సింగరేణి కార్మిక సమాఖ్య కార్యకర్తగా గురజాల రవీందర్ నడిచిన తొవ్వ యిది. బొగ్గుగని కార్మికులు తమ చెమటతో నిర్మించుకొన్న తొవ్వ యిది. ఏ దిక్కూ లేని చోట దారులు పరవడం అంత సులువేం కాదు. దారి కూడా సుగమం కాదు. దారి పొడవునా ప్రాణాలు పణంగా పెట్టిన కార్మికుల పోరాటాలున్నాయి. వెచ్చటి నెత్తురు సాక పోసిన ఆనవాళ్ళున్నాయి. అమరుల త్యాగాలున్నాయి. చీకటి గుయ్యారం లాంటి బావుల్లో కార్మికులు గాలి కోసం వెలుతురు కోసం నీళ్ల కోసం భద్రత కోసం కనీస సదుపాయాల కోసం సమ్మెలు కట్టారు. బావుల బయట యిళ్ళ కోసం వైద్యం కోసం మెరుగైన బతుకుల కోసం తాత్కాలిక వుద్యోగాల క్రమబద్ధీకరణ కోసం వేతనాల సవరణ కోసం మిలిటెంట్ కార్యక్రమాలు చేపట్టారు. వీటన్నింటి వెనక రాడికల్స్ రాజకీయ చైతన్యం వుంది. నిర్మించిన వ్యూహాలున్నాయి. వాటన్నింటిలో రవీందర్ భాగమయ్యాడు.
సికాస ‘బొగ్గు మింగి బొగ్గు యేరిగే’ కార్మికుల బతుకుల్లో గొప్ప చైతన్యాన్ని తెచ్చింది. కార్మికవాడలో మనుషుల జీవిత గమనాన్ని మార్చింది. మానవ సంబంధాలను మెరుగుపరచింది. మట్టి ముద్దల్లాంటి మనుషుల్ని ఆలోచనాపరులుగా క్రియా శీలురుగా మార్చింది. బండ కింది చీకటి బతుకుల్లో వెలుగులు నింపింది. ‘కోల్ బెల్ట్ లో’ నిప్పు రగిల్చింది. తొలిసారిగా కార్మికోద్యమ సాహిత్యానికి స్ఫూర్తినిచ్చింది. కార్మికుల్లోంచి కొత్త రచయితలు పుట్టుకొచ్చి సెమ్మాసు పట్టిన చేతులతో కలం పట్టారు. కోల్కట్టర్లు కథలు అల్లారు. బదిలీ పిల్లర్లు పాటలు కట్టారు. ఈ క్రమంలో వచ్చినవే – బొగ్గుపొరల్లో.., నల్ల కలువలు, నల్ల వజ్రం, బండకింది బతుకులు వంటి రచనలు.
కంపెనీ యాజమాన్యపు దోపిడీకి వ్యతిరేకంగా, కార్మికుల సంక్షేమాన్ని తుంగలోతొక్కి (వామపక్ష కార్మిక సంఘాలతో సహా) ట్రేడ్ యూనియనిజంలో కూరుకుపోయిన జాతీయ కార్మిక సంఘాల దివాలాకోరు విధానాలను నిరసిస్తూ, గనుల లోపల, కార్మికుల కాలనీలో రౌడీయిజానికి విరుద్ధంగా రాడికల్స్ నాయకత్వంలో కార్మికులు అనేక పోరాట రూపాల్ని రూపొందించుకున్నారు. అనేక గెలుపు ఓటముల అనుభవాలతో మస్టర్ కోతకి వ్యతిరేకంగా చేపట్టిన 56 రోజుల సమ్మె సింగరేణిలోనే కాదు; మొత్తం దేశ కార్మికోద్యమ చరిత్రలోనే గొప్ప మలుపు. బొగ్గు గనుల్లో సికాస తిరుగులేని కార్మిక సంఘంగా అవతరించింది.
ఇదంతా కాల్పనిక సాహిత్యంలోకి తర్జుమా అయ్యింది. చరిత్రలోకి యెక్కింది. సికాస యేర్పటానికి ముందు కార్మికుల జీవన గమనంలో చోటుచేసుకున్న గుణాత్మకమైన పరిణామాన్ని అద్భుతంగా చిత్రించిన ‘సైరన్’ (అల్లం రాజయ్య ), గజ్జెల లక్ష్మమ్మ బిడ్డలు గంగారాం సరోజల అమరత్వం నేపథ్యంగా కాలరీలో రాజకీయ చలనాన్ని వుద్వేగ భరితంగా కథనం చేసిన ‘తల్లులు బిడ్డలు’ (హుస్సేన్) నిలువెత్తు నిప్పుల స్తూపంగా వెలిగిన సమ్మిరెడ్డి జీవితం చుట్టూ అల్లిన ‘వీరుడు’ ( పి చంద్ ) యీ మూడు నవలలూ యిటీవలే మొత్తం దేశానికే దిక్సూచిగా నడిచిన ‘సింగరేణి పోరాటాల నెత్తుటి త్యాగాల’ కార్మికోద్యమ చరిత్రని పూసగుచ్చినట్టు నమోదు చేశాయి. ఆ క్రమంలో వచ్చిందే రవీందర్ రాసిన ‘సింగరేణి కార్మికోద్యమ జ్ఞాపకాలు : బొగ్గురవ్వలు’. రవీందర్ ఆత్మకథే అయినప్పటికీ సృజనాత్మక రచనకు సరితూగే పుస్తకం బొగ్గు రవ్వలు. తెలుగులో ప ర్ స్పె క్టి వ్స్ ప్రచురణగా(2024) వెలువడ్డ సంవత్సరానికే ఇంగ్లీషులోకి అనువాదమవ్వడం గొప్ప విశేషం. ప్రచురణ రంగంలో గుర్తుంచుకోదగ్గ ఘట్టం యిది.
చరిత్ర రచనకైనా స్వీయ చరిత్ర రచనకైనా రచయితకు వొక నిర్దిష్టమైన దృక్పధం ఉండాలి. అది ఆబ్జెక్టివ్ గా ఉండాలి. చరిత్రను కేవలం ఘటనల సమాహారంగా గాక సమగ్రంగా చూడటానికి రచయితకుండే ప్రాపంచిక దృక్పథమే స్పష్టమైన చూపునిస్తుంది. సరైన దారిలో నడిపిస్తుంది. ఈ వెలుగులోనే రవీందర్ జీవిత క్రమాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు అవి అతని వ్యక్తిగత జ్ఞాపకాలుగానో కేవలం స్వీయ జీవితానుభవాలుగానో సంఘటనలుగానో మిగిలిపోవు. ఒక నిర్దిష్ట స్థల కాలాలకు చెందిన చరిత్రలో భాగమమౌతాయి. రాజకీయ ఆచరణలో దారి చూపిన సైద్ధాంతిక జ్ఞానానికి ఆకారాలౌతాయి. ముందు తరానికి తొవ్వ దివ్వెలౌతాయి. సికాస నాయకత్వంలో మార్క్సిజ లెనినిజం మావో ఆలోచనా విధానం అందించిన రాజకీయ అవగాహనతో కూర్చిన రవీందర్ ‘ఆత్మకథ’ జ్ఞాపక శకలాలుగా రాసినప్పటికీ రాడికల్ వుద్యమంలో పోరాడిన కార్యకర్తల ప్రత్యక్ష అనుభవాలను నిర్దిష్టంగా రికార్డు చేయడం వల్ల బొగ్గు గని సాహిత్యంలో ప్రత్యేకంగా నిలుస్తుంది.
రామకృష్ణాపూర్ ఎం కె 4 ఇంక్లైన్ గనిలో బదిలీ ఫిల్లర్ గా మొదలైన రవీందర్ సింగరేణిలో మిలిటెంట్ కార్మికోద్యమానికి బీజాలు వేసిన రాడికల్ కామ్రేడ్ గజ్జెల గంగారం మార్గదర్శకత్వంలో రాజకీయ పాఠాలు నేర్చుకున్నాడు. నల్లా ఆదిరెడ్డి (కామ్రేడ్ రఘు) కటకం సుదర్శన్ (కామ్రేడ్ ఆనంద్) సమ్మిరెడ్డి (కామ్రేడ్ రమాకాంత్) ల సాహచర్యంలో నిబద్ధత గల కార్యకర్తగా రాటుతేలాడు. హుస్సేన్ అడుగుజాడల్లో రవీందర్ సికాస నాయకత్వ బాధ్యతలు నిర్వహించాడు. రామకృష్ణా పూర్ మందమర్రి నుంచి బెల్లంపల్లి శ్రీరాం పూర్ గోదావరిఖని .. మణుగూరు వరకు బయటి బొగ్గు గనుల్లో సైతం సికాస నిప్పు రవ్వ వ్యాపించడానికి దోహదం చేశాడు. కోల్ వాయిస్ వినిపించాడు. యాజమాన్యం కంట్లో నలుసయ్యాడు. పోలీసుల వేటకు టార్గెట్ అయ్యాడు. ఈ క్రమంలో అక్రమ కేసుల్లో యిరుక్కున్నాడు. తీవ్ర నిర్బంధాలను యెదుర్కొన్నాడు. కుటుంబానికి దూరమై అజ్ఞాతంలో వున్నాడు. అజ్ఞాతంలో వున్నప్పుడే తండ్రిని కోల్పోయాడు. ఆయన చివరి చూపులక్కూడా పోలేకపోయాడు. లాకప్ లో చిత్రహింసలు అనుభవించాడు. జైలు జీవితం గడిపాడు. ప్రతి సందర్భాన్నీ అతను కొత్త వుద్యమ పాఠాలు నేర్చుకోడానికే వినియోగించుకున్నాడు.
ఈ మధ్యలో రైతుకూలీ సంఘంలో పనిచేస్తున్న మేనమరదలు సరళతో వివాహం, పట్టుమని పదినాళ్ళు కూడా కలిసుండకుండానే జైలు, తర్వాత బెయిలు, దంపతులు ఇద్దరూ విడివిడిగా కలిసి వుద్యమజీవితంలో యెదుర్కొన్న నిర్బంధం, వొద్దనుకున్నా బిడ్డ పుట్టడం, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ యేది వ్యక్తిగతమో యేది మంది పనో తెలీనంతగా కలిసిపోయిన కఠోర జీవితం అనుభవిస్తూనే సహచరులిద్దరూ అంకిత భావంతో వుద్యమంలో పనిచేయడానికి సిద్ధమయ్యారు. రవీందర్ తండ్రి చనిపోతే నిండు నెలలతో వున్న సరళ మామను చూడటానికి పీకలలోతు మానేరు వాగును దాటిన సందర్భం మండుటెండల్లో దాహార్తి తీర్చుకోడానికి రవీందర్ మిత్రుడితో మురుగ్గుంటలో నీళ్లు తాగిన సన్నివేశం కంటనీరు పెట్టిస్తాయి. విప్లవం విందు భోజనం కాదని యీ కథనాల్లో యెందరో కార్యకర్తల కఠిన జీవితాలు నిరూపించాయి.
సరళ రవీందర్ దంపతులిద్దరూ కలిసి పూర్తికాలం కార్యకర్తలుగా పనిచేయడానికి పార్టీ అనుమతి లభించని కారణంగా తాము బయటికి రావాల్సివచ్చింది అన్న రవీందర్ మాట వివాదానికి దారితీసింది. ఉద్యమంలో పార్టీ అవసరాలకు ప్రాథమ్యం యివ్వాలా వ్యక్తుల వుద్వేగాలకు ఆలోచనలకు ప్రాధాన్యం యివ్వాలా అని చర్చ జరిగింది. స్థలకాలాల పరిస్థితికి అనుగుణంగా విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు వుంటాయి. ఈ గమనింపు రచయితకు వుందనే అతని మాటల ద్వారా తెలుస్తుంది. కాలం గడిచే కొద్దీ నెపం రూపం మారుతుంది. కొత్త అర్థం స్ఫురిస్తుంది. ఎనిమిది సంవత్సరాల (1978-86) పాటు మిలిటెంట్ కార్యకర్తగా గడిపిన రవీందర్ స్వీయ చరిత్ర జడ్జిమెంట్ కోరుతూ పాఠకుల ముందుంది. అంతిమ తీర్పరులు ప్రజలే.
‘బొగ్గు రవ్వలు’ కేవలం రవీందర్ వొక్కడి నడక కాదు. అతని వ్యక్తిగత స్వోత్కర్ష అసలే కాదు. బొగ్గు పొరల్లో నిప్పై మండిన వేలాది మంది చైతన్యానికి ప్రతీక. ఒక నిర్మాణంలో నిబద్ధతతో రూపుదిద్దుకున్న వుమ్మడి వ్యక్తిత్వానికి సూచిక. చరిత్ర నిర్మాణంలో భాగమై కాలం వెంట తండ్లాడిన వుత్పత్తి శక్తుల సామూహిక స్మృతి శకలాల దొంతర. ఒక వెలుగు కోసం, మానవీయ సమాజ పునర్నిర్మాణం కోసం ప్రత్యామ్నాయ ఆచరణలో కదంతొక్కి నిలబడ్డ కార్మిక యోధుల ఆలోచనల పరంపర.
అడవులు గనులు నదులు సముద్రాలు.. మొత్తం సహజ వనరుల్ని సామాజిక సంపదని కార్పొరేట్ వ్యక్తుల పరం చేసేందుకు ప్రభుత్వం దళారి పాత్ర పోషిస్తున్న తరుణంలో, అందుకు సొంత పౌరుల పైనే అమానవీయమైన సైనిక చర్యకు తెగబడిన సంక్షోభ కాలంలో, ఓసీ గనుల తవ్వకంలో వూళ్లకు వూళ్ళు మాయమైపోయి వేలాది మంది ప్రజలు భూనిర్వాసితులౌతున్న సందర్భంలో, దశాబ్దాల తరబడి ప్రాణాలు పణంగా పెట్టి పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులు చట్టబద్ధంగా హరించు కుపోతున్న సంక్లిష్ట సమయంలో యాభై ఏళ్ల తర్వాత కూడా సికాస చరిత్ర యేదో వొక రూపంలో పోరాట శక్తులకు స్ఫూర్తినిస్తూనే వుంది. అందుకు తన వంతుగా దోహదం చేస్తున్నందుకు గురజాల రవీందర్ కు వుద్యమాభినందనలు తెలుపుతూ…
ప్రేమతో
ఎ. కె. ప్రభాకర్