నిశ్శబ్ద స్వరం

అతని చివరి నిట్టూర్పును కూడా పీల్చేసుకున్న ఆ పాత నల్లని వేణువు నుంచీ ఓ నిశ్శబ్ద స్వరం వెలికివచ్చి, పొంగి ఉప్పొంగి ఆరిన తుంగభద్ర ఇసుకమేటల్లో కనిపించని అడుగుల్ని వేస్తూ అనంతంలోకి లీనమైపోయింది.
ఆ చివరి నిట్టూర్పు….
ఆ మెత్తని శ్వాస ఖాదర్ సాబే..
ప్రేమకు పర్యాయపదమైన ఖాదర్ భాయ్…
ఆ నిర్జన నదీప్రాంతానికి చైతన్యాన్ని మోసుకొచ్చిన ఖాదర్ స్వామిది… వయసు తెలీని ఆ మహావృక్షం, తన కొమ్మల్ని వంచి సుతిమెత్తగా అతని పాదాల్ని తాకి, అనునిత్యం నమస్కరించే వేణుగాన లోలుడు…
కటిక ఖాదర్….
ఆరడుగుల అందగాడిది…
‘దొంగముండా కొడుకు నా కూతుర్ని మాయ చేసినాడ’ని, కసాయి అంగడి ముందింటి పూజారి తిట్లు తిన్న ఉస్తాద్ ఖాదరిది…
తనింట్లో కసాయి కత్తి పక్కన ఒత్తిగిలి పడుకున్న వేణువులకు లాలపోసి జోలపాడే స్వరవిరించిది…
ఆ నిశ్శబ్ద సుషిరాల్లోకి తన భావనల్ని భాష తెలియనితనంతో వంచే కవిది…
ఖాదర్ భాయ్ చనిపోయాడు.
ఉప్పొంగిన తుంగభద్రమ్మ కమ్మని ఒడి చెమ్మన కూరుకుపోయి…
భాయి జాన్ ఖాదర్, ఇన్తికాల్…
సినెమా హీరో కావాలని పసి కలలు కన్న ఖాదర్…
పాండిబజార్ కర్కశత్వం నించీ నిరాశతో…
మద్రాస్ మెయిల్ కక్కూస్ అంచున చేర్చుకుంటే పారిపోయొచ్చిన ఖాదర్…
అంగిట ఎండిన ఎంగిలి గుర్తుగా ఆకల్నీ…
ఆవిరైన ఆశల్నీ వెంట తీసుకుని..
సంగీతపు పిచ్చితో మెరీనా బీచ్లో నిలుచున్న ఒంటరి పడవ పక్కన, రూపాయతో పోరాడి… ఆకలిచే జయించబడి… దొరికిన రెండిడ్లీల్లో ఎలకలమందు కూరి… వేణువుల పెట్టే నక్కున చేర్చుకుని… అసువులు బాసిన కొన్ని రోజుల స్నేహితుడు సుబ్రహ్మణ్య మొదలియార్ స్నేహపు గుర్తుగా…
మద్రాస్ సినీ మొహర్ ముద్రగా…
ఆ వేణువుల్లో ఓ వేణువు నేరుకుని.. ఆరు ఛిద్రాల ఆ నిశ్శబ్ద అమర గానాన్ని వెంట తెచ్చుకున్న ఖాదర్..
మచ్చు కత్తి మొద్దు మీద మాంసాన్ని తరిగినట్టుగా… మంద్రగానంతో మనసుల్ని తరగిన ఖాదర్…
ఖాదర్ భాయ్ చనిపోయాడు..
స్వర లాలసుడు ఖాదర్ తుంగభద్ర ఇసుక మేటల్లో కూరుకుపోయి…
తావరగెరె అనే కర్నాటకంలోని మారుమూల గ్రామంలో మర్మ సంగీత ధృతులుంటాయని, కర్నూలు పాతవూరు చిన్న యిరుకు సందుల్లో మొద్దు మీద గొడ్డు మాంసం సరికే కటిక ఖాదర్సాబ్ ఎలా కనుగొన్నాడన్న రహస్యం… యిక రహస్యంగానే మిగిలుంటుంది…
ఆ రహస్యాన్ని తుంగభద్ర శాశ్వతంగా ఇసుక మేటల్తో కప్పేసింది. ఆ సంగీత మర్మజ్ఞుడు ఖాదర్ జాన్ యిక మహా మౌనం…
ఆ కన్నడ రాజ్యం పడమటి కనుమల్లో చిక్కుపడ్డ తావరగెరెలో, ఓ మహాయోగి, వేణునాద సాధకుడు మరిరాజ మెణెదల దర్శనాన్ని ఖాదరెలా సాధించాడు?
ఎవరు చెప్పాలిక?
ప్రతిరోజు తండ్రికి తెలియకుండా కసాయి డబ్బుల్లోంచీ చిల్లర దొంగలించి పైసా పైసా పోగు చేసుకుని… ఆ చిల్లర మూటను అనువదింపజేసుకుని…
రాయచూరుకు లారీలో…
అక్కడ్నించీ రైల్లో గదగ…
గదగ నించీ హుబ్బళికీ..
క్రిక్కిరిసిన జీపులో అక్కడినించీ పడమటి అడవుల అంచుల్లోకీ…
ఆ అరణ్య పరిమళాల్తో కలసి కొట్టుకొస్తూన్న దివ్య భవ్య స్వరాలను… వేణూ సుషిరాల్లోంచీ తేలివచ్చే వాయు ప్రకంపనాలను, ఒడిసి పట్టుకుని…నగ్న పాదాల్తో ఆ అరణ్యాల ప్రవేశించి
ఇరవై అయిదు ముప్పై గడపలతో కొండవాలునున్న ఆ పల్లె తావరగెరె చేరి…
దివ్య తేజోమూర్తి
జ్వలనేత్ర ధృతి
కుంభించిన శ్వాసతో ఏకధాటిగా అయిదు నిముషాలు ఏక స్వరాన వేణునాదాన్ని నిలపే, స్వరసాధకుడు… యోగి…
మరిరాజు మెణెదల పాదాల వాలి…
శుష్క వంశీఖండాల్లోకి మధుర స్వర ప్రాణాలు పోసి మహామహా విద్వాంసులకు వేణువులుగా అందించిన మంజునాథ హెగ్గడే వద్ద…
జీవనాద సాధనాలు, ఆరు వేణువులు తెచ్చుకున్న గడ్డమున్న కృష్ణయ్య ఖాదర్ భాయ్ చనిపోయాడు..
మాంసమమ్మని మరుక్షణం… చేతిలోని మచ్చు కత్తిని పక్కనుంచి… సుతిమెత్తని రాగాల వేణువందుకుని రాగాలాపన చేసే ఖాదర్… కటిక ఖాదర్… బుర్రావారు కర్నూలు వాసిగా వుండగా ఆయన అంతేవాసై… నృత్యంతోపాటు కమ్మనైన రాయబార పద్యాలూ… కరిగించే విషాదంతో హరిశ్చంద్ర పద్యాలూ నేర్చిన కళాకారుడు ఖాదర్… తెలుగు మాతృభాషైన వాళ్లు కూడా అచ్చెరువొందేలా అచ్చ తెనుగక్షరాలను… ఛందాన అందాల కందాలుగా మలచగలిగిన అక్షర శిల్పి కవి ఖాదర్స్వామి… మత పెద్దల నిరసనలను చల్లని చిర్నవ్వున ఎదుర్కొన ఖాదర్ సాబ్కా ఇన్తికాల్…
కటిక అంగడికెదురుగా ఆరువాటాల ఇంట్లో అద్దెకుంటున్న పూజారి కేశవయ్య రెండవ కూతురు మనోరమ ఖాదర్ వేణుగాన వాహినిలో పడి కొట్టుకుపోతూ వేసిన మునకల కేకలకు తేరుకుని ఆ గాన నదీ తీరాన నిలబడి ఆమెకు తన బలమైన చేతినందించిన చారెడు కన్నుల కన్నెదొంగ ఖాదర్…
సాము గరడీలు చేసి ఖాజా పహల్వాన్ షాగిర్డీ చేస్తూ యిటు కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, నెల్లూరు… అటు బళ్లారీ రాయచూర్లలో గోదాలో లంగోటితో మహామహా వస్దాదుల్తో భుజాలు కలిపిన గండరగండడు కండల ఖాదర్ పహల్వాను…
ఒకరోజు రైసుమిల్లు పొట్టుబండీ వెనక నడుస్తూ కంట్లో నలుసు పడితే… కన్ను కడుక్కుందామని పక్కనే వున్న గురువు ఖాజా పహల్వాన్ ఇంట్లోకి వెళితే… పహల్వాన్ మూడవ కళత్రం మెహరున్నీసా… “అరే కద్దూ! నే తీస్తారా” అని పిలిచి… ఆరడుగుల ఖాదర్ని మూడడుగుల వాడినిచేసి మడతలుగా కూచోబెట్టి, చూపుడు వేలూ బొటనవేలూ కలిపి ఆ తువ్వాయి కన్ను విప్పదీసి నాలుకతో నలుసు తీస్తున్న క్షణాన, ఖాజాపహల్వాన్ ప్రవేశించి, ఆ దృశ్యాన్ని జీర్ణం చేసుకోలేక… ఓ పొలికేక పెట్టి… యిద్దరు పసికూనల తల్లి… నాజూకు జాజిమల్లి మెహరున్నీసాను… ‘రండీ!’ అంటూ తలమీద యినుప పిడికిలితో గుద్దితే… ఆమె కుప్పకూలిపోతే ఘర్ఘరిస్తూ ఘూర్ణిల్లుతూ గురువని చూడకుండా అతని మీదకు సింహంలా దూకి పిడుగుల్లాంటి పిడిగుద్దులు గుద్దిన ఛోటా పహల్వాన్ ఖాదర్…
తెప్పరిల్లి చూస్తే కుప్పకూలిన గురుపత్ని…
‘మా!’మా!’ అంటూ మెహర్ని ఉక్కుచేతుల మీదెత్తుకుని… జనాలు నోళ్లు తెరుచుక చూస్తుండగా రెండు మైళ్ల దూరం పరిగెత్తి హకీమ్ ఇంటికి మోసుకెళ్లి ఆమెకు జీవం పోసిన ఆమెకంటే ఆరేళ్లు పెద్దవాడైన ఆ మెహరున్నీసా ఎన్నడూ కనని కొడుకు ఛోటా పహల్వాన్ ఖాదర్…
ఆ తర్వాత గురువైన ఖాజా పహల్వాన్ లాల్ మస్జిద్ మత పెద్దల ముందు పంచాయితీ పెట్టించి… మెహరున్నీసాకూ… ఆమెను తల్లిలా చెల్లిలా ప్రేమించే మెత్తని మనసువాడు ఖాదరూ కళంక మంటగడితే… గురువు భార్య ఎవరైనాసరే వయోప్రమేయం లేకుండా తనకు కన్నతల్లితో సమానమని వాదించి ఓడిన క్షత హృదయుడు ప్రిదిలి కరిగి జావగారిన ఖాదర్…
భర్త తల మీద గుద్దిన బండరాతి గుద్దుకు ప్రాణమైతే తిరిగి వచ్చి నా… పిచ్చి చూపు పడి మాట కోల్పోయిన మెహర్ని ‘మా! మా!’ అని పిలిచే మెహరున్నీసాని యిద్దరు కసిగాయల్తో కలిపి భార్యగా స్వీకరించాల్సొచ్చిన ప్రళయ భయంకర క్షణం దాపురించినపుడు…
ఇదే తుంగభద్రమ్మ ఒడి చేరి ఆ సైకతాల రాత్రంతా హృదయ విదారకంగా వేణుగాన రూపాన ఘూర్ణిర్లిన ఖాదర్…
మనసిచ్చిన మనోరమ పిచ్చినవ్వు నవ్వుతూ చిప్పిల్లిన కళ్లను దుఃఖాన
పెళ్లగించుకుంటుండగా… అందుకున్న ఆమె పువ్వుల చేతిని వదలడానికి వలవలలాడిన ప్రియతముడు ఖాదర్ జాన్..
పిచ్చితల్లి మెహర్, మాటలు కూడా రాని… రెక్కలార్చుకునే గువ్వ పిల్లలు ఆమె కూతుళ్లు షాజియా, నూర్బానోలను ముగ్గుర్నీ మనోవాక్కాయ కర్మణా బిడ్డలుగానే స్వీకరించిన మహోత్తముడు బ్రహ్మచారి తండ్రి ఖాదర్ బాబా…
మాంసం అమ్మడం మానేసిన ఖాదర్.. తుంగభద్రమ్మ ఒడ్డున దర్గా దగ్గర గుడిసె వేసుకుని జీవనం ప్రారంభించిన ఆ ముగ్గురు బిడ్డల తండ్రి బాబా ఖాదర్ ఇంటినించీ తెచ్చుకున్న ఆస్తి, ఓ ఆరు వేణువులున్న పెట్టె…ఆకుపచ్చని వస్త్రంలో చుట్టి వుంచిన నిర్మల పవిత్ర ఖుర్ ఆన్లు మాత్రమే… ఖుర్ ఆన్ పఠనానికి చెక్క రిహత్…మస్జిద్ మైకులో ము అజ్జన్ అజాఁ వినబడగానే పరుగులాంటి నడకన వెళ్లి మూడు జాములూ జాయె నమాజ్ మీద మోకరిల్లే ముల్లా ఖాదర్ సాహెబ్…
అంతే నైర్మల్యాన శ్రీరామనవమి ఉత్సవాల్లో, దసరా నవరాత్రుల్లో అంతే పవిత్రంగా హైందవ అన్నదమ్ముల్తో కలగలసిపోయి పాల్గొనే భక్త ఖాదర్ స్వామి. తుంగభద్ర తీరాన వయసు తెలియని ఊడలమర్రి చుట్టూ రాయిరాయి పేర్చి పెద్ద కట్ట కట్టిన గౌండ (తాపీ) ఖాదర్…
తర్వాత రోజుల్లో ఆ కట్టనే తన సర్నామా చేసుకున్న ఖాదర్…మాంసం అమ్మడం మానిం తర్వాత జీవిక కోసం… గూడూరు, తర్రూరు తిరునాళ్లకు వెళ్లి జీవాలను కొని తెచ్చి అమ్మకం సాగించిన కటిక సాయిబు ఖాదర్… మాట పడిపోయి, పిచ్చి చూపు పడిన గురుపత్ని మెహరున్నీసా మానసిక స్థితి రోజురోజూకూ క్షీణిస్తూ… పిచ్చిముదిరి… వీధుల వెంటపడిపోతోంటే… రాళ్లు రువ్వే పిల్లల్నీ… వెంటబడే కుక్కల్ని అదిలిస్తూ, ఆమెను పసిపిల్లలా ఇల్లు చేర్చే మనసు తండ్రి ఖాదర్…
ఆ మెహర్ను నిజంగానే ఓ మాటు కుక్కలు కాలి పిక్కలు వూడేలా కరిచేస్తే…. గాయాల సలుపు భరించ లేని ఆ పిచ్చితల్లి దీనంగా ఏడుస్తోంటే… తనకాశ్రయ మిచ్చిన మర్రిచెట్టుకు జంబుఖానాతో ఊయలకట్టి… సమాజం తనకు భార్యను చేసి తల్లి మెహరును.. పసిపిల్లను చేసి ఊచిన… మూర్తీభవించిన అమ్మతనం… ఖాదర్… పోనుపోనూ.. చివరికి ఖాదర్్ను కూడా గుర్తించడం మరచిపోయిన పిచ్చితల్లి మెహర్ తుంగభద్ర ఒడ్డున రాళ్లు విసురుతూ ఆడుతూ ఆడుతూ… జారి నీటపడి…
కొట్టుకుపోయి… గొందిపర్ల శివార్లలో ఉబ్బిపోయి చేపలు తిన్న శవంగా తేలితే… కూతుళ్లుగాని కూతుళ్లు షాజియా, నూర్లను రెండుచేతులా కావలించుకుని కునారిల్లి…
భార్యగాని భార్య అయిన తల్లి మెహరునొసాను… బిడ్డల్లే సాకిన మెహరు… తానే పవిత్రంగా జనాజాలో శుభ్ర వస్త్రాల్లో చుట్టి పడుకోబెట్టిన ము అల్లా ఖాదర్బ్బా.. పిచ్చిదాన్ని భరించలేక తానే తుంగభద్రలో తోసేసి చంపేసి పీడ వదుల్చు
కున్నాడనే కొందరేసిన అపవాదును…
ముళ్లకిరీటంలా ధరించి భరించిన ఖాదర్ ఏసయ్య…
ఆరోజు రాత్రంతా మర్రికట్టన కూచుని వేణువుతో నాదనామక్రియ ఆలపిస్తూ ఆలపిస్తూ అలసిన బైరాగి ఖాదర్ ఓ ఫకీరు…
ప్రేమారామాన జీర్ణపర్ణాల్లా రాలిన స్వప్నాల్ని దొంతరలుగా పేర్చుకుని మనోమంజూషలో భద్రపరుచుకుని…
జ్ఞాపకాల ఈదురుగాలుల్లో కొట్టుకొచ్చే జాలికళ్ల మనోరమ వియోగ దృక్కుల్నించీ యింకా తప్పుకోలేక… లోలోన తల్లడిల్లుతూండగా…
ఉన్నట్టుండి ఓ విషాద ఉదయాన… ఆమె ఐదవతనం కోల్పోయి పుట్టిల్లు చేరిందని తెలిసి పరుగున వెళ్లి, ఘనీభవించిన ధుఃఖమై… మౌనమై… ఆమె ఎదుట నిల్చిన ప్రేమి ఖాదర్…
ఆమెనలా చూట్టంతోపాటు, ఆమె తండ్రి కేశవయ్య…
“అది ముండమోసి దరిద్రంతో కొంపజేరింది… నువ్వు నన్ను కూడా ముండమోయించేసి ఆ పీడకు తోడు యింకింత దరిద్రం నాకు పులిమేట్టున్నావు” అన్న చీదరింపును కూడా భరించిన ఖాదర్…
తన స్నేహం, ఆత్మీయత, జీవితం అనుకున్న మనోరమే.. రెండు చేతులూ జోడించి, కాసారాలైన కళ్లతో, వణికే పెదవుల్తో, యావత్ప్రపంచ భేదమూ తానే అయి “దయచేసి నువ్విక్కడకి రావద్దు… నన్నెప్పుడూ కలవద్దు కద్దూ!” అని వలవలా విలపించి తపించిపోతే..
యావత్ప్రపంచమూ తనమీద కప్పడిపోయినట్టు… నిట్టనిలువునా కూరుకుపోయినట్టు ఊపిరాడక… నిశ్శబ్ద వేణూ సుషిరాల ఊపిరులూద లేక దీనుడై.. హీనుడై.. ఖిన్నుడై తల్లడిల్లిన అవ్యాజ ప్రేమికుడు ఖాదర్… ఆమె జీవిత శిలారామ
ప్రాంగణాల్నించీ చివరిసారిగా… శాశ్వతంగా వెలుపలికడుగేసి నడిచొచ్చేసిన ఛిద్ర హృదయుడు సాజన్ ఖాదర్…
తన కళ్లముందే దివ్య సౌందర్యమూర్తులుగా ఎదుగుతున్న కూతుళ్లు గాని కూతుళ్లు షాజియా, నూర్లు తనకు భారమవుతారని తలుస్తూన్న క్షణాన… నవాబు వారసులైన ఓ సంపన్న కుటుంబం వచ్చి షాజియాను కోడలిగా అడిగితే.. ఆకాశమందినంత ఆనందాన్ననుభవించిన పిచ్చి తండ్రి ఖాదర్… ఆ సంపన్నులే… నువ్వు కాఫిర్ని… నీ కూతురి సౌందర్యం చూసి మా కుటుంబంలోకి తీసుకుంటున్నాం… నీ నీడ మళ్లీ జీవితంలో ఆ పిల్లదాని మీద పడకూడదని శాసించినపుడు
ఆకాశమే తానై… శూన్యమై మిగిలి… ఆ బిడ్డ సౌభాగ్యమే తన భాగ్యమని నమ్మి గుండెకు హత్తుకు పెంచిన ఆ పావురాయి కూనని సుతిమెత్తగా వాళ్ల చేతుల వుంచి, ఆ పసిడి బొమ్మను దీవించి.. దువా చదివిన బాబా ఖాదర్… షాజియా వివాహం తర్వాత హఠాత్తుగా వృద్ధుడైపోయిన మియాఖాదర్, తన ప్రాణమైన వేణువును మాత్రం వీడక… తను ఆ మహా వటవృక్షం చుట్టుకట్టిన కట్ట సాయిబాబా భజన మండలి నెలవైనపుడు… వాళ్ల భజనకు తన వేణువుతో సహకారమందిస్తూ…. ఒకరిద్దరికి వేణువు నేర్పుతూ… దాదాపు తుంగభద్ర ఒడ్డున్నే మిగిలిపోయాడు.
చిన్నపాప నూర్బానో ఇంటర్మీడియేట్ పూర్తిచేసి, ఏదో దుకాణంలో పన్చేస్తూ తండ్రిని పసిబిడ్డలా చూసుకుంటూండగా…
భజన మండలి డోలక్ వాద్యగాడు, తాలూకాఫీసు గుమాస్తా రాఘవ.. జ్ఞానమందిరం అనాథ హాస్టల్ లో పెరిగినవాడు.. యువకుడు, అందగాడు… ఓ కాషాయపు సాంధ్యవేళ, గురువు పైమెట్టున కూచునుండగా.. అతని పాదాల మోకరిల్లి, తనకు నూర్ పట్ల వున్న అనురాగాన్ని వెలిబుచ్చితే… ఆశీర్వదించి… ఆ మహావటవృక్షపు నీడనే… తను కట్టిన కట్టనే వేదిక చేసి… భజన మండలి సాక్షిగా వివాహం జరిపించిన ఖాదర్ మియా..నూర్బానో రాఘవల వివాహం తర్వాత మరీ వృద్ధుడైపోయి, ఆ కట్టను తన శాశ్వత సరానామా చేసుకుని, నిలిచిపోయిన ఖాదర్ సిద్దయ్య…
ఆ కట్ట మీద ఓ గుడి వెలిస్తే… భక్తుల రద్దీ పెరిగి… కట్టను పూర్తిగా గుడి మింగేస్తే… నదిలోకి దిగే మెట్లు తన ఆవాసమై మిగిలితే..
అన్నింటికీ సాక్షియై, వడలిన దేహంతో, మాయని చిర్నవ్వుతో మిగిలిన ఫకీరు
ఖాదర్… ఆ రోజు గంగమ్మతల్లి ఉగ్రరూపమెత్తింది… బుసబుసా పొంగింది.. మెలమెల్లగా ఒక్కో మెట్టూ మింగుతూ వస్తోంది.. ప్రాణభీతితో అందరూ పరుగులు పెడుతూ అరుస్తూ వున్నా… కదలకుండా ప్రశాంతంగా కూచుని వేణువు వాయిస్తూ ఖాదర్..
కర్నూలును సగానికి సగం గంగమ్మ మింగేసింది..
ప్రాణాలు అరచేత పట్టుకుని ఎత్తైన మిద్దె లెక్కిన వాళ్లు కళ్లు చిరిగేలా తెరుచుకుని చూసిన వాస్తవం..
వెండి తలా… వెన్నెల గడ్డమూ… వాయిస్తున్న నల్లని వేణువుతో ఖాదర్ సాబ్ ఒక్కోమెట్టే దిగుతూ… దిగుతూ, తిరిగి మాతృగర్భంలోకి అన్నట్టు ఆ నదీ గర్భంలోకి అడుగులు వేసాడని..
పరవళ్లు తొక్కి… సగం కర్నూలును మింగేసి, శాంతించి, ప్రకృతి ముందు మనిషి అల్పత్వాన్ని నిశ్శబ్దంగా బోధించి వెళ్లిపోయిన తుంగభద్రమ్మ తడి ఇసుక మేటల్లో సగం కూరుకుపోయి ఖాదర్బయి…
బైటికి చొచ్చుకొచ్చిన చేతిలో, సుషిరాల నిండా ఇసుకతో ఆ నల్లటి వేణువు అతని చివరి నిట్టూర్పును కూడా పీల్చేసుకుని…
సాధారణమైన మనుషుల మధ్య అసాధారణంగా జీవించిన ఖాదర్ మరణించాడా? ఊహూఁ లేదు… కాదు…
జయంతితే సుకృతినో రస సిద్ధాః కవీశ్వరః
నాస్తి తేషాం యశః కాయే జరామరణజ భయం!!

పుట్టింది కర్నూలు (2 జనవరి, 1954). కవి, రచయిత. నవలాకారుడు. రచనలు : ఘోష (కథల సంపుటి), నేనూ - చీకటి (నవల), దిగంతం (నవల), నేనూ- చీకటి (నవల), తపన (నవల), రంగుల (నవలిక), మంచు పూవు (నవల), తెరవని తలుపులు (నవల), నికషం (నవల), అసత్యానికి ఆవల (నవల), అసంగత (నవల), స్పర్శరేఖలు నవల (చివరిది), నాలుగు కథా సంకలనాలు, మూడు కవిత్వం పుస్తకాలు, నాలుగు సినిమాలకు రచయితగా పనిచేశారు. అనారోగ్యంతో 19 ఆగస్టు, 2024న మరణించారు.

Leave a Reply