సాహితీ సదస్సుపై దాడి అనాగరికం: మానవ హక్కుల వేదిక

హన్మకొండ
30.04.2024

కాకతీయ యూనివర్సిటీ (హన్మకొండ, వరంగల్)లో ఈనెల 28వ తారీకు ఆదివారం రోజు సెక్యులర్ రైటర్స్ ఫోరం (లౌకిక రచయితల వేదిక) ఆధ్వర్యంలో జరిగిన సాహితీ సదస్సుపై ఏబీవీపీ అనే విద్యార్థి సంఘం దాడి చేసి సభను విచ్ఛిన్నం చేయటం, రచయితులనూ, మహిళలనూ దుర్భాషలాడటం, బ్యానర్లను చింపివేయటం, వ్యక్తులపై భౌతిక దాడులకు పాల్పడటం అనాగరికమైన, అప్రజాస్వామికమైన ఉన్మాద చర్య. ఈ దాడిని మానవ హక్కుల వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది.

ఆదివారం జరిగిన పై రాష్ట్రస్థాయి సాహితీ సమావేశం ‘సాహిత్యంలో లౌకిక విలువలు’ అనే అంశంపై నిర్వహించబడింది. ఎన్నికల ప్రచారానికీ, రాజకీయాలకీ సంబంధం లేకుండా జరిగిన సాహితీ సభలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి అనేక భావజాలాలకు చెందిన ప్రఖ్యాతిగాంచిన సాహితీవేత్తలూ, రచయితలూ పాల్గొన్నారు.

ఎంతో బాధ్యత కలిగిన సాహితీవేత్తలు పాల్గొన్న ఈ సదస్సుపై ఎన్నికల కోడ్ అంటూ, రామున్ని ధూషిస్తున్నారంటూ సంబంధంలేని ఆరోపణలు చేస్తూ భౌతిక దాడికి దిగటం అనాగరికమైన పద్ధతి. వారి ఆరోపణల్లో నిజమే ఉంటే భౌతికదాడికి దిగకుండా వారు చట్టాన్ని ఆశ్రయించాల్సి ఉండింది. మతోన్మాద ప్రేరేపిత విద్యార్థులు వారి రాజకీయ నాయకుల ఆదేశాలతో చేసిన ఈ మూక దాడి ఆధునిక సభ్య సమాజానికి సిగ్గు చేటు.

భౌతిక దాడికి గురైన సాహితీవేత్తలతో ప్రభుత్వ ప్రతినిధులు మాట్లాడి వారిలో ఆత్మ విశ్వాసం నింపాలనీ, రాష్ట్రంలో ఇటువంటి మూక దాడులు పునరావృతం కాకుండా ప్రజాస్వామ్య సంస్కృతిని కాపాడాలనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మానవ హక్కుల వేదిక కోరుతున్నది. భౌతిక దాడులకు దిగిన వ్యక్తులనూ, వారిని పంపిన రాజకీయ నాయకులనూ వెంటనే కేసులు నమోదు చేసి, అరెస్టు చేయాలని మేం డిమాండు చేస్తున్నాం.

ఎస్. జీవన్ కుమార్
(ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు)

డాక్టర్ ఎస్. తిరుపతయ్య
(మానవ హక్కుల వేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)

ఆత్రం భుజంగరావు
(రాష్ట్ర అధ్యక్షులు)

Leave a Reply