మరణానంతర సన్నివేశం : అదృశ్య కాంతి చే గెవారా

అక్టోబరు 8, 1967.. యూరో లోయ ప్రాంతంలో బొలీవియా సైనిక దళాలు గాయపడిన చే గెవారాని బందీగా పట్టుకున్నాయి. బందీగా పట్టుకున్న తర్వాత, లెఫ్టినెంట్ గ్యారీ ప్రాడో ఉన్నతాధికారులకు వరుసగా సందేశాలు పంపుతూనే వున్నాడు. టెలిగ్రాఫ్ ద్వారా రాత్రి 8.30 కి పంపిన సందేశం – ‘పాపా గాయపడ్డాడు’. రాత్రి 10.30 కి ఉన్నత సైనికాధికారులకు (జనరల్ ఒవాండో, జనరల్ లాఫుంటేలకి) పంపిన సందేశంలో ఒక సంకేత భాషని ప్రతిపాదించారు. ‘ఫెర్నాండో (చే): 500, సజీవం: 600. మొదటిది కేవలం మోర్స్ కోడ్ లోనే పంపాలి. మిగతావి రేడియో ద్వారా పంపించవచ్చు. చనిపోయాడు: 700). రాత్రి 11.30 కి వలేగ్రాండేలో ఉన్న కల్నల్ హొవాకిన్ జెంటేనో కి పైనుంచి ఆదేశం అందింది. ‘అధ్యక్షుడి ఉత్తర్వు – ఫెర్నాండో 700’. ఆ ఆదేశం తర్వాత చే ఆ ఆదేశం ని కాల్చి చంపేశారు.

అక్టోబరు 10 న పత్రికలు చే గెవారా మరణ వార్తను ఫొటోతో సహా ప్రచురించాయి. ‘చే గెవారా మరణ వార్త నిజమేననితోస్తున్నది. అదే నిజమైతే, ఆ మనిషి, ఆ గాథ ఇక ముగిసిపోయినట్లేన’ని న్యూయార్క్ టైమ్స్ పత్రిక వ్యాఖ్యానించింది. ‘ఇది కొలిమిలో నిప్పు రాజేసే సమయం, ఇప్పుడు మంటలు మాత్రమే కనిపించాల’నే జోస్ మార్తీ మాటలని చే గెవారా ప్రస్తావించాడు. నిప్పు రాజేసే కృషిలో చే వెలుతురుగా మారాడు. చే గెవారా మృతదేహాన్ని వాళ్ళు అదృశ్యం చేశారు. చే ఒక అదృశ్య కాంతిగా మారాడు. చే సర్వవ్యాపిత స్ఫూర్తిగా మారాడు. చే గురించి ఎంతైనా మాట్లాడుకోవచ్చు. ఆ నాడు పత్రికలు ప్రముఖంగా ప్రచురించిన పై ఫోటో గురించి కూడా మాట్లాడుకోవాలి.

చిత్ర కళా విమర్శకుడూ, రచయితా జాన్ బెర్జర్ చే గెవారాపై ఒక వ్యాసం రాశాడు. చే మృతదేహం పక్కన సైనికాధికారులు నిలుచున్న పై ఫోటోకి రెండు చిత్రాలతో ఉన్న సామ్యాన్ని ప్రస్తావించి వివరించాడు. అది చదవాల్సిన వ్యాసం. పదిహేడవ శతాబ్దపు డచ్ చిత్రకారుడు రెంబ్రాన్ట్ చిత్రం, ‘ది అనాటమీ లెసన్ ఆఫ్ ప్రొఫెసర్ టల్ప్’, ఇంకా, పదిహేనవ శతాబ్దపు ఇటాలియన్ చిత్రకారుడు ఆండ్రియా మాంటేనా క్రీస్తు మృతదేహాన్ని గీసిన చిత్రం, ఈ రెండింటి తోనూ చే గెవారా మృతదేహపు ఫోటోకి ఉన్న సామ్యాన్ని జాన్ బెర్జర్ ప్రస్తావించి, వివరించాడు.పదిహేడవ శతాబ్దపు డచ్ చిత్రకారుడు రెంబ్రాన్ట్ చిత్రం, ‘ది అనాటమీ లెసన్ ఆఫ్ ప్రొఫెసర్ టల్ప్’ అనే చిత్రంతో పోలికగురించి చెబుతూ, ‘మడత నలగని మంచి దుస్తులు ధరించి, ముక్కు దగ్గర కర్చీఫ్ పెట్టుకున్న బొలీవియా కల్నల్ ఇక్కడ ప్రొఫెసర్ స్థానాన్ని ఆక్రమించాడు. ప్రొఫెసర్ పక్కనున్న ఇద్దరు డాక్టర్ల మాదిరిగానే, ఆ అధికారి పక్కనున్న ఇద్దరు మనుషులు కూడా చే దేహాన్ని తీక్షణంగా, నిరాశక్తితో చూస్తున్నారు. రెంబ్రాన్ట్ చిత్రంలో కొంచెం ఎక్కువమంది ఉన్నమాట నిజమే. వలేగ్రాండేకొట్టంలో కూడా ఫోటోలోకి రాకుండా చాలామందే ఉండి ఉండాలి. రెండు చిత్రాల్లో సాపేక్షంగా కళేబరం ఉన్న స్థానం, వాటిలోని నిశ్చలతా – వీటిని బట్టి చూస్తే , రెండింటి మధ్యా చాలా సామ్యం ఉంది.’

‘ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. రెండు చిత్రాల లక్ష్యం ఒక్కటే. ఒక శవాన్ని ప్రదర్శించడం, దాన్ని వస్తుగతంగాపరిశీలించడం అనే వాటిని చూపడమే వాటి ప్రయోజనం. అంతేకాక, మృతదేహాన్ని అవి ఒక నమూనాగా చూపిస్తున్నాయి. మొదటిదానిలో లక్ష్యం వైద్యశాస్త్రాన్ని అభివృద్ధి చేయడం. కాగా, రెండవదాని లక్ష్యం ఒక రాజకీయ హెచ్చరిక చేయడం. చనిపోయిన వాళ్ళవీ, మారణకాండలో మృతిచెందిన వాళ్ళవి వేనవేల ఫోటోలు తీశారు. కానీవాటిని ఒక వస్తుగత పరిశీలనకి లోనుచేసే సందర్భాలు అరుదు. మనిషి చేతులలో లిగమెంట్లని టాక్టర్ టల్ప్ చూపిస్తున్నాడు. మనుషులందరి చేతులలో స్నాయువులు అలాగే ఉంటాయి. కర్చీఫ్ పెట్టుకున్న సైనిక కల్నల్,ఒక సుప్రసిద్ధగెరిల్లా నాయకుడికి దైవ నిర్ణయం ప్రకారం పట్టిన గతిని ప్రదర్శిస్తున్నాడు.’

‘నాకు ఇంకో చిత్రం కూడా గుర్తుకొస్తున్నది. (పదిహేనవ శతాబ్దపు ఇటాలియన్ చిత్రకారుడు ఆండ్రియా) మాంటేనా క్రీస్తుమృతదేహాన్ని గీసిన చిత్రం అది. అదిప్పుడు ఇటలీలోని బ్రెరా లో ఉంది. శరీరం మొత్తం ఒక సమతలంలో ఉంటుంది, కానీ పక్కనుంచి కాకుండా కాళ్ళవైపు నుంచి కనిపిస్తుంది. రెండు చిత్రాలలోనూ చేతులు ఒకే విధంగా, వేళ్ళు ఒకేభంగిమలో ఉన్నాయి. నడుము కింది భాగంలో దుస్తుల మధ్య కూడా సామ్యం ఉంది. మాంటెనా చిత్రంలో ఆ వస్త్రం నలిగిపోయి ఉంటే, రక్తంతో తడిసిన ఆలివ్ గ్రీన్ ప్యాంటుతో బటన్లు లేకుండా గెవారా దేహం కనిపిస్తుంది. రెండింటిలోనూ తల, కొంచెం పైకి ఎత్తి ఉంటుంది. పెదవులు, నోరు కూడా ఒకేలా ఉన్నాయి. క్రీస్తు దేహం కళ్ళుమూసుకుని ఉంటుంది, తన పక్కన ఇద్దరు విలపిస్తున్నారు. గెవారా కోసం విలపించే వాళ్ళు ఆ చిత్రాల్లో లేరు గనక తనకళ్ళు తెరుచుకునే ఉన్నాయి. కర్చీఫ్ పెట్టుకున్న కల్నల్, అమెరికా గూఢచారి, బొలీవియన్ సైనికులు, ఇంకా జర్నలిస్టులు గెవారా దేహం పక్కన నిలబడి ఉన్నారు. వాళ్లలో తన కోసం విలపించేవాళ్ళు లేరు. ఈ రెండు చిత్రాల మధ్య కూడా సామ్యం ఉండడంలో ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. చనిపోయిన నేరస్తులని ప్రదర్శించే పద్ధతులు అనేకం ఉన్నాయి.’

II

మృతదేహాలు చరిత్రకి సాక్ష్యాలు. మరణానంతర కర్మకాండలు, క్రతువులు సాంఘిక, మత విశ్వాసాలకీ, నాగరికత పరిణామానికీ గుర్తులు.

చే శవానికి స్నానం చేయించిన బొలీవియా నర్స్ తాను స్నానం చేయిస్తుంటే యేసు క్రీస్తు అంతిమ సంస్కారాలను జరుపుతున్నట్లు అనిపించించిందని చెప్పింది. ‘అప్పుడప్పుడూ చే నా కలలోకి వస్తుంటాడు. నాకు ఆటను సజీవంగా కనిపిస్తాడు. నా దుర్భరమైన పేదరికం నుంచి నన్ను దూరంగా తీసుకెళ్తానని చే అంటుంటాడ’ని ఆమె చెబుతుంది.

విప్లవవాది చే గెవారా మృతదేహం పట్ల సిఐఎ, బొలీవియా పాలకులు అనుసరించిన వైఖరి వాళ్ళ రాజకీయ వైఖరిని ప్రతిబింబించేది కూడా. వాళ్ళు చే గెవారా మృతదేహాన్ని గుర్తు తెలియకుండా ఖననం చేసేశారు. తన మరణాన్ని ధృవీకరించుకోవడం కోసం, వేలిముద్రల కోసం చేతులని నరికివేశారు. తన మృతదేహాన్ని గుర్తు తెలియని చోటుకు తరలించి, తనని దహనం చేశారా, ఖననం చేశారా అన్నది స్పష్టంగా చెప్పకుండా రహస్యంగా ఉంచారు.

చే గెవారా ని హత్య చేసి, రహస్యంగా దహనం/ ఖననం చేసిన ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత, ఆనాడు హత్యలో పాల్గొన్న సైనికాధికారి తనని ఖననం చేసిన స్థలాన్ని న్యూయార్క్ టైమ్స్ పత్రిక విలేఖరి జాన్ లీ ఆండర్సన్ కి వెల్లడించాడు. చే గెవారా హత్యకు ఆదేశాలు ఇచ్చిన బొలీవియా అధ్యక్షుడు తనని దహనం చేశామని చెప్పాడు. ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత, తనని ఖననం చేసిన స్థలం ఆచూకీ తెలిసిన తర్వాత, బొలీవియా మంత్రి మారియో రుయేడా పెన్యా మాటలలో ‘ఆ రాత్రి అంతా రగిలిన జ్వాలలు బహుశా ఎర్నెస్టో చే గెవారా అస్థికలని దహనం చేయలేకపోయాయి. అతని స్ఫూర్తినీ, ఆ తరపు ఉటోపియన్ ఆదర్శాలనీ ఆ మంటలు నాశనం చేయలేకపోయాయి.’

III

మెక్సికన్ రచయిత పాకో ఇగ్నాసియో టైబో II రాసిన జీవిత చరిత్రలో చే చివరి క్షణాల గురించి ఇలా రాశాడు, ‘ఆ ఉదయం, చే ని చంపడానికి ముందుకు వచ్చేవాళ్ళు రాయాలని అయోరో అడిగాడు. సార్జంట్ మేజర్ మారియో టెరాన్ ముందుకొచ్చాడని ఒక సైనికుడు చెప్పాడు… అతను కొంచెం తాగి ఉన్నాడు…
టెరాన్ మాటలలో, ‘నేను అక్కడికి వెళ్లేసరికి చే బెంచ్ పై కూర్చుని ఉన్నాడు. ‘నువ్వు నన్ను చంపడానికి వచ్చావు కదా అని అడిగాడు. నేను తనని కాల్చలేక పోయాను. ‘భయపడకు, నువ్వు ఒక మనిషిని చంపబోతున్నావు. నేను తలుపుల వైపు ఒక అడుగు వెనక్కి వేసి, కళ్ళు మూసుకుని మొదటి తూటా పేల్చాను. కళ్ళకి తగిలి చే కింద పడిపోయాడు. నెప్పితో బాధపడుతున్నాడు. రక్తం ధారగా కారుతుంది. నాకు ధైర్యం వచ్చింది. చేయి, భుజం, గుండెల మీద రెండోసారి కాల్చాను.’

టెరానో విషయం తర్వాత ఏం జరిగిందో కూడా మనం చెప్పుకోవాలి. ఒక గడియారంలో పాటు అమెరికా వెస్ట్ పాయింట్మిలిటరీ అకాడమీలో సార్జంట్ మేజర్ హోదాకి అవసరమైన శిక్షణ ఇస్తామని టెరానోకి వాగ్దానం చేశారు కానీ, ఆవాగ్దానాలు ఏవీ నెరవేర్చలేదు.

కాగా, అక్టోబరు 2, 2006 నాటి బిబిసి వార్తా కథనాన్ని ఉటంకిస్తూ మంత్లీ రివ్యూ పత్రిక ఇలా పేర్కొన్నది. చే హంతకుడికి చికిత్స చేసిన క్యూబన్లు ‘బొలీవియాలో పనిచేస్తున్న క్యూబా డాక్టర్లు, 1967 లో క్యూబా విప్లవ నాయకుడు చే గెవారాను హత్యచేసిన వ్యక్తి కంటిచూపును కాపాడారు. ఈ విషయాన్ని క్యూబా పత్రికలు తెలియజేశాయి. బొలీవియా తూర్పు ప్రాంత లోయలో బందీగాపట్టుకున్న తర్వాత చే గెవారాను మేరియో టెరానో అనే సార్జంట్ కాల్చి చంపాడు. చే గెవారా 40 వ వర్ధంతి సందర్భంగాఅక్టోబరు 9 న క్యూబా పత్రికలు ఈ వార్తను ప్రసారం చేశాయి. లాటి అమెరికాలో క్యూబా ఉచిత కంటి చికిత్స కార్యక్రంలోభాగంగా, మేరియో టెరానో కళ్ళలోని శుక్లాలను క్యూబా డాక్టర్లు శస్త్ర చికిత్స ద్వారా తొలగించారు. ఈ శస్త్ర చికిత్స ఏడాదిక్రితం జరిగింది. తన తండ్రి కళ్ళను కాపాడినందుకు క్యూబా డాక్టర్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ టెరానో కొడుకుబొలీవియా పత్రికలలో ఉత్తరం రాయడంతో ఈ విషయం మొదటిసారిగా వెలుగులోకి వచ్చింది.’
‘చే గెవారా 40 వ వర్ధంతి కార్యక్రమాలలో భాగంగా క్యూబా పత్రికలు దీనిని ప్రచురించాయి. ‘ఒక కలనీ, ఒక ఆలోచననీఅంతంచేయడానికి టెరానో ప్రయత్నం చేసిన నలభై సంవత్సరాల తర్వాత, చే మరొక యుద్ధాన్ని గెలవడానికి తిరిగివచ్చాడ’ని క్యూబా కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రిక గ్రాన్మా ప్రకటించింది.’
‘ఇప్పుడు వయసు మళ్ళిన టెరానో మళ్ళీ ఆకాశ వర్ణాలనీ, అడవిలో రంగులనీ చూడగలడు. మనవళ్ళు, మనవరాళ్ల చిరునవ్వులని తిలకించగలడు. ఫుట్ బాల్ ఆటనీ చూడగలడు’

IV

చే చనిపోయిన 30 సంవత్సరాల తర్వాత అర్జెంటీనా దర్శకుడు లియాండ్రో కాట్జ్ తనపై 30 నిమిషాల సినిమా తీశాడు. చేగెవారా మృత దేహాన్ని ఫోటో తీసిన ఫ్రెడ్డీ అల్బోర్టా ని అందులో ఇంటర్వ్యూ చేశాడు. జాన్ బెర్జర్ పోల్చిన ఫోటోల గురించితెలుసా అని అడిగాడు. తెలియదు, కానీ తాను తీయబోతున్న ఫోటోలు మామూలు ఫోటోలు కావన్న ఎరుక అల్బోర్టా కివుంది. అర్జెంటీనా రచయిత జార్జ్ లూయీ బోర్హెస్ రాసిన రెండు పేరాల అతి చిన్న కథ ‘ది విట్నెస్’ నీ, 1935 లోచనిపోయిన అర్జెంటీనా గీత రచయిత కార్లోస్ గార్డెల్ పాట ‘ది డే యు లవ్ మీ’ నీ అందులో ఉపయోగించాడు. చే హత్యలో ఇమిడి వున్న రాజకీయ వాస్తవికత పట్ల మనం స్పందించేలా చేస్తాడు. ముగింపుగా, చే గురించి లూయీగొంజాలెస్, నియంత్రణ సాంచెజ్ సాలాజార్ పుస్తకం, ‘ది గ్రేట్ రెబెల్’ లో మాటలని ఉటంకిస్తాడు, “కాల్చేశారు, మరణశిక్ష విధించారు, హత్య చేశారు, అంతం చేశారు – ఇలా వాస్తవాలకి ఎలాంటి వ్యాఖ్యానం చెప్పుకున్నా, మన స్వీయాత్మకతని అధిగమించిన మానవ సత్యం ఒకటి ముందుకొస్తుంది. వ్యాధిగ్రస్తుడు, గాయపడిన ఖైదీ, ఒకమనిషిని ఎలాంటి న్యాయానికి కట్టుబడకుండా చంపేశారు. తనని కాపాడటమే బాధ్యత అయిన వాళ్ళ చేతుల్లో తనని హతమార్చారు. నైతిక న్యాయం, న్యాయ సూత్రాలకు మించి, ఒక ప్రాధమిక యుద్ధ నియమాన్ని సైతం ఉల్లంఘించారు.”

పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాలో. ఇంజనీరింగ్ చదువూ, ప్రస్తుత ఉద్యోగమూ హైదరాబాద్ లో. అప్పుడప్పుడూ రాసే కవిత్వంతో పాటు, సాహిత్యం, రాజకీయాలు, ఆర్థిక అంశాలు, టెక్నాలజీ ధోరణుల పైన విశ్లేషణ వ్యాసాలు, తెలుగు, ఇంగ్లీషు అనువాదాలు వివిధ పత్రికలలోనూ, పుస్తకాలలోనూ అచ్చయ్యాయి.

Leave a Reply