విరసం చేతిలో మహత్తర శక్తి శ్రీశ్రీ

8-7-83 తేదీగల మీ పత్రికలో మా పెదబాబాయి, చినబాబాయి అంటూ శ్రీ ఆరుద్ర రాసిన వ్యాసం మహాకవి శ్రీశ్రీ గారిని కించపరచేదిగానూ, అది వారి యెడల నిందాస్తుతిగా వున్నట్టుగానూ నాకు బోధపడుతోంది. చినబాబాయిగారి పేరు శ్రీ ఆరుద్ర మరచిపోతే పోయేరు. కాని, కార్మికులైన చినబాబాయి గొప్పవారేననీ మంచివారేననీ ఒప్పుకుంటాను. కాని, మహాకవిగా ఎదిగి కార్మిక కర్షకలోక కల్యాణానికి తన కవితా శక్తినంతా ధారపోసిన శ్రీశ్రీగారు. కార్మికులు కాకపోయినప్పటికీ చినబాబాయికంటె తక్కువవారూ చెడ్డవారూ అంటేమాత్రం ఆ మాటని శ్రీ ఆరుద్ర వంటి వారు తప్ప మరెవ్వరూ ఒప్పుకోరు.
మీ అదే పత్రికలో 32వ పేజీలో ”శ్రీశ్రీ శవాన్ని వైజాగ్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ కు యివ్వాలని తన వీలునామాలో వ్రాశాడ”ని చలసాని ప్రసాద్ (శ్రీశ్రీగారి) ” అంత్యక్రియలకి ముందు సహజంగా చిన్న అభ్యంతరం తెలిపారు” అని రాసేరు.

తన మృతదేహాన్ని పైన చెప్పిన ఆసుపత్రికి ఇవ్వాలని శ్రీ శ్రీ గారు లోగడ చాలామందితో చెప్పేరు. అందుచేత, శ్రీ చలసాని ప్రసాద్ “సహజంగా” ఆ సంగతి చెప్పడంలో తప్పేమీలేదు. కానీ మీ పత్రికలో రాసిన వారెవరోకాని, శ్రీ ప్రసాద్ అలా చెప్పడంలో ఆయన సహజంగా తప్పుచేసేరన్నట్టుగా ధ్వనింపచేయడం చాలా తప్పు. అంతేకాదు. శ్రీశ్రీగారి “మిత్ర, హిత, ఆత్మీయ, అభిమానుల్లో” శ్రీ ప్రసాద్ ఒకరు కాదన్నట్టుగా తోపింపజేయడం క్షమించరాని తప్పు.
విశాఖ మెడికల్ కాలేజీకి శ్రీశ్రీ గారి భౌతిక కాయాన్ని ఇచ్చివుండినట్లయితే ఆ కాలేజీవారు పరిశీలించి పాఠాలు నేర్చుకొందికి శ్రీశ్రీ గారి మెదడునైనా నిల్వచేసి వుంచేవారు.
పోనీయండి. ఆయన జన్మస్థలంలో దహనపర్చడానికి ఆయన నుృతదేహాన్ని విశాఖకి తెచ్చి ఉండినట్లయితే, లక్షలాది ఆంధ్రులు, దారంటా ఆయన్ని ఆఖరిసారి దర్శించుకొని ధన్యులు అయి ఉండేవారు. తరవాత – ఆ సంచికలో 37వ పేజీలో “శ్రీశ్రీ విరసం జేబులో కలమా?” అనే శీర్షికకింద రాసిన అంశాలు విరసం వారి యెడల విపరీతమైన ద్వేషంతో రాసినట్టుగా నాకు తోస్తున్నాయి. ఆ అంశాలు ఎవరు రాసినదీ పాఠకులకి తెలియచెప్పడం మీరు మర్చిపోయినట్టున్నారు. కాని, మహాకవి శ్రీశ్రీని మహాకవిగా మార్చినది మేమేనని ఏ విరసం సభ్యులు ఎప్పుడు చెప్పేరో ఆ రచయిత చెప్తే బాగుండేది. విరసం సభ్యుల్లో ఎవ్వరూ, ఎప్పుడూ అలా చెప్పి ఉండలేదు.

అదే వ్యాస సందర్భంలో మరొక విషయం :
మహాకవి శ్రీశ్రీ గారి మరణం గురించి యావదాంధ్రదేశం విచారించి కంటతడిపెట్టింది. కాని, ఆ మరణం శ్రీశ్రీగారి “మిత్రులు, హితులు, ఆత్మీయులు, అభిమానులు” – వారందరికీ కలిగే విచారపుటావేదనా కన్నీటిధారా కూడా మిగతావారికి కలిగినకంటె ఎక్కువ స్థాయిలో ఉంటాయి కదా! ఉంటాయి. ఎంచేతనంటే! మిగతా వారికంటె వారికి ఆయన దగ్గిర మనిషి, స్వంత మనిషి కాబట్టి. అటువంటి అప్పుడు – విరసం జన్మకి కారణభూతుడయి, గత దశాబ్దానికి పైనించి చివరి క్షణం వరకూ విరసం ఆశయాలతో ఏకీభవిస్తూ నిల్చిపోయిన శ్రీశ్రీగారిని విరసం సభ్యులు తమ స్వంత మనిషిగా భావించుకుంటే అందులో తప్పు ఉన్నదా? ఉన్నదని నేను అనుకోను.
పూర్వం ఒక దుష్టరాక్షసుణ్ణి సంహరించడానికి ఒకానొక దేముడు ఇంకొక దేముడి చేతికి బాణం అయేట్ట. అలాగ – శ్రీశ్రీ విరసం జేబులో కలం మాత్రమే కాదు. అన్యాయాలని ఎదిరించి హతమార్చడానికి, ఇచ్ఛాపూర్వకంగా విరసం చేతికి వెళ్ళి అమిరిన మహత్తరశక్తి మహాకవి శ్రీశ్రీ.

(ముద్రణ : ఆంధ్రజ్యోతి, వారపత్రిక, 29 జులై, 1983)

కథా రచయిత. విరసం వ్యవస్థాపక సభ్యుడు. వృత్తి రీత్యా న్యాయవాది. 1922, జూలై 30న శ్రీకాకుళంలో జన్మించాడు. సొంతూరు అనకాపల్లి దగ్గర తుమ్మపాల గ్రామం. అసలు పేరు రాచకొండ విశ్వనాథ శాశాస్త్రి.  ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి తత్వ శాస్త్రంలో బీ.ఏ (ఆనర్స్), మద్రాసు యూనివర్సిటీ నుండి 1946లో లా పట్టభద్రుడయ్యాడు. తన పితామహుడైన శ్రీరామమూర్తి వద్ద న్యాయ వృత్తి మెళుకువలు నేర్చుకొని 1950లో సొంత ప్రాక్టీసు పెట్టుకున్నాడు. మొదట్లో కాంగ్రెస్ వాది. 1960లలో మార్క్సిస్ట్ సిద్ధాంతాలచే ప్రభావితుడయ్యాడు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల మాండలికంలో, అట్టడుగు వర్గాల భాషలో పదునైన రచనలు చేశాడు.
రచనలు: మార్చు; కథాసాగరం (1955); ఆరుసారా కథలు (1961); రాచకొండ కథలు (1966); ఆరుసారో కథలు (1967); రాజు మహిషి (1968); కలకంఠి (1969); బానిస కథలు (1972); ఋక్కులు (1973); ఆరు చిత్రాలు (1974); రత్తాలు-రాంబాబు (1975); సొమ్ములు పోనాయండి; గోవులోస్తున్నాయి జాగ్రత్త; బంగారం; ఇల్లు; నాటకం / నాటికలు : నిజం (నాటకం); తిరస్కృతి (నాటిక); విషాదం (నాటిక). 1966లో తీసుకున్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి ఇచ్చివేసాడు. 1983లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు గౌరవ కళాప్రపూర్ణను ప్రకటిస్తే దానిని తిరస్కరించాడు. ఆయన కథకుడే కాదు, నటుడు కూడా . ఆయన రాసిన నిజం నాటకంలోను, గురజాడ కన్యాశుల్కం నాటకంలోను నటించాడు. నిజం నాటకం ఆ రోజుల్లోనే( 1962లో) వంద ప్రదర్శనలు ఇవ్వడం విశేషం. 10 నవంబర్, 1993న మరణించాడు.

 

Leave a Reply