దేశపటం

కాళ్ల కింద నేల కాదు,
నెత్తి మీది నింగి కాదు..
భుజాల మీది బాధ్యత.
జైల్లో సముద్రం కాదు,
బయట మిగిలిన ఎడారి కాదు..
ఆత్మబలిదానపు ఆతృత.
విత్తు ఒక్కటే కావచ్చు,
వృక్షాలు ఒక్కటి కాదు..
ఆకుపచ్చని అడవి ఒక ఆసరా.
గలగలల గోదారి కాదు,
బిరబిరల కృష్ణమ్మా కాదు..
చెట్టుకు వేలాడుతున్నభరోసా.
తేనెలొద్దు తేటలొద్దు
కొలవడాలు కచేరీలు వద్దు
కాపురాల్లో కలహాల కరువే దిలాసా.
రంగు కండువాల ఊసరవెల్లులొద్దు
కలల నెమలి పింఛాలమ్ముకునే జాతర్లొద్దు
బోర్లించిన పుస్తకాల మాటున
బోర్లాపడే బొచ్చెలొద్దు
మల్లెపూల దండలొద్దు
మత్తు ఒదలని మాటలొద్దు
దేశపటం మనిషే ముఖచిత్రం కావాలోయ్

పుట్టింది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. సొంతూరు తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం. కవి, జర్నలిస్టు. గీతా విద్యాలయం(శ్రీకాకుళం)లో మొదలు పెట్టి ఎస్ఎమ్‌యుపి స్కూల్లో ప్రాథమిక విద్య. ఏడు రోడ్ల జంక్షన్‌లోని ఎం.హెచ్.స్కూల్లో ఉన్నత విద్య. ఆముదాల వలస, మందసల్లో ఇంటర్ తొలి, మలి సంవత్సరాలు. బారువాలో బి.కాం. డిగ్రీ చదివారు. ఉద్యోగ విరమణ అనంతరం తల్లిదండ్రులు స్థిరపడిన విశాఖలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవడంతో, పొట్ట చేతబట్టుకుని 1995లో హైదరాబాద్ చేరిక. జర్నలిస్ట్‌ గా ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్, డిజిటల్ మీడియాల్లో పని. రచనలు: ‘ఒకేఒక్క సామూహిక స్వప్నావిష్కరణ’(2000), ‘దుర్గా పురం రోడ్’(2019) కవితా సంకలనాలు వెలువడ్డాయి. ‘దుర్గాపురం రోడ్’ కవితా సంపుటికి ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు, పాతూరి మాణిక్యమ్మ జాతీయ స్థాయి స్మారక సాహిత్య స్ఫూర్తి పురస్కారం ప్రకటించారు. తరచుగా కవిత్వం, అరుదుగా కథలు, అలవోకగా పుస్తక పరిచయాలు, అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు, అనువాదాలు, వ్యాసాలు రాస్తుంటారు.

Leave a Reply