కరోన వైరస్- దాని పరిణామాలు

కరోనా వైరస్- ఈ పేరు వింటేనే ప్రస్తుతం ప్రపంచమంతా వులిక్కిపడుతోంది. మొదట్లో దీన్ని గురించి అసలు వివరాలకన్నా, అసత్యాలు ఎక్కువగా ప్రచారంలోకి వచ్చాయి. అవి యువకులలో కొంత నిర్లక్ష్యం, వయసు పైబడిన వారిలో భయాందోళనలు పెంచాయి. ప్రభుత్వం తగిన శ్రద్ధ తీసుకుని, కరోనా గురించి విస్తృతంగా ప్రచారం మొదలెట్టాక, ప్రజలకు దాని వల్ల వచ్చే ప్రమాదమేమిటో అర్ధం అయ్యింది. దీనికి కారణం లేకపోలేదు. మనదేశంలో ఇలాంటి వైరసులు- స్వైన్ ఫీవర్ లాంటివి, ఇదివరకు వచ్చినప్పటికీ, ప్రజలకు వాటిని అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తించదగ్గ పరిస్థితి ఏర్పడలేదు. అందువల్ల మొదట్లో ప్రజలకూ, ప్రభుత్వాలకు కూడా కరోనా వైరస్ గురించి సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం తెలియ లేదు. అత్యంత ఆధునిక దేశాలన్నింటిలోనూ, ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, ముందుగా వివిధ దేశాలకు సరైన దిశానిర్దేశం చెయ్యలేకపోయిందనే ట్రంప్ గారు తప్పుబట్టారు. మన దేశంలో కాస్త ఆలస్యంగా మొదలైన ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని చర్యాలూ తీసుకున్నప్పటికీ, అధిక జనాభా వల్ల పూర్తి నియంత్రణ సాధ్యపడ లేదనుకోవాలి. అయితే సామాజిక వ్యాప్తి నిరోధానికి మన ప్రభుత్వం తీసుకున్న“లాక్ డౌన్” గొప్ప అసాధారణ చర్య అనే చెప్పాలి. దీని వల్ల మంచి ఫలితా లుంటాయని ప్రభుత్వం ప్రకటించింది. అది రుజువైంది కూడా. ఈ చర్యే ప్రభుత్వం తీసుకుని ఉండకపోతే, మనదేశం కూడా మరొక న్యూయార్క్ నగరంలా మారి ఉండేది.

అయితే, తర్వాతి కాలంలో (పోస్ట్ కరోన పీరియడ్) సమాజంలో ఈ ప్రమాదకారి కరోనా ఏ మార్పులు తెచ్చే అవకాశం ఉందో చర్చించడం ఈ వ్యాసం ఉద్దేశం. అంతేకాదు, అనేక రకాల సమస్యలతో బాధపడుతున్న వారి అవసరాలను మనం గుర్తిస్తున్నామాని ఆలోచింప జేయడం కోసం కూడా ఈ వ్యాసం రాయడం జరిగింది. ఈ కరోనా పెనుముప్పు ఎలాగోలా దాటినా, రాబోయే కాలంలో మనం ఎదుర్కోవాల్సిన సమస్యలు ముఖ్యంగా మూడు రకాలుగా ఉండవచ్చు. అవి ఆర్ధిక, సాంఘిక, మానసిక పరమైనవిగా మనం విభజించ వచ్చు. ఆర్ధిక పరమైన ప్రమాదకర పరిస్థితులు గురించి అనేకమంది నిష్ణాతులు తమ ఆలోచనలు వెల్ల డించడం జరిగింది కనుక, వాటిని ఇక్కడ చర్చిండం లేదు.

ముందుగా ఈ కరోనా కాలంలో పాటించిన, లేదా పాటించవల్సి వచ్చిన కొత్త జాగ్రత్తలు ఒక సారి గుర్తుచేసుకుందాం. తరచూ చేతులు కడుక్కోవటం, మనిషికి మనిషికి మధ్య దూరం పాటించడం, దగ్గు, లేదా తుమ్ములు వచ్చినప్పుడు మోచేతిని అడ్డం పెట్టుకోవటం, అనవసరంగా బయటకు వెళ్ళక పోవటం, అవసరమైనప్పుడు మాస్కులు ధరించ మాత్రమే బయటకు వెళ్ళటం –ఇవీ మనం పాటిస్తున్న నియమాలు. అయితే, ఈ కరోనా వైరస్ మనలో సృష్టించిన భయాలు ఎన్నో వున్నాయి. అసలు క్వారంటైన్ అంటే జైల్లో పెట్టినట్లు ఏకాంత వాసమనీ, ఎవర్ని చూడనివ్వరనీ, ఫోనులోనైనా మాట్లాదనివ్వరనీ భయం ఒకటైతే, అక్కడ తమ ఇంట్లో వుండే కనీస సౌకర్యాలైనా ఉంటాయో లేదోనని అనేక మంది అనుమాన పడుతున్నారు. కొన్ని చోట్ల, ప్రజలు తమ బాధలను, భయాలను నివృత్తి చేసుకోక, వైరస్ సోకినా కూడా, దాక్కుని ఉండటం దీనివల్లనే. ఈ భయాలను, అనుమానాలను ప్రభుత్వమే తీర్చాలి. అవసరమైన సౌకర్యాలు ఏర్పరచడమే కాదు, వైద్యం కూడా అందుబాటులో వుందని ప్రజలకు అర్ధమయ్యేలా మరింత ప్రచారం చెయ్యాలి. అంగవికలురు, అంధులు మరొకరి సాయం, చేయూత లేకుండా నిత్య జీవితంలో దైనందిన కార్యక్రమాలు నెరవేర్చుకోవడం దాదాపు అసాధ్యమేనని మనందరికి తెలుసు. అలాంటప్పుడు వీరు సామాజిక దూరం పాటించగలరా? అడుగడుగునా చేతులు కడుక్కోవడం లాంటి పరిశుభ్రతలు పాటించేదేలా? వీరికి కరోనా సోకకుండా ఉండాలంటే వారి కుటుంబంలోని వారు, తోటి పనివారు మరింత ఎక్కువ జాగ్రత్త వహించాల్సిందే.

సాంఘిక సమస్యలు: ప్రధానంగా , నీటి సమస్య వున్న ప్రాంతాలలో, తరచూ చేతులు కడుక్కోవటం కూడా ఒక సమస్యే. పక్క వాళ్ళని అనుమానంగా చూడటం, మా ఇంటికి ఎవరూ రావద్దనీ, లేదా మా వూరికి రావద్దని నిర్మొహమాటంగా చెప్పటం, కరోన వచ్చిన తల్లి, తండ్రి, భార్య పిల్లలు, వారెవరైనా, తమవారికి కూడా కరోన వస్తుందేమోనని ఆందోళన పడటం, అలాగే బాధితుల కోసం వారి బంధువులు కలవరపడటం మనం చూస్తున్నాం. కొన్ని చోట్ల కరోనాతో చనిపోయిన తల్లిని చూడలేని, లేదా అంతిమ సంస్కారానికి కూడా వెళ్ళలేని పరిస్థితులను మనం వింటున్నాం. ఇటలిలో అయితే, సామూహిక మరణాల వల్ల, ప్రభుత్వమే ఏమి చెయ్యలేని పరిస్థితిలో పడింది. ఈ పరిస్థితి ఎన్నాళ్ళు కొనసాగుతుందో, దీనికి అంతమెప్పుడో ఎవ్వరూ చెప్పలేని పెద్ద సమస్య. మనిషికి తన వాళ్ళ పట్ల వున్న అనురాగాన్ని నిర్లిప్తతగా మార్చుకుని, నిస్సహాయంగా వదిలేసే స్థితిలోకి ఇప్పుడు కొంతమంది నెట్టి వేయబడుతున్నారు. మున్ముందు మన సమాజంలో ఈ అనురాగాలూ, అభిమానాలూ నిర్లిప్తతగా మారే ప్రమాదం ఉందా? రాబోయే రోజుల్లో ఒకరి ఇంటికి ఒకరు వెళ్ళే స్నేహ భావం, లేక బంధుత్వం ఉంటుందా? ఒకరినొకరు అనుమానంగా చూడటం వదిలేయగలమా?

బ్రతక గలిగిన వాళ్ళే బ్రతుకుతారు: గత నెలలో బ్రెజిల్ దేశ అద్యక్షుడు జైర్ బోల్సోనారో తమ దేశంలో కరోనా పరిస్థితిపై చెప్పిన మాటలు మనం మననం చేసుకోవాలి. ఆయన మాటల్లోనే, “కొంతమంది కరోనా వైరస్ వల్ల చనిపోక తప్పదు. ఇది జీవితం. ఇలా చెప్పడానికి నేను చాలా విచారిస్తున్నాను.” ఇప్పటికే, వయసు మళ్ళిన వృద్ధులు సమాజానికి భారమనే అభిప్రాయం ప్రబలుతోంది. ఇది ప్రభుత్వాల వైఖరిలో వస్తున్న లేదా, రాబోతున్న మార్పు అనుకోవచ్చా? బ్రెజిల్ అద్యక్షుడు ఎటువంటి పరిస్థితులలో అలా అన్నప్పటికీ, ఈ మాటలు కొన్ని ప్రశ్నార్ధకాలను లేవనెత్తుతున్నాయి.

ఈ నాటి సమాజంలో, వయసు పైబడిన వాళ్ళు, ఆడవారు, సమాజంలో అట్టడుగు వర్గాల వాళ్ళు, ఫిజికల్లి చాలెంజ్డు పీపుల్ అనేక విషయాల్లో నిర్లక్ష్యం చేయబడుతున్నారు. చాలా సందర్భాలలో వీళ్ళకు జరుగుతున్న అన్యాయాలకు సమాజమే కేంద్ర స్థానం అవుతున్నది. అయితే, ఈ కెరోనా విపత్తు సమయంలో ఇటలీ దేశంలో “ఎనభై ఏళ్ళు పైబడిన కరోనా బాధితులు బతికితే బతుకుతారు, యువకులకు వైద్యం చేసి బతికించడమే తమకు ముఖ్యమనే” నిర్ధారణకు వచ్చారు. నిత్యం పెరుగుతున్న రోగుల సంఖ్య మూలంగా వేరే గత్యంతరం లేక అలాంటి నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. మరొక కారణం వైద్యుల కొరత, మందుల కొరత కావచ్చు. మన దేశంలో తరతరాలుగా పాతుకుపోయిన కుటుంబ విధానాలు కొంత పలచబడినప్పటికీ, ఇంకా మనం ఆ స్థితికి రాలేదనే నా నమ్మకం. అయితే, మానవాళి మెత్తంగా చూసినప్పుడు, సమాజంలో ఈ మార్పు రాబోతోందా అన్న అనుమానం రాక తప్పదు. అసలు వయసుపైబడిన వాళ్ళు ఈ సమాజానికి అవసరం లేదా? శారీరక ధారుడ్యం ఉన్నవాళ్ళు, రోగాలు రానివారే సమాజానికి ముఖ్యమా? ఒక ఫిజికల్లి చాలెంజ్డు వ్యక్తి గాని, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్నవారు కానీ, అంధులకు కానీ, సమాజంలో అందరితో పాటు సాధారణ జీవనం గడిపే హక్కు మనం ఎంత వరకూ ఇవ్వగలుగుతున్నాము? జీవన విధానాల్లో వచ్చిన గణనీయమైన మార్పుల వల్ల, వైద్య విజ్ఞానం వల్ల, ప్రజల ఆయు ప్రమాణం కూడా పెరిగింది. అలాగే, అనేక కారణాల వల్ల, ముఖ్యంగా పట్టణాలలో, నగరాలలో ప్రజల ఆరోగ్య సమస్యలూ పెరిగాయి కదా! అలాంటప్పుడు అసలు ఎంత వయసు వరకూ ప్రజలు ఈ సమాజానికి అవసరంగా, లేదా ఉపయోగకరంగా పరిగణింప బడతారు? మరి ధనవంతులు, అధికార ప్రముఖులు ఎలా వున్నా, ఎంత వయసున్నా ఈ లిస్టులోకి రారా? వారికి లభించే వైద్యంగాని, మరే ఇతర విషయాల్లో వారికి లభించే ప్రాముఖ్యత గానీ మనం చూసినట్లయితే, ఈ సమాజంలో ఒకరికి ఒక న్యాయం, మరొకరికి మరొక న్యాయం-ఇది అన్యాయం అనిపించదా? అందరికి ఆరోగ్యం అంటూనే వివిధ దేశాలు ఇంతవరకూ ప్రజారోగ్యం మీద అవసరమైనంత శ్రద్ధ చూపించలేదని ప్రతిపక్షాలు నిందిస్తూనే వున్నాయి. మరి అలాంటప్పుడు, వయసుపైబడిన వాళ్ళు, వ్యాధిగ్రస్తులు, శక్తీ లేనివాళ్ళకి వైద్యం చెయ్యకుండా వదిలెయ్యడాన్ని ఏమనాలి? ఎక్కడో ఒక చోట మాత్రమే జరిగినదని, ముందస్తు ఆలోచన, విపత్కర పరిస్తితుల నెదుర్కొనే మానసిక సంసిద్ధతలేని ప్రభుత్వాధి నేతలే ఇలా మాట్లాడుతారని, ప్రవర్తిస్తారనీ సరిపుచ్చుకోవచ్చా ?

వసుదైక కుటుంబం: ఇంటర్నెట్ వచ్చాక, ప్రపంచమంతా ఒకటిగా మారిపోయింది. క్షణాలలో వార్తలు మారుమూలలకు కూడా చేరిపోతున్నాయి. కష్టాలు ఎక్కడ వచ్చినా, సామాన్య ప్రజలు కూడా “అయ్యో పాపం, వాళ్ళూ మనుషులే, అంతా ఒకటే” అనే వసుదైక కుటుంబ భావనకు వచ్చినప్పటికీ, వివిధ దేశాధినేతలు మాత్రం “బలవంతుడిదే రాజ్యం” అనే ఆటవిక న్యాయానికి ఇంకా దగ్గరలోనే మసలుకుంటున్నారు. వ్యాపార రంగంలో ఎత్తులూ, పై ఎత్తులూ, బెదిరింపులు కొన్ని ధనిక దేశాలు అమలు చేస్తూనే వున్నాయి. ప్రతి దేశం తమ మనుగడ కోసం, ఆధునిక సాయుధ సంపత్తి సమకూర్చుకోవడం ముఖ్యమైన అవసరంగా భావించాల్సి వస్తోంది. దానికి ఆయుధ వ్యాపారం చేసే దేశాలే కారణమవు తున్నాయి. అభివృద్ది చెందు తున్న దేశాలు, పేద దేశాలూ, ఎంత కాలమైనా అక్కడే ఆగిపోవడానికి ఈ దేశాల ఆయుధ వ్యాపారం కారణం కాదా? రేపు కరోనా తిరుగు ముఖం పట్టాక, ఈ దేశాలు ఖాళీ అయిన తమ నిత్యావసరాల కోసం, తమ ప్రజల కోసం, ఏ రకంగా ప్రవర్తించబోతున్నాయి? పరస్పర స్నేహా లను, సహాయాలను మరిచిపోతాయా? కేవలం సైనిక బలం, ఆర్ధిక పరమైన బెదిరింపులే వారు తూటాలుగా ఉపయోగించబోతున్నారా?

మరొక విషయం. ఈ కరోనా కాలంలో వివిధ దేశాలు, తమ దేశాలలో నివసిస్తున్న విదేశీ యులను, వాళ్ళ దేశాలకు పంపివేశాయి. ఇప్పటిదాకా ఒక దేశ ప్రజలు మరొక దేశంలో నిశ్చింతగా జీవిస్తున్నారు. పై చదువులకోసమో, వ్యాపారం కోసమో, ఉద్యోగాలవల్లనో విదేశాల్లో అనేకమంది స్థిరపడి పోయారు. ఇక ముందు ఈ అవకాశం మృగ్యం కానున్నదా?

మానసిక సమస్యలు: దేన్నీ లెక్కజేయని ధైర్యస్తులు అన్ని దేశాలలో ఉన్నప్పటికీ, వారిని కూడా ఈ కరోనా చాలావరకు భయభ్రాంతులను చేసింది. ఈ నాటి విపత్కర పరిస్థితులు పసివారి మనసులపై చేరగరాని ముద్ర వేస్తాయి. ఇది రాబోయే తరాల జీవనంలో మార్పు తేనుందా? వాళ్ళు ఇలాంటి వ్యాధుల పాలబడినప్పుడు ధైర్యంగా ఎదుర్కోగలరా? అ తర్వాత అందరితో కలిసి మెలిసి జీవించ గలరా? ఇప్పటికే కులాలు, మతాలూ, వర్గాలుగా విడిపోయిన మనం ముందు తరానికి ఏ విధమైన మార్గ నిర్దేశం చేయబోతున్నాం? మానసికమైన వంటరితనానికి వారిని అలవాటు చేయబోతున్నామా?

సమాజంలో విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు, సాధారణ స్థితి ఏర్పడిన కొన్ని సంవత్సరాల వరకు కూడా, జరిగిపోయిన బాధాకరమైన దృశ్యాలే వెంటాడుతుంటాయి. కొన్ని దశాబ్దాల వరకూ దాని ఫలితాలు ప్రజలపై పడక మానవు. దీనికి గొప్ప ఉదాహరణ భోపాల్ గ్యాస్ ప్రమాదం. ఇలాంటివి మానసికంగా మనిషిని కృంగ దిస్తాయి. జీవితంలో మరే ఉత్సాహాన్ని నింపే సంతోషకరమైన సంఘటనలు లేనప్పుడు, మనిషికి సహజంగానే జీవితంపై విరక్తి పుట్టవచ్చు. అది ఆత్మ హత్యకు దారితీయవచ్చు. స్టాన్ ఫర్డ్ యూనివర్సిటిలో పనిచేసే సైక్రియాటిస్ట్ శైలి జైన్ “ఇలా మనల్ని చాలా కాలం వెంటాడే భయాందోళనలను పోస్టు ట్రామాటిక్ డిసార్డర్(PTSD)” అని అంటారు. ఇంకా అనేక కారణాలు, రేప్ జరగడం, కుటుంబ హింస, అణచివేయబడటం, ఒక ప్రమాదకర సంఘటన నుంచీ బయట పడటం లేదా, రాజకీయ పునరావాసం, ఆర్ధిక విపత్తు –ఇలాంటివన్నీ దీనికి కారణాలు కావచ్చని అంటారామె. మన భారతదేశంలోనే మానసిక పరమైన బాధలు పడేవారి సంఖ్య అత్యధికమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక నివేదికలో తెలిపింది. దీనికి రెండు కారణాలు చెబుతున్నారామె. మన సమాజంలో మానసిక రుగ్మతలున్న వారిని చిన్న చూపు చూడటం వల్ల, ఆ లోపాన్ని మనలోనే దాచిపెట్టుకుని, డాక్టరు సహాయం తీసుకోకపోవడం ఒకటైతే, ఇవి పాశ్చాత్య దేశాలలోని రుగ్మతలుగా మనం ఇచ్చుకున్న గుర్తింపు మరో కారణం. ప్రభుత్వాలు మానసిక రుగ్మతలకు, వాటి వైద్యానికి తగినంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె నొక్కి చెబుతున్నారు. ఎందుకంటే, మానసికంగా ఆరోగ్యంగా వున్న వ్యక్తి, శారీరకంగానూ ఆరోగ్యంగా ఉన్నట్లే.

ప్రభుత్వ సహాయం, ప్రజల బాధ్యత: అసంఘటిత కార్మీకులకు, చిన్న వ్యాపారస్తులకు, తోపుడు బళ్ల వాళ్ళకు, వ్యవసాయదారులకు, కూలీలకు ప్రభుత్వం తలపెట్టిన, చేస్తున్న సహాయం మంచిదే. అది వారికి అందేలా చూడాల్సిన అవసరం కూడా వుంది. అయితే, ఇది వారికి ఆపత్కాలంలో ప్రభుత్వం ఇచ్చే సహాయం కింద మాత్రమే చూడాలి. సహాయం చేసేందుకు ప్రభుత్వానికి కూడా పరిమితులున్నాయని మనం గ్రహించాల్సిన అవసరం వుంది. కరోనా ఆపద తర్వాత, ప్రజలకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై మరింత పెరగనుంది. ఈ విపత్తులో ప్రాణాలు పణంగా పెట్టి సేవ చేస్తున్న వైద్య సిబ్బందికి, పోలీసు వారకి, అట్టడుగు వర్గాల వారికి- కార్పోరేట్ కంపెనీలు, దాతలు చేస్తున్న సహాయం మరువలేనిది. అలాగే ఉపాధి కల్పనలోనూ ప్రభుత్వానికి వీరు అండగా నిలబడాలి. కరోన దాడి తగ్గగానే, నిత్యావసారాల నుంచి అన్నీ ధరలు పెరగకుండా ప్రభుత్వానికి చేయూత నివ్వాలి. మరో విషయం. మన ప్రభుత్వాలు సామాజిక బాధ్యతగా, ప్రజలకు కరోన వైరస్ వల్లే కాదు, మరే రోగం వల్లనైనా భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం కలిగించాలి. మన వైద్య విధానం పట్ల, వైద్యుల పట్లా కూడా ప్రజలకు నమ్మకం పెరగాలి. ప్రైవేటు వైద్య విధానంలో సామాన్యుడికి అనుభవ మవుతున్న అత్యధిక బిల్లుల బరువు తగ్గాలి. ఈ దిశగా ప్రభుత్వాలు కొంతైనా ప్రయత్నం చెయ్యాల్సిన అవసరం ఉంది. మరొక విషయం. ఇలాంటి విపత్తుల సమయంలో ప్రైవేటు ఆస్పత్రులు కూడా బాధ్యత తీసుకునేలా వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అలాగే, ఇలాంటి విపత్తులు ఎదుర్కొనేందుకు, ప్రజారోగ్యం కోసం అవసరమైన హాస్పిటళ్ళను నెలకొల్పటం, వైద్య విద్యనూ, ప్రతిభావంతులను ప్రోత్సాహించడం చెయ్యాలి. ఆరోగ్య రంగలో కొత్త ఆవిష్కరణలు, ప్రయోగాలూ జరగాల్సిన అవసరం ఎంతైనా వుంది. దానికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో సత్వర ప్రయత్నాలు జరగాలి.

ఈ కరోనా ప్రభావం వల్ల, కొన్ని వేల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదముందని కొంత మంది చెబుతున్నారు. ఐ.టి. ఉద్యోగాల కల్పన లాంటివి మన ప్రభుత్వాలు చెయ్యలేక పోవచ్చేమో కానీ, ఫ్యాక్టరీలు నెలకొల్పటడం, మన దేశం అవసరాలకు సరిపడా, మరియు విదేశాలకు ఎగుమతి చెయ్యగలిగిన ఉత్పత్తులు పెంచేందుకు కృషి చెయ్యడం మన చేతిలో పని. అందువల్ల, అనేక వేల మందికి ఉపాధి ఏర్పడుతుంది. ప్రజల ఆదాయం పెరుగుతుంది. ఎగుమతుల వల్ల మన దేశ ఆదాయం పెరుగుతుంది. ఈ దిశగా మనం కృషిచేయాలి. ఇవన్నీ మనం సాధించగలిగితే, ఈ కరోనా విప్పత్తు సృష్టించిన సమస్యలను కొంతవరకైనా అధిగమించినట్టు అనుకోవచ్చు.

కవి, రచయిత, అనువాదకుడు. మొదటి కథ 'దోమాయణం' లీలా రాఘవయ్య గారి 'జ్యోతి' 1989 దీపావళి ప్రత్యేక సంచికలో అచ్చవడంతో రచనా వ్యాసాంగం మొదలైంది. ఇప్పటికి రెండు తెలుగు నవలు (‘సహజీవనం’, ‘లాకర్ నెంబరు 112’) (విహంగ, కౌముది) వెబ్ మ్యాగజైన్లలో ప్రచురితమయ్యాయి. తమిళ రచయిత్రి శివ శంకరి నవల 'ది బిట్రేయల్', అపూర్వ పురోహిత్ 'ఓ లేడీ యు ఆర్ నాట్ ఎ మాన్' అనే పుస్తకాలను తెలుగులోకి అనువదించారు. 'పియర్సన్ ఇండియా' వారి ఐదు పర్సనాలిటీ డెవలప్మెంట్(రిచర్డ్ టెంప్లార్ రాసినవి) పుస్తకాలను తెలుగులోకి అనువాదం చేశారు. అద్భుతమైన ప్రతిభా పాటవాలు కలిగినా, రావాల్సినంత పేరు రాని, దేశ విదేశాల్లోని స్త్రీ మూర్తుల గురించి తొమ్మిది వ్యాసాలు “విహంగ” వెబ్ మ్యాగజైన్ లో ప్రచురితమయ్యాయి. ఇప్పటి దాకా పందొమ్మిది కథలు రాశారు. ఒక ఇంగ్లిష్ సస్పెన్స్ నవల రాస్తున్నారు. రెండు తెలుగు కవిత్వం పుస్తకాలు అచ్చు వేశారు. మరొక తెలుగు కవిత్వం పుస్తకం, ఒక ఇంగ్లిష్ కవిత్వ పుస్తకం ప్రింట్ కావాల్సి వుంది.

Leave a Reply