ఆధ్యాత్మిక ఫాసిజానికి ప్రతినిధులే ప్రవచనకారులు

మొన్నటి వరకు “చాదస్తపు మాటలు” అని ఈసడించుకున్న వాటినే ఇప్పుడు జనాలు చాటంత చెవులేసుకొని వింటున్నారు. జీవిత చరమాంకంలో కాలక్షేపం కోసం వినే ప్రవచనాలు ఇప్పుడు “జీవిత సారం” తెలుసుకోవడం కోసం వింటున్నామని యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా మీదికి ఎగబడుతున్నారు. “మాకు భలే గిరాకీ పెరిగిందని” స్వయంగా ప్రవచనకర్తలే కాసింత గర్వంగా చెబుతున్నారు. వాళ్ళ వెలుగుబాటు రాజకీయ శూన్యంలో జరగటంలేదని, గత ఎనిమిదేండ్లుగా హిందూ రాష్ట్ర స్థాపనకు పునాదులు వేసుకుంటున్న సంఘ్ పరివార్ రాజకీయ నీడలో జరుగుతుందని ప్రవచనకారులు చెప్పకనే చెబుతున్నారు.

కొత్త కాషాయ గాలి తెలుగు నేల మీద వీస్తుంటే ప్రవచనకారుల స్వరం పెరుగుతుంది. వాళ్ళను ఫాలో అయ్యే మంద ఎక్కువవుతావుంటే వారి మాట మదమెక్కుతుంది. వేల ఏండ్లుగా సమాజాన్ని అణిచివేయడానికి వాడుకున్న భావజాలాన్ని “కొత్త సీసాలో పాత మత్తు”గా ఆధ్యాత్మికత పేరిట సామాజిక వేదికల మీది నుండి ప్రవచిస్తున్నారు. ఆశ్చర్యంగా ఈ కొత్త వాతావరణంలో అణిచివేత, దోపిడీ, పీడనకు గురైన వర్గాలు, కులాలు, లింగాలు ఈ ప్రవచనకారులకు భజనపరులుగా మారుతున్నారు. అయితే కనీసం కొందరైనా ఆలోచనాపరులు, సామాజిక కార్యకర్తలు ప్రవచనకారుల ముసుగు తొలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రవచనాల పేరుతో కొనసాగిస్తున్న హింసను ఎండగడుతున్నారు.

అయితే ఈ ప్రవచనకారుల గురించి చర్చ వచ్చినప్పుడల్లా ఒక పెద్ద ‘మనోభావాల బ్యాచ్’ ట్రోలింగ్ కు సిద్ధమయిపోతుంది. ఈ బ్యాచ్ కు విషయం అర్థం కావాల్సిన పనిలేదు. అసలు ఆలోచించాల్సిన పని కూడా లేదు, ఎందుకంటే ఆ పని వేరే వాళ్లకు అప్పగిస్తారు. వీళ్లు ప్రతి చిన్న దానికి మనస్సును గాయ పరుచుకోని గాయి గాయి చేస్తుంటారు. మరో ‘అమాయకపు/అయోమయపు బ్యాచ్’ “వాళ్ళకు చేతనైన పనేదో వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ల మాటలు మనకు నచ్చకపోతే వినకుండా వుంటే సరిపోతుంది. వాళ్ళను వినడం దేనికి?, విమర్శించడం దేనికి?” అని సుద్దులు చెబుతుంటారు.

ఇది కేవలం వ్యక్తులుగా వినడం, వినకపోవడం గురించి కాదు. ఎందుకంటే ప్రవచనకారులు తమ ఇంట్లో కూర్చోని గునుక్కోవడం లేదు. పబ్లిక్ స్పేస్ లో కూర్చొని “మొత్తం సమాజాన్ని ‘ఉద్దరించడం’ కోసమే ఆధ్యాత్మిక బోధన చేస్తున్నామని” చెబుతున్నారు. చెప్పేవాళ్ళు తమకు తాముగా ఏదైనా బాధ్యతను ఆపాదించుకోవచ్చు. కానీ, వినేవాళ్ళకు కూడా హక్కులుంటాయి. తమకు ఇష్టమొచ్చింది చెప్పి “ఇదే పరమ సత్యం” అని చెప్పుకుంటూ పోవడం ఈ ఆధునిక కాలంలో ఒప్పుకునే విషయం కాదు.

పైన చెప్పిన రెండు బ్యాచ్ లతో పాటుగా “గురువు గారి బ్యాచ్” అనే మూడో బ్యాచ్ కూడా ఒకటి ఉంది. “ప్రవచనకారులు భాషా, సాహిత్య రంగాలలో ఉద్దండ పండితులు. అలాంటి గురువులు చెప్పేది విని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలే తప్ప వాళ్ళను అపార్థం చేసుకోవద్దు, తప్పుపట్టొద్దు. ఎందుకంటే వాళ్ళను విమర్శించే స్థాయి మనకు లేదు.” ఇలాంటి వాళ్ళు తమ మెదడును ఆ గురువుల పాదాల దగ్గర పెట్టి మాట్లాడుతుంటారు.

అయితే వీళ్ళకు అర్థం కాని విషయం ఏమంటే అసలు ఆ పండితుల జ్ఞానం దేనికి సంబంధించింది? ఆ జ్ఞానాన్ని ప్రసరించి వాళ్ళు సమాజాన్ని ఎటువైపునకు తీసుకుపోవాలని అనుకుంటున్నారు? అసలు ఎవ్వరూ ఈ పండితులు? కట్టకట్టుకొని ప్రవచనకర్తలు అందరూ బ్రాహ్మణులే ఎందుకయ్యారు? వాళ్ళకే ఈ సమాజాన్ని “ఉద్దరించాలని” ఎందుకు అనిపిస్తుంది? తరతరాల అన్యాయాలకు పుక్కిటి పురాణాల పేరిట ఎందుకు మద్ధతును కూడగడుతున్నారు? వాళ్ళు చెప్పే ప్రవచనాలలో ఏ సాహిత్యమైనా వుండనీ, అది ఎవరి ఆధిపత్యం కోసం పనిచేస్తుందో చూడాలి. ప్రవచనకారులు మొత్తంగా ఏ విధంగా బ్రాహ్మణీయ హిందూత్వ భావజాలాన్నీ పునరుద్ధరించే పనిచేస్తున్నారో చూడాలి. మన సమాజంలోని అన్ని రకాల అణిచివేతలకు, హింసలకు కావాల్సిన భావజాల, సాంస్కృతిక పునాదిని ఎట్లా ఏర్పాటు చేస్తున్నారో చూడాలి.

ప్రవచనకారులు చేస్తున్న పని మొత్తం పెను ప్రమాదమై ముంచుకొస్తున్న హిందూత్వ ఫాసిజానికి భావజాలరంగాన్ని సిద్ధం చెయ్యడం. మతం మత్తును సుతిమెత్తగా నరనరానికి ఎక్కించడం. సాంప్రదాయం పేరిట కట్టుబాట్లతో మనిషి స్వేచ్ఛను, సమాజ పురోగతిని అడ్డుకోవడం. అయితే ఆధునికత పేరిట, అభివృద్ధి పేరిట జరుగుతున్న విధ్వంసాన్ని ఎవ్వరైనా ప్రశ్నించవచ్చు. కానీ ప్రశ్న హేతుబద్ధమై, శాస్త్రీయమైనదై వుండాలి. ఆ ప్రశ్న సమన్యాయం, సమతా భావనలకు దారులు వేసేదిగా ఉండాలి. అంతేకాని ఆధునిక భావనలను, నవ జీవన వ్యవహారాలను ఎద్దేవ చేస్తూ కట్టుబాట్ల కంచె వెయ్యొద్దు. “వేదాల్లోనే అన్నీ వున్నాయిష” అని, అదే సత్యమని దబాయిస్తే సరిపోదు.

ప్రవచనకారులు రూపంలో ఒక్కో విధంగా కనిపిస్తున్నప్పటికి, సారంలో అంతా ఆధ్యాత్మిక ఫాసిస్టులే! ఇప్పుడు సాధారణ భాషలో “ఫాసిజం” అనేది ఒక తిట్టు పదంగా మారింది. కానీ అది ఒక రాజకీయ సిద్ధాంతం, ఆచరణ. ప్రపంచాన్ని ఏకదృష్టితో చూసే రాజకీయం. ఫాసిస్టులు తాము ఇతరుల కంటే (అంటే తమలో భాగం కాని, తమ భావాలను అంగీకరించని, తామ శతృవు అనుకునే వారితో పోలివుండే ఎవ్వరైనా) గొప్పవాళ్ళమని నమ్మేవాళ్లు. అంతేకాదు, ఆ భావనతో హింసను కొనసాగించేవాళ్ళు. ఇతర భావాలను ధ్వంసం చేసేవాళ్లు. ఆధిపత్యాన్ని నిర్మాణం చేసి దానిని నిత్య జీవితంలో భాగం చేసేవాళ్లు.

అటువంటి రాజకీయాలతో జాతీయవాదం పేరిట ఇటలీలో అన్ని ఉదారవాద, ప్రజాస్వామిక సంస్థలను బుల్డోజ్ చేసి నెత్తుటి ఏరులు పారించిన “నేషనల్ ఫాసిస్టు పార్టీ” నాయకత్వాన్ని కలిసి వాళ్ళ సలహా, ప్రోత్సాహంతో భారతదేశంలో అతి-జాతీయవాదాన్ని (ultra-nationalism) కలగన్నది సంఘ్ పరివార్ శక్తులు. ఇటాలియన్ ఫాసిస్టులు గర్వంగా తమ సిద్ధాంతాన్ని, అస్తిత్వాన్ని ప్రకటించుకున్నారు. కానీ చివరికి ఆ ఫాసిస్టులను ప్రజలు నడిరోడ్డు మీద ఉరికించారు. మిలాన్ చౌరస్తాలో ఫాసిస్టుల శవాలను తలకిందులుగా వేలాడగట్టి చెప్పు దెబ్బలు కొట్టారు. చరిత్రలో ఫాసిజం ఓడిపోయింది కాబట్టే హిందూత్వ శక్తులకు ఫాసిస్టు పోలిక రుచించడం లేదు. కానీ తాము నడుస్తున్నది ఫాసిస్టు దారిలోనే! ఆ దారికి ఆధ్యాత్మిక ఫాసిజం ఒక కాగడాలా పనిచేస్తుంది.

“ఆధ్యాత్మిక ఫాసిజం” (Spiritual Fascism) అనేది నేటి భావన కాదు. దానిని ఫాసిస్టు సిద్ధాంతకర్త జూలియస్ ఎవోలా ప్రతిపాదించాడు. అతను ఆధారాలతో కూడిన చరిత్రకు వ్యతిరేకి. దాని స్థానంలో పురాణాల మీద ఆధారపడే ఆధిభౌతిక చరిత్రను (metaphysics of history) ప్రపోజ్ చేశాడు. అది హిందూ పురాణాలలో ఉండే యుగ చరిత్రతో పోలి వుంటుంది. పురాణాలనే చరిత్ర చెయ్యడం, దాని ద్వారానే మంచి, చెడులను నిర్మాణం చెయ్యడం దాని ముఖ్య ఉద్దేశం. అంతేకాదు, ఎవరు యుగపురుషుడో (ఎవోలా పితృస్వామ్యవాదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు!) ఎవరు “ప్రజా కంఠకులో” ఆ పురాణకర్తలే నిర్ణయిస్తారు. వారి కట్టుకథల ఆధారంగానే నీతి, నిజాయితీ, సత్యం, ధర్మం నిర్ణయమవుతాయి. ఎవోలా ప్రకారం ప్రపంచంలో ఎన్నో రహస్య సత్యాలు (mysterious truths) దాగివున్నాయి. అయితే వాటిని సృష్టించిన వాడు మాత్రమే చూడగలుగుతాడు. అర్థం చేసుకోగలుగుతాడు. అంటే ప్రపంచం అనేది ఒక రహస్య జ్ఞాన నిధి అది కొందరికే అర్థమవుతుంది. (ప్రవచనకారులకు అర్థమయినట్లుగా అని!).

ఇటువంటి పుక్కిటి పురాణాలకు ఇటలీలో ఫాసిజం 1922లో అధికారం చేపట్టగానే మంచి ఆదరణ పెరిగింది (ఇప్పుడు ప్రవచనకర్తలకు మాదిరిగానే). అదే అదనుగా ఎవోలా ఫాసిస్టు ప్రభుత్వ ముఖ్య పత్రిక Defense of the Race లో తన జాతి ఎంత గొప్పదో, ఎందుకు గొప్పదో విపరీతంగా రాయడం మొదలు పెట్టాడు. ఆ “ఆధ్యాత్మిక జాతివివక్ష” (spiritual racism) రాతల ద్వారా తాను నమ్మిన పాగనిజాన్ని (Paganism) పునరుద్ధరించాలని అనుకున్నాడు. రోమన్ పాగన్ అనేది నాలుగో శతాబ్ధానికి చెందిన మతం. ఈ మతంలో హిందూ మతంలో మాదిరిగానే ప్రకృతి ఆరాధన, బహుదేవతారాధన ఉంటుంది. పూజలు, మంత్రాలు, ఇంద్రజాల క్రీడలు ఉంటాయి. దాదాపుగా హిందూ మతానికి పోల్చదగినది. అందుకే ఎవోలా తన రచనలలో హిందూ మతానికి సంబంధించిన అనేక రెఫరెన్సెస్ ఇచ్చాడు. ‘‘యూదులు, క్రైస్తవులు బయటివారని, వారి మతాలే పాగనిజం అభివృద్ధికి అడ్డంకి’’ అని బహిరంగానే ప్రకటించాడు. ఫాసిస్టు నాయకుడు ముస్సోలిని క్రైస్తవ మతానికి దగ్గరవ్వడాన్ని ఎవోలా సహించలేదు. ఎలాగైనా దూరం చేయడానికి ప్రత్యేక పూజలు చేశాడు. తనకు ఉన్నాయని అనుకున్న ఇంద్రజాల “శక్తులను” ప్రయోగించాడు. వీటి మూలంగానే ఎవోలాను ఫాసిస్టు నాయకత్వం కొంత దూరంగా వుంచింది. కానీ అతని మత్తు, మాయ సిద్ధాంతాలను విమర్శించలేదు.

ఎవోలా క్రిస్టియానిటీని ముందు శత్రువుగా భావించినప్పటికి తర్వాత కాలంలో కథాలిసిజం మీద తన విమర్శ తగ్గించి, ప్రొటెస్టన్ల మీద దాడి మొదలు పెట్టాడు. చివరికి కాథలిక్స్ కూడా ఎవోలాను ఎత్తిపట్టారు. ఎందుకంటే తాము నమ్మే సాంప్రదాయవాదాన్నే అతనూ ప్రచారం చేస్తున్నాడు కాబట్టి.

మొత్తంగా ఎవోలా తన ఆధ్యాత్మిక ఫాసిజం ద్వారా చరిత్రను, స్వేచ్ఛను, మానవవాదాన్ని, హేతువాదాన్ని, మార్క్సిజాన్ని వ్యతిరేకించాడు. వర్గ సమాజం సుస్థిరం కావాలని కోరుకున్నాడు. పీడిత ప్రజలు వర్గ దోపిడీ గురించి ఆలోచించకుండా ఒక మంద మనస్తత్వాన్ని (mob mentality) నిర్మాణం చెయ్యాలని ప్రవచనాలు చెప్పాడు. సామాజిక పురాణాల (social myths) ద్వారానే ఆ మంద మనస్తత్వాన్ని సునాయాసంగా ప్రజల్లో అభివృద్ధి చెయ్యొచ్చని నమ్మాడు. ఆ పనే చేశాడు. వాస్తవానికి ముస్సోలిని ఇంకా కావాల్సినంత దూకుడుగా ఫాసిజాన్ని అమలుపరచడం లేదని దిగులు పడేవాడు.

బ్రాహ్మణీయ ప్రచనకారులు సరిగ్గా ఎవోలా చేసిన ఆధ్యాత్మిక ఫాసిస్టు పనే చేస్తున్నారు. నిచ్చనమెట్ల సమాజాన్ని జన్మ జన్మల కర్మఫలితాలతో ముడిపెడుతున్నారు. ‘‘అది నీ కర్మ ఫలం. కాబట్టి అనుభవించాల్సిందే’’ అని దోపిడీ, పీడనలకు ఆధ్యాత్మిక మద్ధతును కూడగడుతున్నారు. ‘‘అంతా అమ్మవారి ఆటలోని పావులం మాత్రమే. కాబట్టి ఆ ఆటను ప్రశ్నించకు, ఆట ఫలితాలను ఆశించకు’’అని నిద్రబుచ్చుతున్నారు. సమాజ చలనాన్ని కోరుకునే అన్ని రాజకీయాలను కించపరుస్తూ తమ ఆధిపత్యం కొనసాగే హిందూ రాష్ట్రాన్ని కలకంటున్నారు. దానికి మద్ధతుగా సమాజం మీదికి మత్తు జల్లుతున్నారు. తెలుగు నేల మీద అందులో అగ్రగణ్యుడు గరికపాటి.

సీనియర్ జర్నలిస్టు వనజ తన వీడియోలో చూపించినట్లు గరికపాటి ఒక సెక్సిస్ట్. స్త్రీలు ఎలాంటి బట్టలు వేసుకోవాలి? ఎలా వేసుకోవాలి? జుట్టు ఎంత పెంచుకోవాలి? ఎలా ముడి వేసుకోవాలి? సామాజిక, ఆర్థిక వ్యవహారాలలో ఎలా ప్రవర్తించాలో తానే నిర్ధేశిస్తాడు. ఈ వ్యాఖ్యానాలకు మద్ధతుగా పురాణాలను వల్లిస్తాడు. ఒకవైపు స్త్రీని శక్తి రూపమంటాడు. మరోవైపు స్త్రీ “సృష్టి ధర్మానికి” అనుగుణంగా (పురుషుడికి లొంగి!) బతకాలంటాడు. “సృష్టిలో ఏ లోపం లేదు, మన దృష్టిలోనే లోపమంతా” అంటాడు. ఆ లోప దృష్టితోనే స్త్రీని చూస్తాడు. “పవిత్ర” పురాణాలు చెప్పే నోటితోనే పైటకొంగుల ముచ్చట్లు చెబుతాడు. తన ముందుండే మంద చప్పట్లు కొడుతుంటే మురిసిపోతాడు.

గరికపాటి లాంటివాళ్ళను బహిరంగంగా ఎండగట్టడం అవసరం. అందుకు వనజకు అభినందనలు. గరికపాటి మాటలు వింటుంటే చీము నెత్తురు వున్న ఎవ్వరికైనా రక్తం మరుగుతుంది. కానీ వనజ నిలకడగా, నిబ్బరంగా చెప్పిన తీరు ఎందరినో ఆలోచింపచేస్తుంది. ధైర్యాన్ని ఇస్తుంది. అయితే ఇలాంటి ప్రవచనకారులను నిర్ధిష్టంగా ఎండగడుతూనే వీళ్ళందరికి మూలుగయిన బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిజాన్ని అన్ని రూపాలలో ఎదుర్కోవాలి. లేకపోతే ఆధ్యాత్మిక ఫాసిజం మన నడివీధుల్లో, నట్టింట్లో, నెట్టింట్లో మన అనుమతి లేకుండానే ఊరేగుతుంది. “ఉద్దరిస్తానని” అంటూ ఉద్దెర మాటలు చెబుతూనే ఉంటుంది.

ఆధ్యాత్మిక ఫాసిజం పీడిత కులాల, వర్గాల, లింగాల, మత మైనారిటీల మీద కొనసాగుతున్న దాడి. దానిని భావజాలరంగంలో ఎదురించడం ప్రజాస్వామ్య, సమతా సమాజాన్ని ఆకాక్షించే అందరి కర్తవ్యం.

పుట్టింది చారకొండ (పాలమూరు). పెరిగింది అజ్మాపూర్ (నల్లగొండ). సామాజిక శాస్త్ర విద్యార్థి, ప్రజా ఉద్యమాల మిత్రుడు. అమెరికాలో అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా పనిచేస్తున్నాడు.

5 thoughts on “ఆధ్యాత్మిక ఫాసిజానికి ప్రతినిధులే ప్రవచనకారులు

  1. దొంగలు దొంగలు కలిసి ఊరు పంచుకుంటుడ్రు అనేది పాత సామేత ..ఇ లాంటి సన్యాసులు కలిసి దేశాన్ని దోచుకుంటుండ్రు అని ఎప్పుడు తెలుసుకుంటారో ఈ మనిషనే జీవి 🙏🏼

  2. ఫాసిజం అని హిందూ మతం మీద దండెత్తారు కాని ఇది ఇతర మతాలకు కూడా వర్తిస్తుంది. మొన్నటి దాక మనకు మెకాలే చదువులే కదా ! మహమ్మదీయుల దండ యాత్ర ల లో నాశనమయినవి హిందూ దేవాలయాలే !
    ఆ ఫాసిజాలు లెక్క లోకి రా వా ?
    ఎవరి భావ వ్యాప్తి కి వాళ్ళు అధికారాన్ని,హింస ని వాడ లేదా ?
    గరిక పాటి ఉపన్యాసాల్లో అభ్యంతరాలు ఉంటే చెప్పవచ్చు !
    అదేదో హిందూ మత కుట్ర గా చిత్రీకరింఛడం
    చరిత్ర చదవని పాక్షిక దృష్టి
    హిందూ మతం కాదు హిందూ ధర్మం !
    ప్రస్తుతం హిందూ మత మద్దత్తు దారులు అధికారం లో ఉన్నారని రాజకీయ రంగు పులమడం ఇది పాఠకుల్ని తప్పు దోవ పట్టించడమే !

    ఒకసారి వివేకానందుడు అన్నాడు
    ” ఒక్క హిందూ మతమే మతవ్యాప్తి కి హింస ని వాడలేదు ”

    అందుచేత గరికపాటి గురించి ఆవేశపడక,వాస్తవాన్ని గ్రహించడం మంచిది.

  3. అశోక్ గారు —మంచి వ్యాసం — చక్కగా చెప్పారు
    మనిషిగా బతుకాలంటే మతం — కులం అవసరమా ??
    గరికపాటి — చెప్పేదంతా సొల్లు –ఏమి ఉండదు — పొగరు ఎక్కువ
    too much importance to this guy — donot know WHY ???
    జియ్యం గారు — గ రికపాటి –తోడు దొంగలు
    బి జే పి పాలనలో —దేశమంతటా ప్రవచనాల సొల్లు ఎక్కువ అయింది
    హిందు మతం — దేవుడు —అవసరమా
    వనజ గారు SALUTES –ప్రశ్నించే వాళ్ళు అవసరం
    గళం ఎత్తాలి
    ==============
    బుచ్చిరెడ్డి గంగుల

Leave a Reply