మత విద్వేషాలు నింపి జీవితాలను నాశనం చేస్తున్నది ఎవ్వరు…?

జనవరి ఐదున నేను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఒక కేసు పెట్టి వచ్చాను. ఆ కేసు ఏంటనేది చెప్తాను. అంతకంటే ముందు… నేను ఎక్కువగా మతానికి సంబంధించిన వీడియోలే ఎందుకు చేస్తున్నానో మీకు వివరణ ఇవ్వాల్సిన టైం వచ్చింది.

నేను ఇప్పటిదాకా చేసిన వీడియోల్లో మతానికి సంబంధించినవే ఎక్కువ. కానీ ఏ మతానికి సంబంధించినవి…? ఏ మతానికి అనుకూలంగానో, వ్యతిరేకంగానో నేను పని చెయ్యట్లేదు. మత విద్వేష రాజకీయాలు ఎంత ప్రమాదకరమో చెప్తూ పూర్తి ఆధారాలతో వీడియోలు చేశాను. ఒక వీడియో చేసిన ప్రతి సారీ ఇక ఇలాంటి టాపిక్స్ వద్దు జనరల్ టాపిక్స్ చేద్దాం నా సెన్సిటివ్ నెస్ కి ఇవి సూట్ కావు అనిపిస్తుంది. కానీ… రకరకాల ప్రశ్నలు, నిత్యం జరిగే రకరకాల ఇష్యూలు నన్ను ఈ సబ్జెకులు ఎంచుకునేలా పుష్ చేస్తుంటాయి.

ఒక మానవతావాదిగా, మనుషులంతా సమానం అని నమ్మే వ్యక్తిగా నా ప్రశ్నలివి.

నా చిన్నప్పటి ఫ్రెండ్ ఒకబ్బాయికి… అందరికంటే ఎక్కువగా ముస్లిం ఫ్రెండ్స్ ఉండే వారు. ఇప్పుడు సడన్ గా అదే మిత్రుల్ని శత్రువుల్లా అతను చూస్తున్నాడు. వాట్సప్ గ్రూపులో సనాతన ధర్మాల పోస్టులు మాత్రమే పెడుతున్నాడు. అతనిలో ఈ మార్పుకు కారణం ఏంటి…?

నాతో కలిసి జర్నలిజం చదువుకున్న ఒక అమ్మాయి. నేను చాలా ప్రేమగా అక్కా అని పిలిచేదాన్ని. చాలా మంచి స్నేహితురాలు. 2014 దాకా నాకు తనకు ఒక్క చిన్న మనస్పర్థ కూడా లేదు. అలాంటి వ్యక్తి జర్నలిజం అంటే ఈ దేశాన్ని హిందుత్వ దేశంగా ప్రకటించేందుకు కృషి చెయ్యడమే అని నమ్ముతోంది. మొదట్నుంచి దేశభక్తురాలిగా ఉన్న ఆమె… 2014 తర్వాత పరమత ద్వేషిగా మారిందంటే ఆమె ఎలాంటి ప్రభావాలను లోనై ఉండాలి…?

ఇంకెక్కడో జస్ట్ పదో క్లాస్ కూడా పూర్తికాని చిన్న పిల్లాడు… ఈ దేశం హిందువులది మాత్రమే అట కదా… ముస్లిమ్స్, క్రిస్టియన్స్ దోచుకోవడానికి, దాడులు చెయ్యడానికే వచ్చారంట కదా మా టీచర్ చెప్పాడు..  అని అమాయకంగా అడుగుతాడు. వాళ్ల సార్¬తో ఆ పసి బిడ్డలకు ద్వేషాన్ని నూరిపోయిస్తున్నది ఎవరు…? అతనికొచ్చే వాట్సప్ మెసేజీలు, అతని ఫాలో అయ్యే సోషల్ మీడియా అకౌంట్లు. అతని ఊరి పెద్ద మనుషుల్లో  సడన్గా వచ్చిన మార్పులే కదా.

మరో అబ్బాయి… చెల్లెలు కాలేజీకి జీన్స్ వేకుకొని వెళ్తోంటే ఇది మన సంస్కృతి కాదు అని రోజూ ఆమెను నానా మాటలతో హింసించి చివరికి కాలేజీ మానేసేలా చేశాడు. ఆ యువకుడికి ఆడ వాళ్ల బట్టల్లోనే దేశ సంస్కృతి ఉందని నూరిపోసింది ఎవరు…?

అంతెందుకు… విరాట్ కోహ్లీ అనుష్కా శెట్టిల పసిపాప, జస్ట్ నెలల వయసున్న బిడ్డను రేప్ చేస్తాను అని ట్విట్టర్లో బెదిరించిన రాం నగేష్ వయసెంత జస్ట్ 23 ఏళ్లు. తెలంగాణకు చెందిన వ్యక్తే. అవారాగా తిరిగేవాడేంకాదు. ఐఐటీ చదివాడు. మరో నెలలో ఫారన్ వెళ్లిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. అతనిపైన తల్లిదండ్రులు కోటి ఆశలు పెట్టుకున్నారు. అలాంటతను విరాట్ కోహ్లీని ఎందుకు టార్గెట్ చేశాడు..? టీమిండియాలోని ఏకైక ముస్లిం ఆటగాడు షమీ వల్లే పాకిస్థాన్తో ఇండియా మ్యాచ్ ఓడిపోయిందని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తోంటే… షమీకి కోహ్లీ అండా ఉన్నాడు. అంతే… ఐఐటీ ప్రొఫెషనల్ అయిన రాం నగేష్ కోహ్లీ కూతుర్ని రేప్ చెయ్యాలంటూ ట్వీట్ చేశాడు. తన ప్రొఫైల్ అడ్రస్లో లొకేషన్ పాకిస్థాన్ అని పెట్టాడు. ఆ తర్వాత పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఐఐటీ చదివినోడు, తల్లిదండ్రుల కలల్ని నెరవేర్చాల్సిన వాడి.. జీవితం ఒక్కసారిగా పాతాళంలోకి పడిపోయింది. అందుకు కారణం ఎవరు… 23 ఏళ్ల కుర్రాడి బుర్రని మత విద్వేషంతో నింపేసి అతని జీవితాన్ని నాశనం చేసింది ఎవరు…?

అంతెందుకు… లేటెస్ట్ కాంట్రవర్సీనే తీసుకుందాం. వంద మంది ముస్లిం యాక్టివిస్టులు, జర్నలిస్టుల్ని బుల్లీ బాయ్ అనే గిట్ హబ్ యాప్లో వేలానికి పెట్టారనేది జనవరి ఒకటి 2022న బయటికొచ్చింది. సల్లీ డీల్స్ 2.0 పేరుతో ఈ యాబ్ లో ముస్లిం మహిళల్ని వేలానికి పెట్టారు. నిజానికి 2021 జులైలోనే ఈ సల్లీ డీల్స్ మీద కాంట్రవర్సీ నడిచింది. అప్పుడు నిందితుల్ని పట్టుకోలేదు. ఇప్పుడు మళ్లీ ఫోటోలు వైరల్ కావడంతో బాధితులు స్పందించారు. అయితే… ఇక్కడ ఆశ్చర్యపోవాల్సింది ముస్లిం మహిళల్ని ఎందుకు టార్గెట్ చేశారని మాత్రమే కాదు… నిందుతుల ఎవరనేది షాక్ కు గురి చేసే అంశం.
ఈ కేసులో ప్రధాన నిందితురాలైన స్వేతా సింగ్ వయసు జస్ట్ 18 ఇయర్స్. ఉత్తరాఖండ్ అమ్మాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ పాసైంది అంతే. పసిబిడ్డ. ఇదే కేసులోనే విశాఖ ఝా అనే 21 ఏళ్ల బెంగుళూరు యువకుడుణ్నీ అరెస్ట్ చేశారు. అతను సివిల్ ఇంజినీరింగ్ చేశాడంట. వీళ్లిద్దరికీ ఇంటర్నెట్లోనే పరిచయం.  ఆ పద్దెనిమిదేళ్ల అమ్మాయే ఈ మొత్తం బుల్లీ బాయ్ సుల్లీ డీల్స్ సూత్రధారంట. ఆమే గిట్ హబ్ అనే వెబ్ సైట్లో ఖల్సా సూపర్ మిస్ట్ పేరుతో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసింది. ఖల్సాను  సిక్కులు పవిత్రంగా చూస్తారు. యాప్ లో ఖలిస్థాన్ జెండాలనూ వాడారు. అంటే…  ఇదంతా ఖలిస్థాన్ కోరుకునే సిక్కుల పనే అనుకునేలా ప్లాన్స్ చేశారు. ఇప్పుడు ఇద్దరూ అరెస్టయ్యారు. వాళ్లు ఎవరో కాదు… మన ఇళ్లలో మన చుట్టూ పెరుగుతున్న యువతీయువకుల్లాంటి వాళ్లే. 18 ఏళ్లు, 21 ఏళ్ల వయసులో వాళ్లను ఎవరు తీవ్రంగా మిస్ లీడ్ చేసి ఉంటే.. ఇంత ఉన్మాదంగా వాళ్లు ముస్లిం మహిళల్ని టార్గెట్ చేసి ఉంటారు…? దయ చేసి ఆలోచించాలి… రాబోయే తరాలకు మంచి చదువును ఇస్తున్నామా… మత విద్వేషాలను వాళ్ల బుర్రల్లోకి చొప్పిస్తున్నామా…? ఇప్పుడు కేసులతో నాశనమౌతున్న వాళ్ల జీవితాలకు ఎవర్ని పూచీ. ఏం సాధించడానికి ఇంత విద్వేషం నింపుతున్నారు…  వీటన్నింటికీ మూలం రాజకీయ పార్టీల విధానాల్లో లేదా.. లక్షలాది సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా చిమ్ముతున్న విషం నేరుగా మన ఇళ్లల్లో.. మన చుట్టూ ఉన్న అమాయమైన యువతీయువకుల్ని చేరకుండా ఎలా ఉంటుంది.

ఇప్పుడు నేనెందుకు సైబర్ క్రైం పోలీస్ స్టేషన్¬కు వెళ్లి కంప్లైంట్ చెయ్యాల్సి వచ్చిందో చెప్తాను. బుల్లీ బాయ్స్ కాంట్రవర్సీ గురించి చదువుతున్నప్పుడే.. ఒక ఫ్రెండ్ నుంచి నాకొక స్క్రీన్ షాట్ వచ్చింది. ఓపెన్ చేస్తే నా ముఖంతో మార్ఫింగ్ చేసిన ఈ ఫోటో కనిపించింది. ఈ ఫోటోలో ఉన్న వాళ్లు ప్రముఖ సామాజిక కార్యకర్తలు దేవి, అరుణ గోగులమండ, సీఎంఎస్ రమ. వీళ్లు ప్రజా సమస్యలపై సామాజిక అంశాలపై ఎప్పుడూ తమ వాయిస్¬ను వినిపిస్తూ ఉండేవాళ్లు. బాధితుల పక్షాన నిలబడి పోరాడేవాళ్లు. వీళ్ల వల్ల ఎవరికి నష్టం…?
ఎంత విద్వేషం అంటే.. క్రైస్తవుల్ని రెచ్చగొట్టాలన్న ఉద్దేశంతో పాస్టర్ పరంజ్యోతి అనే ఓ క్రైస్తవ పేరుతో ఈ అకౌంట్ నడుపుతున్నారు. ఏకంగా కవర్ పేజీగా మా ఫోటోలను పెట్టాడు.
ఈ పాస్టర్ పరంజ్యోతి అసభ్యకర కామెంట్స్ చేస్తున్న బాధిత వ్యక్తుల్లో మాజీ ఐపీఎస్ ఆఫీసర్, తెలంగాణ బీఎస్పీ కో ఆర్డినేటర్ ఆర్. ప్రవీణ్ కుమార్, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రముఖ నటి జయసుధ, ప్రముఖ యాక్టివిస్ట్ సంధ్య ఇలా మంది ఫోటోలను అత్యంత జుగుప్సాకరంగా మార్ఫింగ్ చేసి.. బూతు అర్థాలతో రాతలు రాసి ఉన్మాద ఆనందాన్ని పొందుతున్నారు.


ఈ పాస్టర్ పరంజ్యోతి రాజా పోస్టుల్ని వందలాది మంది షేర్లు చేస్తున్నారు. వాళ్లంతా ఎవరని చూస్తే… అంతా ఒకే పార్టీ సపోర్టర్లు. పాస్టర్ పరం జ్యోతి రాజాతో భారతీయ జనతా పార్టీనే ఇలా చేయిస్తోందని నేను వన్ పర్సెంట్ కూడా అనుకోవట్లేదు, చెప్పట్లేదు. కానీ.. ఇతని ఫాలోయెర్లను, అతని కంటే నీచంగా కామెంట్ చేస్తున్న వాళ్లను చూస్తే ఏమనిపిస్తుంది…? వీళ్లలో చాలా మంది ఫేక్ పేర్లతోనే అకౌంట్స్ క్రియేట్ చేశారు. కొంత మంది సొంత పేర్లతోనూ ఉన్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇతను పెట్టే పోస్టులపై ఎంత మంది ఫేస్ బుక్¬కు రిపోర్ట్ చేసినా, ఆ పోస్టుల్ని పేస్ బుక్ తొలగించలేదు. పైగా.. వీటిలో అభ్యంతరకరం ఏమీ లేదని రిపోర్టు కొట్టిన వాళ్లకు చెప్తోంది. అందుకే ఆ పాస్టర్ పరంజ్యోతి రాజా… దర్జాగా పోస్టులు పెడుతున్నాడు.


మరి వాళ్లంతేలే అని చూసి వదిలెయ్యాలా..? అతని పోస్టుల్ని చూసే కాలేజీ పిల్లలో, యువతీయువకులో ఏమనుకుంటారు.. అతను రాస్తున్న రాతల్ని నమ్మరా.. అతను కించపరుస్తున్న వాళ్లపైన అటాక్స్ చెయ్యరా.. అందుకే ఆ పాస్టర్ పరంజ్యోతి రాజా పైన ఐటీ యాక్ట్ కింద కేసు పెట్టాను. ఎఫ్ఐఆర్ నమోదైంది. అతన్ని పట్టుకోవాల్సిన బాధ్యత తెలంగాణ పోలీసులదే. అతన్ని కోర్టుకు లాగగలిగితే.. సోషల్ మీడియాను తప్పుగా వాడకూడదన్న అలర్ట్ నెస్ అతన్ని ఫాలో అయ్యేవాళ్లకు వచ్చినా చాలన్నది నా ఉద్దేశం.


తెలుగులోనే ఇలాంటి పరంజ్యోతి రాజాల్లాంటి వేలాది ఫేక్ అకౌంట్స్¬ ఉన్నాయ్. లక్షలాది ట్విట్టర్ అకౌంట్స్, ఇన్ స్టా అకౌంట్స్ ఉన్నాయి. వాటిని ఫాలో అయ్యేవాళ్లంతా ఇప్పుడిప్పుడే సమాజాన్ని చూస్తున్న యువతీయువకులు. మంచి కంటే చెడే వాళ్లకు ఎక్కువగా అందుబాటులో ఉంటే… శాంతి, సహనం కంటే.. విద్వేషమే వాళ్ల చుట్టూ కనిపిస్తోంటే.. ఆ ప్రభావాలకు లొంగిపోకుండా ఎలా ఉంటారు..? ప్లీస్… జస్ట్ రాజకీయాల కోసం తప్పుడు వార్తల్నీ, తప్పుడు ప్రచారాల్నీ చేసే వాళ్లు ఆలోచించాల్సింది ఒక్కటే… వాటిని మన పిల్లలు ఫాలోఅయితే.. తీవ్రమైన చర్యలకు దిగితే ఎలా…?? మన పిల్లలు నిందితులుగానో, బాధితులుగానో మారినా పర్లేదా??

ఇండిపెండెంట్ జర్నలిస్ట్

One thought on “మత విద్వేషాలు నింపి జీవితాలను నాశనం చేస్తున్నది ఎవ్వరు…?

  1. Agree with u sir —but FAMILY VALUES starts from home —(MOM&DAD) not from GOVT

Leave a Reply