వాడు…
తన వేలాది ఫాసిస్టు మూకలతో
చుట్టుముట్టి హతమార్చిన
నేలతల్లి బిడ్డల శవాల్ని
కన్నవాళ్లకు ఇవ్వనంటాడు.
వాడికి భయం..
వాడు పెట్టిన చిత్రహింసల ఆనవాళ్లు,
వాడు నరికిన కాళ్ళూ చేతులూ,
ఛిద్రం చేసిన జననాంగాలూ
వాడి గోముఖవ్యాఘ్ర కిరాతకత్వాన్ని
ప్రపంచానికి బహిర్గతం చేస్తాయని
భయం వాడికి….
హైందవధర్మ సంరక్షకుడిని అని చెప్పుకుంటూనే
పెదవులపై వేదాలు వల్లిస్తూనే
‘హైందవ సాంప్రదాయం ప్రకారం
కర్మకాండ జరుపుకుంటాం
మా బిడ్డల్ని కాల్చిన బూడిదైనా ఇమ్మంటే’…
వాడు ససేమిరా ఇవ్వనంటాడు..
ఈ గ్రీష్మ ఋతువులో బూడిదైన
నేలతల్లి బిడ్డలు
తిరిగిరాబోయే వసంతంలో
వేలకువేలుగా తిరిగిమళ్ళీ మొలకెత్తుతారని
చచ్చేంత భయం వాడికి…