సాహిత్య మార్క్సు మన శ్రీశ్రీ

రాత్రి శ్రీశ్రీ గారి కబురు వినగానే చతికిలబడిపోయాను. అయితే పొద్దున ఎ.ఐ.ఆర్. వాళ్ళు ఫోన్ చేసి చెప్పేదాకా శ్రీశ్రీగారు పోయారనే మాట జ్ఞాపకం లేదు నాకు. ఎందుకంటే, నా చిన్నప్పటి సంగతి గుర్తొస్తోంది. మెయిన్రోడ్డు మీద శవాలు వెళుతూంటే మా అమ్మ మమ్మల్ని చూడనిచ్చేది కాదు. బాజాల్లో వెళ్తూండేవా శవాలు. చచ్చిపోయిన వాళ్ళని అలా తీసుకువెళతారని తర్వాత తెలిసింది నాకు. కాని నేనూ, మా అమ్మా, మా నాన్నగారూ, మా అన్నా, మా తమ్ముళ్లూ, మా చెల్లెలూ మేమెవరం చచ్చిపోమనీ, ఊళ్ళో వాళ్ళే చచ్చిపోతారని అనుకునేవాడిని నేను.

అలాగే ఆంధ్ర సాహిత్యానికి సంబంధించినంత వరకు మహాకవి శ్రీశ్రీ ఎల్లప్పుడూ మనతోనే జీవించి వుంటారని నేనిప్పటివరకు అనుకుంటూ వస్తున్నాను. వారులేని సమయం ఒకటి వుంటుందని నేనెప్పుడూ ఊహించలేదు. అందుచేత వారులేని సమయాన్ని ఈ ఉదయం మిత్రులు గుర్తు చేసినపుడు, ఆ నష్టం, ఆ నష్టంలో వుండే కష్టం అంతా తెలిసోచ్చింది నాకు. అయ్యో మహాకవి మనకిక లేడే అనుకున్నాను.
అయితే రవికీ కవికీ ఓ తేడా వుంది. రవి అస్తమిస్తే ఏమిటవుతుందో మీ అందరికీ తెలుసు. కాని కవి అస్తమిస్తేమటుకు అతని కాంతి అలా మిగిలిపోతుంది. అతని కాంతి చావదు. కవి పోయినప్పటికీ అతని కాంతి పోనట్టు మహాకవి శ్రీశ్రీ మనకి ఎల్లప్పుడూ అమరుడై వుంటారు. ఆయన గురించి ఏదో చెబుదామనుకున్నాను. కాని మరి నాకు గాభరా లావుగావుంది. అంటే ఏమీ చెప్పలేకపోతున్నాను. ఇది బాగా విచారించవలసిన సమయం. అయినప్పటికీ శ్రీశ్రీ గురించిన తలపులు నాకొచ్చినపుడు ఓ విధమైన సంతోషం నాలో అంకురిస్తోంది.

ఒక్క భారత దేశానికేగాదు, ఆ మాటకొస్తే మొత్తం ప్రపంచ సాహిత్యానికే ఎనలేని సేవ చేశారు. శ్రీశ్రీ. విశ్వసాహిత్యంలో మన తెలుగు భాష చాలామట్టుకు శ్రీశ్రీ గారి వల్లనే నిలిచివుంటుందని నేను భావిస్తున్నాను. అంతేకాదు రాజకీయపరంగా లెనిన్ మహాశయుడు, మావో మార్క్సిజానికి ఏవిధంగా సేవచేశారో సాహిత్యపరంగా శ్రీశ్రీ అంత సేవ చేశారు. మార్క్సిజం అనే మంచి బంగారానికి తెలుగు కవిత్వశోభ తీసుకొచ్చి యువకుల మధ్య నిలబెట్టి దాన్ని ఘుమ ఘుమలాడించినవాడు మహాకవి శ్రీశ్రీ. ఆయన శక్తిసామర్ధ్యాలలాంటివి. కార్ల్ మార్క్స్ రాసిన దాస్ కాపిటల్ గ్రంథం తెలుగుదేశంలో ఎంతమంది చదివారో నాకు తెలీదు. కాని కార్ల్ మార్క్స్ రాసిన దాస్ కాపిటల్ ప్రభావం ఎంతో మంది యువకుల మీదా, కొన్ని వేల జనంమీదా పడటానికి శ్రీశ్రీ మహాప్రస్థానం కారణం. ఈ సంగతి నిజమని నలభై ఏళ్ళ నుండి అందరికి తెలుసు. మహాప్రస్థానం వల్ల తెలుగు సాహిత్యానికీ మార్క్సిజానికీ తెలుగు యువకులకీ శ్రీశ్రీ యెంతో సేవ చేశారని నేను నమ్ముతున్నాను.

నా చిన్నప్పటినుంచీ అంటే ఆరో ఏటనుంచీ ఇంగ్లీషు పొయట్రి చదివేవాడిని. ఆ ఇంగ్లీష్ పద్యంలో వున్నప్పటి శోభ కొంతయినా తెలుసుకున్నవాడినే. ఇప్పటిదాకా ఇంగ్లీషు మాట్లాడుతున్నవాడినే. అంతో ఇంతో ఇంగ్లీషు సాహిత్యంతో నాకు పరిచయముందని చెప్పడానికే ఇదంతా చెబుతున్నాను.
”ఆనందం అర్ణవమైతే” అని శ్రీశ్రీ తెలుగులో ఒక గేయం రాశారు. స్విన్బర్న్ ఇంగ్లీషులో రాసిన ”ఏ మాచ్” అనే గేయం దీనికి మూలం. కాని ఆ ఇంగ్లీషు మూలంకన్నా శ్రీశ్రీ గారి తెలుగు గేయం మూడువందలరెట్లు బావుంది. అదీ ఆయన కవితాశక్తి.

శ్రీశ్రీగారు ఏకసంథాగ్రహి. ఒక్కసారి చదివితే యెన్ని ఏళ్ళదాకా అయినా సరే గుర్తుండిపోతుంది. ఇవాళ చదివింది యాభై ఏళ్ళతర్వాత అడిగితే ఇప్పుడు కంఠస్తం చేసినట్లు అప్పజెప్పగలరాయన. అంతేకాదు, ఏదైనాసరే రెడీగా ఒప్పుకుంటారాయన. ఆయన్ని ఒకసారి నేనడిగాను ”రాబర్టు బర్న్) మిమ్మల్ని ఇన్ఫ్లుయన్స్ చేశాడు గదా” అని. “అవును” అన్నారాయన. రాబర్ట్ బర్న్స్ మహాకవి. ఇంగ్లండులో వుండేవాడు. ఆయన పేదలకి… మహాకవి శ్రీశ్రీ గారిలాగే. ఆయన రైతుగా, రైతుకూలీగా కూడా వుండేవారు. మహాకవి శ్రీశ్రీ గారికన్నా కూడా ప్రజలకు ఇంకా దగ్గరగా వుండేవాడాయన. ఆ రాబర్టుబర్న్స్ For a ‘that and a’ that అనే గేయం రాశాడు.
We dare be poor for a’ that అన్నాడాయన. మానవుడి శ్రమశక్తి బంగారమనీ, మానవుడి అంతస్థు అనేది మనమేసేముద్ర అని అంటాడాయన.
That man to man, the world o’er shall brothers be for a ‘that!’
అని ఆగేయం ముగుస్తుంది.
“సాధుతత్వపు సోదరత్వపు స్వాదుతత్వం జయిస్తుందా?”
అని “నిజంగానే నిఖిలలోకం” గేయంలో మీరన్నారు. అలా మీరన్నప్పుడు రాబర్టు బర్న్స్ ప్రభావం మీ మీదుందిగదా అన్నాను. వెంటనే అవునన్నారాయన.
మామూలుగా రచయితలు, కవులు తమమీద ఫలానవాళ్ళ ప్రభావం వుందా అంటే” ఎవరతను? ఎవరది? పేరు మళ్ళా చెప్పండి” అని దాటేస్తారు. రచయితల గురించి నాక్కొంచెం రావిశాస్త్రీయం ఎక్కువ తెలుస్తుంది, కాని శ్రీ శ్రీగారలా కాకుండా వెంటనే ఒప్పేసుకుంటారు.

ఎంత చిన్నవారితోనైనా సరే శ్రీశ్రీ గారు సమానంగా వ్యవహరించగలరు. వాళ్ళదగ్గర తన ఎక్కువతనం చూపించరు. తన ప్రజ్ఞతో, ప్రతిభతో విదుటివాళ్ళను అదరగొట్టరాదను శ్రీశ్రీగారు నిగర్వి, కాని తనశక్తి తనకు తెలుసు. తనకి హిమాలయ శిఖరాల ఎత్తువున్నడు. తనలో మహాసముద్రాల లోతులున్నాయని గూడా తెలుసు. ఎవడైనా అల్లరిపెడితే మాత్రం పెడిముని కొట్టిగలడు. మీ శిష్యరత్నం ఆరుద్రగారెలా వున్నారని ఈమధ్య’ ఆంధ్రజ్యోతి’లో ఎవరో అడిగారు. ” శిష్యుడంటే ఆయనొప్పుకోడు. రత్నమంటేనేనొప్పుకోను” అన్నారాయన. అంతబాగా మహాకు శ్రీశ్రీగారే చెప్పగలరు.
ఎంత కష్టమైన విషయాన్నైనా ఎంతో సులభంగా చెప్పగల మహాకవి శ్రీశ్రీ- “కష్టజీవికి రెండువైపులా వుండేవాడే కవి” అని శ్రీశ్రీ గారన్నారు. ఇంత తేలిగ్గా చెప్పడం నిజానికెంతో కష్టమైన సంగతి. కవిత్వంలో శ్రీశ్రీగారు సాధించినదదే. అందుకే ఆయన మహాకవి, ఇప్పుడాయన లేరు అనుకోవడానికి నాకు బహుకష్టంగా ఉంది. ఆయన గురించి చాలా విషయాలు చెప్పాలి. కాని ఇప్పుడు చెప్పలేను. ఆయన గురించి నాకు ఎంతో రాయాలని వుంది. ఎప్పుడో రాస్తాను.

(16-6-83 సాయంత్రం విశాఖలో విరసం ఏర్పాటు చేసిన శ్రీశ్రీ సంతాపసభలో అధ్యక్షోపన్యాసం, ముద్రణ : రంజని, 1983)

కథా రచయిత. విరసం వ్యవస్థాపక సభ్యుడు. వృత్తి రీత్యా న్యాయవాది. 1922, జూలై 30న శ్రీకాకుళంలో జన్మించాడు. సొంతూరు అనకాపల్లి దగ్గర తుమ్మపాల గ్రామం. అసలు పేరు రాచకొండ విశ్వనాథ శాశాస్త్రి.  ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి తత్వ శాస్త్రంలో బీ.ఏ (ఆనర్స్), మద్రాసు యూనివర్సిటీ నుండి 1946లో లా పట్టభద్రుడయ్యాడు. తన పితామహుడైన శ్రీరామమూర్తి వద్ద న్యాయ వృత్తి మెళుకువలు నేర్చుకొని 1950లో సొంత ప్రాక్టీసు పెట్టుకున్నాడు. మొదట్లో కాంగ్రెస్ వాది. 1960లలో మార్క్సిస్ట్ సిద్ధాంతాలచే ప్రభావితుడయ్యాడు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల మాండలికంలో, అట్టడుగు వర్గాల భాషలో పదునైన రచనలు చేశాడు.
రచనలు: మార్చు; కథాసాగరం (1955); ఆరుసారా కథలు (1961); రాచకొండ కథలు (1966); ఆరుసారో కథలు (1967); రాజు మహిషి (1968); కలకంఠి (1969); బానిస కథలు (1972); ఋక్కులు (1973); ఆరు చిత్రాలు (1974); రత్తాలు-రాంబాబు (1975); సొమ్ములు పోనాయండి; గోవులోస్తున్నాయి జాగ్రత్త; బంగారం; ఇల్లు; నాటకం / నాటికలు : నిజం (నాటకం); తిరస్కృతి (నాటిక); విషాదం (నాటిక). 1966లో తీసుకున్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి ఇచ్చివేసాడు. 1983లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు గౌరవ కళాప్రపూర్ణను ప్రకటిస్తే దానిని తిరస్కరించాడు. ఆయన కథకుడే కాదు, నటుడు కూడా . ఆయన రాసిన నిజం నాటకంలోను, గురజాడ కన్యాశుల్కం నాటకంలోను నటించాడు. నిజం నాటకం ఆ రోజుల్లోనే( 1962లో) వంద ప్రదర్శనలు ఇవ్వడం విశేషం. 10 నవంబర్, 1993న మరణించాడు.

 

Leave a Reply