వర్తమానం చదువుకోవాల్సిన ‘పోరాట పద్యం’

వర్తమానం అనేక సంఘర్షణల్లో కొట్టుమిట్టాడుతోంది. దేశాల మధ్య జాత్యాహంకారపు పుండు పొటమరిస్తోంది.జాతుల మధ్య మత ద్వేషం, సామ్రాజ్యవాద వ్యాపార ధోరణి అల్లుకొంటోంది. యుద్ధం. యుద్ధ వాతావరణం సామాన్య ప్రజలను దుఃఖంలో, దారిద్య్రంలో నిలబెడుతోంది. విద్వేష పూరిత రాజకీయాలు, ఆ రాజకీయాల నుంచి ఏర్పడుతున్న ప్రభుత్వాలకు దోపిడీదారుల కొమ్ముకాయడమే ఎజెండాగా మారుతోంది. అందుకు అవి ఆరాటపడుతున్నాయి. కుట్రలు చేయడంలో, కుహనా రాజకీయాలు సాగించడంలో ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. ఇందుకు సామాన్యుల పక్షంగా నిలబడే ప్రజా సంఘాలను, ప్రజాస్వామిక సంస్థలను, వ్యక్తులను ధ్వంసం చేయడంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఇది వర్తమాన దేశాల రాజకీయ కుటిల నీతిగా మారిపోయింది.మనదేశం ఇందుకు మినహాయింపేమీ కాదు.పార్టీలు,పాలకులు మారినా ప్రజల బాగోగులు విషయంలో అందరివీ ఒకటే పద్ధతి. కాకుంటే కొంచెం అటూ ఇటూ అంతే.

దేశంలో ప్రజల్ని పథకాల వల వేసి మాయచేస్తూ, దినానికొక కొత్త విషయంతోనో, కొత్త మాటతోనో, కొత్త దుర్ఘటనతోనో ప్రజల దృష్టి మళ్ళిస్తూ తమ పనుల్ని మూడో కంటికి తెలియకుండా పూర్తి చేసుకుంటున్నాయి. ప్రభుత్వరంగ సంస్థల్ని, ప్రభుత్వ రంగ ఆస్తులుని ప్రయివేటు వ్యక్తులకు కట్టబెడుతూ క్రమంగా కార్పోరేట్ శక్తులు బలపడేందుకు కృషి చేస్తున్నాయి. ఆధునిక ప్రభుత్వాలు కార్పోరేట్ కంపెనీల పనులు చక్కబెట్టే ఏజంట్లు అన్న మార్క్స్ మాట నిజమనిపిస్తోంది. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతున్న పట్టడం లేదు. పార్టీలు ఏవైనా, ఎన్ని ప్రభుత్వాలు మారినా పాలకులు సాగిస్తున్న ఈ మోసాలను ప్రశ్నించడమే నేరంగా పిలువబడుతోంది. ఎందుకని ఏమని ప్రశ్నించే వాళ్ళను,ప్రజల్ని చైతన్యం పరిచే వాళ్ళను దేశద్రోహ నేరం కింద జైళ్లలో వేయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయడంలేదు. మాట్లాడటానికి కూడా జంకే ఒక భయానక వాతావరణం నిర్మిస్తూ ప్రజల నుంచి, ప్రజా పక్షం నుంచి మాట్లాడే గొంతుకలను నిషేధిస్తున్నారు.

ఈ నిషేధకాలంలో, నిర్బంధపు రోజులలో ప్రజా పోరాటాల అవసరం చాలా ఉన్నది. దోపిడీ నుండి, సమాజిక అణచివేతల నుంచిప్రజల్ని విముక్తిగావించడానికి, ప్రజాస్వామికి విలువలు కాపాడటానికి, ప్రజల ఆస్తులు కాపాడుకోడానికి జనాన్ని కూడగట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఈ నేపథ్యం నుంచి మాట్లాడుతున్న కవిత్వం ‘పోరాట పద్యం’. కవి తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ తన మూడవ కవితా సంపుటి ‘పోరాట పద్యం’లో వర్తమాన ప్రపంచ,దేశ,రాష్ట్ర సమాజిక సందర్భాలనుంచి తన కవితా స్వరాన్ని వినిపిస్తున్నారు. సమకాలీన సామాజిక అంశాలను దళిత చైతన్యం నుంచి, దళిత స్త్రీ చైతన్యం నుంచి మాట్లాడుతున్నారు. పాలకులు ప్రభుత్వ రంగ సంస్థల్ని నష్టాల పేరుతో ప్రయివేటు వ్యక్తుల పరం చేస్తున్న కుట్రల తుట్టని కదిపే ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యంగా ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని ఆత్మగౌరవంతో నిర్మించబడిన విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రయివేటు చేతుల్లోకి ధారాదత్తం చేయడాన్ని ‘పోరాట పద్య ఏమున్నదిక్కడ’కవితలో పరిచయం చేస్తాడు. ఈ సంపుటిలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం పట్ల నిరసన ఉంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతు ఉద్యమాల పట్ల సానుభూతి ఉంది. దళిత బహుజనుల పట్ల ఆధిపత్య కుటుంబాలు అవలంబిస్తున్న సమాజిక వివక్ష గురించిన చర్చ ఉంది. దళితుల పట్ల చూపుతున్న వివక్ష, దాడులు గురించిన చర్చ ఉంది.

“బంగారు రంగస్థల పద్యాల్లా
గర్జించి గాండ్రించి పొగలు చిమ్మే భూముల్ని
దినం రోజున మరమరాల ఫలహారంలా పంచాక కూడా”అనడంలో…
“దేశానికి తెలుగు కవచకుండలాలు లేవు
దేశభక్తి నృత్యరూపకం మీద తెరలేపిన వాదానికి”
అనడంలో ఒక కదలికను అందించే చేతన ఉంది.

“ఒక శ్వాసను పీల్చాలంటే
ఒక ఊపిరిని అమ్మకానికి వదలాలి”వంటి వ్యక్తీకరణలు తో విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోడానికి చేయాల్సిన పోరాటాన్ని పురికొల్పడం ఉంది.ఒక్క విశాఖ పరిశ్రమ విషయమే కాదు వర్తమాన రాజకీయ, సమాజిక సంఘటనపట్ల దుర్మార్గాలపట్ల అప్రమత్తంగా ఉండడం అనే ఎరుక ఉంది.ప్రజల్లో పోరాట స్ఫూర్తి నింపే తపన ఉంది.

ఇటీవల దేశంలో ఎక్కువగా మాట్లాడబడుతున్న అంశం దేశభక్తి. దేశభక్తి అనే పూనకాన్ని జనం మెదళ్లలోకి ఎక్కించి,దేముడు,మతం అనే విశ్వాసాల, ఉద్వేగాల రంగు పులిమి ప్రజలల్లో చీలికలు తేవడం గమనిస్తున్నాం. ప్రజల్ని ,ప్రజా సంక్షేమాలను పట్టించుకోవాల్సింది వదిలి ఏదో ఒక నిస్తేజం లోకి,నిస్సహాయతలోకి సమాజం నెట్టివేయబడుతోంది. వీటన్నింటి నేపథ్యంలో పాలకుల వైఖరిని, పాలనను ఎండగడుతూ ఆలోచనల్ని పొగుచేసే పని ఈ కవిత్వంలో ఉంది.

పాలకులు సాగిస్తున్న విద్వేషపు రాజకీయాలను నిరసిస్తూ, దేశాన్ని మాతగా కొలుస్తూనే మహిళల పట్ల వ్యవహరిస్తున్న దుర్మార్గపు చర్యలను,మణిపూర్ విషాదం వంటి ఘటనను గురించి…

“ఒంటిమీద నూలుపోగు లేకుండా ఊడదీసి
వీధుల్లో ఊరేగిస్తే..
కళ్ళుమూసుకుంటే ఏడుకొండలు అడ్డనుకున్నాను గానీ
మదమెక్కిన మూకలు మీదెక్కి
చేతులు వెనక్కి విరిచి శరీరంతో ఆడుకున్నా
నిర్వేదంతో ఉండిపోయానుగానీ
నా మానాన్ని చిదిమేయమని సాటి ఆడోళ్ళు మగోళ్ళని
పందెం కోళ్ళలా ఎగదోసినందుకే కాస్త కష్టం వేసింది…” అంటూ సభ్యసమాజాన్ని సూటిగా గుండెల్లో గుచ్చి మాట్లాడాల్సిన అసభ్యతను గుర్తుకు తెస్తాడు. దేశవ్యాప్తంగా ఎందరో అట్టడుగు తల్లుల, ఆదివాసీ అమ్మల గుండె ఘోషను వినిపిస్తాడు. మామిడికాయలు కోసినదుకు ప్రభుత్వ ఆపీసులో ఉరివేయబడిన దళిత హత్యను నిరసిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న అనేక అన్యాయాలను మన ముందు నిలుపుతాడు. అడవిబిడ్డలి ఆదివాసీల పై సాగుతున్న ఘోరాలను పట్టించుకోమంటాడు. నిశ్శబ్దం వదిలి నిజాలు మాట్లాడాలి అంటాడు.మాట్లాడాల్సినవి మాట్లాడం కూడా పోరాటమే కదా! ఆ పోరాటాలకు ‘తలుపులు ఇంకా మూయబడలేదు’అన్నది కవి భావన.

మహనీయుల సిద్ధాంతాల్ని చంపేసి శిలావిగ్రహాలు పెడడుతున్న చోట, మట్టిపువ్వు సైతం కులం పాటకు పత్రహరితం అవుతున్న చోట ప్రజల్ని కాపాడుకోగలిగిన బుద్ధుడు, పూలే అంబేద్కర్ తాత్విక చింతనలను చదువుకోవాల్సిన అవసరాన్ని పోరాట పద్యం కవితా సంపుటిలో కవి బోధిస్తాడు. చర్చిస్తాడు. మిత్రునివలె సంభాషిస్తాడు.

ప్రజా చైతన్యం వొట్టిపోతున్న కాలంలో కొంత చేతన పులిమే పోరాట పద్యం వంటి పుస్తకాల కాలంగుండె చప్పున్ని మనం తప్పక వినాలి.

“నేనిప్పుడు
కొత్త వాదాలు మొదలుపెట్టదలచుకోలేదు
కొత్త అనువాదాలు చెయ్యదలచుకోలేదు
కొత్త అధ్యాయాలు చదువుకోదలచుకోలేదు.

చెవుల్లో సత్తులోహద్రావకం పోసి
తలలో చీలలు కొట్టిన కాలపు పిండాన్నే గానీ
విముక్తి శబ్దసౌందర్య పలావుధాన్యం పండించే
రుతువులో కళ్ళు తెరిచినవాణ్ణి ” అంటున్న ‘బహిరంగ ప్రకటన’ను చదువుకుందాం.

పూర్తిపేరు ప‌ల్లిప‌ట్టు నాగ‌రాజు. చిత్తూరు జిల్లా ‘అరవై నాలుగు పెద్దూరు’లో తెలుగు ఉపాధ్యాయుడు. శ్రీ వెంకటేశ్వర విశ్వ‌విద్యాల‌యంలో పీహెచ్‌డీ చేస్తున్నారు. ఆరువంద‌ల‌కు పైగా కవితలు, మినీ కవితలు, 6 కథలు రాశారు. చిత్తూరు జిల్లా ‘అభ్యుదయ రచయితల సంఘం’, ‘ఈ తరం కవితా వేదిక’లో కార్యవర్గ స‌భ్యుడిగా ప‌నిచేస్తున్నారు.

Leave a Reply