కాలాన్ని మేల్కొపే సాహిత్యాన్ని సమాజం నెత్తిన పెట్టుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మాట అన్నపుడు అసలు మేల్కొపు అని దేనిని అంటాం? అనే ప్రశ్న ఎదురవుతుంది. జీవిస్తున్న కాలంలో, సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనల పట్ల, వాస్తవాల పట్ల మెలుకువతో ఉండేలా చేయడమే మేల్కొపు కదా! ఆధిపత్య వర్గాల దోపిడి నుంచి సామాన్యులను, అన్యాయాల నుంచి న్యాయాన్ని, అసత్యాల నుంచి సత్యాన్ని కాపాడుకోవడానికి ప్రజల్ని అప్రమత్తంగా ఉంచడం, సమాజాన్ని ఆవరిస్తున్న దుర్మార్గాల నుంచి తమకు తాముగా బయటబడే ఎరుకను అందివ్వడమే మేల్కొపు కదా. ఎక్కడైనా ఎప్పుడైనా సాహిత్యం సామాజిక మేలు మలుపులకు కీలు చీల అవుతుంది. ఆ స్పృహలో సామాజిక బాధ్యతను మనసుకెత్తుకుని రాస్తున్న కవి గార శ్రీ రామ్మూర్తి. వీరి కలం పేరు నిజం. నిజంగా సమకాలీన నిజాలను, సామాజిక వాస్తవికతను నిశితంగా పరిశీలిస్తూ హృదయ భాషలో అనువదించిన కవిత్వమతనిది.
నిజం గారు దశాబ్దాల సాహిత్య జీవితంలో ఎర్రమందారాలు, నిజం గీతాలు, నివురు, నాలుగో పాదం,అలలు, బూడిద చెట్ల పూలు, రంగు రంగుల సూర్యోదయాలు వంటి కవితా సంపుటాలను వెలువరించారు. సీనియర్ పాత్రికేయులుగా సమాజాన్ని బాధ్యతతో పట్టించుకుని, కలాన్ని జీవిస్తున్న కాలం యొక్క గళంగా వినిపిస్తున్నారు. ఆ క్రమంలో వారు ఇటీవలి ‘బూడిద చెట్ల పూలు’ కవిత్వం వెలువరించారు. ‘బూడిద చెట్ల పూలు ‘వస్తువు పరంగానూ, అభివ్యక్తి పరంగానూ ముందుమాటలో ఎలనాగ గారు అన్నట్టు ” శిల్ప సమన్విత కవిత్వం” నిజంగారు తన పాత్రికేయ వృత్తి, సాహిత్య జీవిత అనుభవాల నుంచి ఈ సమాజాన్ని తానెలా దర్శిస్తున్నాడో ఈ కవిత్వంలో అర్థం చేసుకుంటాం. వాక్యం వాక్యం కవిత్వమై పలవరించే కవి హృదయాన్ని మనం వింటాం. ప్రపచాన్ని ఒక కుదుపు కుదిపిన కరోనా కష్టకాలాన్ని, ఆ కష్టకాలంలో స్తంభించిపోయిన జన సమూహాల దుఃఖాన్ని, దిగుళ్లను రికార్డు చేసిన కవిత్వం ఇది. అంతేకాదు కరోనా విపత్తు కాలంలో జరిగిన అనేక అమానవీయ సంఘటనల్ని తదనంతర రాజకీయాలను, వాటి కుటిల స్వభావాలను అండర్ కరెంట్ గా ఈ కవితా సంపుటి చర్చిస్తుంది.చదవండి.
“దిక్కులు పిక్కటిల్లుతున్నా
తనకు వినిపించని అనునిత్య శోకగీతం
కూలిన పచ్చని చెట్టు మీది
కుఠార సింహాసనంపై
యోగాచార్యుని చిద్విలాసముద్ర
కొంగరంగు గెడ్డంలో మెరుస్తున్న
కాటిమెప్పుల కీర్తిచంద్రికలు
శవాలను మోస్తూ జీవచ్ఛవాలను చూసి
వొలుకుతున్న కన్నులతో
ప్రాణాలరచేత పట్టుకొని
పరుగులుతీస్తున్న నదులు
గుండెపగిలిన జెండాకింద
వూపిరీపాయల్లో
నాగులు నర్తిస్తున్న చిద్విషాదనేల ” అంటాడు. “కొంగ రంగస్థలం” కవితలో. ప్రజల ప్రణాలతో పరాచికాలాడిన పాలకులు బాగోతాలు, కార్పోరేట్ శక్తుల కొమ్ముకాసి పబ్బం గడుపుకున్న మోసాలు మనకు గుర్తుకు రాకుంటే మనం ఈ కాలంలో జీవించలేదని అనుకోవాల్సిందే.
“కుళ్ళిన శవాల కొట్టం మీద
గద్దలు చక్కర్లు కొడుతున్నాయి
విలయాన్ని విసనకర్ర చేసుకొని
జనవిషాదాన్ని తాగి
నిషా నషాళానికంటిన
మొసళ్ల యీతకు
నరరక్త కొలనులు కడుతున్న
కాపాలికులను చూసి
జాతి మూర్ఛపోతున్నది” అన్నపుడు ఈ నేల ‘అకాల ప్రసవ వేదన’ మనకు వినిపీకపోతే కవి పొరపాటు కాదు. మన అవగాహనలోనే లోపముంది.
కరోనా మహమ్మారి కబళించిన దేశాలకు దేశాలు దుఃఖంలో మునిగపోయిన పరిస్థితిని,కాలుతున్న శవం వాసనాల్ని శ్వాసించిన సందర్భాన్ని కళ్ళకు కట్టారు బూడిద పూల చెట్లు కవిత్వంలో. ఒకవైపు మనుషులు పిట్టల్లా రాలిపోయాయి.ప్రాణాలు గాల్లో కలోసిపోయాయి.బతుకు తెరువుకు వలస బోయిన కుటుంబాలు ఇంటిదారి పట్టాయి. వందల,వేల మైళ్ళు నడిచి నడిచి సొంత ఊళ్లను చేరుకున్నాయి. మార్గమధ్యంలో ఆత్మీయుల్ని కోల్పోవడం ఇంకో విషాదం. ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ విషాద కాలాన్ని మెడికల్ మాఫియా పెద్ద వ్యాపారం క్యాష్ చేసుకోవడం మరో ఘోరం.బహుశా ఆధునిక మానవ జీవితంలో ఇటువా6 విపత్తు దుర్మార్గపు కాలం లేదేమో.ఈ సంఘటనల్ని ఈ కాలంలో ప్రభుత్వాల పనితీరుని,ప్రజా సంక్షేమం గాలికి వదిలి ప్రతిదీ రాజకీయంగా వాడుకోవాలని చూసే నీచమైన చర్యలను నిజం గారి బూడిద చెట్ల పూలు పరిచయం చేస్తుంది. తరువాత కాలంలో దేశవ్యాప్తంగా జరిగిన రైతు ఉద్యమాలను, రైతులపై ప్రభుత్వం ప్రదర్శించిన దాస్టీకాలను మనం ఈ కవిత్వంలో చదువుకుంటాం.
“హక్కుల్నీ రెక్కల్నీ
హతమార్చే వారి
అంతిమ వోటమి కోసం న
ప్పులల్లార్చే నేత్రాలతో
పోరాడుతున్నాయి
ఆకలికి రూకలకు యుద్ధం
సరికొత్త వుదయానికి పునాది వేస్తుంది.
వర్తమానం కడుపున రేపటి
కాంతి బీజాలను చల్లుతుంది.(యుద్ధం) అని రైతు పోరును వివరిస్తాడు. ‘తనువు కాగడాలు’ కవితలో కింది పాదాల్ని చదవండి.మాయమాటల పాలకుల బండారాన్ని
“చితిశయ్యల
సౌధమై,తనువు కాగడాల వెలుగులో
మేకిన్ యిండియా కాటిసీనులను
రక్తి కట్టిస్తోంది దేశం
సామూహిక చావును
సిలిండర్లలో నింపి
యెగుమతి చేస్తానంటోంది
కుపరిపాలన పాఠ్యగ్రంథాలను
కుప్పలు తెప్పలుగా ముద్రిస్తోంది.”అని తేటతెల్లం చేస్తాడు.
మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజల్ని చీలికలు పేలికలుగా చీలుస్తూ,ప్రజా సంక్షేమం పట్టని వర్తమాన రాజకీయాలపై ఈ కవికి ఏహ్యభావం ఉంది.అభివృద్ధి, దేశభక్తి అంటూ ప్రజల్ని మతం దేవుడి మత్తులో ఉంచి దేశ సంపదను కార్పోరేట్ కుటుంబాలకు దోచిపెట్టే దుర్మార్గం అంతం కావాలని అందుకు ప్రజల్ని మేల్కొపుతున్న పోరాట స్వరం వీరి కవితల్లో మనల్ని పలకరిస్తుంది.
సమజాన్ని అవరిచిన అనేకానేక చీకట్లను పారద్రోలి చైతన్యాన్ని దీపంగా నిలబెట్టాలన్న తపన నిజం కవిత్వం నిండా ఒప్పారుతుంది. బిగి సడలని వస్తు శిల్పాలతో, నూతన రూపకాలు, ఉపమానాలతో హృదయానికి చుట్టుకునే వాక్యాల కూర్పుతో కవిత్వం ప్రజా విషాదాల్ని, ప్రజా పోరాటాల్ని చిత్రిస్తుంది. శబ్ద సౌందర్యం, అర్ధ సౌందర్యం, భావ గాంభీర్యం, పద నిష్ఠ, కవిత్వపద సృష్టి మెండుగా ఉన్న కవిత్వం నిజం గారి ‘బూడిద చెట్ల పూలు’. కాలాన్ని కవిత్వపు పాదులో సాగుచేస్తున్న కవి నిజం శ్రీరామ మూర్తి. ఒక నిస్తేజం లోకి,నిద్రలోకి, మాయలోకి, మత్తులోకి కూరుకుపోతున్న సమాజాన్ని ఒక చరుపు చరిసి,తలపై ఒక మొట్టికాయ వేసి మెలుకువలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్న కవిత్వం ఇది.
వర్తమాన ప్రపంచాన్ని, దేశాన్ని బాధ్యతగా పట్టించుకుని కవిత్వం చేసిన ఈ ‘బూడిద చెట్ల పూలు’ పుస్తకంలో కరోనా దుఃఖమే కాదు రైతుల పోరాటం ఉంది. దేశం దోపిడిదారుల చేతుల్లో కుదేలవుతున్న దుస్థితి ఉంది. మత రాజకీయాలు, మానవత్వం మసకబారిన దైన్యం ఉంది. హక్కుల హననానికి బలవుతున్న ఆదివాసీ ఆక్రదన ఉంది. పర్యావరణ విధ్వంసం ఉంది. మాట్లాడే పౌర స్వేచ్ఛను హరిస్తున్న పాలకుల దుర్మార్గపు చేస్టలపై నిరసన ఉంది. ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలనే తపన ఉంది.
క్షణక్షణం తునకలు తునకలుగా కోసుకుపోతూ మట్టిలో కలుస్తుంటానంటున్న బువ్వపుట్టి ఈ కవి.
“మన్ను నా ప్రాణం, గానం
నాలో యెగసే అణిగే ఆవేశకావేషాల చెలమ
వోదార్పులు, కలతల కొలకుల జలపాతం” అంటున్న నిజం శ్రీ రామ్మూర్తి గారి వాక్యాలతో గొంతు కలుపుదాం.
“నవ్వాలి, నిండుగా పకపకా వికవికా పగలబడి విరగబడి నవ్వాలి,
నవ్వుప్పెనలో బతుకునావ తిరగబడిపోయి విరిగి ముక్కలైపోవాలి,
అదుపనే సెంట్రలైజైలు తాళాలు బద్దలుకొట్టుకొని, సకల సంకెళ్ళను కరిగించి నామరూపాలు లేకుండా చేస్తూ నవ్వాలి
అడ్డుకట్టలన్నీ అదృశ్యమైపోయేలా హసించాలి,
ముళ్లకంచెల ప్రపంచాన్ని పరిహసిస్తూ అదేపనిగా మైమరచి నవ్వాలి” అంటున్న వారి ‘నవ్వుల దండోరా’ను నడుస్తున్న కాలం గుండె చప్పుడుగా చదువుకుందాం.