ప్రకృతిపాఠం

*చెట్టు*
నేను
ప్రశాంతంగా కూర్చొని
కవిత రాస్తుంటే..
నా వెనుకన నిల్చొని
ఆకుల చేతులతో
నను నిమిరేస్తూ,
గాలుల శబ్దంతో
నను తడిమేస్తూ
ఓ పులకింతల కావ్యాన్ని
నాకు పాఠంగా చెబుతోంది..

*గాలి*
చల్లని తాకిడితో
ఓ తాదాత్మ్యాన్ని
వెచ్చని తాకిడితో
ఓ ఉత్తేజాన్ని
కలిగిస్తుంటుంది..
రగిలిస్తుంటుంది..
కిందపడేలా చేస్తుంది
పడినా లేవమని చెబుతుంది
నిరంతరం వెన్నుతట్టి
ప్రోత్సహించే
ఆత్మీయతను, స్నేహాన్ని
నాకు పాఠంగా చెబుతోంది..

*సెలయేరు*
గలగలల శబ్దంతో
అడ్డులేకుండా ముందుకెళ్ళమని,
బండరాళ్ళను, ముళ్ళపొదలను
దాటుకుంటూ సాగిపొమ్మని
బోధిస్తుంది..
కడలిలాంటి జీవితాన్ని
ఎదురీదే రహస్యాలపాఠం
నాకు పదే పదే చెబుతూ ఉంటుంది..

*వెలుతురు*
నాలో ఓ కొత్తదనాన్ని
గుండెల్లో ఓ ఉల్లాసాన్ని
కలంలో ఓ ఉత్తేజాన్ని
నింపేస్తుంటుంది..
లోపలి చిరాకునంతా
బయటకు వెళ్ళగొట్టి
రోజూ రోజూ నన్ను
తనకు ప్రతిబింబంలా మార్చేసుకుంటుంది..
లోకాన్ని మనకు
మనల్ని లోకానికి
చూపించే అద్దాన్ని పాఠంగా
నాకు అందిస్తూనే ఉంటుంది..

*చీకటి*
నాలో నిరాశకు, నిరూత్సాహానికి
అదొక ప్రతీక..
నా కోపానికి, దు:ఖానికి
అదొక సూచిక..
తరిమేసిన ప్రతీసారి
నన్ను ఆవరించాలని చూస్తుంటుంది..
వదిలించుకోవాలనుకున్న
ప్రతీసారి
నన్ను చుట్టేయాలని చూస్తుంటుంది..
నిశ్శబ్దాన్ని
నిశ్శబ్దంలో ప్రళయాన్ని
నాకు పాఠంలా చెబుతుంటుంది..

ఈ ప్రకృతి అంతా
నాకు పాఠాలు చెప్పి
పరీక్ష పెట్టేసింది.
ఆ పరీక్ష ఫలితం..
నా ఈ కవిత్వం..

కవి, పరిశోధకుడు, సినీగీతరచయిత.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా (ప్రస్తుత జగిత్యాల జిల్లా) లో పుట్టారు. తల్లిదండ్రులు తిరునగరి శ్రీనివాసస్వామి, మాధవి. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో ఎం.ఏ తెలుగు పూర్తి చేశారు. ఎం.ఏ లో విశ్వవిద్యాలయంలో ప్రథమస్థానంలో ఉత్తీర్ణత పొంది స్వర్ణపతకాన్ని సాధించారు. అదే విశ్వవిద్యాలయం నుండి ఆచార్య సూర్యాధనంజయ్ గారి పర్యవేక్షణలో 'దాశరథి సినిమాపాటల్లో కవితాత్మకత' అనే అంశంపై పిహెచ్.డి చేసి డాక్టరేట్ పట్టా పొందారు. రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం బాసర(ఐఐఐటి)లో, ప్రభుత్వ డిగ్రీ&పి.జి. కళాశాల కోరుట్లలోను, హైదరాబాద్ లోను తెలుగు ప్రొఫెసర్ గా కొంతకాలం పనిచేశారు. ప్రస్తుతం నిజాం కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.

సాహిత్యకృషి:

'అక్షరశిఖరం'(గేయసంపుటి-2019), 'చైతన్యలహరి'(తెలుగు గజళ్ళు-2022), 'విశ్వవీణ'(తెలుగు రుబాయీలు-2023) 'సినీగీతావరణం(వ్యాససంకలనం-సంపాదకత్వం-2022), 'జ్ఞానపీఠత్రయం'(వ్యాససంకలనం-సహ సంపాదకత్వం-2023) పుస్తకాలు ప్రచురితమయ్యాయి. వచనకవితాసంపుటి ముద్రణలో ఉంది.

ఆకాశవాణి హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్,నిజామాబాద్, కొత్తగూడెం కేంద్రాల్లో పలు కవితాగానాలు, ప్రసంగాలు చేశారు. దాదాపు జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో 70కి పైగా పత్రసమర్పణలు చేశారు. అనేక దిన,వార,మాసపత్రికల్లో 300 కి పైగా కవితలు ప్రచురితమయ్యాయి. 2021 లో 'ఒక్కడే నెం.1' సినిమా ద్వారా గీతరచయితగా ప్రవేశించి 50కి పైగా సినిమాపాటలు రాశారు. రాష్ట్ర, జాతీయస్థాయిల్లో పలు పురస్కారాలు అందుకున్నారు.

Leave a Reply