పారిశ్రామికీకరణ – కార్మిక స్థితిగతులు

భారత ఆర్థికాభివృద్ధికి ఎదురవుతున్న సమస్యలకు గల కారణాలను పరిశీలించి, “సరళీకరణ మీదనే ఎక్కువ కేంద్రీకరించి మిగతా రంగాలన్నింటినీ పట్టించుకోకపోవటం వల్ల అంటే అసమాన కేంద్రీ కరణ వలన భారీగా నష్ట పోతున్నాము,” అని ప్రముఖ ఆర్ధిక వేత్త అమర్త్యసేన్ అభిప్రాయ పడ్డారు. అంటే మన దేశ ఆర్ధికాభివృద్ధిలో విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, కుటీర పరిశ్రమలు లాంటి రంగాల పట్ల వివక్షే కాకుండా ఆయా రంగాలలో సామాన్య ప్రజలకు తగిన అవకాశాలు లేవనేది సుస్పష్టం. మన సమాజం అసమానతల నిలయమనీ, వర్గ పునాదుల మీద ఉన్నదనీ మనకు విదితమే. ఇటువంటి పరిస్థితులలో దేశం మొత్తం అన్ని రంగాలలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందటం సాధ్యమా? అసలు అభివృద్ధికి నిర్వచనం ఏమిటి? ఎలాంటి ఆర్థికాభివృద్ధిని మనం కాంక్షిస్తున్నాం. ఇలాంటి అనేక ప్రశ్నలు మన ముందుకు వస్తాయి. ఐతే మేడే సందర్భంగా ప్రైవేటీకరణ – నూతన ఆర్ధిక సంస్కరణలు ప్రవేశ పెట్టిన తరువాత పారిశ్రామిక రంగం లో కార్మికుల స్థితిగతుల పై ఒక సమాలోచన.

భారత దేశ కార్మిక వర్గ చరిత్రను గమనిస్తే ఇతర అభివృద్ధి చెందిన దేశాలలో లాగా మనదేశంలో కార్మిక వర్గానికి పునాదులు ఏర్పడలేదనేది సుస్పష్టం. పాశ్చాత్య దేశాలలో భూస్వామ్య వ్యవస్థను నాశనం చేస్తూ పెట్టుబడి దారీ వ్యవస్థ వచ్చింది. వృత్తులు పోయి ఫ్యాక్టరీలు వచ్చాయి. వృత్తులు కోల్పోయిన వారు సంబంధిత ఫ్యాక్టరీలలో కార్మికులుగా మారారు. కానీ ఈ విధంగా భారత దేశంలో కార్మిక వర్గ పునాదులు ఏర్పడలేదు. భారత దేశం వలస దేశం. 1757 నుండి 1812 దాకా ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధిపత్యం లో మన భారత దేశ వాణిజ్యం ఉన్న సమయంలో అంటే 18 వ శతాబ్దంలో బ్రిటన్ లో పారిశ్రామిక విప్లవం వచ్చింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా బ్రిటన్ పట్టు వస్త్రాలను భారత దేశం నుండి దిగుమతి చేసుకుంటూ ఉండేది. అలాగే నూలు బట్టలను ఎగుమతి చేస్తూ ఉండేది. ఎగుమతుల మీద విపరీతమైన పన్నులు విధించే వాళ్ళు. అధిక మొత్తంలో పన్నులు విధించి ముడి సరుకులను బ్రిటన్ కు దిగుమతి చేసుకోవటాన వృత్తులు దెబ్బతిన్నాయి. వాణిజ్యం కోసం రైల్వే లను ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు బ్రిటిష్ వాళ్ళు. రైల్వే ల కోసం బొగ్గు గనులు తవ్వవలసి వచ్చింది. బ్రిటన్ కు ఎగుమతి అయ్యే సరుకులకు బదులుగా భారత దేశం నుండి జనపనార, తేయాకు లాంటి ముడి సరుకులను దిగుమతి చేసుకున్నారు. మొదటగా కార్మిక వర్గ పుట్టుక భారత దేశంలో గనులలో, తేయాకు తోటలలో, జనపనార మిల్లులలో ఏర్పడిందని పలువురు మేధావులు అభిప్రాయ పడ్డారు. వలస పెట్టుబడి దారీ వ్యవస్థ ఏర్పడింది. కార్మికులలో గ్రామీణ భూస్వామ్య వ్యవస్థ తాలూకు మూలాలు, రైతాంగ సృహ ఉన్నదే తప్ప, కార్మిక వర్గ లక్షణాలు తక్కువ ఉన్నాయి. వీరు భూమినే నమ్ముకున్నారు. కొంత కాలం ఏదన్నా ఫ్యాక్టరీ లో పని చేసి తర్వాత గ్రామాలకు తిరిగి వెళ్ళి పోవాలనుకునే వాళ్ళే ఎక్కువ. భూస్వామ్య వ్యవస్థ తాలూకు దాస్య భావనలు ఎక్కువ. కానీ యజమానిలో పెట్టుబడిదారీ వ్యవస్థ తాలూకు లక్షణాలు ఉన్నాయి. దీని వలన పెట్టుబడి దారుడుకు లాభం, కార్మికులకు నష్టం జరుగుతుంది. వలస పారిశ్రామీకరణ వలన భారత దేశ ప్రజలు తీవ్రంగా నష్ట పోయారు. మన పారిశ్రామిక రంగంలో ఇప్పటికీ వలస విధానమే నడుస్తోంది. భారత దేశంలోని కర్మాగారాలలో బల్క్ డ్రగ్స్ తయారీ ఎక్కువ. బల్క్ డ్రగ్స్ అంటే ఏదైనా ఒక ముడి పదార్ధాన్ని ఔషధ రూపంలో వాడుక లోకి తీసుకొని రావటం. ముడి పదార్ధాల నుండి రసాయనాలను తీసే క్రమంలో చెప్పలేనంత వ్యర్ధాలు విడుదల అవుతూ ఉంటాయి. మిశ్రమ ఔషధాల ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ లోనూ వ్యర్ధాలు విడుదల అవుతూ ఉంటాయి. పారిశ్రామిక ప్రాంతాలలో ఉండే నాలాలలో రసాయనాలను కలపటాన రాత్రి పూట వ్యర్ధ రసాయనాలను విడుదల చేయటాన అక్కడి భూమి, నీరు, గాలి సమస్తం కలుషిత మవుతున్నాయి. అక్కడి ప్రజలు అనేక రకాల అంటు వ్యాధులకు గురవుతున్నారు. హైదరాబాద్ లోని సుభాష్ నగర్, బాలాజీ నగర్, నాచారం, ఉప్పల్, జీడిమెట్ల, మల్లాపూర్, ఒకటేమిటి చాలా పారిశ్రామిక ప్రాంతాలలో విష వాయు, జలాల మూలకంగా పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర అస్వస్ధతకు లోనవుతున్నారు.



మన దేశం లో చట్టాలను రూపొందించటం వాటిని సంపూర్తిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం ఈ రెండింటికీ మధ్య ఎంతో వైరుధ్యం ఉంది. కార్మిక సంఘాలకు ప్రత్యేక హక్కులూ, రక్షణ, సదుపాయాలూ కల్పించే 1926 లో తెచ్చిన కార్మిక చట్టం నుండి మొదలుకుంటే 1928 లో వచ్చిన కార్మికుల నష్ట పరిహార చట్టం, 1936 లో వేతన చెల్లింపుల చట్టం, 1948 లో ఏర్పడిన కనీస వేతనాల చట్టం జీవన వ్యయ భృతి, మినహాయింపుల నగదు విలువను కలిపి కనీస వేతనం గా పేర్కొంది. 1970 లో కాంట్రాక్ట్ కార్మికులకు కూడా అసలు కార్మికులతో సమానంగా సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్న కాంట్రాక్ట్ కార్మికుల చట్టం -1976 లో సమాన వేతనాల చట్టం, బాల కార్మిక నిషేధ చట్టం, 1979, అంతర్ రాష్ట్ర వలస కార్మికుల చట్టం 2008, అసంఘటిత కార్మికుల భద్రతా చట్టం ఇలా చెప్పుకుంటూ పొతే చట్టాలకు కొదవే లేదు. ఆచరణే శూన్యం. ఇక ఇండియన్ పీనల్ కోడ్ కార్మికులకు అనేక హక్కులను, యజమానులకు అనేక బాధ్యతలను నిర్దేశించింది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 19(1)(సి )కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకోవటం, ఇది వరకే ఏర్పడిన కార్మిక సంఘాలను కొనసాగించటం పౌరుల ప్రాథ‌మిక హక్కుగా గుర్తించింది.

భారత దేశంలో నూతన ఆర్ధిక సంస్కరణలు ప్రవేశ పెట్టినప్పటి నుంచీ అంటే 1990 నుంచీ అసంఘటిత కార్మిక వర్గం పెరిగి పోయిందన్నది కాదనలేని సత్యం. గ్రేటర్ హైదరాబాద్ లోని పారిశ్రామిక ప్రాంతాలలో కొన్ని వేల సంఖ్యలో ఫ్యాక్టరీలు, చిన్న తరహా, అతి చిన్న కంపెనీలు ఉన్నాయి. బల్క్ డ్రగ్ తయారు చేసే రసాయన కంపెనీల నుండీ అల్లం, వెల్లుల్లీ పేస్ట్ చేసే అతి చిన్న కంపెనీ ల దాకా ఉన్నాయి. లక్షల సంఖ్యలో అసంఘటిత కార్మికులు ఉన్నారు. కాంట్రాక్టు కార్మికులు పెరిగిపోయారు. దళారీ వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉంది. కాంట్రాక్ట్ కార్మికులను స్కిల్డ్ వర్కుగా కాకుండా అన్ స్కిల్డ్వర్కర్ గా గుర్తించటం జరుగుతోంది. కొన్ని కంపెనీ లలో అయితే ఎం.డి, పర్సనల్ ఎం.డి తప్ప మిగతా అందరూ స్కిల్డ్ వర్క్ లోకి రాకుండా పోయారు. కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండదు. హైదరాబాద్ లో ఉన్న ఫ్యాక్టరీలలో, కంపెనీలలో మొత్తం 20%మాత్రమే పెర్మినెంట్ కార్మికులు ఉన్నారు. 80%కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. ఈ.యస్. ఐ.డి.ఎ. బోనస్ లు ఏమీ ఉండవు. ప్రభుత్వం ఇచ్చే ఎటువంటి పథ‌కాలు, రాయితీలు వీరికి వర్తించవు.

దాదాపుగా అన్ని కర్మాగారాలలో 12 గంటల కంటే ఎక్కువ చాకిరీ ఉంటుంది. ఓ.టి గా ఎక్కువ జీతం ఇస్తామని చెప్తుంటారు. ఎక్కువ శాతం 6,000 జీతం ఉంటుంది. ఓ.టి చేస్తే 9,000 దాకా జీతం వస్తుంది. కార్మికులకు కనీస హక్కులు లేవు. కనీస వేతనాల చట్టం అమలులో లేదు. కంపెనీలు తామిచ్చే వాస్తవ వేతనాల గురించి చెప్పవు. హైదరాబాద్ లోని చాలా కంపెనీలు కాంట్రాక్టర్ లకు గుత్తకు ఇస్తుంది. కాంట్రాక్టర్లు బీహార్, జార్ఖండ్, నేపాల్ నుండి కార్మికులను తీసుకు వచ్చి రూములు ఇచ్చి అతి తక్కువ జీతానికి రోజుకు 12 గంటలు చేయిస్తారు. ఆ కార్మికులకు ఎటువంటి భద్రతా ఉండదు. జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా లో 10%మాత్రమే స్థానికులు ఉన్నారు. మిగతా 90% వివిధ జిల్లాల నుండీ, రాష్ట్రాల నుండీ వచ్చి స్థిరపడిన వారే. స్థానికులు కాక పోవటాన ఇంకా అనేక సమస్యలను వీళ్ళు ఎదుర్కోవలసి వస్తోంది.



వేలాది మంది స్థానిక కార్మికులకు కంపెనీలలో పని దొరకదు. కంపెనీ లో పని కావాలంటే కాంట్రాక్టర్ చెప్పినట్టు దినసరి కూలీ 600 రూ.లలో 250 రూ లు కాంట్రాక్టర్లకు ఇవ్వవలసిందే. ఇవి కాక పి.ఎఫ్ అనో, మరోటనో కార్మికుల నుండి డబ్బులు కాంట్రాక్టర్ తీసుకుంటూనే ఉంటాడు. హైదరాబాద్ లోని పారిశ్రామిక ప్రాంతాలలో దళారీ కాంట్రాక్ట్ వ్యవస్థ అత్యంత పటిష్టం గా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే దళారీ మాఫియా నడుస్తోంది. కాంట్రాక్ట్ వ్యవస్థ నే రద్దు చేయాలని ప్రతి ఒక్క కార్మికుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాడు.

జీడిమెట్ల సుభాష్ నగర్ లో ఉండే ముస్తఫా అనే కార్మికుడు, “కెమికల్ డ్రమ్ములను గత 15 సం.రాలుగా కటింగ్ చేస్తున్నాము. కాంట్రాక్టర్ పిలిస్తే గోడౌన్ ల దగ్గరకు వెళ్తాము. రోజుకు 20 డ్రమ్ములను దాకా కటింగ్ చేస్తాము. ఒక్కొక్క డ్రమ్ కు 10రూ. లు ఇస్తారు. బస్తీలో చాలా మంది ఇదే పని చేస్తుంటారు. కెమికల్ డ్రమ్ములు కంపెనీ నుండి గోడౌన్ కు వస్తుంటాయి,” అని చెప్తున్నాడు. కెమికల్ కంపెనీ ల వలన వస్తున్న ఇబ్బందుల గురించి స్థానికులు ఇలా అంటున్నారు, “నిద్ర పోయాక రాత్రి రెండు, మూడు గంటలకు కెమికల్ గ్యాస్ వదులుతుంటారు. కిటికీలు కూడా వేసుకొని ఉండవలసిన పరిస్థితి. బయటకు వచ్చి ఇంటి ముందు నిలబడలేము. ఉతికిన బట్టలు వేసుకుంటే దురదలు, మంటలు వస్తాయి. చర్మ సంబంధ వ్యాధులు, ఎలర్జీ లు వస్తున్నాయి. దుమ్ము, ధూళి ఎంత ఉంటుందో చెప్పలేము. పిల్లల మీద ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటోంది. మా వయసుల కంటే 15, 20 ఏళ్ళు పెద్దవాళ్ళుగా కనపడుతున్నాము. నాలా దగ్గరైతే నిలబడలేనంతటి దుర్వాసన. ఉదయం 6గంటలకు విపరీతంగా వస్తుంది. వర్షాకాలం ఇంకా కష్టం. గుంతల రోడ్లు. వర్షం వస్తే మొత్తం నీరంతా నిలిచిపోతుంది. వర్షం వచ్చేటప్పుడు నిల్వ ఉంచిన వేల లీటర్ల రసాయన జలాలను నివాస ప్రాంతాలలోకి వదిలేస్తుంటారు. వ్యర్ధ పదార్ధాలను తెచ్చి ఇక్కడ కంపెనీ లలో శుభ్రం చేస్తుండటం వలన ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ఎక్సపైర్ అయినవీ, ఫెయిల్ అయినవీ ఇక్కడికే తెస్తుంటారు. ఇక్కడకు వచ్చే వాటిలో 30% ఇలాంటివే. ప్రశ్నించే వారిని గుర్తించి అవకాశం దొరికినప్పుడు ఫ్యాక్టరీ వాళ్ళు ఇబ్బందులకు గురిచేస్తుంటారు.”

జీడిమెట్ల చుట్టుపట్ల ప్రాంతాలతో సహా 2,000పైగా కంపెనీలు ఉన్నాయి. 60, 70 వేల మంది కంటే ఎక్కువగానే హమాలీ పనులు చేసే వాళ్ళు ఉంటారు. మహిళలు ఎవరూ హమాలీలుగా లేరు. మహిళలా కార్మికులు ఎక్కువ శాతం కంపెనీ లలో ప్యాకింగ్, కీపింగ్, లేబుల్ అతికించటం లాంటిపనులు చేస్తుంటారు. తెలంగాణా లోని అన్ని జిల్లాలలో కలిపి 5 లక్షల మంది దాకా హమాలీ కార్మికులు ఉంటారని ఒక అంచనా. గతంలో హమాలీ కార్మికుల కోసం ఒక చట్టం ఉండేది. 1978లో హమాలీ కార్మికుల చట్టాన్ని రద్దు చేశారు. 2008లో వచ్చిన అసంఘటిత కార్మికుల చట్టంలో హమాలీలను చేరుస్తామని చెప్పారు. కానీ, చేర్చలేదు. హమాలీ దేవదానం, “పరిశ్రమలలో ఉత్పత్తి అయ్యే వాటిని లోడింగ్ -అన్ లోడింగ్ చేస్తుంటాము. ఉదయం 7 గంటల నుంచీ సాయంత్రం దాక సిమెంట్, బొగ్గు, బూడిద, ప్లాస్టిక్, పేపర్ లాంటివి లోడింగ్ – అన్ లోడింగ్ చేస్తుంటాము, టన్నుకు ఇంత అని ఇస్తుంటారు. ఒక్కొక్కళ్ళం 100, 120, 180 కేజీ ల దాకా బరువులు మోస్తుంటాము. రోజుకు 300 నుండీ 500 రూపాయల దాకా వస్తాయి. 40 ఏళ్ళు దాకా నే ఆరోగ్యంగా ఉంటాము. మోకాళ్ళు, నడుములు నొప్పులు వస్తాయి, మల మూత్రాదులకు కూడా వెళ్లలేని పరిస్థితి,” అంటున్నారు. ఇ.ఎస్.ఐ, పి.యఫ్, సౌకర్యాలు కల్పించి, హమాలీలకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని అంటున్నారు హమాలీ బీరప్ప.

తెలంగాణా రాష్ట్రంలో బీడీ కార్మికులు ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల మంది దాకా ఉంటారని ఒక అంచనా. తునికాకు తెంపటం మహిళలే చేస్తారు. బీడీ కార్మికురాలు పుష్ప ఇలా అంటోంది, “తునికాకును సేఠ్ లు తెచ్చి ఇస్తారు. తునికాకును రాత్రి నీళ్ళల్లో నాన బెట్టి తెల్లవారి తడి ఆరబెడతాము. ఆకు నారను తీసి బీడీలు చుడతాము. రోజు మొత్తం చేసినా 500 బీడీలు మించి చేయలేము. 500 బీడీలు చేస్తే 50 రూపాయలు వస్తాయి. మెడలు, చేతులు గుంజుతాయి. ఆదాయం లేదు.” బీడీ కార్మికులు గతంలో అనేక పోరాటాలు చేశారు. కొత్త కొత్త జి.ఓ లు వస్తున్నాయే తప్ప పరిస్థితులలో ఎటువంటి మార్పు రాలేదు.

నాచారం లో 256 కంపెనీ లున్నాయి. 13,000 మంది కార్మికులు పని చేస్తున్నారు. అందులో 6,000 మంది మహిళా కార్మికులే. దాదాపుగా ఏ కంపెనీలోనూ మహిళల కంటూ ప్రత్యేక సదుపాయాలు లేవు. తక్కువ కూలీ, సీజనల్ పనులకు మాత్రమే ఎక్కువ శాతం మహిళా కార్మికులను తీసుకుంటున్నారు. హైదరాబాద్ లోని ఉప్పల్, నాచారం, మల్లాపూర్, కుషాయ గూడా, చర్లపల్లి, మేడిచర్ల, జీడిమెట్ల, బాలా నగర్, విఎస్టి, సనత్ నగర్, రాజేంద్ర నగర్, కార్వాన్, కాటేదాన్, చాంద్రనారాయణ గుట్ట, సరూర్ నగర్ ఇలా అన్ని ప్రాంతాలలో ఒకేరకమైన పరిస్థితులు ఉన్నాయి.

ఇక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కు వస్తే జి యస్ టి ప్రభావం పెద్ద కంపెనీల బదులు వీళ్ళ మీద దారుణంగా పడింది. పెద్ద కంపెనీల నుండీ సప్లైయి చేసుకునే చిన్న కంపెనీ లకు జి.యస్.టి తో సహా కట్టించుకుంటున్నారు. పెద్ద కంపెనీల వాళ్ళు. దీని వలన మినీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మూసేసుకునే పరిస్థితి ఏర్పడిందని బాలానగర్ లోని అనేక మంది అభిప్రాయ పడ్డారు. మినీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లో కార్మికునితో పాటు యజమాని కూడా సమానంగా కష్ట పడుతూ ఉంటాడు. బ్యాంకు ల నుండి రుణాలు తీసుకొని వీళ్ళు నడుపుతుంటారు. సరైన ఆదరణ లేక అప్పుల పాలు అవుతున్న వాళ్ళే ఎక్కువ.

రాబోయే రోజులలో అతి చిన్న తరహా పరిశ్రమల పరిస్థితి ఏంటి? లక్షల సంఖ్య లో ఉన్న అసంఘటిత కార్మికుల పరిస్థితి ఏమిటి? పాలకులు వీళ్ళకు ఎటువంటి భరోసానిస్తున్నారు. అనేవి ప్రశ్నార్థకమే? కార్మిక యూనియన్ లు దాదాపుగా నిర్వీర్యమయి పోయాయి. పేరుకు మాత్రమే అన్ని పార్టీల యూనియన్ లు ఉన్నాయి. కార్మికులు యూనియన్ ల ద్వారా సంఘటిత మవటానికి అత్యంత అననుకూల పరిస్థితులు ఉన్నాయి. సి.సి కెమెరాల నిఘాల మాటున వీళ్ళు పని చేయవలసి ఉంటుంది.

అభివృద్ధి చెందిన దేశాలలో ఉన్న పరిస్థితులకు మన దేశ పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉంది. మన దేశ పారిశ్రామిక రంగాన్ని ఆకళింపు చేసుకుంటూ, కార్మికులలో కార్మిక వర్గ చైతన్యాన్ని తెచ్చే విధంగా ప్రణాళికలను చేస్తూ, కార్మికుల న్యాయమైన హక్కుల కోసం మేధావులు, సామాజిక వేత్తలు, సమాజ శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరూ నినదించవలసిన అవసరం నేడు ఎంతైనా ఉన్నది.

జ‌న‌నం: గుంటూరు జిల్లా, తెనాలి. నివాసం : హైదరాబాద్. ఎం.ఏ (హిందీ), ఎం. ఏ(ట్రాన్సలేషన్ స్టడీస్ ఇన్ హిందీ), బీఈడీ. 'జైనేంద్ర కుమార్ న‌వ‌ల‌ల్లో స్త్రీ పాత్రల మనో వైజ్ఞానిక చిత్రణ' అంశంపై ఎం.ఫిల్ చేశారు. 'కృష్ణా సొబతి& మమతా కాలియాల కథా సాహిత్యంలో స్త్రీ ల జీవితాలు' అంశంపై పీహెచ్‌డీ(ఉస్మానియా యూనివ‌ర్సిటీ) చేస్తున్నారు. సొంత‌ రచనలు : 1. పోరాడితేనే రాజ్యం, 2. ముగింపు మాటలా ..., 4. అభాగ్య జీవనాల భాగ్య నగరం. అనువాదాలు : 1. వైజ్ఞానిక భౌతికవాదం (రాహుల్ సాంకృత్యాయన్ ), 2. మధు పురి (రాహుల్ సాంకృత్యాయన్).

Leave a Reply