అత్తరు మునక

“అన్నట్లు మరిచిపోయాను. ఇదిగో సాహిల్ నీకు ఈ అత్తరు ఇమ్మన్నాడు అత్తా. నీ గురించి చాలా చెప్పాడు. నిన్నెంత గుర్తుకు చేసాడో తెలుసా? “మీ పుప్పూ {అత్త} షాయరీ రాస్తుంది కదా? పేరు తెలీదు అందుకే ఫోన్‌లో షాయరీ మేడమ్ అని ఫీడ్ చేస్కున్నా” అన్నాడు. “కొంచెం సిగ్గు పడుతూ నీ పేరు అడిగాడు సుజన అని చెప్పాను వెంటనే షాయర్ సుజన అని ఫీడ్ చేస్కున్నాడు. మా అత్త టీచర్ కూడా అని చెప్పాను. మేనకోడలు రుద్ర గలగలా మాట్లాడుతూనే ఉంది. మళ్లీ తానే నా గుప్పెట్లో ఉన్న షాహిల్ అత్తరు సీసా లాక్కుని తెరిచి అరచేతి పైభాగంలో రాస్కొని ముక్కు దగ్గరికి తీస్కుని గాఢంగా శ్వాస తీస్కుంటూ కళ్లు అరమోడుస్తూ “వాహ్ అత్తా క్యా కుష్బూ” అంటూ పరవశించి పోయింది. వెంటనే తన చేతిని నా ముక్కు దగ్గరగా పెట్టి “చూడత్తా ఎంత గొప్ప పరిమళమో” అంది. ఊపిరితిత్తుల నుంచి రక్తంలోకి అత్తరు పరిమళం దేహమంతా కాదు ఆత్మలో.. మెదడులో ఇంకిపోయింది. ఒక గొప్ప బావన.. దేహం మనసూ శుభ్రమైన భావన.అత్తరు పరిమళం పలుచగా పూల నుంచి వెదజల్లబడ్డట్లు నాలో నిలువెల్లా రఫీ పాటలా,గులాం ఆలీ గజల్ ల్లా ఆవహించింది. మల్లెలా.. పారిజాతాలా.. గులాబీలా .. చందనమా.. ఏమో అన్నీ కలగలసిన అమృత సౌగంధమా ఇది..?ఏమో, నాకేదో అత్తరు మునక లో ఉన్నట్లు అనిపించింది.

***

దీని పేరేంటి.. అడిగాను. ఏదో పరవశం నుంచి తేరుకుంటున్నట్లు..”అత్తర్ -అల్ -కాబా”అంట అత్తా నీకు పేరు కూడా చెప్పమన్నాడు సాహిల్” అంది రుద్ర. ఓహ్హ్ గుర్తుకు వచ్చింది. ఈ పేరు సాహిల్ నోటనే విన్నాను. చాలా రోజులైంది. సాహిల్ జనరల్ బజారు టైలర్ ! నా బిడ్డ పెళ్లికోసం గతేడాది నా మరదలు లక్ష్మీ,వాళ్లమ్మ జ్యోతి తో వెళ్ళి కలిసాను. అక్కడ సందులన్నీ దాటుకుని ఇరుకైన ఇనుప మెట్లను ఎక్కితే సాహిల్ బట్టల దుకాణం. ముందు గది అంతా సాహిల్‌దే. బ్లౌసులు కత్తిరించుకోవడానికి టేబుల్ పక్కనే కుర్చీ దాని చుట్టూ గోడలకానుకుని రకరకాల బట్టలు, బ్లౌజులు, పంజాబీ సూట్లు,లంగా ఓణీలు వేలాడుతున్నాయి. రంగు రంగుల చమ్కీలతో మెరుస్తున్నాయి బట్టలన్నీ. అన్నింటికంటే నన్నాకర్షించింది గోడల మీద మక్కా మస్జీదు బొమ్మలు,అందమైన తెల్లని ఉర్దూ అక్షరాలతో,నల్లని నిలువెత్తు కాబా బొమ్మలతో వేలాడే ఆకు పచ్చని వాల్ క్లాత్‌లు. దాని కంటే ఎక్కువగా గోడకి ఆనించి ఉన్న వెడల్పాటి గాజు ముక్క మీద ఉన్న అర చేతుల్లో ఇమిడేంత పెద్ద దబ్బ పండంత అత్తరు సీసాలు! ఎంత అందంగానో ఉన్నాయి. అందులో అత్తరు ఉందో లేదో తెలీదు.అలాంటివి మూడు ఉన్నాయి అక్కడ. రకరకాల అత్తర్లు సేకరించే అలవాటున్న నాకు ఆసక్తి కలిగింది. లోపలి గదిలో బట్టలు కుడుతున్నట్లు మెషిన్ల సంగీతం మధ్య మధ్యలో మనుషుల మాటలు, నవ్వులు, చిన్నగా కేకలూ వినిపిస్తున్నాయి.

***

ఉన్నట్లుండి సాహిల్ వచ్చాడు లోపల్నించి అతనితోపాటు గుప్పుమన్న అత్తరు పరిమళం కూడా ఆ గదిలో పరివ్యాప్తమైంది. మనసుకి హాయిగా అనిపించింది ఆ క్షణాల్లో. తెల్లని జుబ్బాలో పల్చటి గడ్డంతో తెల్లటి మేని ఛాయలో ఆకర్షణీయంగా ఉన్నాడు సాహిల్. “ఏం సాహిల్ బాగున్నావా? అని సాహిల్ ని పలకరించి మా మరదలు లక్ష్మీ ఆయనకి బట్టలు ఇచ్చి ఎలా కుట్టాలో చెబుతూ బ్లౌజు డిజైన్లు ఎన్నుకోవడంలో పడిపోయింది. నేను మెల్లగా సాహిల్ వెనకున్న గోడమీది అత్తరు సీసాను చూపిస్తూ “”ఏమి అత్తరుంది దాన్లో.. అక్కడెందుకు పెట్టారు” అని అడిగాను. సాహిల్ పక్కకు తిరిగి వెనకున్న గోడమీది అందమైన అత్తరు సీసాలు చూసాడు.వెంటనే అతని కళ్లల్లో ఏదో మెరుపు.. పెదాలపై సన్నని చిరునవ్వు మెరిసింది. “అది “అత్తర్ అల్ కాబా” మేడమ్ కాబా నుంచి తెచ్చింది చాలా స్పెషల్” అన్నాడు కొద్దిపాటి గర్వంగా.. “దేనితో చేస్తారు ఏం అత్తరు అది.. మల్లెలా, సంపెంగలా”అనడిగా ఆసక్తిగా.. “లేదు మేడమ్ అగర్ వుడ్, ఏంబర్, సాండల్ ‌వుడ్, ముస్క్ మాస్, నిమ్మ, సంత్రా, సాఫ్రన్ ఇలాంటి వాటితో చేస్తారు. చాలా మెహంగా మేడమ్ కాబాలో ఎక్కువగా వాడతారు మేడమ్ జీ” అన్నాడు.

“ఇది మెన్స్ ఫర్ ఫ్యూమా సాహిల్” అని అడిగా “లేదు మేడమ్..ఔరత్‌‌ లోగ్ కూడా వాడొచ్చు సబ్ కా హై మేడమ్” అన్నాడు సాహిల్.. “దేఖో మేడమ్ ఇస్కీ ఖుష్బూ” అంటూవెనక్కి తిరిగి ఒక అత్తరు సీసా అందుకుని దాని మూత తెరిచి, ముందు తను తన ముంచేతికి అత్తరు రాస్కుని, తర్వాత నా ముంచేతికి రాసాడు..ఓహ్హ్ అద్భుతమైన పరిమళం నేరుగా హృదయాన్ని తాకింది. అత్తరు ఇచ్చిన పరిమళ హాయి మనసంతా నిండి సంతోషాన్ని నింపింది. సాహిల్ మొహం కూడా అదే సంతోష రేఖలతో విచ్చుకుని ఉంది. నా మొఖం లో అత్తరు నింపిన ఆనందం అతనిలో గర్వాన్ని కలిగించినట్లున్నది.మళ్ళీతనే“హమ్ ముసల్మాన్ లోగ్ ఇత్ర్ {అత్తరు} జరూర్ లగాతే మేడమ్.. అది మిమ్మల్ని నిత్యం శుభ్రపరుస్తుంది మేడమ్. అంటే మనసుని,దేహాన్ని పవిత్రంగా ఉంచుతుంది మా దగ్గరికి వచ్చిన వాళ్లకి కూడా మా నుంచి వచ్చే పరిమళం సుకూన్ ఇస్తుంది ఆల్కహాల్ లేని అత్తరే నమాజుకు ముందు వాడతాం మేడమ్ . ఒక రకంగా మా ఇస్లామ్ లో ఉంది మేడమ్. అత్తరు పెట్టుకోవడం మమ్మల్ని మేము గౌరవించుకోవడం అనే విలువ ఇచ్చుకోవడం లాంటిది,ఇతరులకు ఇవ్వడం కూడా అంతే మేడమ్. కుల మతాలతో సంబంధం లేకుండా అందరికీ మేము అత్తరు కానుకగా ఇస్తాము ”. ఒక మైకం లో అన్నట్లు చెప్పుకు పోతున్నాడు సాహిల్.

మరదలు లక్ష్మీ ముసి ముసి నవ్వులు నవ్వుతోంది.ఆమెకు నా ఆశక్తులు తెలుసు. సాహిల్ పని చేస్తూనే మెల్లిగా తన ఉమ్మడి కుటుంబం గురించీ,తన అన్నలు ముగ్గురూ విడిపోవడం గురించీ,తను తన అమ్మీ,అబ్బాలను తన ఇంటికి తెచ్చేసుకోవడం గురించి, తన భార్య తన అమ్మీఅబ్బాలను తన స్వంత తల్లిదండ్రులకంటే కూడా ప్రేమగా ఎలా చూసుకుంటుందో చెబుతూ పోతున్నాడు. “ఆప్‌కో మాలూమ్‌ హై క్యా మేడమ్ మేరే అబ్బాజీ భీ షాయర్ హై “ అంటూ ఆయన రాసిన ఒక షేర్ వినిపించాడు.
‘కుచ్ లోగ్ ఇత్ర్ కే తరహ్ హోతె హై!
అగర్ ఉన్సే మిల్ లో తో ..
ఎహశాసోం కో మెహకా దేతే హై !

షేర్ చదివాక అతి కష్టం మీద దాని అర్థం వివరించాడు.“కొద్ది మంది ఇత్ర్ అంటే అత్తరు లాంటి వాళ్ళట. వాళ్ళను కలిస్తే..వాళ్ల చుట్టూ అనుభూతుల్ని కూడా పరిమలింప చేస్తారట” తండ్రి రాసిన షేర్ ని మురిపెంగా గుర్తుచేసుకుంటూ వినిపిస్తున్న సాహిల్, నిజంగానే పరిమళాల్ని వెదజల్లే ఒక నిలువెత్తు మానవ అత్తరు సీసాలా కనిపించాడు. “మేడమ్ ఔర్ ఏక్ ఛోటా షేర్ యాద్ ఆయా ..అబ్బా జాన్ హమేషా గున్ గునాయా కర్తె థె సునియే”{మేడమ్ మరో చిన్న షేర్ మా అబ్బా జాన్ ఎప్పుడూ తనలో తాను పాడుతూ ఉండేవారు. వినండి} సాహిల్ ఉత్సాహంగా. నా సమాధానం కోసం చూడకుండా “హమ్ హై భారత్ దేశ్ కే వాసీ., భారత్ అప్నా జహాన్ హై” అంటూ ఆగిపోయి నా వైపు చూసి సిగ్గు పడ్డాడు.

“చాలా బాగుంది షేర్..మీ నాన్న రాసిన షేర్స్ పుస్తకంగా వచ్చాయా” అడిగాను నేను. “లేదు మేడమ్ ఇప్పటి దాకా అయితే రాలేదు” అన్నాడు కొద్ది నిరాశగా మళ్ళీ తానే “అవును మేడమ్ అబ్బాకి చాలా ఇష్టం షేర్ షాయిర్ లంటే, ఉర్దూ సాహిత్యం అంటే చాలా ఆసక్తి మా ఇంట్లో ఎప్పుడూ అబ్బా దోస్తుల తోని ముషాయిరాలు అవుతూ ఉండేవి అంటూ ఉత్సాహంగా “మీరు కూడా షాయిరీ రాస్తారా మేడమ్” అన్నాడు షాహిల్. “ ఓ సాహిల్ మా వదిన కవిత్వం రాస్తారు. అనువాదాలు కూడా చేస్తారు” లక్ష్మీ చనువుగా అంది. అంతే సాహిల్ మొఖం వెలిగిపోయింది.”ఓహ్… బహుత్ ఖూబ్ మేడంజీ అచ్ఛాలగా సున్కర్” అంటూ మీకు ఇంకో సంగతి తెలుసా మేడమ్.. చెబితే మీరు నమ్మరు మా నానాకి నానా అంటే మా నాన్న గ్రాండ్ ఫాదర్.. భారతదేశ ఆజాదీ ఉద్యమంలో పాల్గొన్నారు. జైలుకి కూడా వెళ్లారు తెలుసా? అదిగో ఆయనే” అంటూ వేలు పెట్టి గోడ మీదున్న వాళ్ల ముత్తాత పాత ఫోటో చూపించాడు గర్వంగా నేను నిర్ఘాంతపోయి చూశాను. పాత బడ్డ ఫోటో ఫ్రేమ్ లో సాహిల్ వాళ్ల ముత్తాత ఎంతో హుందాగా ఉన్నాడు. ఫోటోలో మరికొంతమంది కూడా ఉన్నారు.మరొక ఫ్రేమ్ లో విడిగాజాతీయోద్యమంలో పాల్గొన్న మౌలానా అబుల్ కలాం ఆజాద్, డాక్టర్ జాకిర్ హుస్సేన్, ఫోటోలు ఉన్నాయి. బడిలో సాంఘిక శాస్త్రం చెప్పే టీచర్గా నాకు వాళ్ళందరూ తెలుసు.“ఇదిగో మేడం..ఈ చివర్లో ఉన్నాయన మా ముత్తాత మహమ్మద్ అబ్దుర్ రహమాన్. మాది కేరళ మేడం హైదరాబాద్‌కి బతుకుదెరువు కోసం వలస వచ్చాం. ఆస్థులేమి సంపాదించుకోలేదు. కానీ గర్వంగా చెప్పుకుంటాం. మా ముత్తాత ఫ్రీడమ్ ఫైటర్ అని” అన్నాడు గర్వంగా మధ్య మధ్యలో మా మరదలు లక్ష్మీ చెప్పే డిజైన్లు చూస్తూ ఆమెతో కూడా ‘ఇది మంచిగుంటుంది ఇదే తీస్కోండి’ అంటూ చెప్తూనే “ఎవరూ నమ్మరు మేడం ఈ విషయం చెబితే ఏమన్నా అవుతుందేమో అన్నభయం కూడా’’అన్నాడు కాసింత చిన్న గొంతుతో “చాలా తక్కువ మందికే తెలుసు మేడమ్… ఆప్‌ కే లియేమై “మక్కా ఆల్ కాబా” అత్తర్ మంగాతే (మీ కోసం నేను మక్కా ఆల్ కాబా” అత్తరు తెప్పిస్తా) నాకు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి” అన్నాడు. నా నెంబర్ తీస్కున్నాడు. సాహిల్ నిజంగానే వాళ్ల నాన్నరాసిన షాయరీ లాగా పరిమళాలు వెదజల్లే అత్తరు సీసాలా కనిపించాడు. బట్టల కొలతలు డిజైన్లు తీసుకున్న సాహిల్ లోపలి గదిలో బట్టలు కుడుతున్న ఒక వ్యక్తిని “భజరంగ్ ఇధర్ ఆ” అంటూ పిలిచాడు. లోపల నుంచి భజరంగ్ పరిగెత్తుకు వచ్చాడు. సాహిల్ దుకాణం లో భజరంగ్ టైలర్ గా ఉద్యోగం చేస్తాడు నెల జీతం మీద. సాహిల్ అతనికి బట్టలు అప్ప చెప్పాడు.
***

“ఎంత మంది పనిచేస్తారు నీ దగ్గర”? ఆసక్తిగా అడిగాను.”ఆట్ లోగ్{ఎనిమిది మంది} మేడమ్” సాహిల్ గర్వంగా అన్నాడు. “పెద్దగా చదువుకోలేదు మేడమ్ పదో తరగతి వరకు చదువుకుని ఇక చదువు ఎక్కక దర్జీ పని నేర్చుకున్నా.కానీ మా అన్న దమ్ములు బాగానే చదువుకున్నారు మేడమ్. ఇద్దరు సర్కారీ నౌకహరి లో ఉన్నారు. ఒక అన్న హోటల్ నడిపిస్తాడు ఓల్డ్ సిటీలో” అన్నాడు.సాహిల్ కి పెళ్లి బట్టల పని అప్ప చెప్పి ఇంటికి బయలుదేరాము నేను లక్ష్మీ.

***

బాగా రద్దీగా..ఒకింత ఇరుకుగా ముస్లిం హీందూ జనాభా అటూ ఇటూగా ఒక పక్క మహాంకాళి గుడి, మరోపక్క మస్జీద్ -ఎ -జనరల్ బజార్ జమిలిగా ఉన్న ఆ వీధుల్లో ఒక రహస్యం, దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న సాహిల్ ముత్తాతకి సంబంధించిన రహస్యం, దాని చుట్టూ “అత్తర్ – ఆల్ – కాబా” అత్తరు పరిమళం చుట్టి ఉందని ఎవరికితెలుసూ? ఆ జనరల్ బజార్ లో తలకి కాషాయ రంగు మెరుపుల వస్త్రం, ముఖం నిండా తెలుపు నారింజ రంగుల్లో పంగానామాలు, చేతుల్లో పట్టుకున్న కంచంలో రామ్ పరివార్ బొమ్మలు.. పూలు, కుంకుమ, కొబ్బరి కాయ, రామనామ పేర్లున్న కాషాయ అంగవస్త్రం పంచె, చిడతలు.’’జై శ్రీరామ్” అంటూ అరుస్తూ అడుక్కుంటున్న ఒక మనిషిని తప్పించుకుంటూ నడవసాగాము నేనూ మా లక్ష్మీ. “మేడమ్ తిరంగా జెండా లీజీయే దస్ రూపయ్యా కో ఏక్” అనే పిలుపుతో ఉలిక్కి పడ్డాను. నెత్తిన టోపీ పెట్టుకున్న పిల్లాడు ఆగస్ట్ 15 కోసం చిన్నజాతీయ జెండాలు అమ్ముతున్నాడు.“చోటా వాలా దస్ రూపయ్యా.. బడా వాలా బీస్ రూపయ్యా లోనా… మేడమ్”అంటున్నాడు. నెత్తిన ఎండ మాడుస్తుంది ముఖమంతా చెమటలు కారుతుంటే ఆశగా అడుగుతున్నాడు. మాట్లాడకుండా వంద రూపాయల జెండాలు కొన్నాను. “ఎందుకు వదినా వొత్తి దొంగ మొఖాలు ఈ ముస్లింలు” అంటున్న లక్ష్మీ వాళ్లమ్మ జ్యోతి మాటలు వినలేదు నేను. “స్కూల్లో పిల్లలకి ఇవ్వచ్చని కొంటున్నా అత్తమ్మా” అంటూ “బేటా నామ్ క్యాహై తుమ్హారా” అని అడిగాను.”ఆజాద్ మేడమ్” అన్నాడు. తెల్లని పళ్లన్నీ కనిపించేలా నవ్వుతూ… ఎందుకో సిగ్గనిపించిది నాకు. “బడిలో పాటాలు చెప్పండి సర్.. కోటి రామ నామాలు రాయిస్తే ఎవరూ పాస్ కారు సర్” అంటూ సుందరరావు మాష్టారు ని వేడుకునే పదో తరగతి ఆఫ్తాబ్ కళ్లముందు కదిలాడు. గబగబా రోడ్డు దాటి మా డ్రైవరు అహ్మద్ స్టార్ట్ చేసిన కార్ ఎక్కాను.కార్ ఎక్కేముందు “జై శ్రీ రామ్” అంటూ అతని కంచంలో పది రూపాయ లేసిన లక్ష్మీ వాళ్లమ్మ జ్యోతిని చూస్తే నవ్వొచ్చింది నాకు.లక్ష్మి ఈ మధ్యనే అప్పు చేసి మరీ వాళ్ళమ్మని అయోధ్య పంపించింది. పంపక పోతే నీ ఇంటికి రాను ఊర్లో అందరూ పోతున్నారు అంటూ జిద్దు చేసింది వాళ్లమ్మ.

***

అలా సాహిల్ అత్తరు సీసా,అత్తరు పరిమళం, సాహిల్ వాడిన అత్తరు పర్యాయ పదం “ఇత్ర్” ,గోడమీద వేలాడుతున్న సాహిల్ ముత్తాత గంభీరమైన మొఖం..రోడ్డు మీద జెండాలమ్ముతున్న పదేళ్ల “ఆజాద్” తెల్లని ఎండ దెబ్బ కొట్టిన నీరసపు నవ్వు, రాముని బొమ్మ చూపిస్తూ దబాయింపుగా అడుక్కుంటున్నకాషాయధారి రూపం చాలా కాలం వెంటాడాయి. కానీ మళ్లీ జనరల్ బజార్‌‌కి వెళ్లే అవకాశం రాలేదు. బట్టలు తెచ్చుకోవడం అంతా మా మరదలు లక్ష్మీనే చూస్కుంది.

పెద్ద అమ్మాయి పెళ్లి జరిగిపోవడం బంధువులు రాకపోకలు రెండేళ్ల తర్వాత అమ్మాయి అల్లుడు అమెరికా వెళ్లిపోవడం, నా ఉద్యోగం, మధ్యలో వేసవి శెలవలకి అదనంగా రెండు నెలలు సెలవు పెట్టి నేను కూడా అమెరికా వెళ్లాల్సి రావడం వీటితో నాకు మళ్లీ జనరల్ బజార్ వెళ్ళే పని పడలేదు. కానీ సాహిల్ అత్తరు బుడ్జీ అందం, ఆ పరిమళం..దేశభక్తుడైన సాహిల్ ముత్తాత జైలు జీవితం, ఆకలి, పేదరికంతో వీధుల్లో జెండాలమ్ముకుంటున్న “ఆజాద్” గుర్తుకొస్తూనే ఉన్నారు. కానీ నా దగ్గర సాహిల్ నంబర్ లేదు.

***

రెండేళ్ల కాలం గిర్రున తిరిగిపోయింది. ఈ మధ్య కాలంలో కుంభామేళాకి, ప్రయాగ్ రాజ్ వెళ్లడానికి మా అ త్తయ్య మామయ్యలతో పాటు,మా ఆయన పిన్ని బాబాయ్ వచ్చారు. కుంభమేళా నుంచి వచ్చినప్పటి నుంచి అత్తయ్యా మామయ్యలకి,పిన్నికి చర్మం అంతా దద్దుర్లు బాబాయ్‌కి పదిరోజుల పాటు వదలని విరోచనాలు.మానవ మలమూత్రాలు కుళ్లిన శవాలతో పరమ మురికిగా ఉన్నాయట త్రివేణి సంగమ నీళ్ళు. నేనూ మా ఆయన వద్దని ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు వాళ్ళు. గంగా,యమునా,సరస్వతి ఈ మూడు నదుల సంగమంలో పవిత్రమైన మునక వేయక పోతే ఈ జీవితం పవిత్రం ఎట్లా అవుతుంది? ఎన్ని జన్మలెత్తితే రావాలీ వరం?” అనుకుంటూ వెళ్లిపోయారు. వాళ్ళతో పాటు మా పక్కింటి లక్ష్మణ రావు అంకుల్ కూడా బయలు దేరారు భార్యతో సహా. పైగా అక్కడ జరిగిన తొక్కిసలాటలో బాబాయి కింద పడి చేయి విరగ్గొట్టుకున్నారు.

“హమ్మో ఏం తొక్కిసలాట అది? ఒక క్షణంలో అయితే ఇహ మా పనైపోయింది.. పోతామనే అనుకున్నాం తెలుసా సుజనా? సమయానికి యాసిన్ నన్ను కాపాడి అంబులెన్స్‌‌లో ఎక్కించాడు. ఇక ఆ రామ శంకర్ కి హార్ట్ ఎటాక్ వచ్చి కుప్ప కూలిపోగానే యాసీన్ అట అమ్మా అచ్చం ఆ శ్రీ రామచంద్రుడిలాగే వచ్చాడమ్మా సుజనా వెంటనే సిపిఆర్ చేసి ఆంబ్యులెన్స్ లోపంపాడు. అతనే లేకపోతే ఆ రామ్ శంకర్ ఏమయ్యేవాడు? అన్నారు మామయ్య మొఖంలో గొప్ప రిలీఫ్ కనిపిస్తుంటే. అక్కడి ముస్లింలంతా గాయపడ్డ మిగతా వాళ్లని హాస్పిటల్‌కి చేర్చారుట. హాస్పటల్లో ఉన్న వారంరోజులు భోజనాలు బట్టలు అన్నీ ఆయన భార్య బిల్కిస్ బానూ, వాళ్ల పిల్లలు చూస్కున్నారట. మామయ్య చెప్పడం ఆపిదేన్నో అణుచుకుంటున్నట్లు మంచి నీళ్ళు తాగారు.

***

ఇంతలో అక్కడికి అత్తెయ్య టీలు పట్టుకునివచ్చింది. ఓపెన్ కిచెన్ కాబట్టి దాని ఎదురుగా ఉన్న హాల్లో జరుగుతున్న సంభాషణ అంతా వింటూనే ఉంది “ముస్లీమ్స్ నిజంగా ఎంత మంచి వాళ్లు‌రా సుజనా … మన హిందువులు అక్కడ వాళ్లను ఏ రకమైన వ్యాపారాలు చేయనివ్వలేదు. వాళ్ల దుకాణాలు, వ్యాపారాలు అన్నీ బంద్ చేయించారు. వాళ్లు కుంభమేళా దరిదాపులకు రాకుండా కట్టుదిట్టం చేశారు. అయినా వాళ్ళంతా ముందు పడి మా అందరినీ కాపాడుకున్నారు. వాళ్ల వ్యాపారాలు అలా బందు చేయిస్తే ఎలా బతకాలి పాపం వాళ్ళు చెప్పు? అయినా అంత పెద్ద ప్రమాదం జరిగిన వెంటనే ఎక్కడకక్కడ అందర్నీ రక్షించడానికి ఇళ్ల బయటకు వచ్చేశారు. మా వసతి కోసం వాళ్ల దర్గాలు మస్జీద్‌లు తెరిచేశారు.మాకు అన్నం,నీళ్ళుపెట్టి ఆకలి తీర్చారు. వైద్యం చేయించారు. మాకు ఏ కష్టము రాకండా మౌని అమావాస్య స్నానాలకి ఏర్పాట్లు చేశారు. సుజనా.. ఎంత మంచి వాళ్లమ్మా వాళ్లు.. మన ఊర్లో పక్కింటి జానకి రామయ్యా ఉన్నాడు. అంత రాత్రి కురిసిన భారీ వర్షానికి మన ఇంట్లో కొట్టం కూలిపోయి జాగా లేక వాడి షెడ్డులో మన ఆవు, దూడను కట్టుకుంటామంటే ససేమిరా అన్నాడు.వీళ్లు పైకి మాత్రం గోమాత,భక్తీ అంటూ మాట్లాడతారు. ఇక్కడ వాళ్లు తమ ప్రాణాలకు తెగించి మమ్మల్నందర్నీ కాపాడారు తెలుసా” అంది అత్తయ్య మామయ్య ఎడమ చేతికి టీ కప్ అందిస్తూ ఆయన కుడి చేతికి ఇంకా ప్లాస్టర్ అలాగే ఉంది. వాళ్లందరికీ మురికి నీళ్లల్లో స్నానాల వల్ల చర్మం అంతా దద్దుర్లు వచ్చేసాయి. తిరిగొచ్చాక ట్రీట్మెంట్ తీస్కోడంతోనే సరిపోయింది. ప్రయాగ రాజ్ లో తొక్కిడీ జరిగినప్పుడు నేనూ,మా శ్యామ్ ఎంత ఖంగారు పడ్డామో,ఎన్ని ఫోన్లు చేశామో మాకే తెలుసు.

***

“తాతయ్యా ఈయన ఎవరూ” అంటూ వినయ్ బాబాయి మనవడు ఒక ఫోటో తెచ్చి చూపిస్తున్నాడు. ప్రయాగ రాజ్ లో ప్రొఫెసర్ త్రిపాఠీ నుంచి కరపత్రం తీసుకుంటున్న మామయ్య ఫోటో అది.
మామయ్య మొఖంలో నవ్వు విచ్చుకుంది. “ఈయన ప్రొఫెసర్ త్రిపాఠీ రా ప్రేమనీ, శాంతిని పంచమని అక్కడ ప్రయాగ్ రాజ్ లో అందరికీ కరపత్రాలు ఒక్కడే పంచుతూ పోయాడు. ఆయన అంతే అలా దేశమంతా తిరుగుతూనే ఉంటాడు తెల్ల పావురం లా . “భారత దేశంలో మనుషులు మతాల్ని నమ్ముతారు. కానీ మతతత్వం లేని వాళ్లనీ. వీళ్లంతా దేశంలో మతంతోనో,ద్వేషంతోనో కాదు ఇక్కడి భూమితోసంబంధంతో ఉన్నారు”అంటాడు. ఎక్కడికెళ్లినా ఇదే మిషన్ మీద తిరుగుతున్నాడు ప్రొఫెసర్ త్రిపాటి” అన్నాడు మామయ్య ఆ కరపత్రాన్నినిమురుతూ. ఏడేళ్ల తన్మయ్ కి తాత చెప్పింది అర్థం కాలేదు. అయినా ఏదో అర్థం అయినట్లే నవ్వాడు వాడు.

***

మరునాడు ఉరినుంచి మా పిన్నికూతురు శిరీష వచ్చింది. “నీ మౌని అమావాస్య మునగల కథలు చెప్పత్తయ్యా” అంటూ మా అత్తయ్య వెంట పడింది. అత్తయ్య శిరీషకీ తన యాత్ర కి సంబంధించిన కథల్ని అచ్చం ఒక స్టోరీ టెల్లర్ లాగా చెప్పింది. “నిజం చెప్పొద్దూ కుంభమేళాలో ఎంత బాగా చూస్కున్నారనుకున్నావు శిరీషా మా మీద పూలు చల్లుతూ.. రామనామం ఉండే అంగవస్త్రాలలో మాకు స్వాగతం పలికారు. రామ్ నామ్ సత్య హై అంటూ మాతో పాటు వాళ్ళూ గొంతు కలిపారు. ఎంత బాగా అనిపించిందో. అంతా అనుకుంటున్నట్లు ముసల్మానులు చెడ్డవాళ్లు కాదు సుమీ. పేపర్లో టీవీలో, సినిమాల్లో చూపించినట్లు రాజకీయ పార్టీల వాళ్లు చెప్పినట్లు క్రూరులు కాదమ్మా. మమ్మల్నైతే వాళ్లు కంటికి రెప్పల్లా కాపాడుకున్నారు. చనిపోయిన భక్తుల కోసం “చన్నే షరీఫ్ దర్గా”లో అదేంటి ఆ చాదర్ కప్పి వాళ్ల ఆత్మలు శాంతించాలని దువా చేశారు. ఎంతమంది వచ్చారనుకున్నావూ శ్రద్ధాంజలి కోసం ?మాతోపాటు జై శ్రీరామ్ అంటూ నినాదాలు ఇచ్చారు.మన హిందువులు ఎంత బాధ పెట్టినా,వాళ్ల వ్యాపారాలు బందు పెట్టించినా అదేమీ పట్టించుకోకుండా “మీరు మా ప్రియమైన అతిథులు” అంటూ అన్నీ సేవలూ చేశారు.మనల్ని కోసినా “అల్లాహో అక్బర్” అంటామా చెప్పూ… డిగ్రీ దాకా చదువుకున్న అత్తయ్య అదేదో అద్భుతాన్ని చెప్పినట్లు చెబుతోంది.

***

అసలు కుంభ మేళాకి వెళ్లొచ్చిన తరువాత వీళ్లందరి ప్రవర్తనలో కొంచెం మార్పు వచ్చింది. కుంభమేళాకి వెళ్లొచ్చాక పిన్ని, బాబాయ్ , అత్తయ్య, మావయ్యల్లో పక్క గల్లీ ముస్లిమ్స్ పట్ల కొంత మెతక వైఖరి కనిపిస్తోంది. అవసరాన్ని బట్టి ముస్లిమ్ల పీర్ల పండగల్లో కలిసిపోయి మొక్కులు తీర్చుకుని పండగెళ్లినాక తురకలు అంటూ అంటరానితనాన్ని పాటిస్తూ, అయోధ్య రాముడి పూనకాలలో ఊగిపోయే వాళ్ల చెల్లెల్ని తిట్టి పోసింది అత్తయ్య. అంతేకాదు ఎక్కడైనా ముస్లింలను అనవసరంగా హింసిస్తున్న హిందువులను పేపర్లలో, వీడియోల్లో,రీల్స్ లో చూస్తూ “అయ్యో ఈ ముదనష్టపు గాడిదలకేమయ్యింది? రాముడు చెప్పాడా అట్లా చంపమని.. కొట్టమని? అలా చెప్పేవాడు దేవుడెలా అవుతాడసలు? వీళ్ల చేతులు పడిపోను… అసలు ఈ కొట్టి చంపే వాళ్ళంతా ఎవరసలు? ఎక్కడినుంచి ఇట్టా గుంపులు గుంపులుగా తయారయ్యారు? అయ్యో.. అంతమంది ముస్లింలు హిందువుల ప్రాణాలు కాపాడాక కూడానా ఈ ద్వేషం”అంటూ అని విలవిల్లాడుతుంది అత్తయ్య. మొన్నటిదాకా ముస్లింలంటే సద్భావన లేని చాలా మంది హిందువులు కుంభమేళా వెళ్లొచ్చాక ద్వేషం కొంచెం తగ్గించుకున్నారు.

***

ఆ రోజు మా ఇంట్లో జరిగిన కుంభమేళాలో మా అత్తయ్య మామయ్యల మునకల కథలు .. ఆలస్యం చేయకుండా రామ్ శంకర్ కి సిపిఆర్ చేసి గుండెపోటుచావు నుంచి రక్షించి యాసీన్ సంఘటన గురుంచి నేను పనిచేసే బడిలో తోటి టీచర్లకి చెబుతున్నా. అది వింటున్న మా బడిలో పిల్లలతోపాఠాలు కాకుండా బలవంతంగా రామకోటి రాయిస్తూన్న సుందరం సారు మాత్రం “ఆ గొప్ప పనేమి చేయలేదు ఆ స్థలం లో మన హిందూ హెల్త్ వర్కర్ ఉన్నా అదే చేసి ఉండేవాడు. మీరు మరీ రంగు పూసి చెబుతున్నారు సుజనా మేడమ్. ఇంకోటి వాళ్ల అవసరం కోసం హిందువులకి సేవ చేశారు. మన రామాయణాలు చదవకపోతే, జై శ్రీరామ్ అనకపోతే ఇక్కడ బతుకేది వాళ్లకి ? మన భయానికే చేసేది. భక్తితో మనమంటే ప్రేమతో మాత్రం కాదు” అని కొట్టి పడేస్తూ “నేను క్లాస్కి వెళుతున్నాను మీరూ పనికిరాని కబుర్లు ఆపి క్లాసులకి వెళ్ళండి” అన్నాడు ప్రిన్సిపాల్ హోదాలో. అసలు ఈ దేశ నాగరికులు కూడా అయిన వాళ్ళని భయం లో ఎందుకు పెట్టాలి?బడిలో సైన్సు పాఠాలు కాకుండా రామకోటి రాయిస్తున్న సుందరం సార్ కి నాకు ఎప్పుడూ గొడవనే. నా సబ్జెక్ట్ అయిన సాంఘిక శాస్త్రం లో కూడా చరిత్ర పాఠాలు చెప్పవద్దంటాడు. రామాయణ కాలం నాటికే విమానాలను ఋషులు కనుక్కున్నారని చెప్పమని సైన్సు టీచర్ శ్రావణిని పోరుతుంటాడు. మొన్న పదో తరగతి చదివే ఆఫ్తాబ్ రామనామం రాయనన్నాడట. క్లాస్ అవుట్ చేసాడట సుందరం సార్. ఆఫ్తాబ్ నేరుగా స్టాఫ్ రూమ్ కి వచ్చి నాకు కంప్లయింట్ చేశాడు “వైస్ ప్రిన్సిపాల్ మేడమ్ చూడండీ సుందరం సార్ టెక్స్ట్ బుక్ లోని పాఠాలు చెప్పట్లేదు రామ కోటి రాయక పోతే పరీక్షలో ఫెయిల్ చేస్తాడంట, పాకిస్థాన్ పోవాలంట, నేను స్కూల్ ల్లో టోపీ పెట్టుకోవద్దంట” అంటూ దుఖ పడుతూ. తనకీ,సుందరం సార్ కి ఆ రోజు యుద్దమే జరిగింది. “నేనేనా చాలా స్కూల్స్ లో జరుగుతున్నదే . అయినా పిల్లలు హిందూ సంస్కృతి,దేశభక్తి నేర్చుకోవద్దూ ?ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చెప్పాలి? మొక్కయి వంగినదే సామెత తెలీదా మీకు టీచర్”అంటాడు. బడిలో హిందూ పిల్లల్లో ముస్లిమ్స్ పట్ల ,సాటి ముస్లిం విద్యార్థుల పట్ల ఎంత ద్వేషం నింపాలో అంతా నింపుతుంటాడు.

అత్తయ్య మావయ్య పిన్ని బాబాయ్‌లతో సహా ప్రయాగ్‌రాజ్ వెళ్లిన పక్కింటి లక్ష్మణరావులో ఏదో మంచి మార్పే వచ్చింది. మన, వాళ్ళు అంటూ విడదీసి మాట్లాడడం మానేశారు. ఆయన బతికి బట్ట కట్టిందే ప్రయగరాజ్ ముస్లిమ్స్ వల్ల అని బలంగా నమ్ముతాడు. అతనికి కూతురు చనిపోతే అల్లుడు రెండో పెళ్లి చేసుకున్నాడు. ఒంటరైన మనవాడిని పెంచాల్సిన బాధ్యతని తీసుకున్నాడు ఆయన. కుంభ మేళా యాక్సిడెంట్ లో తనొకవేల చనిపోతే తన మనవడి గతిం ఏంటి అని ఆ క్షణాల్లో భయపడిపోయాడు. మనవాడ్ని తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు. కానీ తనని ఆ దుర్ఘటన నుంచి రక్షించడానికి భుజాలమీద మోసి,ఆసుపత్రికి తీసుకెళ్లిన మక్బూల్, ఖాజా లను అతనెలా మారిచిపోతాడు? ఆ మృత్యు క్షణాల్లో రాముడుకు బదులుగా మక్బూల్,ఖాజాలకే మనసులో వెయ్యి నమస్కారాలు పెట్టుకున్నాడాయన.లక్ష్మణరావు మనవడు బొమ్మ కత్తి పట్టుకుని ఉరుకుతూ జై శ్రీరాం అంటూ పిల్లల్ని బెదిరిస్తూ ఆటలాడుతున్నట్లు చేసేవాడు. ఆ ఆటల్ని లక్ష్మణ రావు కూడా ఆడనిచ్చేవాడు ఒకప్పుడు. కానీ ఇప్పుడు సిగ్గు పడుతున్నాడు. బొమ్మ కత్తి పడేసాడు. ఈ మార్పు ఇంకా ఎంత కాలం ఉంటుందో ఇలాగే తెలీదు. ఈ లోపల బడిలో మరో ఇద్దరు కరడుకట్టిన సుందరం మాష్టర్లు కొత్తగా చేరారు. నా శక్తి ఎక్కడా సరిపోవట్లేదు. బడిలో మెల్లిగా ముస్లిం పిల్లల హాజరు తగ్గిపోవడం గమనించాను. బడిలో పిల్లల డ్రాప్ వుట్స్ కి కారణం బీదరికంగా రాసేవాళ్ళమా ఒకప్పుడు? ఇప్పుడు మతం అని అనధికారంగా అనుకోవాల్సి వస్తుంది.

***

ఈ లోపల తమ్ముడి బిడ్డ పెళ్లి కూడా ఈ ఎండా కాలంలో కుదిరింది. అంతా బిజీ అయిపోయాం పెళ్లి పనుల్లో… హనీమూన్‌‌కి కశ్మీర్ వెళ్దామని నిర్ణయించుకున్నారు కాబోయే దంపతులు రుద్ర ,సచిన్.టికెట్స్ కూడా బుక్ చేస్కున్నారు. ఒక తెల్లవారు ఝామున పెహల్గాం వార్త బద్ధలైంది. పాక్ – భారత్ యుద్ధ వార్తలతో దేశం వేడేక్కిపోయింది. యుద్ధమూ మొదలైంది.

దేశంలో ముస్లింల మీద ఎప్పటి కంటే ఎక్కువ దాడులు, హత్యలు జరగసాగాయి. హిందూత్వ వాదులు ఎప్పటిలాగే ద్వేష భక్తితో ఊగిపోసాగారు. సామాన్య జనం యుద్ధ భయంతో ఒణికి పోసాగారు. బళ్లకి ముస్లిం పిల్లలని పంపడం మానేశారు. ముస్లిం యువకుల్ని,ముసలి వాళ్ళని దాచిపెట్టేస్తున్నారు కుటుంబ సభ్యులు. దేశమంతా ఉన్న ముస్లింలు ప్రాణ భయం తో వొణి కి పోతున్నారు. మరో పక్క బీహార్ లో ఎన్నికల ప్రచారం ఎక్కువైపోయింది. దేశమంతా సింధూరం పుణ్యకాలు ఎక్కువయ్యాయి. సైన్యంలో యువతను చేరమని నాయకుల పిలుపులు ఎక్కువైనాయి.యుద్దంలో పాకిస్థాన్ చేతుల్లో ఇద్దరు భారతదేశ సైనికుల వీర మరణాలు తల్లిదండ్రుల కడుపుకోతకు కారణమయ్యాయి. “పేహలగామ్ లో మిమ్మల్ని రక్షించింది ముస్లిం సోదరులే. మా నాన్నలు,కొడుకులు ,భర్తలు పోయిన వాళ్ళు పోయారు. సంబంధం లేని ముస్లింలనేం చేయకండి అని భర్తల పోగొట్టుకున్న భార్యలు,కొడుకుల పోగొట్టుకున్న తల్లిదండ్రులు, నాన్నల పోగొట్టుకున్న పిల్లలు చెబుతూనే ఉన్నారు.అయినా దేశభక్తి నినాదాలు,,అమాయక ముస్లింల హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి.విదేశాల్లో ఉన్న బంధువులు పిల్లలు భారత దేశంలో అమ్మ నాన్నలపైన బెంగ పెట్టేసుకున్నారు. లండన్ లో ఉండే ఆడ బిడ్డ సంగీత రోజూ ఫోన్స్ చేస్తూ అత్తయ్య మామయ్యలను లండన్ వచ్చేయమని ఏడుస్తూ అడుగుతున్నది. ఆరు నెల్లకి సరిపడావంటసామాను మందులు సిద్ధం చేసుకోమని మీడియా ప్రజల్ని భయపెట్టేస్తున్నది.కిరాణా దుకాణాలు,మందుల దుకాణాలు జనంతో పోటెత్తిపోయాయి. వాళ్ల వ్యాపారం అమాంతంగా పెరిగిపోయింది. యుద్ధం బాంబుల నించి ఎట్టా తప్పించుకోవాలో మాక్ డ్రిల్ చేయిస్తున్నారు. అణుబాంబులు వేస్తే ఎట్లా అని జనాలు పిచ్చెక్కిపోతున్నారు. “పాలస్తీనా యుద్ధంలో లాగా మనము కూడా చనిపోతామా అమ్మా” అంటూ పిల్లలు భయం భయంగా తల్లుల్ని కావలించుకుని ఏడ్చేస్తున్నారు. మామూలు జనం అంతా.. ముస్లింలు హిందువులు, క్రిష్టియన్లు ఆదివాసీలు యుద్ధం వద్దు వద్దంటూ అల్లాడుతున్నారు.

***

దేశ భక్తీ మరీ ఎక్కువైన భర్తలందరూ భార్యలకు సింధూరాలు పెట్టి, కుంకాలు,ఎర్రగాజులు టన్నుల కొద్దీ అమ్మేసుకుంటున్నారు. ఒక రోజు పొద్దున్న మా పక్కింటి ఫ్లాట్ లోంచి ఏవో అరుపులు వినపడ్డాయి. నార్త్ నుంచి వచ్చిన పాయల్ ఆమె భర్త విశ్వజిత్ , అత్తా ,ఆడబిడ్డలతో,ఇద్దరు పిల్లలతో ఉంటోంది. ఆమె గొంతే అది. వెంటనే తలుపులు తీసుకుని వెళ్ళాను. నుదుటన రూపాయి బిళ్లంత సింధూరాలు పెట్టుకున్న హిందూ మగాళ్లు కొందరు పాయల్ కి ,ఆమె ఆడబిడ్డ,అత్తమ్మలకి “మన దేశ ఆడబిడ్డల సింధురాన్ని రక్షించుకుందాం “ అంటూ వద్దన్నా వినకుండా పాయల్ అత్తమ్మకు సింధూరం పెట్టారు. “సింధూరం పోట్లాలు ,గాజులు అమ్ముతాం తీసుకోండి” అంటూ వెంట తెచ్చుకున్న బాగుల్లోని సింధూరం పోట్లాలు వాళ్ల చేతుల్లో బలవంతంగా పెడుతున్నారు. అంతే పాయల్ పూనకం వచ్చినట్లు ఊగిపోయింది.”మీరెందుకు మాకు సింధూరం పెడుతున్నారు రా మీరేం మాకు మొగుళ్లా ., మా మొగుళ్లు కదా మాకు సింధూరం పెట్టాల్సింది పోండి” అంటూ ఆ సింధూరపు మొఖాలేసుకున్న మొగాళ్లను మెట్ల వైపు తరిమి కొట్టి మొఖాల మీద తలుపుల వేసుకున్నారు. వాళ్లకి నా వంతు సాయంగా నేనూ ఆ సింధూరం పోట్లాలున్న సాంచీలని అక్కడే ఉన్నడస్ట్ బిన్ లో పడేసాను కసికొద్దీ.

***

ఇలా దేశమంతా సింధూరోద్యమం స్వాతంత్రోద్యమం కంటే జోరుగా సాగుతున్నది.ఆవు కొమ్ములేసుకున్న మనుషులు కర్రలు,కోరలూ,కొన్ని చోట్ల కత్తులూ బయటకి తీశారు. పిడికిల్లు బిగించి, చెప్పులు, రాళ్లు, కర్రలు నోట్లోని కోర.. కోరల పళ్లు వేసుకుని ముస్లిమ్స్ మీద విపరీతమైన దేశభక్తి పూనకాలతో కుమ్మేస్తున్నారు. జై శ్రీ రామ్ అనమంటూ రక్తాలు కారేలా కొట్టుకుంటూ రోడ్ల మీద ఈడ్చుకెళుతున్నారు. నాయకులు, సినిమా యాక్టర్లు స్వమూత్రపానాలు చేస్తూ ప్రచారాలు కూడా చేస్తున్నారు.

ఓల్డ్ సిటీ అంతా పోలీసుల దేశభక్త కాషాయధారుల పహారా… నిలువెత్తు అత్తరు బుడ్డీలాంటి చార్మినార్ చుట్టూ అత్తరు వాసన పోయి ధూప దీపాలతో, కాషాయ భజనలలో పాకిస్థాన్ డౌన్ డౌన్ నినాదాలతో నిండిపోయింది.దేశ ముస్లింలు దేశమంతా పాకిస్థాన్ ముర్ధాబాద్ అంటూ ఊరేగింపులు చేయసాగారు. నిజాలు తెలిసిన మిలిటరీ ఆఫీసర్ లు మాయమవసాగారు. వాళ్ల కళ్ళల్లో, ఇళ్ళల్లో,వాళ్ల భార్యాపిల్లల మొఖాల్లో అంతులేని భయం తారట్లాడుతోంది. చావు భయంతో మస్జిద్ లలో,దర్గాల్లో,ఇళ్ళల్లో,ఒకరితో ఒకరు మాట్లాడుకునే మాటల్లో అల్లాహ్ కి దువాల మీద దువాలు చేయసాగారు. యుద్దం ముగిస్తే దర్గాలకొచ్చి ఫాతెహాలు {మొక్కులు} సమర్పించుకుంటామని ప్రత్యేక ప్రార్థనలు చేయసాగారు. సరిగ్గా పాకిస్థాన్ బలహీన మవుతున్న సమయంలో విచిత్రం జరిగిపోయింది ఇంతలో ట్రంపు దూరాడు. పాలస్తీనా గురుంచి ఒక్క మాట కూడా మాట్లాడని ట్రంపు భారత్ పాకిస్థాన్ దేశాలని మాత్రం యుద్ధం ఆపమని ఘీంకరించాడు. యుద్ధం ఆపకపోతే నీ దేశ వెన్నుముక్కలైన ఆదాని,అంబానీల పని చెప్తా అన్నాడంతే! దేశ ప్రధాని తోక ముడిచాడు.ద్వేష భక్తీ పూనకాలతో పిచ్చెక్కి ఉన్న దేశ భక్తులంతా గెలవబోయే యుద్దం మధ్యలో ఆపేసినందుకు నిర్ఘాంత పోయారు.ప్రధానికి దేశభక్తి లేదా.. లేదా అయ్యో అని వాపోయారు. కాసింత సిగ్గు కూడా పడ్డారు. యుద్ద భయం పోయిన దేశ ప్రజలు మరీ ముఖ్యం ముస్లింలు మొక్కులు తీర్చుకోవడానికి దర్గాల వైపు,మస్జిద్ ల వైపు రెక్కలేసుకుని ఎగిరిపోయారు. దేశం మళ్ళీ పాతబడిపోయింది!

***

ఈ యుద్దాల గొడవల మధ్య నా తమ్ముడి బిడ్డ పెళ్లి ఆగిపోయింది. మళ్లీ ముహూర్తం పెట్టుకున్నారు. ఆగిపోయిన పెళ్లి బట్టలు సాహిల్ మళ్లీ కుట్టసాగాడు. ఈ సారి నేను సాహిల్ దగ్గరికి వెళ్లాను. నన్ను గుర్తు పట్టాడు. సాహిల్ ముఖంలో ఒక దిగాలు, నిరాశక్తత నిండి ఉంది. పెహల్గాం తర్వాత మొన్న జరిగిన దాడిలో వాళ్ల బాబాయి చనిపోయాడట. ఓల్డ్ సిటీ లో అన్న హోటల్ మీద దాడి చేసి ఫర్నీచర్ తో సహా అన్నీ ఎత్తుకుపోయారట. కన్నీళ్లు చిప్పిల్లుతుంటే అన్నాడు సాహిల్. సాహిల్ దుకాణం మునుపటిలా లేదు. “వచ్చారా షాయర్ మేడమ్.. చూడండి పెహల్గాం తర్వాత నా దుకాణాన్ని ఎట్లా విరగొట్టారో అన్నాడు. సాహిల్ దుకాణం మునుపటిలా లేదు. గోడలన్నీ ధ్వంసం అయి ఉన్నాయి. గోడల మీది మక్కా.. కాబా వాల్ పీసెస్ చెరిగి ఉన్నాయి. అన్నింటికి మించి సాహిల్ ఎంతో అపురూపంగా దాచుకున్న మక్కా-ఆల్-కాబా అత్తరు సీసా సగం విరిగి, పరిమళాన్ని, అందాన్నీ కోల్పోయి నివ్వెరపోయి చూస్తున్నది. సాహిల్ నాన్న, ముత్తాత ఫోటోలు లేవు.ఎక్కడ మళ్ళీ దాడులు చేసి విరగగొడతారో అన్న భయంతో తీసేశాడట సాహిల్. “నాకు మా ముత్తాత దేశం కోసం ఆజాదీకి జంగ్ లో పాల్గొన్నాడని పదిమందితో చెప్పుకునే రోజు,లేదా పండగ చేసుకునే రోజు వస్తుందన్న ఆశ లేదు మేడంజి” అన్నాడు గొంతు పూడుకుపోతుంటే! ఎందుకో దుఃఖం అనిపించింది.

సాహిల్ దుకాణానికి 70 శాతం బట్టలు కుట్టించుకోవడానికి హిందువులే వస్తారు.సాహిల్ భయ్యా.. బేటా అనుకుంటూ. సాహిల్ దుకాణంలో నలుగురు హిందూ టైలర్ లు పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.ఎందుకో బయటకు వస్తూ వస్తూ సాహిల్ కి సారీ చెప్పాను. “అరె మీరేందుకు మేడమ్ సారీ చెప్తున్నారు? మీకు మేమంటే ఎంత ప్రేమో తెలీదా నాకు?” అన్నాడు సాహిల్ బాధతో. అతను నాకు గుర్తు పెట్టుకుని తెప్పించి ఇచ్చిన అత్తరు సీసాకి థ్యాంక్స్ చెబుదామనుకున్నా కానీ ఏమీ చెయ్యలేకపోయాను. మౌనంగా నేరం చేసినట్లే బయటపడ్డాను. వీళ్ల బాబాయి పోయిన దు:ఖం నుంచి సాహిల్ ఎప్పటికైనా కోలుకుంటాడా? అత్తరు సీసాతో పాటు అతని హృదయం కూడా పగిలిపోయిందా? జనరల్ బాజారులోని క్రాస్‌రోడ్స్ లో నేను తిరిగి వస్తుంటే నా కళ్లు పోయినేడాది జెండాలమ్ముకున్న ఆజాద్‌ని వెతుక్కున్నాయి. ఆజాద్ కనబడలేదు.కానీపిలక గుండేస్కుని, రామనామాలు పెట్టుకున్న పదేళ్ల పిల్లాడు చేతుల్లో పసుపు కుంకుమ సింధూరాలున్న హారతి పళ్లెంలాంటి దాంట్లో రామ పరివార్ బొమ్మలతో పాటు,చిన్ని చిన్ని జాతీయ జెండా,కాషాయ జెండా రెండూ కలిపి ఒకే మెరుపు దారంతో కట్టి జమిలిగా అమ్ముతుండడం ఆశ్చర్యం కలిగించింది.ఆజాద్ ఎక్కడ? ఏమో? అన్యమనస్కంగా కారు ఎక్కి ఇంటికి వచ్చేశాను. కారులో వస్తుంటే పాకిస్థాన్‌కి దేశ రహస్యాలు చేరవేసిన జ్యోతిమల్హోత్రా పాకిస్థానీ యువకుడ్ని నిఖా చేసుకుందన్న వార్తల వీడియో చూస్తూ డ్రైవ్ చేస్తున్న మా డ్రైవరు అహ్మద్ ఎందుకో వెనక్కి తిరిగి నా వైపు చూసిన చూపు సూటిగా గుండెలో దిగింది.

***

వర్షాలు పడేట్లున్నాయి. ఒకట్రెండుసార్లు వేసవిలో వర్షం పడింది కూడాను. ఇక మామిడికాయలు పురుగులు పట్టి వస్తాయి.ఊరగాయ పెట్టలేకుండా.ఒకరోజు హాడావుడిగా నేను మా మరదలు లక్ష్మీ మామిడికాయలు దొరికే మోండా మార్కెట్‌కి వెళ్లాం. రెండు, మూడు చోట్ల మామిడి కాయల పులుపు రుచి చూశాక బాగా పులుపున్నాయి అని నిర్ధారించుకున్న జంట దగ్గర కాయలు బేరమాడి అక్కడే స్టూల్స్ మీద కూర్చున్నాం. మేమిద్దరమే వెంట తీసుకెళ్లిన నీళ్ళతో కాయలు శుభ్రంగా కడిగి తుడిచి ఇచ్చాము.

అతని పేరు భిఖ్కూ నాయక్, ఆమె పేరు సుజాత. భిఖ్కూ డిగ్రీ చేశాడు. “రుతువులను బట్టి పండ్లు, కూరగాయలు అమ్ముకుంటాం. ఎండల కాలం అంతా మాకు మామిడికాయలు,పుచ్చ,ద్రాక్ష లాంటి పండ్లు ఉంటే,,చలికాలం రేక్కాయలు,ఉసిరికాయలు,పండు మిర్చి బతికిస్తాయి. ఋతువులే మిమ్మల్ని బతికిస్తాయి. మాకు ఎప్పటిదేముడప్పటికే మేడమ్. డిగ్రీ చేసినా ఉద్యోగం లేదు.” అంటున్నాడు భిక్కు. భిక్కు నుదుటన పెద్ద సింధూరం బొట్టు ఉంది. ఎందుకో అర్థం కాలేదు. అతని భాష సులభంగా అతను లంబాడా తెగకి చెందిన వాడని పట్టిస్తున్నాయి. వాళ్ళు ఇంత పెద్ద బొట్టు పెట్టటం నేను ఎన్నడూ చూడలేదు.ఇంతలో అక్కడికి మామిడికాయల లోడుతో ఒక ట్రాలీ వచ్చి ఆగింది. అందులోనుంచి. పిల్లిగడ్డం ,నెత్తిన టోపీ వేసుకున్న ముస్లిం మనిషి దిగాడు. అతన్ని చూసిన వెంటనే భిక్కు పని ఆపిలేచి అతని దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఎంతో వినయంగా బొటన వేలు గుప్పిటి లోపల ముడిచి, మిగతా నాలుగు వేళ్ళనీముక్కు పైన రెండు కనుబొమలకి తాకించి “సలాం భిక్కు భాయ్” అన్నాడు. “అరె “జై శ్రీ రామ్”కహనే కోబోలానా యాఖూబ్ తెరెకో”? అంటూ కోపంగా చూపుడువేలితో బెదిరిస్తున్నాడు భిక్కు. “ఏహే ఊర్కో భిక్కు నువ్వు! ఎందుకనాల ఆయన జై శ్రీ రామ్ అని? నువ్వు అల్లా హో అక్బర్ అని అంటావా?నడు తియ్., ఈ పిచ్చి గూండాగిరీలు నీకు తిండి పెట్టయి .. భయ్యా నువ్వు కాయలు దింపు ఆయనట్లనే అంటడు నువ్వు సలామే చెప్పు. నూర్ ఆపా,పిల్లలు గిట్ల మంచిగున్నరా?” అంది సుజాత కోపంగా భిక్కు వైపు చూస్తూ. యాఖూబ్ కాయలన్నీ దింపి లెక్క చెప్పి డబ్బులు తీసుకుని మౌనంగా వెళ్ళిపోయాడు.

నేను సుజాతని సంభ్రమంగా చూస్తూ ఉండిపోయాను నేను. “భిక్కూ నీ దగ్గర కాయలు కొ నాలనిపించట్లేదు.. కోసినకాడికి నువ్వే తీసుకో యాఖూబ్ ని అలా ఎందుకు బెదిరించావ్”అన్నాను కోపంగా. “పోంతియురి మేడమ్ నా కోసం తీసుకోన్రి.” సుజాత బతిమీలాడుతున్న ధోరణిలో అంటూనే,”ఇంకా దిక్కులేమ్ చూస్తున్నవ్ జల్ది జల్ది కొయ్యి” అంది కళ్ళతోనే భిక్కు ని బెదిరిస్తూ. భిఖ్కూ నాయక్ ముక్కలు కోస్తూ భార్య మీద గొణిగాడు.

***

రోడ్డుకి రెండు వైపులా ఉన్న పేవ్మెంట్ల మీదే ఈ మామిడి కాయలు వ్యాపారం నడుస్తోంది. ఇంతలో నా వెనుకవైపు ఏదో చప్పుడు వినిపించిది. వెనక్కి తిరిగి చూశాను. నా గుండెలు అదిరిపోయాయి. భయంతో. నా వెనుక పెద్దకోరల, కొమ్ములతో అంతెత్తు ఆవు.. నుదుటున సింధూరం అద్ది ఉంది. కింద ఉన్న ప్లాస్టిక్ కవర్‌లో కూరగాయలు,పండ్ల తొక్కలను తింటోంది. తినేటప్పుడు నాలుగు కాళ్లనూ అలజడిగా కదిలిస్తుండడంతో దాని భారీ శరీరం అస్థిరంగా కదులుతుంది. “వదినా లే డేంజర్’’ అంటూ లక్ష్మీ అరిచింది.నేనూ లక్ష్మీ భయంతో లేచాం. కాయలు ముక్కలు చేస్తున్న భిక్కూ నాయక్ కోయడం ఆపి ఫక్కున నవ్వాడు. “ఏమి చేయదు మేడమ్ భయపడకండి కూర్చోండి ఏయ్ రమాబాయి ఛాల్ జా ”అన్నాడు. “ఎందుకు అమ్మో ఎంత పెద్ద కొమ్ములున్నాయి పొడిచేస్తే” అన్నాను. “ఏమీ కాదు మేడమ్ భయ పడకున్రి నేను చెప్పినట్లే వింటుంది అది నా రమా బాయి మేడమ్. నేను పెంచిన మేడమ్ దాన్ని”భిక్కు ఇంచు కూడా కదలకుండా నిమ్మలంగా అంటున్నాడు. లక్ష్మీ నేనూ భయంగా ఆవుకు దూరంగా జరుగుతున్నాము. “భలే చెప్తున్నావు వీడియోల్లో చూడడం లేదా ఎంతమందిని చంపుతున్నాయో ఆవులు కాస్త లేచి దూరం తరుము. లేకపోతే కాయలన్నీ తీసుక పోయి వేరే వాళ్ళతో ముక్కలు కొట్టించుకుంటాము” అంది లక్ష్మి. “మేడం ఆగున్రి, దాని మొఖాన్ని చూడండోసారి ఏముందో”అన్నాడు భిక్కూ నాయక్. ఏముంది అంటూ చూసాము. “నాకేమి కనిపించడం లేదే” అన్నాను. “మేడం గోమాత నుదుటున చూడండి మేడం ఎంత పెద్ద సింధూరం ఉందో” అన్నాడు గొప్పగా… గర్వంగా “”ఉంటే .. నాకర్థం కాక అడిగాను “అదేంటి మేడమ్.. అది మన హిందువుల ఆవు మేడం అది మనల్ని పొడవదు.ముస్లింలనే పొడుస్తుంది” అన్నాడు.ఏదో ఖచ్చితమైన మాట చెబుతున్నట్లు.. సూర్యుడు తూర్పున తప్ప ఇంకో దిక్కున ఉదయించడన్న వాస్తవాన్ని బాలల గుడ్డి చెప్తున్నట్లు. అదేదో జువాలజిస్టులాగా.. ఆవుల మనస్తత్వవేత్తలాగా!

నేను నిర్ఘాంత పోయాను. ఎందుకో నా రోమాలు నిక్క బొడుచుకున్నాయి. “అదేంటి దానికెలా తెలుస్తుంది ఎవరు హిందువో.. ఎవరు ముస్లిమో” అన్నాను ఆశ్చర్యంగా ఇదొక కొత్త సిద్ధాంతం నాకు. మతం అడిగి మరీ దాడులు చేసే మనుషులను చూశాను. కానీ ఇలా జంతువులు కూడా మతం గుర్తుపట్టి ముస్లింలని చంపుతాయా?

“అవును మేడం! నాకు, నా భార్యకీ బొట్టుంది.. మీ ఇద్దరికీ బొట్టుంది అది మన మతం గుర్తుపడతాది మన జోలికి రాదు” అన్నాడు మళ్లీ అదే గర్వంతో. “పైగా వాళ్ల ఆవులు తింటారు.. మనం పూజ చేస్తాం..మనకది గోమాత వాళ్ళకి కోసి తినే జంతువు అంతే. వాటికి ఇది కూడా తెలుసు” అన్నాడు.. భిక్కు నాయక్‌ని పరిశీలనగా చూశాను. నిజమే.. అతని నుదుటున సింధూరం ఉంది. “ఈ భిక్కు అచ్చం ఆవులాగే ఉన్నాడు చూడు వదిన”అంది లక్ష్మీ లో గొంతుతో భిక్కు వైపు,ఆవు వైపూ చూపిస్తూ. నా చూపులు తప్పించుకుంటూ భిక్కూ “ఏం కాదు మేడం” అంటున్నాడు. భిక్కూ నాయక్ భార్య మాత్రం “ఎహే., అన్ని పిచ్చిమాటలు మాట్లాడకు కూర్చొన్న కాడికెళ్ళి లే ముందు మేడమ్ భయపడ్తుంది. అయినా నీకు సింధూరం,బొట్టుబిళ్ళలు,ముక్కుపుడుకలు,గాజులు ఎందుకు చెప్పు? పోయి ఉద్యోగం ఇప్పియ్యమని అడగరాదు గా సర్కారోన్ని? అంటూ భిక్కు మీద అరిచి మా ఇద్దరి వైపు తిరిగి “ఎన్ని మాటలు చెప్పినా వినడు మేడమ్. ఈ మధ్యన ఈ సింధూరం పెట్టుకుని కర్రలు పట్టుకుని ఆ గుంపుతో రోడ్ల మీద మనుషుల్ని బెదిరించుకుంటా తిరుగుతున్నాడు మేడమ్ మొన్న అందరూ కలిసి ఒక ముస్లిం ఆయన మామిడి పండ్ల బండిని రోడ్డు మీద పడేసి కొట్టినరు పాపం రోడ్డు మలుపు దాకా పరిగెత్తించి తరిమి,ఈ పండ్లన్నీ ఎత్తుకుపోయినరు మేడమ్,అన్నీ పాపపు పనులు చేస్తున్నరు.బగ్గ తాగుతరు..వీళ్ళే వాళ్ళకంటే ఎక్కువ కోడి, మట్టన్, ఎద్దు, చేప మాంసం తింటరు. నాకు తెలవదనుకుంటడు. పగలు మొఖం మీద సింధూరం పెట్టుకొని మెడలో కాషాయ టవలు వేసుకొని, బాజార్లలో దుకాణాలపొంటి,తిరుగుతా ముస్లింలను బెదిరించి కొట్టుకుంట గిట్ల గొడవల దంద చేస్తా తిరిగితే ఈ రౌడీ మూకలకి పైకెల్లి డబ్బులు వస్థయి అంట మేడమ్ ..ఆ పాపపు డబ్బు వద్దు అంటే భిక్కు వినడు మేడమ్. ఇది గుర్తు పట్టిందనుకో ఆవు వీళ్ళ చేతి కూడు కూడా తినది. ” అంటూ భిక్కు వైపు తిరిగి “ఫో దాన్ని తరుము ఫో” అంది కోపంగా భర్తతో. భిక్కు లాంటి వాళ్ల గోభక్తి వెనకాలి ఆర్థిక రహస్యపు గుట్టు విప్పి చెబుతూ.

“ ఏహే ఎక్కువ మాట్లాడకు సుజాత పిల్ల పరీక్షల ఫీజు నీ బాబు ఇస్తున్నడా మరి? ” అంటూ భిక్కు భార్యని కసిరి మా వైపు తిరిగి.,”ఓ..ఆగురి మేడమ్ మీరే చూడురి.. అది నన్నేం చేయదు. నేను హిందువుని దానికి తెలుసు. దాని పేరు రమాబాయి మేడం సీతమ్మ పేరు. గోమాత మేడం.. ప్రేమగా చూసుకోవాలి” అన్నాడు. అదిగో రోజూ అట్లా తిండి పెడతా, నీళ్ళు తాపుతా” అంటూ కర్ర తీసుకుని దానిని తరమడానికి వెళ్లాడు. కొద్ది దూరంలో మా డ్రైవరు అహ్మద్ కార్ ఆపి తమాషా అంతా చూస్తున్నాడు.

భిక్కు నాయక్ మొదట “హె… హె… ఫో.. ఛ్” అంటూ చేత్తో తట్టాడు.అలా చాలా సార్లు సౌమ్యంగా,ప్రేమగా చెప్తున్నట్లు,బుజ్జగిస్తున్నట్లు చెప్పాడు. అది “ఎహె ఫో” అన్నట్లే పట్టించుకోలేదు . పైగా ఎడం కాలితో భిక్కూని తన్నింది. భిక్కూకీ రోషం పొడుచుకొచ్చింది అంతే వీరావేశంలో కర్రతో ఆవుని బాదసాగాడు బూతులు తిడుతూ. ఆవు రెచ్చిపోయింది. కోపంతో దాని కళ్లెర్రబడ్డాయి. అంతే వెనక్కి తిరిగి భిక్కూ నాయక్‌ మీద కొమ్ములతో దాడి చేసింది. భిక్కు ని ఎత్తి అవతల పడేసి మీదకు దూకి తన కొమ్ములతో పొడవ సాగింది. అందరం భయంతో అరవసాగాం. సుజాత భోరున ఏడవసాగింది. దారిన పోయే వాళ్లని “సార్ హెల్ప్” చేయండంటూ అరుస్తూ అడగసాగింది. ఒక్కరూ ఆగలేదు. నేను “అహ్మద్.. అహ్మద్ ఇటు రా” అంటూ రోడ్డవతల ఉన్నఅహ్మద్ వైపుకి సైగలు చేస్తూ అరిచాను. అహ్మద్ కారు నడుపుకుంటూ రోడ్డు దాటి వచ్చి,తెలివిగా మెల్లిగా ఆవు మీదకు కారు తోలుతూ పోయాడు. ఆవు భయపడి అడుగులు వెనక్కి వేసింది. ఈ గ్యాప్‌లో భిక్కూ నాయక్ గబుక్కున్న లేచాడు. అదృష్ట వశాత్తు అతనికేం కాలేదు.మో చేతులు గీసుకుపోయాయి. నుదుటికి మాత్రం దెబ్బతగిలి రక్తం ముక్కు మీదకు కారుతూ అతను పెట్టుకున్న సింధూరాన్ని చెరిపేసింది.భిక్కు పరుగున వెళ్లి పేవ్మేంట్ మీద కూలబడ్డాడు. వెనక్కి చూశాను కాలు దువ్వుతున్న ఆవు నుదుటిపై ఎర్రటి సింధూరం.. కళ్లల్లో అంతేఎర్రటి క్రోథం అచ్చం ఇప్పటి సిక్స్ ప్యాక్‌ రాముడిలా, పది చేతుల్లో త్రిశూలం,కత్తి, బాణాలతో,ఎర్రబడ్డ కళ్లతో కాషాయధారుడై ఎవరినో చంపడానికి యుద్ధానికి పోతున్నట్లున్న ఇప్పటి క్రోధండ,ఉగ్ర రాముడి నకలులా ఉంది ఎర్రబడ్డ కళ్ళతో కోపంతో వణుకుతున్న ఆవు.సాధు జంతువయిన ఆవునీ, రాముణ్ణి ఇలా మార్చి పడేశారేంటి అనిపించింది.

అహ్మద్ కింద పడ్డ తన టోపిని తీసి తలకి పెట్టుకున్నాడు.తన మెడకి చుట్టి ఉన్న గళ్ళ రుమాలుని భిక్కు నాయక్‌క్కి,కోపంగా కాలు దువ్వుతున్న ఆవుకు అడ్డంగా ఆవు భిక్కు ని చూడకుండా పట్టుకున్న అహ్మద్ ని ,సుజాతని చూసి భిక్కు పెంచిన ఆ రమాబాయావు ఏమనుకుందో ., నాలుగు అడుగులు వెనక్కేసింది. తరువాత మెల్లగా మెల్లగా వెళ్లిపోయింది.

“మేడమ్ దవాఖానాకి తీసుకొని పోదాం కార్ ఎక్కండి” అంటూ అహ్మద్ భిక్కు నాయక్ కార్లో ఎక్కించాడు.రెండు వీధుల అవతల ఎల్‌.కె హాస్పటల్ ఉంది. అక్కడికి తీస్కెళ్ళాం. “ఏమైంది.. పడ్డడా కొట్టినరా” డాక్టర్ అడుగుతుంటే “లేదు సార్ గమ్మున ఉన్న ఆవుని పోయి తన్నిండు కర్రతోని దానికి కోపం రాదా చెప్పున్రి”? అంది సుజాత కోపంగా.”ఆవేం చేసింది ఆవుని కొట్టడం దేనికి దాని మానాన దాన్ని ఉండనీక” డాక్టర్ ఆశ్చర్యంగా అడిగాడు. “ఈన హిందువు అంట..అది ఆవుకి తెలుసంట.ఈన కేదో ఆవొచ్చి చెప్పినట్లు. అందుకని ఆవు తనని పొడవదంట.. ఛాలెంజ్ చేసిండు ఇగో మాడికాయలు కొనడానికి వచ్చిన ఈ మేడంతోని” అంది సుజాత సిగ్గుతో నా వైపు చూపిస్తూ. “దిమాఖ్ ఖరాబయిందా గుర్తు పట్టిందా ఆవు నిన్ను.. నీ కులాన్ని కూడా గుర్తు పట్టి ఉంటుందే..అవునూ మరి నిన్నెందుకు పొడిచింది అమ్మా భిక్కు కుటుంబంలో ఎవరికైనా ఇట్లా భ్రమలు ,పిచ్చిమాటలు ఉన్నాయా”? డాక్టరే వెర్రి చూపులు చూస్తూ అడిగాడు. “అయ్యో అట్ల ఎందుకు అడుగుతున్నరు ఎవరూ లేరు సారూ., ఇగో ఈననే ఇట్లున్నడు” అంది సుజాత భయంగా భిక్కు వైపు చూస్తూ. ఇంతలో అహ్మద్… “డాక్ సాబ్ జర జల్ది చూడున్రి …తలకి దెబ్బ బాగానే తగిలింది” అన్నాడు. తన దస్తీని భిక్కు నుదుటికి గట్టిగా కట్టి ధారను ఆపాడు అహ్మద్ అప్పటి దాకా.
డాక్టర్ గాయం పరిశీలించి నాలుగు కుట్లు పడతాయంటూ లోపలికి తీస్కెళ్లాడు. నేను కళ్ల నీళ్లతో ఉండిపోయిన సుజాతని బుజ్జగించి చేతిలో రెండు వేలు పెట్టాను.

అరగంట అయినాక భిక్కూ నాయక్ వచ్చాడు నీరసంగా తల ఒంచుకుని.. “మేడం థ్యాంక్స్, భయ్యా థ్యాంక్స్” అంటూ..అహ్మద్ వైపు సిగ్గుపడుతూ చూస్తూ తల వంచుకున్నాడు. “ఇంకో సారి ఆవుల వెంట పడకుండా నీ బతుకేదో నువ్వు బతుకరాదు..మతం కూడు పెడుతుందా ? అంది మా లక్ష్మి భిక్కు నాయక్‌ తో.
“నేను చెప్తానే ఉన్నా మేడం పీజీ చేయమని, గ్రూప్స్‌కి కూర్చోమన్న నేను చదివిస్త అన్నా కూడా మేడం వినడు” అంది సుజాత కోపంగా…భిక్కూ ఏమన్నట్టు చూసిన నన్ను చూస్తూ” లేదు మేడం ఇద్దరి పిల్లల చదువు.. ఇంటి అద్దె నెత్తి మీద ఉంది చదువు బుర్రకెక్కట్లేదు” అన్నాడు భిక్కు నాయక్.. “ఎందుకు దందా చేస్తూనే చదువుకో.. నేను కడుపుల బిడ్డ ఉన్నప్పుడే ఇంటర్ పరీక్షలు రాసిన. ఆ సింధూరాలు పూస్కుని..గోమాత, గోమూత్రం అనుకుంట తిరిగితే ఏ తరక్కీ చేయవు గోపూజ చేస్తూ కూర్చొంటే ఆవు అన్నం పెట్టదు.. చదువుకో లేకపోతే వ్యాపారం చేసుకో”అంది లక్ష్మి. “ఊర్కో లక్ష్మి.. భిక్కు నాయక్, సుజాతా పదండి మిమ్మల్ని ఇంటికాడ దింపుతా” అంటూ వాళ్లని కార్లో కూర్చోమన్నా! అహ్మద్.. కారుని ముందుకు పోనిచ్చాడు. తన మామిడికాయలు జాగ్రత్తగా చూస్కోమని, ఒక గంటలో అక్కడికి వస్తానని మామిడికాయల బజారులో తన పక్క దుకాణం అనురాధకి చెబుతూ కార్ ఎక్కింది సుజాత.

ఇంట్లోకి వెళ్తున్న భిక్కు నాయక్ ప్యాంట్ జేబులోంచి అహ్మద్ ఎప్పుడూ మెడచుట్టూ వేసుకునే గళ్ళలున్న పెద్ద సైజు దస్తీ వేలాడుతుంది రక్తపు మరకలతో. దాన్ని అహ్మద్ భిక్కునాయక్ గాయానికి కట్టాడు రక్తం కారకుండా. రోజూ మధ్యాహ్నం అసర్ నమాజు చేసే ముందు కాళ్ళు చేతులు కడుక్కుని ఆ పెద్ద గళ్ళ రుమాలుతో మొఖం చేతులూ తుడుచుకుంటాడు అహ్మద్. దాన్ని ఉతికి ఇస్తాన్నాడు చేతిలో పట్టుకొని భిక్కు.”అరె వొద్దు భాయి పెట్టుకో కొత్తదే అది. నిన్ననే తీసినా” అన్నాడు అహ్మద్ నవ్వుతూ. సుజాత ఎంతో ప్రేమగా చేసిచ్చిన చాయ్ తాగి, భిక్కుని ఇంట్లోనే వదిలేసి మళ్ళా అందరం కలిసి మామిడికాయల కోసం మోండా బాజారు వైపుకి బయలుదేరాం. దార్లో పేవ్మెంట్ల మీదున్న చెత్త కుప్పల దగ్గర దొరికింది తింటూన్న ఆవులు గుంపులు గుంపులుగా, వాటికి పోటీ పడుతూ కుక్కలూ కనిపించాయి.

కారులో ఇంటి వైపు పోతున్నాం. కారు దీక్షగా నడుపుతున్నాడు అహ్మద్. ఒక్క సారి చల్లటి గాలి వీచింది.ఎందుకో కారులో..సాహిల్ టైలర్ దుకాణంలోని అత్తరు పరిమళం గుబాళించినట్లు అనిపించింది.

డా. భారతి : Psychotherapist & marital counselor. కలం పేరు గీతాంజలి. పుట్టిన స్థలం హైద్రాబాద్. ర‌చ‌న‌లు: 'ఆమె అడవిని జయించింది', 'పాదముద్రలు'. లక్ష్మి (నవలిక). 'బచ్ఛేదాని' (కథా సంకలనం). 'ప‌హెచాన్‌' (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), 'పాలమూరు వలస బతుకు చిత్రాలు' (కథా సంకలనం), 'హస్బెండ్ స్టిచ్' (స్త్రీల విషాద లైంగిక గాథలు) 'అరణ్య స్వప్నం' (కవితా సంకలనం) సెప్టెంబర్ 2019 లో విడుదల అవుతుంది.

Leave a Reply