ఊపిరి బిగపట్టి చదవాల్సిన పుస్తకం “ఉరి వార్డు నుండి”

కొన్ని పుస్తకాలు చదవడానికి చాలా దిటవుగుండెలుండాలి. ఇలాంటివి చదివేపుడు ఇంత విషాదమా, ఇంత బీభత్సమా? వీటికి దరీ, అంతూ లేదా అనిపిస్తుంది. అయినా ఊపిరి బిగబెట్టి చదువుతాం. మేరీ టైలర్” భారత దేశంలో నా జైలు జీవితం “అప్పటి పాఠకుల్ని రోజుల తరబడి ఇలానే వెంటాడి వుంటుందనుకుంటాను. సుధా భరద్వాజ గారి “ఉరివార్డు నుండి” కూడా ఈ కోవకే వస్తుంది. ఇదేమీ ఆషామాషీ పుస్తకం కాదు.

ఇంత కొద్దికాలంలోనే ఇది తెలుగులోకి అనువాదం కావడం ఆశ్చర్యం, ఆనందం కలిగిస్తాయి. ఇతర ఏ భాషల్లోనైనా ఎంత వేగంగా ఇది అనువాదం అయిందో లేదో తెలియదు. ఇది మన రాజకీయ సాంస్కృతిక సాహిత్య వారసత్వం తెలుగు వాళ్ళంగా మనం దీనికి గర్వపడాలి. ఇలాంటి గ్రంధాన్ని ఎంచుకొని, ఎక్కడా కొతుకు లేకుండా చదివేలా అనువదించిన ఉషారాణి గారిని, ప్రచురించిన ప్రజాశక్తి బుక్ హౌస్ వారినీ ఎంతైనా అభినందించాలి.

సుధా భరద్వాజ్ లాంటి వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తారు. మనం సావిత్రిబాపూలే లాంటి మహిళల గురించి స్మరించుకుంటాం. కానీ వర్తమానంలోనూ ఇలాంటి వారున్నారన్నది మర్చిపోతుంటాం. తెలిసినా వీరి వెంట నిబడ్డానికి తటపటాయిస్తుంటాం.

సుధా గారి తల్లి కృష్ణ దేశం కోసం మహాలనబిస్ గారి పిలుపుమేరకు అమెరికా వదిలి మాతృభూమికి వచ్చేసారు. కూతురు సుధా గారు 21 ఏళ్లకే అమెరికా పౌరసత్వం వదిలేసి ఇండియాకు వచ్చేసారు. కాన్పూరు ఐఐటిలో ఐదేళ్ళ డిగ్రీ చదివి చత్తీస్ ఘడ్ గని కార్మికుల కోసం మరుగుదొడ్డి కూడా లేని గుడిసెలో మూడు దశాబ్దాల తరబడి వున్నారు. అక్కడి గిరిజనులే తన ప్రపంచంగా మారిపోయారు. బీమాకొరెగావ్ కేసులో జైలు శిక్ష అనుభవించారు. ఈరోజుల్లో ఈ త్యాగాలు ఎవరిది సాధ్యం? తలచుకుంటే మన చుట్టూ ఉన్న ప్రపంచంలోనే ఇంత వీర వనితలు వున్నారా అన్పిస్తుంది. కొండతం ధైర్యం వస్తుంది. భవిష్యత్తు పట్ల గొప్ప భరోసా కలుగుతుంది. ‘ఉరి వార్డు నుండి’ మొదటి భాగంలో స్వంతంగా ఆమె చెప్పిన జీవిత కథ పుస్తకం లోకి దూరకముందే మన గుండెల్నిబరువెక్కిస్తాయి.

సామాన్యంగా జైలు రచనలు ఎక్కువ భాగం స్వీయాత్మకంగా వుంటాయి. కానీ “ఉరివార్డు నుండి” ఈ ధోరణికి పూర్తిగా భిన్నం. ఇదంతా తోటి ఖైదీల గురించీ, అదీ నిరుపేద మహిళా ఖైదీల గురించి చూసింది చూసినట్టుగా. వ్యాఖ్యానం లేకుండా చేసిన కథనం. ఇది దాదాపు ఎబైకి పైగా మహిళల వ్యథార్థ జీవితాల దృశ్య మాలిక. ఒక ఉద్యమకారిణిగా, మరీ మహిళగా సుధా గారికి ఒక విస్పష్ట ప్రాపంచిక దృక్పథంతోపాటు నిరుపేద మహిళల పట్ల గాఢతిగాఢ ప్రేమానురాగాలున్నాయి. ఆమె సామాజిక ఆచరణే వారి చుట్టూ జరిగింది. ఈ ఆర్ద్రత లేకుండా ఇలాంటి రచన చేయడం అసాధ్యం.

జైల్లో ఆమె చుట్టూ రకరకాల స్త్రీలున్నారు. వారిలో కొందరు వచ్చి బాలింతలు కూడా వున్నారు. వారితోపాటు పసిపిల్లలు కూడా వున్నారు. వీరు చేసినవన్నీ చిన్నచిన్న నేరాలు. చాలా భాగం తెలియక చేసినవి. కొన్ని చేయక తప్పక చేసినవి. కొన్ని నెత్తిన పడ్డవి. ఒక పచ్చి బాలింతను. బిడ్డను కని వారం రోజులు కూడా తిరక్క ముందే మొగుడు తాగొచ్చి తన కోరికను తీర్చమన్నాడు. కాదంటే ఏడేళ్ల కూతురుని పంపమన్నాడు. ఇంకేం చేయాలి? బాది వాడిని చంపింది. ఇదీ ఆమె చేసిన ‘హత్యా’ నేరం. నేరం చేసినప్పుడు భార్య ఫోన్ మొగుడి దగ్గర వుంది. ఆ ఫోన్ కాల్ రిజిస్టరు ఆధారంగా ఆమెను అరెస్ట్ చేశారు! కొన్ని అత్తలతో గొడవలు. ఇవి చాలా భాగం సంసారపు సమస్యలతో ముడివడ్డవి. దాదాపు అందరూ మొదటి సారి జైలుకొచ్చిన వారు. వీళ్ళల్లో ఒక్కరూ కరుడుగట్టిన నేరస్తులు లేరు. క్రిమినల్స్ లేరు. ఉగ్రవాదులు లేరు. కనీసం రౌడీషీటర్లు కూడా లేరు. అంతా బండ చాకిరీ చేసి సంసారాల్ని ఈదుతున్నవారు. తాగుబోతు మొగుళ్ళతో బతుకంతా ఏగుతున్న వాళ్ళు. తమకంటూ ఏ న్యాయమూ లేని ప్రపంచంలో “లౌక్యంగా” నెట్టుకు రాజ తెలీక జైల్లోకి చేరిన వాళ్ళు.

ఇలాంటి వాళ్ళ కోసమేనా మన జైళ్లు వుండేది. వీరి కోసమేనా పోలీసులు, లాయర్లు, కోర్టులు, కారాగారాల ఇంత పెద్ద వ్యవస్థ వుండేది? నిజానికి వీళ్లే ఈ వ్యవస్థకంతా బతుకుతెరువు. వీళ్ళే లేకుంటే వీటికి పూటే గడవదన్పిస్తంది ఈ పుస్తకం చదువుతున్న ప్రతి క్షణం!

అసలు బయట వుంటున్న వారెవరు? జైల్లో వుంటున్న వారెవరు? జరుగుతున్నది ఉల్టా కదా అన్న మౌలిక ప్రశ్నలు కూడా ఈ పుస్తకంలో చదువుతున్నంత సేపూ మనల్ని వెంటాడుతాయి. వేటాడుతాయి కూడా!

విచిత్రం ఏమంటే నిర్భాగ్యమహిళలకు బయట ప్రపంచమూ, జైలు ప్రపంచమూ కొంచెం అటూ ఇటూ రెండూ ఒకటి గానే వుంటాయి. ఒక్కోసారి జైళ్లే మేలని కూడా అన్పిస్తుంటాయి.

బ్రహ్మకుమారీలు వచ్చి “నైతిక ఆధ్యాత్మిక బోధామృతం” కురిపించబోయినప్పుడు ఒక సాధారణ ఖైదీ “అందరం బాగానే వున్నాం కదా! ఇక్కడ అత్తలూ లేరు, మొగుళ్ళూ లేరు; వంటలూ లేవు, వేధింపులూ లేవు” అని అమాయకంగానో, గడసరి తనంతోనో వారిని ప్రశ్నిస్తుంది. ఇలాంటి ఘట్టాలు చదువుతున్నప్పుడు జైలు రచనల్లోనూ ఇంత హాస్యం పండించవచ్చునా అన్పిస్తుంది. కానీ ఇదొక కఠోర వాస్తవం. 

జైల్లోనూ ఆడవాళ్ళకి పండుగలు, సంసారాలు, కోరికలు, ప్రేమలు, మేకప్లు, మాతృత్వాలు, సహకారాలు అన్నీ ఉంటాయి. అలానే అసూయలు, ద్వేషాలు, పోటీలు, కొట్లాటలు,దొంగతనాలు కూడా ఉంటాయి. జైల్లో వేసినంత మాత్రాన వాళ్ళ జీవితాలేమీ మారవు. వీళ్లంతా నిఖార్సైన మనుషులు, మట్టి మనుషులు. వాళ్లు ఎప్పుడూ మనుషుల్లానే వుంటారు. ఇలా చూస్తే జైలే వీళ్ళ ముందు ఒక ఘోరంగా ఓడిపోతుంది.

అన్నట్టు వీరంతా జైలు నుంచి బయటికొచ్చాక ఏమవుతారు? ఏమీ కారు.లోకాన్ని ఎదురీదడంలో అంతో ఇంతో మరింత రాటు తేలుతారన్పిస్తుంది. ఇంతకన్నా ఈ జైళ్లు నీళ్ళని “సంస్కరించించేదీ” లేదు. సాధించిందీ లేదు. బయట బడాబడా నేరగాళ్లు లక్షల మంది వుంటే వీళ్ళే జైలుకెందుకు రావాలి అనేది అసలు ప్రశ్న. కనీసం మరుగుదొడ్లయినా ఉండని, బాత్రూములు కూడా దొరకని, చివరకు బట్టలారేసుకొనూ దోవలేని దౌర్భాగ్యం దేనికనేది ప్రశ్న. సుధా గారే “నేను భారతీయ మరుగుదొడ్డిలో ఒక మూల కూచొని స్నానం చేసేదాన్ని” అన్నప్పుడు రాజ్యంలోని అమానుషత్వమంతా జైళ్లలో పేరుకుపోయిందా అనిపిస్తుంది. అసహ్యం వేస్తుంది.

విచిత్రం ఏమంటే బ్రిటన్ కాలపు జైళ్లే మేలు. ఇదే యరవాడ జైల్లో గాంధీ గారి లాంటివారూ వున్నారు. ఆ రోజుల్లో వారికి కావలసిన అన్ని పుస్తకాలు అందుబాటులో ఉండేవి. ఎన్ని రచనలనైనా వారు చేసేవారు. సమావేశాలు జరిపేవారు పూనా ఒప్పందం సైతం ఇక్కడే జరిగింది. దీర్ఘకాలిక నిరాహార దీక్షల్లాంటి రాజకీయ పోరాటాలు కూడా వాళ్ళు చెయ్యగలిగే వారు. మరి స్వతంత్ర భారత జైళ్ళు ఎందుకిలా బిగుసుకుపోయాయి? మన ప్రజాస్వామ్యం ఎందుకింత కురచబారి పోయింది? సుధా భరద్వాజ్ గారు ఈ ప్రశ్నలన్నీ లేవనెత్తుతారు. అసలు జైళ్ళులేని పాలను అంటూ వుండదా? ఉండే రోజులు రావా అని ఆమె ప్రశ్నిస్తారు.

అలాగే మన నేరనిర్ధారణలూ, శిక్షాస్మృతులు కూడా. ఆత్మ రక్షణలో భాగంగా చెయ్యాల్సి వచ్చే చర్యల్ని బ్రిటన్ లాంటి దేశాలు హత్యానేరాలుగా లెక్కించవు. మరి ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లంటూ బడాయికి పోతున్న మన దేశంలో ఈ మాత్రం విచక్షణా లేదెందకని? అదే వుండి వుంటే ఈ ఖైదీల్లో సగం మంది జైలు ముఖం చూడాల్సి వచ్చేదే గాదు. సుధా గారు సూటిగా ఈ ప్రశ్నను లేవనెత్తుతారు.

ఇక “ఉరివార్డు నుండి” కథనం కూడా అద్భుతమైంది. సుధా భరద్వాజ్ గారు చెయి తిరిగిన రచయిత్రిగా ఏ అరుంధతీ రాయ్ లాగానో సాహిత్య ప్రపంచంలో దఖలు పడకపోవచ్చు గానీ ఒక్కోఖైదీని (ఈ మాట మాటి మాటికీ అనడం సిగ్గుగా ఉంది) సాదాసీదాగా ఆమె ముక్కు గురించీ, ముంగురుల గురించీ, పూసుకున్న లిఫ్టిక్ గురించీ, వేసుకొన్న జడ గురించీ చెబుత చెబుతూనే పాఠకుల్ని ఎంత దూరం తీసుకెళ్లాలో అంత దూరం తీసుకెళ్తారు. సామాజిక రాజ 3 అపసవ్యతలనన్నిటినీ మన ముందు రాసి పోస్తారు. పేర్లుచెప్పడం వీలు గాక రూపురేఖలతోనొ, వేషభాషలతోనో ప్రారంభించి ప్రతి ఖైదీ విషాదృశ్యాన్ని మన కళ్ళ ముందు నిలబెడతారు. ఇదో కొత్త ప్రక్రియ అనిపిస్తోంది.

చివరగా ఇలాంటి పుస్తకాలను తేవడం ఇప్పుడేమీ ఆషామాషీ వ్యవహారం కాదు. మనందరం ఒకరికొకరం తోడుగా నిలబడితేనే ఈ వరవడిని కొనసాగించగలం. ఇప్పుడు మనకు పాఠకుల రచయితల సంఘటన కూడా, ఏదో ఒకటి, ఏదో ఒక మేరకైనా వుండాలి. ఇలాంటి పుస్తకాలు సహకార రంగంలో వచ్చిన సమిష్టి ప్రచురణలుగా మారాలి. పుస్తకం వెలువడ్డాక కూడా కనీసం ఐదారు వందల పుస్తకాలయినా మనలాంటి వాళ్ళందరి చేతుల్లోకి రాగలగాలి. వాటిపైన చిన్నచిన్న గ్రూపుల్లోనయినా విస్తృతంగా చర్చజరగాలి.

తెలుగు వాళ్ళకు గొప్ప ప్రజాస్వామిక సాంస్కృతిక వారసత్వం వుంది. దీన్నిప్పుడు మనం పనిగట్టుకొని మరీ నిలబెట్టుకోవాలి. ఈ రోజు మతఛాందస శక్తుల నుంచి వెయ్యి సవాళ్లు మన ముందుండొచ్చు. ఎన్ని వున్నా మనం సమిష్టిగా వుంటే దీటుగా ప్రతి సవాలును విసరగలం. ప్రజాస్వామిక ఉద్యమాలకిది కొండంత స్ఫూర్తినిస్తుంది. వెన్నుదన్నుగా నిలుస్తుంది.

“ఉరి వార్డు నుంచి” మనల్ని ఈ వైపుకు కొంచెమైనా మళ్ళించగల్గితే దీనికి మరింత సార్థకత చేకూరుతుంది.

Leave a Reply