కామ్రేడ్స్,
సి.పి.ఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ సుధాకర్@ టెంటు లక్ష్మీనరసింహ చలం కు విప్లవ జోహార్లర్పిస్తున్నాను. ఆపరేషన్ కగార్ దాడిలో ప్రపంచ పర్యావరణ దినమైన జూన్ 5, 2025న ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నేషనల్ పార్క్ లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించినట్లు పోలీసులు చెబుతున్నారు. సివిల్ దుస్తుల్లోనే కనబడుతున్న కామ్రేడ్ సుధాకర్ మృతదేహం అనేక అనుమానాలను కల్పిస్తుంది. ఏదైనా ఎన్నో ప్రతికూలంశాలను ఎదుర్కొంటూ తన వయోభారాన్ని సైతం లెక్కచేయకుండా కామ్రేడ్ సుధాకర్ ప్రజల కోసం ప్రాణాలర్పించిన గొప్ప యోధుడు. అతనికి నా విప్లవ జోహార్లర్పిస్తున్నాను. జీవన్మరణ కగార్ దాడిలో అటు విప్లవోద్యమాన్ని, ఇటు ఆదివాసులను కాపాడుకుంటున్న వారి పార్టీ శ్రేణులకు, బంధుమిత్రులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నంబాల కేశవరావు ఘటన నుండి నిత్యం ఏ వార్త వినాల్సి వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ స్థితిలో కూడా విప్లవ శ్రేణులు, ప్రజాస్వామిక వాదులు, మెజారిటీ పార్లమెంటరీ పార్టీలు చేస్తున్న కృషితో కగార్ ఆపరేషన్స్ నిలిపివేయబడి, శాంతి చర్చలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడాలని ఆశిస్తున్నాను.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004 అక్టోబర్ లో వైయస్సార్ ప్రభుత్వం తన ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విధంగా శాంతి చర్చలకు హామీపడి అది నెరవేర్చింది. పర్యవసానాలేమయినప్పటికీ కన్సర్న్ సిటిజన్స్ కమిటీ (CCC) చొరవతో దాదాపు చరిత్రలో తొలిసారిగా నక్సలైట్లకు-ప్రభుత్వానికి మధ్య శాంతి చర్చల ప్రక్రియ నడిసింది. ఆనాటి పీపుల్స్ వార్ పార్టీ పై ఉన్న నిషేధాన్ని, తలలపై ఉన్న వెలలను పక్కనపెట్టి ప్రభుత్వం చర్చల ప్రక్రియకు సిద్ధపడింది. ఆ సమయంలో దాదాపు పది, పదిహేను రోజులు కామ్రేడ్స్ సుధాకర్ తో పాటు, అమరులు రామకృష్ణ, గణేష్ లతోను కలిసి ఉండే అవకాశం వచ్చింది. సునిశిత ఆలోచనతో, కామ్రేడ్లీ సంబంధాలతో సామాన్యుడిగా ఉన్న సుధాకర్ తో నేను ఎక్కువగా కలివిడిగా ఉన్నాను. చిన్న పార్టీ-పెద్ద పార్టీ అనే తార తమ్యాలకు అవకాశం లేని విధంగా మనసా -వాచా-కర్మనా అతని వ్యవహార శైలి నాకు ఎంతో నచ్చింది.అక్కడికి సందర్శకులుగా వచ్చిన సహచరులతోనూ అంతే స్నేహంగా, ప్రేమగా, కలివిడిగా ఉండేవాడు. అలాగే రాజకీయంగాను ఆయన సూచనలు లోతుగా ఉండేవి. కామ్రేడ్ సుధాకర్ కు సంబంధించిన మరణ వార్తలు కూడా తరచుగా ఊహాగానాలుగా లోగడ వచ్చి ఉన్నాయి. కానీ నాయకత్వ నిర్మూలన లక్ష్యంగా సాగుతున్న ఈ పరిణామాలు చూసి ఈసారి వచ్చిన మరణ వార్త ఎప్పటిలా అబద్ధం కాలేకపోయింది. ఈ వార్త ధ్రువీకరించ బడ్డ కొన్ని గంటల్లోనే ఒక స్మృతి గీతం రాసుకున్నాను. ఆరోజు నిద్ర కూడా పోలేక పోయాను.
ఆరు నెలల క్రితమే చర్చల ప్రతిపాదన చేశాను.
ఆపరేషన్ కగార్ దాడులు, దాని లోతుపాతులు నేను అర్థం చేసుకున్న మేరకు అవి కేవలం మావోయిస్టుల నిర్మూలనకు పరిమితం కావు. అపార ఖనిజ సంపద కలిగిన అబూజ్ మడ్ నుండి ఆదివాసులను ఖాళీ చేయించి, పోలీసు క్యాంపులకు తరలించడం అంటే కేవలం ఆషామాషి వ్యవహారం కాదు. సల్వాజుడం కాలంలోనూ ఈ ప్రయత్నాలు జరిగాయి. అందువల్ల లక్షల కోట్ల టన్నుల విలువైన సహజ సంపదను స్వాధీనం చేసుకోవడానికి ఆదివాసులను, నిర్వాసితులను చేసే ప్రయత్నాలు దశాబ్దాలుగా సాగుతున్నాయి. అందుకే ఆదివాసి సంఘాలను పార్టీగా చేసి మావోయిస్టులతో చర్చలకు ప్రభుత్వం ముందుకు రావాలని కామ్రేడ్ రియాజ్ తండ్రి చెంచంగారి శెట్టయ్యా మరణించిన రోజున 2025 జనవరి 26 నాడు వ్యక్తిగతంగా నేను చర్చల ప్రతిపాదన చేశాను. ఎందుకంటే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తన ఎన్నికల మ్యానిఫెస్టోలో చర్చల ప్రస్తావన చేసి ఉంది. ఆ మేరకు గెలిచిన తర్వాత 2024 జనవరిలో రాష్ట్ర ముఖ్యమంత్రి చర్చల ప్రతిపాదన చేస్తే, మావోయిస్టు పార్టీ అందుకు సంసిద్ధత ప్రకటించింది. అందుకే నేను ధైర్యంగా ఈ శాంతి చర్చల ప్రతిపాదన చేశాను. ఆ శాంతి చర్చల ప్రతినిధిగా మరొకసారి సుధాకర్ తిరిగి వస్తాడనుకుంటే వెంటాడి, వేటాడి కాల్చిందీ రాజ్యం. జోహార్ కామ్రేడ్ సుధాకర్!
ఆదివాసుల రక్షణ-దేశవాళీ వనరుల సంరక్షణ
వందల ఏళ్ళ క్రితమే బ్రిటీష్ సామ్రాజ్యవాదాన్ని ఎదిరించిన ఆదివాసులు దేశానికి స్వాతంత్ర్య పోరాట మార్గం చూపారు. ఈరోజు అదే ఆదివాసులు కనీవినీ ఎరుగని దాడులు ఎదురుకుంటున్నారు. వారి కాళ్ళ కింద నేలలో ఉన్న అపారమైన ఖనిజ సంపద దోపిడీకి, అన్ని షెడ్యూల్ చట్టాలు, పైసా నిబంధనలు, రాజ్యాంగ రక్షణలు అన్ని ఉల్లంఘించ బడ్తున్నాయి. ఇలా కౄరంగా దాడి చేయడమే కాకుండా, ఫలానా తేదీ కల్లా మావోయిస్టులను నిర్మూలిస్తామని ప్రకటిస్తున్నారు. తద్వారా ఆదివాసులకు అండదండ దొరకదని భావిస్తున్నారు. అపారమైన దేశ ఖనిజ సంపదను సరుకుగా మార్చ చూస్తున్నారు. ఆధునిక టెక్నాలజీ ద్వారా, చుట్టువేత- అణచివేత ద్వారా మావోయిస్టు నాయకత్వాన్ని, ఆదివాసీ నాయకత్వాన్ని ఎంతగా నష్ట పరుస్తున్నారో దేశ ప్రజలకు, ప్రపంచ ప్రజల ముందు పాలకుల ఫాసిస్ట్ స్వభావం అంతగా బట్టబయలవుతుంది. టెర్రరిస్టులకు కొమ్ముకాస్తున్న పాకిస్తాన్ తో కాల్పుల విరమణ పాటిస్తున్న భారత పాలకులు, మన దేశ బిడ్డలను అది మన దేశ సంపద దేశ ప్రజల అవసరాలకే వినియోగ పడాలన్న నిజమైన దేశ భక్తులను శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటిస్తున్న వారిని వేటాడి చంపడం వెనుక దురుద్దేశాలను ప్రజలు కూడా గమనిస్తున్నారు. పార్టీలు, సంస్థలకతీతంగా ఇదొక దేశభక్తియుత ఉద్యమంగా రూపుదిద్దుకుంది. ఆదివాసుల జల్-జంగల్-జమీన్ సమస్య రక్షించ బడాలంటే 6 వ షెడ్యూల్డ్ మాదిరి వీరికి ఆదివాసి అటానమస్ కౌన్సిల్ ఏర్పరచాలని డిమాండ్ కూడా ముందుకు వస్తుంది. కామ్రేడ్ సుధాకర్ లాంటి వీర యోధుల, వీర వనితల, ఆదివాసి బిడ్డల త్యాగాలు వృధా కావడానికి ఇదొక నిదర్శనం. అయితే ఆపరేషన్ కగార్ పేరిట దేశ- విదేశ కార్పోరేట్లతో జరిపిన ఒప్పందాలన్నీ బట్టబయలు అవుతాయని ప్రభుత్వం శాంతి చర్చలకు సిద్ధం కావడం లేదని స్పష్టం అవుతుంది.
మధ్య భారతంలోని అడవులు మాత్రమే ఈరోజు దేశానికి ఆక్సిజన్ ఇస్తూ, పర్యావరణ సమ తుల్యతకు, నది జలాల సంరక్షణకు నిజమైన ఆవాసాలుగా ఉన్నాయి. కేవలం పిడికెడు మంది కార్పొరేట్ల కోసం అడవులను, కొండలను పిండి చేసి, భూగర్భాన్ని తవ్విపోసి దేశ ద్రోహానికి పాల్పడుతున్నదెవ్వరు? సుప్రీంకోర్టు చే తిరస్కరించబడిన సల్వాజుడుంను, డిఆర్జీ పోలీసులుగా ప్రమోట్ చేస్తూ చట్టవిరుద్ధ సేనను తయారు చేస్తున్నదెవ్వరు? శాంతి కొరకు విజ్ఞప్తి చేస్తున్న వెంటాడి, వేటాడి కాల్చి చంపుతూ జీవించే హక్కును చిదిమివేస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న దెవ్వరో? దేశ ప్రజల ముందు స్పష్టంగా బట్టబయలు చేస్తున్న మీ త్యాగాలు వృధా కావు.
కామ్రేడ్ సుధాకర్, మీ అనన్య త్యాగాలు అడవులు, కొండలను దాటకుండా ఎంతగా కప్పి పెట్టాలని పాలకులు చూస్తున్న దేశ ప్రజల ముందు అవి దేదీప్యమానంగా వెలుగ నున్నాయి. పార్టీలు, సంస్థలకతీతంగా ఆపరేషన్ కగార్ ని నిలిపివేయాలని, శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ ఒక ఉద్యమంగా ప్రారంభమైనాయి. ఇవి తెలుగు నేలను దాటి నిజమైన దేశభక్తియుత ఉద్యమంగా, కార్పొరేట్ వ్యతిరేక ప్రజా ఉద్యమంగా ఉద్యమంగ పరిణమించక తప్పదు. మళ్లీ ఒకసారి మీరు శాంతి చర్చల ప్రతినిధిగా వస్తే మీతో కరచాలనం చేద్దామని అనుకున్నాను. కానీ మీకిలా సంతాప సందేశం పంపాల్సి వస్తుందని ఊహించలేదు. మీ త్యాగం నిజమైన ప్రజా ఉద్యమాలకు రెట్టింపు శక్తిని ఇస్తుందని ఆశిస్తూ….
మీ స్మృతులు అజరామరణమని ప్రకటిస్తూ…..
(ఏలూరు జిల్లా, పెద్దాపాడు మండలం, సత్యవోలు గ్రామంలో కామ్రేడ్ సుధాకర్ సంస్మరణ సభ సందర్భంగా… జూన్ 19,2025)