భారత దేశం ఎన్నో ప్రాంతాలతో విలసిల్లుతోంది. ఎన్నో సంస్కృతి సంప్రదాయాలకు నిలయంగా నిలుస్తుంది. అయితే నేడు ఈ సంస్కృతి సాంప్రదాయాల మీద, వివిధ ప్రాంతాల మీద దాడులు పెచ్చురిల్లుతున్నాయి. ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాలైన అడవి మీద భారత ప్రభుత్వం యుద్ధాన్నే ప్రకటించింది. అడవిని ఆధారం చేసుకుని పోరాటాలు నడుపుతున్న నక్సలైట్లను,మావోయిస్టులను బూచిగా చూపుతూ ఆదివాసీ ప్రజలపైన, అడవిపైన అంతిమ యుద్ధం కగార్ పేరుతో భారత ప్రభుత్వం యుద్ధం మొదలెట్టింది.
మనం ఆదివాసీ ప్రాంత చరిత్రను చూస్తే మనకు అర్థం అవుతుంది. ఆదిమ కాలం నుండే అడవిని ఆధారం చేసుకుని, ప్రకృతిని ప్రేమిస్తూ జీవిస్తున్న వాళ్ళు. అటవి సంపదను కాపాడుతూ నాగరికత సమాజానికి మేలు చేసిన నాగరికులు. భారత భూభాగంలో చిన్న చిన్న ఆదివాసీ గొండ్వాన రాజ్యాలుగా వెల్లసిల్లినవి. అవి మానవ నాగరికత జీవన ప్రయాణంలో ఎన్నో మార్పులకు లోనుచేశాయి. ప్రజా సమూహాలకు ఆలనా పాలనతో రక్షించే కార్యాచరణను, పాలన వ్యవస్థను, ఆహార ఫల సహాయం మాంస ఆహారాలు, వన మూలికలు , కృర మృగాలను ఎదుర్కోవడం వంటి వాటిని మానవ మనుగడలో ఆదివాసీలు నేర్పిన పాఠం ఇది. వారి సంస్కృతి సాంప్రదాయాలు, కళలు, వాయిద్యాలు, సాహిత్యంపై నేడు యుద్ధం జరుగుతున్నది.
నేటి ఆధునిక నాగరికత విలసిల్లి ప్రజాస్వామ్య ముసుగులో పరిపాలిస్తున్న భారత దేశ పాలకుల్లారా.., ఆదివాసులను చంపడం అనేది నాగరికతను అంతం చేయడమే అవుతుంది. అడవి మీద యుద్ధం అంటే మానవ మనుగడకే ఉనికి లేకుండా చెయ్యడం అవుతుంది. నేడు ఆపరేషన్ కగార్ పేరుతో భారత ప్రభుత్వం చేస్తున్న దమన కాండ ఇదే కదా.! దీని మావోయిస్టులు, నక్సలైట్ల పేరు పెట్టి అమాయక ఆదివాసీ ప్రజలను చంపుతుంది. ఇది కేవలం ఈ దేశ కార్పొరేట్లకు, పెట్టుబడి దార్లుకు,సామ్రాజ్యవాద దేశాలను సహజ వనరులను, అక్కడి నెలలోని ఖనిజ సంపదను ధారదత్తం చెయ్యడం కోసమే ఆపరేషన్ కగార్.
స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పే దేశ పాలకులు, డెబ్భై ఏడు ఏండ్లు గడిచిన కానీ రాజ్యాంగం ప్రకారం అడవి మీద హక్కు ఆదివాసులకు లేకుండా చేస్తున్న పాలకులున్న దేశం మనది.కల్లి బొల్లి మాటలతో నయవంచక బుద్ధితో నమ్మబలికి ఆదివాసులను మోసం చేస్తున్న వాళ్లు ఈ దేశ పాలకులు. మా గ్రామంలో మా రాజ్యం (మావో నాటే మావో రాజ్) అంటూ ఎవరైనా ఆదివాసులు గొంతు విప్పితే వారిని నక్సలైట్ అనో, దేశద్రోహి ముద్ర వేసి చంపుతున్నారు. ఇదే భారత దేశ పాలకుల విధానం.
నేడు మధ్య భారత దేశంలో నివసిస్తున్న ప్రజలపై యుద్ధం ప్రకటించి ఒక రిపబ్లిక్ దేశం తన పౌరులను తానే చంపక తింటుంది. ఇదేం ప్రజాస్వామ్యం.? ఇదేం రిపబ్లిక్ దేశం.?
ఇప్పటికీ ఇదే విధానం కొనసాగిస్తుంది. నేడు ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రా ప్రదేశ్ రాష్ట్రాలలో వందలాది ఆదివాసీ యువతి యువకులను నక్సలైట్లు, మావోయిస్టులు అంటూ హత్యలు చేసి ఎన్ కౌంటర్ కట్టు కథలు అల్లారు.
ఆదివాసీ ప్రాంతాలను ఆక్రమించడం కోసం నక్సల్ , మావోయిస్టు నిర్మూలన అంటూ ఒక తేదీని ప్రకటించి మరీ భారత ప్రభుత్వం అడవి పైన యుద్ధానికి దిగింది. ఇది శాంతి భద్రతల సమస్య అంటూ ప్రచారం చేస్తుంది. నిజంగా ఇది శాంతి భద్రతల సమస్యనా..? రాజకీయ , సామాజిక, ఆర్థిక సమస్యనా..? రాజకీయ సమస్యగా దేశ పాలకులు చూడాల్సిన విషయాన్ని శాంతి భద్రతల సమస్యగా చిత్రీకరించి, బలవంతుడిదే రాజ్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్న తీరుకు సమాజం మొత్తం బలికావాల్సి ఉంటుంది. ఈ అనాలోచితమైన విధానం వలన సమాజం తన ఉనికిని కోల్పోవాల్సి వస్తుంది.
ఇప్పటికైనా భారత ప్రభుత్వం ఆలోచించి గత ప్రభుత్వాలు నక్సల్, మావోయిస్టులతో జరిపిన శాంతి చర్చలను దృష్టిలో పెట్టుకుని, నేడు ఈ (అంతిమ యుద్ధం) కగార్ పేర జరుపుతున్న మానవ హననాన్ని తక్షణమే నిలిపివేసి మావోయిస్టులు కోరుతున్నట్లు ఏ షరతులు లేకుండా ఆరు నెలల పాటు కాల్పుల విరమణ పాటించి శాంతి చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం చూపాలి. లేకపోతే జరిగేది మాత్రం నరమేధమే అవుతుంది.. అటవి ప్రాంతం అంత నీళ్లకు బదులు నెత్తుటితో పారుతుంది.
దేశంలో జనవరి 1,2024 న ఆరు నెలల పసి పాపతో మొదలైన కగార్ యుద్ధం ఇప్పటికీ విచక్షణగా ఎన్నో వందలాది ప్రాణాలను తీసింది. ఇది ఫాసిజంలో భాగంగా కొనసాగుతున్నది. దేశం మొతాన్ని ఒక ముసలోకి నెట్టుతూ నిత్యం ఎక్కడో ఒక చోట మారణ హోమాన్ని సృష్టిస్తున్నాది బీజేపీ మోషా ల పాలన. దేశ వ్యాప్తంగా మతాల మధ్య , దళిత, మైనార్టీ , ఆదివాసీ, శోశి త జన సమూహాల మీద దాడులు, హత్యలు చేస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని ధ్వంసం చేస్తుంది. ఈ ఘర్షణలు పౌర సమాజానికి మంచిది కాదు. అందుకే భారత ప్రభుత్వం తన ప్రజల మీద తాను చేసే యుద్ధాన్ని తక్షణమే నిలిపివేసి, తక్షణమే మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ఒత్తిడి తెద్దాం.