అడవి సిగన నెలవంక అతడు…

ఎప్పటిలాగే మంచు బిందువులు
అడవి తడిసిన జ్ఞాపకాల్ని మోస్తున్నాయి
అతనిపై అల్లుకున్న
ఎర్రెర్రని పచ్చపచ్చని బంతిపూలు
కొండగోగులతో గుసగుసలాడుతున్నాయి
రాత్రి కురిసిన వానకు
తళతళలాడుతున్న ఆకుల నడుమ
పూర్ణ చంద్రబింబాల్లా
విచ్చుకున్న ఎర్రనిమోదుగపూలు
అవును
అతను నిదురిస్తున్నాడు

ఎప్పటిలాగే గిజిగాళ్ళు
ఆదివాసీ నుడికారంలో
అడవితో మాట్లాడుతున్నాయి
అడవి వాకిళ్ళన్నీ
పూలగుఛ్ఛంలా ఒక చోట చేరినట్టు
గూడాలకు గూడాలు కదిలొచ్చాయి
అక్కడ పుట్టి పెరగని ధీరుడొకడు
నాలుగు దశాబ్దాల ముందు యీ అడవికొచ్చి
లోకానికి పచ్చదనాన్ని పంచే పనిలో తలమునకలై ఇంతకాలానికి సేదతీరుతున్నాడు
అవును
అతను నిదురిస్తున్నాడు.

ఎవరతను?
గుప్పెడు మట్టి లాంటి వాడు
పిడికెడు గింజల్లాంటివాడు
రైతు నుదుటన మొలకెత్తిన పైరులాంటివాడు
కూలీ చేతి కొడవలి వంటివాడు
సముద్రకెరటాలకి సామూహిక కదనం నేర్పినవాడు
మానవతా సుగంధాల్ని పూవు పూవుకు పంచిన సీతాకోకచిలుక వంటివాడు
అడవితల్లి నులివెచ్చని మమతలవొడిలో
నా కామ్రేడ్ నిదురిస్తున్నాడు
ఆర్.కె. నిదురిస్తున్నాడు…

కంట్లోచెమ్మ కొలకులు దాటనీకు
గుండెనిబ్బరం సడలనీకు
నడకలో వేగం తగ్గనీకు
అతను వెలిగించిన కాగడా అందుకో
అతను పాడిన వెలుతురు పాటల నెగరేద్దాం!

కడప జిల్లా ప్రొద్దుటూరు వాసి. 1998 నుంచి కవిత్వం, కథలు రాస్తున్నారు. ఇప్పటి వరకూ 100 కు పైగా కవితలూ 12 కథలూ, అడపా దడపా వ్యాసాలు రాశారు.

ప్యాపిలి గ్రామం, కర్నూలు జిల్లా. 'కర్నూలు మూర్తి'గా కథా ప్రపంచానికి పరిచితుడు. కర్నూలులో కథ పునర్వికాసానికి కృషి చేసినవారిలో ఒకడు. శ్రీనివాసమూర్తి బృందం పాతికేళ్ల కిందట తీసుకొచ్చిన 'పల్లె మంగలి కతలు, ఫ్యాక్షన్ కతలు' పుస్తకాలు కర్నూలు వైపు కథా పాఠకుల చూపును మళ్లించాయి. శ్రీనివాసమూర్తి రాసిన ‘అడివోడు”, ‘మెడమీద వేలాడే కత్తి’, కథ -95, కథ -96 సంకలనాల్లో ప్రచురితమయ్యాయి. ఇటీవల కశ్మీర్ నేపథ్యంగా రాసిన “ఖబర్ కె సాత్’ కథ కథాసాహిత్యంలో చాలా ప్రాచుర్యం పొందింది. ఇప్పటిదాకా సుమారు పదహైదు కథలు రాసిన శ్రీనివాసమూర్తి పుట్టింది కర్నూలు జిల్లా ప్యాపలి గ్రామంలో. ప్యాపలి, ద్రోణాచలం, గద్వాల, కర్నూలు, తిరుపతిల్లో పి.హెచ్.డి వరకు చదువుకున్నారు. ప్రస్తుతం రసాయనశాస్త్ర అధ్యాపకులుగా మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో పనిచేస్తున్నారు.

Leave a Reply