ర గార్లు సాంకేతిక సహకారం అందించారు.

ప్రపంచ వ్యాప్తంగా అనేకులు వీక్షించి, అభినందనలందజేసిన వీక్షణం 100వ సాహితీ సమావేశాన్ని యూట్యూబు లో ఇక్కడ చూడవచ్చు.

Leave a Reply