నది నుంచి సముద్రం దాక… స్వేచ్ఛా విహంగ పాలస్తీనా

“నా పేరు ఖలిల్. నాకు 27 ఏళ్లు. నేను ఇంగ్లిష్ లిటరేచర్ చదువుకున్నాను. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నాకు ఎన్నో కలలూ, ఆశయాలూ, లక్ష్యాలూ ఉన్నాయి.
ప్రేమించడం ఎలానో నాకు తెలుసు. ఎలా సంతోషంగా ఉండాలో తెలుసు. కష్టపడి పని చేసి అనుకున్నది ఎలా సాధించాలో నాకు తెలుసు.

నేను అమరుడనయితే, కేవలం ఒక సంఖ్యగా మిగలాలని నాకు లేదు.

నా పేరు పలకండి. నా కథ వినండి. నాకోసం ప్రార్థించండి.
నేనొక సంఖ్యను కాదు. నేనొక సంపూర్ణ భూగోళాన్ని.”

– ఖలిల్ అబు యహ్య, గాజా

ఖలిల్ అబు యహ్య, నవంబరు 17, 1996 లో పుట్టాడు. అక్టోబరు 30 న, ఇజ్రాయిల్ గాజాపై చేసిన బాంబుల దాడుల్లో ఖలీల్, ఖలీల్ భార్యా, వారి ఇద్దరు పిల్లలూ చనిపోయారు. ఖలీల్ అద్భుతమైన రచయితా, సామాజిక కార్యకర్తా, ఆలోచనాపరుడు. చదువుకోవడం, తన విద్యార్థులకు చదువు చెప్పడం ఎంతో ఇష్టంగా చేసేవాడు.

*

అక్టోబరు 10 సాయంత్రం అమెరికాలో మా అమ్మాయి చదువుతున్న స్కూల్ సూపరింటెండెంట్ నుంచి పేరెంట్స్ కు ఒక ఈ-మెయిల్ వచ్చింది. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో, యుద్ధం గురించి తమ పిల్లలతో చర్చించడానికి సహాయపడే డాక్యుమెంటును పేరెంట్స్ కు పంపుతూ, యూదులకూ ఇజ్రాయిల్ లో ఉన్న వారి కుటుంబాలకూ, అర్థంపర్థంలేని యుద్ధాల వల్ల బాధలు పడుతున్న మిలిటరీ కుటుంబాలకూ మా కమ్యూనిటీ తరపున సంఘీభావం తెలిపింది.

అప్పటికి మూడురోజుల క్రితమే గాజా నుంచి హమాస్ ఇజ్రాయిల్ మీద మెరుపు దాడులు చేసి 1400 మంది యూదులను చంపి, 235 మందిని బంధీలుగా పట్టుకెళ్లిపోయింది. ఇంతవరకూ కొన్ని లక్షలమంది పాలస్తీనియన్లను హత్యచేసిన ఇజ్రాయిల్ కు, ఇంతమంది పౌరులను పోగొట్టుకోవడం దిగ్భ్రాంతి కలిగించింది. ఇజ్రాయిల్ వెంటనే కొన్ని వందల బాబులతో గాజాపై దాడి చేసింది. ఆ మూడురోజుల్లో 700 మందికి పైగా పాలస్తీనియన్లను చంపింది. ఆ దాడులు ఎంత విచక్షణా రహితంగా, క్రూరంగా జరుగుతున్నాయంటే, పిల్లలు తమ శరీరాల మీద తమ పేర్లు రాసుకుంటున్నారు. బాంబు దాడుల్లో తమ శరీరాలు ఛిద్రమైతే ఏ ఒక్కభాగం వల్లనైనా తమ కుటుంబాలూ, స్నేహితులూ తమను గుర్తుపడతారని వాళ్ల ఆశ.

ఇజ్రాయిల్ దాడులను ఇప్పుడిప్పుడే ఉప్సంహరించుకోదనీ, ఎన్నో వేలమంది పాలస్తీనియన్లు చనిపోతారని తెలిసిపోతున్నా, ఈ-మెయిల్లో ‘పాలస్తీనా’ అన్న పదం ఒక్కసారి కూడా దొర్లకుండా జాగ్రత్తపడింది స్కూల్ సూపరింటెండెంట్. ఈ ఇరవైరోజుల్లో, హమాస్ స్వాధీనంలో ఉన్న బంధీలను విడిపించుకోవాలనీ, హమాస్ ను నిర్వీర్యం చెయ్యాలన్న నెపంతోనూ యుద్ధానికి బయల్దేరిన ఇజ్రాయిల్ ఎనిమిదివేలకు పైగా గాజాలోని సామాన్య పాలస్తీనియన్లును హత్య చేసింది. అయినా మా కమ్యూనిటీలోని పాలస్తీనియన్ల కోసం సంఘీభావ ప్రకటనేదీ వెలువడలేదు.

అమెరికాలో చాలా ప్రాంతాల్లో ఈ వైఖరి సర్వసాధారణం. కానీ మేమున్నది ప్రగతిశీల భావాలుగల ప్రాంతం. స్కూల్ సూపరింటెండెంట్ ట్రెయిల్ బ్లేజర్ అని మేమంతా గర్వంగా చెప్పుకునే ఆఫ్రికన్ అమెరికన్ మహిళ. టీచర్లు కార్ల్ మార్క్స్ గురించీ, కార్నెల్ వెస్ట్ గురించీ పిల్లలతో ఏ సంకోచాలూ, అభ్యంతరాలూ లేకుండా స్వేచ్చగా మాట్లాడే వాతావరణం ఉంది. అలాంటి స్కూల్ సూపరింటెండెంట్ నుంచి మొదలుకొని అగ్రదేశాల నాయకుల దాకా, గాజా అంటే హమాస్ అనే తీవ్రవాద సంస్థనే కనిపిస్తోంది కానీ సాధారణ పాలస్తీనా ప్రజలు కనిపించటంలేదు. కనిపించటం లేదా, లేక చూడదలచుకోలేదా?

స్కూలు స్థాయి అధికారులూ, సామాన్య ప్రజలు పాలస్తీనా ప్రజలను గుర్తించకపోవడం వెనకాల శక్తివంతమైన జియోనిస్ట్ నియంత్రిత ప్రచార యంత్రం పనితనం ఉంది. ఇజ్రాయిల్ దాడులపై నిరసన వ్యక్తం చేసిన వారు ఎంతోమంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. వారిపై దాడులు కూడా జరిగాయి. ఇజ్రాయిల్ ఆక్రమణను వ్యతిరేకించడాన్ని యూదు వ్యతిరేకతగా ఎప్పట్నుంచో మలచబడింది. అక్టోబరు 7 నుంచి పాలస్తీనియన్లపై జరుగుతున్న దాడులను గత డెబ్బైఏళ్లుగా వారిపై జరుగుతున్న దురాక్రమణ, వివక్ష, జాతి ప్రక్షాలనలో భాగంగా చూసినవాళ్లను ఆ యంత్రాంగం యూదు వ్యతిరేకులని ముద్ర వేస్తుంది. ఆ ముద్ర సాధారణమైంది కాదు. అదొక శక్తివంతమైన ఆయుధం. ప్రశ్నించగలిగే జనాన్ని, వలసవాద-జియోనిస్ట్ వ్యతిరేకత అంటే యూదు వ్యతిరేకత కాదని చెప్పలేని నిశ్శబ్దంలోకి నెట్టేస్తుంది.
తరతరాలుగా వివక్షనూ, అణిచివేతనూ, చివరికి సామూహిక హత్యాకాండనూ ఎదుర్కొన్న యూదు జాతికి చెందిన ఒక సమూహం, ఒక్క శతాబ్దంలోపల మరో జాతి నిర్మూలనకు పూనుకోవడం, ఎంత విచిత్రం?

విచిత్రమేనా??

అగ్రరాజ్యాలు పాలస్తీనా ప్రజల్ని పట్టించుకోకపోవడానికి వెనక భౌగోళిక రాజనీతి ప్రణాళిక ఉంది. ఆ ప్రణాలికకు బీజం 1799లో నిపోలియన్ వేశాడు. అరబ్బు దేశాలను ముట్టడిస్తున్నప్పుడు పాలస్తీనియన్ల భూభాగాన్ని ఫ్రెంచి దేశ రక్షణ కింద యూదులకు మాతృభూమిగా ప్రతిపాదిస్తూ ఒక ప్రకటన జారీ చేశాడు. ఆ విధంగా ఆ ప్రాంతంలో ఫ్రెంచి ఉనికిని స్థాపించాలని అనుకున్నాడు. అప్పటికి నెరవేరని నెపోలియన్ కలను 19 వ శతాబ్దంలో బ్రిటీషర్లు నిజం చేశారు.

1890ల్లో జియోనిజం అనే సరికొత్త వాదన రూపుదిద్దుకుంది. కొన్ని వందల ఏళ్లుగా ప్రపంచ నలుమూలల్లో ఉన్న యూదుల సంస్కృతీ సాంప్రదాయాల్ని మిశ్రమం చేసి పుట్టింది జియోనిజం. ఈ వాదనలోని మొట్టమొదటి ముఖ్య ప్రణాళిక, రెండువేల ఏళ్ల క్రితం రోమన్లు, క్రిస్టియన్లు, అరబ్బులు కలిసి తమను తరిమేసిన పాలస్తీనా భూమిని – ఇప్పుడు అక్కడ నివసిస్తున్న లక్షల మంది పాలస్తీనియన్లను వెళ్లగొట్టైనా సరే – ఆక్రమించుకోవడం. యూదు సమస్యకూ, మధ్యప్రాచ్యంలో బలపుడుతున్న అరబ్బు సమస్యకూ ఒకే పరిష్కారంగా, ఇతర అగ్రరాజ్య నాయకులూ ఇజ్రాయిల్ స్థాపనకు సహాయసహకారాలు అందించారు. ఆ సహాయ సహకారాలు ఇప్పుడు, మిలియన్లకొద్దీ డబ్బూ, ఆయుధాల రూపేణ, అమెరికా నుంచి ఇజ్రాయిల్ కు అందుతున్నాయి.

1917 నుంచి ప్రపంచ నలుమూలల్లో ఉన్న జియోనిస్టులు పాలస్తీనాకు తరలిరావడం మొదలైంది. హిట్లర్ కాలంలో యూరప్ దేశాలనుంచి పారిపోయివచ్చిన యూదులతో తమ భూమిని పంచుకోవడానికి పాలస్తీనియన్లు ఒప్పుకున్నారు కానీ, తమ ఇళ్లనూ, పొలాలనూ, ప్రార్థనా మందిరాలను ఆక్రమిస్తున్న జియోనిస్ట్ వలసవాద సెటిల్మెంట్లను అంగీకరించలేదు. జియోనిస్ట్ సెటిల్మెంట్ల కోసం యూదులు బ్రిటిష్ ఆధ్వర్యంలో పాలస్తీనాలో భూములు కొన్నారు. ఈ వ్యవహారంలో ఎంతోమంది పాలస్తీనియన్లు తమ భూములనుంచీ, ఇళ్లనుంచీ నిర్దాక్షిణ్యంగా వెళ్లగొట్టబడ్డారు.

బ్రిటిషర్లు, పాలస్తీనా భూమి పంపకం బాధ్యతను 1947లో కొత్తగా ఏర్పడ్డ ఐక్యరాజ్య సమితికి ఇచ్చారు. ఐక్యరాజ్యసమితి 55% పాలస్తీనా భూభాగాన్ని అప్పటికి ఆ ప్రాంతలో ఉన్న 5.5% యూదులకు పంచింది. జెరూసలెం ను తన ఆధ్వరంలో ఉంచుకొని, మిగతా భూమిని పాలస్తీనియన్లుకు పంచింది. ఆ అన్యాయపు పంపకాన్ని పాలస్తీనియన్లు ఒప్పుకోలేదు. జియోనిస్టులు భూమి పంపకాన్ని ఒప్పుకున్నా, బార్డర్లను ఒప్పుకోలేదు. పాలస్తీనాకు ఇచ్చిన భూమిపై దాడులు చేస్తూ క్రమంగా ఒక్కొక్క పట్టణాన్ని ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. 1948 లో బ్రిటిష్ మ్యాండేట్ గడువు తీరిపోయిన రోజున, జియోనిస్ట్ ఏజెన్సీ అధిపతి అయిన బెన్-గూరియన్ ఇజ్రాయిల్ స్టేట్ ఆవిర్భావాన్ని ప్రకటించాడు. అలా ఒక్కరాత్రిలో పాలస్తీనా పౌరసత్వం లేని ప్రాంతమైపోయింది. 1948లో జరిగిన యుద్ధంలో 700,000 మంది పాలస్తీనియన్లు తమ మాతృభూమినుంచి వెళ్లగొట్టబడ్డారు. 13,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సంవత్సరాన్ని అల్ – నక్బా (ఘోర విపత్తు) అని పాలస్తీనియన్లు పరిగణిస్తారు.

ఆ యుద్ధం తరువాత పాలస్తీనియన్లకు వెస్ట్ బ్యాంక్, గాజా ప్రాంతాలు వెళ్లగా, మిగతా 78% భూభాగం ఇజ్రాయిల్ ఆధీనంలోకి వెళ్లిపోయింది. 1967లో జరిగిన ఆరు రోజుల యుద్ధంలో పాలస్తీనియన్ల పరిస్థితి మరింత దిగజారింది. వెస్ట్ బ్యాంక్, గాజాలు ఇజ్రాయిల్ దురాక్రమణకు గురయ్యాయి. గాజా, ప్రపంచంలోని అతిపెద్ద ఓపెన్ ఎయిర్ చెరసాల అని అంటారు. ఇజ్రాయిల్ పాలస్తీనియన్ల ప్రతి కదలికలను ఉక్కుపిడికిలితో నియంత్రిస్తుంది. కొన్ని వేలమంది పాలస్తీనియన్లు ఇజ్రయిల్ జైళ్లలో మగ్గుతున్నారు. పాలస్తీనా పిల్లలు ఎప్పుడు చదువుకోవచ్చో, ఎప్పుడు పరీక్షలకు కూర్చోవచ్చో, వీధిలో ఆడుకుంటున్న పిల్లలు ఇళ్లకు వెళ్లగలుగుతారో లేదో, పనిలోకి వెళ్లిన తల్లిదండ్రులు రాత్రికి ఇంటికి చేరుతారోలేదో అంతా ఇజ్రాయిల్ సైనికుల దయాదాక్షిణ్యాలమీద ఆధారపడి ఉంటుంది. పాలస్తీనియన్ల భూమిని ఆక్రమించడమే కాకుండా వారి సంస్కృతిని కూడా తుడిచెయ్యడానికి ప్రయత్నించింది ఇజ్రాయిల్. 1890ల్లో జియోనిస్ట్ ప్రణాళిక రూపొందుతున్నప్పట్నుంచి ఇప్పటిదాకా జియోనిస్టులు పాలస్తీనియన్లను జంతువులుగా, టెర్రరిస్టులుగా పరిగణిస్తారు.

పాలస్టైన్ లిబరేషన్ ఆర్గనిజేషన్ (PLO) అనే సంస్థ 1960 ల చివర అరబ్-యూదు సహజీవనం అనే ఆలోచనతో ఆవిర్భవించింది. ఆ భూభాగంలో ఉమ్మడి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పొకోవచ్చని ప్రతిపాదించింది. తమ పోరాటం, పాలస్తీనా ప్రజలపై జియోనిస్ట్ ఇజ్రాయిల్ చేస్తున్న అణిచివేతను ఎదుర్కోవడానికే గానీ యూదులమీద కాదనీ ప్రకటించింది. నది నుంచి సముద్రం దాకా పాలస్తీనియన్లు స్వతంత్రులని నినదించింది. కానీ 1970ల చివర్లకు ఆ ప్రతిపాదనలు నిర్వీర్యమైపోయాయి. ఉమ్మడి ప్రజాస్వామ్యం బదులు టూ స్టేట్ పరిష్కారాన్ని ఒప్పుకోవలసి వచ్చింది.

PLO తగ్గుముఖం పట్టాక హమాస్ వెలుగులోకి వచ్చింది. ఇదొక ఇస్లామిక్ మిలిటెంట్ సంస్థ. దీని స్థాపన వెనక ఇజ్రాయిల్ అధినేత బెంజమిన్ నెతన్యాహూ హస్థం ఉందని కూడా అంటారు. ప్రస్తుతం గాజాలో హమాస్ అధికారం ఉంటే, వెస్ట్ బ్యాంకులో చెందిన పాలస్టీనియన్ అథారిటీ అధికారంలో ఉంది. ఆ అధికారాలన్నీ నామమాత్రపు అధికారాలే. ఇజ్రాయిల్ సైనికులూ, మెర్సనరీలూ ఎప్పుడు పడితే అప్పుడు నిర్దాక్షిణ్యంగా పాలస్తీనియన్లను పీడిస్తుంటారు. పాలస్తీనియన్ల అరెస్టులు, హింసించడాలూ, హత్యలూ సర్వసాధారణం.

పకడ్బందీ నిఘా యంత్రాంగం కన్నుగప్పి అక్టోబర్ 7న హమాస్ చేసిన దాడిని సాకుగా తీసుకుని గాజామీద బాంబుల వర్షం కురిపిస్తోంది ఇజ్రాయిల్. ఇది రెండవ నక్బా అనీ, పాలస్తీనియన్లను పూర్తిగా మట్టుపెట్టేదాకా ఆగేది లేదని ఇజ్రాయిల్ ప్రభుత్వాధికారులు ఏ దాపరికం లేకుండా ప్రకటిస్తున్నారు. హమాస్ చేసిన దాడిలో పాలుపంచుకోని వెస్ట్ బ్యాంక్ మీద కూడా దాడి చేస్తోంది. ఇప్పటికి వెస్ట్ బ్యాంక్ లోని రెండు పల్లెటూళ్లను ఆక్రమించి, ఊరి ప్రజలను దోచుకుని వాళ్ల ఇళ్లను తగులబెట్టేశారు ఇజ్రాయిల్ సైనికులూ, ప్రైవేట్ మెర్సనరీలు.

ఇజ్రాయిల్ చేస్తున్నది పాలస్తీనియన్ల సామూహిక హత్యాకాండ, ఇది రెండవ హోలోకాస్ట్. ఈ విషయం ప్రపంచానికి తెలుసు. అయినా ఐక్యరాజ్య సమితిలో జోర్డన్ ప్రవేశపెట్టిన యుద్ధవిరమణ తీర్మానాన్ని అమెరికా, ఇజ్రాయిల్ తో సహా 14 దేశాలు అంగీకరించలేదు. దేశ అధికారుల వైఖరి ఇలా ఉంటే, ప్రపంచం నలుమూలల్లో లక్షలమంది ప్రజలు పాలస్తీనాకు మద్దతుగా ప్రదర్శనలు జరుపుతున్నారు. తమ పేరుమీద పాలస్తీనియన్లను అణిచివేయడాన్ని ఎంతోమంది యూదులు కూడా వ్యతిరేకిస్తున్నారు. స్కూల్ పిల్లలకు కూడా పాలస్తీనా పరిస్థితిని చర్చించుకుంటున్నారు. పాలస్తీనా ప్రజలపై జరుగుతున్న సామూహిక హత్యాకాండనూ, అందుకు చేయుతనిస్తున్న ఇతరదేశ నాయకులనూ పిల్లలు గుర్తుపెట్టుకుంటారు. పాలస్తీనా ప్రజల ధిక్కారాన్నీ, వారికి ప్రపంచ ప్రజలు తెలుపుతున్న సంఘీభావాన్ని కూడా గుర్తుపెట్టుకుంటారు. ఈ పరిస్థితిలో మనమేం చేస్తున్నామన్నదీ గుర్తుపెట్టుకుంటారు.

*

[బొమ్మ గురించి:

నది నుంచి సముద్రం దాకా (From the River to the Sea):
నలుపు-తెలుపు రంగుల కెఫ్ఫియే తలకు చుట్టుకుని, ఒక చేత్తో పాలస్తీనా జాతీయ జెండా పట్టుకుని, పిడికిలెత్తి, పాలస్తీనా జాతీయ పక్షి అయిన పాలస్టైన్ సన్ బర్డ్ ను ఎక్కి స్వేచ్ఛగా నది నుంచి సముద్రం దాకా ఎగురుతున్న పాలస్తీనా అమ్మాయి/అబ్బాయి.

ఆర్టిస్ట్: టెర్ర మమత అనిల్ (ఆర్టిస్ట్ సిగ్నేచర్ : మేపుల్ )]

పర్యావరణ, మానవ హక్కుల కార్యకర్త, అమ్మ. బాల్యం కర్నూలు జిల్లా, నందికొట్కూర్ తాలూకా లోని మండ్లెం గ్రామంలో. హైస్కూల్, ఇంటర్ హైదరాబాదులో. బి.టెక్ కర్నూల్లో. ప్రస్తుత నివాసం పెన్నింగ్టన్, న్యూ జెర్సీ. సామాజిక స్పృహ ఉన్న సాహిత్యం చదవడం, రాయడం ఇష్టం.

One thought on “నది నుంచి సముద్రం దాక… స్వేచ్ఛా విహంగ పాలస్తీనా

  1. పాలస్తీనా సమస్యపై సంక్షిప్తంగా అయినా సమగ్రమైన అవగాహన కలిగిస్తుంది మీ రచన. అభినందనలు.ఒకప్పుడు అలీన దేశాలు పాలస్తీనా ప్రజల స్వాతంత్ర్య ఆకాంక్షలకు బలమైన స్వరంగా నిలిచాయి.ఒకప్పుడు అలీన దేశాలకు సారధ్యం వహించిన భారత దేశం ఇజ్రాయిల్ అనుకూల వైఖరి తీసుకోవడం, ఇస్లామిక్ దేశాల ఊగిసలాట వైఖరులను కూడా ప్రస్తావించి ఉంటే మరింత అర్థవంతంగా ఉండేది అనిపించింది.

Leave a Reply