(ప్రజాస్వామిక తెలంగాణ , సామాజిక సమన్యాయ తెలంగాణ వంటి ఆకాంక్షలతో ప్రజల క్రియాశీల భాగస్వామ్యంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు. ప్రజల అవసరాలు తీర్చి ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం రూపొందించుకొంటున్న విధానాల సంగతేమో కానీ తెలంగాణ ప్రభుత్వం స్వయంగా 2025 మే 7 నుండి 72 వ విశ్వసుందరి పోటీలకు ఆతిధ్యం ఇయ్యటమే ఇప్పుడు చర్చనీయాంశం అయింది. 28 ఏళ్ళ తరువాత మళ్ళీ భారతదేశం ఈ వేడుకకు వేదిక అవుతున్నందుకు హర్షం వ్యక్తం చేసిన వాళ్ళు అనేకులు. అంతకన్నా ఎక్కువగా దీనిని నిరసిస్తూ, ఖండిస్తూ నింపివేయాలని నినదిస్తూ తెలంగాణ అంతటా మహిళా సంఘాలు ఉద్యమిస్తున్నాయి.ఈ సందర్భంలో 28 ఏళ్ళక్రితం బెంగుళూరు లో నిర్వహించబడిన మిస్ వరల్డ్ అందాల సుందరి పోటీల సందర్భంగా దేశవ్యాప్తంగా సాగిన స్త్రీల ఆందోళనలు, తెలుగులో వచ్చిన సాహిత్యం గుర్తుకు వస్తున్నాయి. ఆ చరిత్రలో భాగంగానే వరంగల్ నుండి స్త్రీజనాభ్యుదయ అధ్యయన సంస్థ బాధ్యులు మిత్రులు అయిన వి. శోభ ,జ్యోతిరాణి, కాత్యాయనీ విద్మహే కలిసి అందాలపోటీల పై వ్రాసి ప్రచురించిన వ్యాసం వర్తమాన సందర్భాన్ని అర్ధం చేసుకొనటానికి, విశ్లేషించుకొనటానికి సహాయపడుతుంది. ఆనాడు ఈ నాడూ కూడా ఈ పోటీలకు ఆతిధ్యం ఇయ్యటంలో భారతీయ సంస్కృతి, కళావైభవాలకు అంతర్జాతీయ స్థాయి ప్రచారం కల్పించటం, పర్యాటకులను ఆకర్షించటం తద్వారా దేశీయ స్థానిక చేతివృత్తుల ఉత్పత్తులకు, కళా నైపుణ్యాలకు మార్కెట్ కల్పించటం లక్ష్యంగా చెప్పబడ్డాయి.
1996 నాటి బెంగళూరు మిస్ ప్రపంచసుందరి పోటీలు ప్రపంచీకరణ లో భాగంగా రూపొందిన నూతన ఆర్ధికవిధానాల తొలిదశలో జరిగినవి. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా ఈ ఇరవై ఎనిమిదేళ్ల కాలంలో అది కార్పొరేట్ శక్తిగా పరిణామం చెందింది. లాభాపేక్ష లక్ష్యంగా స్థానికంగా, ప్రపంచవ్యాపితగంగా భిన్నరంగాలలో పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేయటం, వస్తుసేవలను అందించటం, ఆస్తులు సంపాదించటం దీని లక్షణం. ఉద్యోగ పరికల్పన ద్వారా ఆయా ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి అవి దోహదపడతాయి అన్నది ప్రయోజనానికి సంబంధించి చెప్పేమాట. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వాలన్నిటికీ తారకమంత్రం ‘అభివృద్ధి అంటే పెట్టుబడులను ఆకర్షించటం’ అయింది. పెట్టుబడుల ఆకర్షణకు మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ ఒక మంచి మాధ్యమం అని తెలంగాణ ప్రభుత్వం నమ్ముతున్నది.ఆ మేరకు మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ కు స్వయంగా బాధ్యత వహించింది. వ్యాపారాభివృద్ధికి సాధనంగా ప్రారంభమైన అందాలపోటీలు ఈ నాడు దేశవిదేశ కార్పొరేట్ కంపెనీల పెట్టుబడుల వేట కు వేసిన ఎర అయినాయి. ఈ నేపథ్యంలో 1997 నాటి ఈ వ్యాసం అవసరం ఈ నాడు ఉంది.
-కొలిమి ఎడిటోరియల్ టీమ్)
మూడువందలకోట్ల ప్రపంచ ప్రజల సాక్షిగా, నూటయాభై దేశాలకు చెందిన ఇరవైవేల మంది ప్రత్యక్ష ఆహుతుల మధ్యన, ముప్పయి లక్షల ఖర్చుతో నిర్మించిన వేదిక పైన, అట్టహాసమైన అలంకరణల మధ్య, 1996 నవంబర్ 23న భారతదేశంలోని బెంగుళూరు నగరంలో, అనేక మహిళా సంఘాల వేదనల ఘోష మధ్య, నిరసన స్వరాల మధ్య అర్ధరాత్రి 12 గంటలకు ప్రపంచసుందరి ఎన్నిక ఘట్టం ముగిసింది.అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఈ పోటీలో 88 దేశాలనుండి స్త్రీలు పాల్గొన్నారు.
అమెరికా, ఫ్రాన్స్, జపాన్ మొదలైన అభివృద్ధి చెందిన దేశాలనుండి, భారత దేశం, ఫిలిప్పైన్స్, తైవాన్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలనుండి, మహిళలపై జరిగిన సైనిక అత్యాచారాలతో ప్రపంచ దృష్టికి వచ్చిన బోస్నియా వంటి దేశాల నుండి జాతిపోరాటాలు, వర్గపోరాటాలతో వుడుకెక్కిన దక్షిణాఫ్రికా, చైనా వంటి దేశాల నుండి స్త్రీలు ప్రపంచసుందరి పోటీలలో ఒకే రకమైన ఉత్సాహ ఉద్వేగాలతో పాల్గొని సమానంగా అందాలను ప్రదర్శించడం ఒక పెద్ద వైరుధ్య సన్నివేశం. వాళ్ళ వాళ్ళ దేశీయ భౌగోళిక వాతావరణంతో గాని, ఆర్థిక సమస్యలతో గాని, రాజకీయ సంక్షోభాలతో గాని, ప్రజాచైతన్యంతోగాని సంబంధం లేకుండా వాళ్ళ వాళ్ళ దేశాల నుండి ఎంపికై పోటీలో పాల్గొనటానికి వచ్చిన స్త్రీలు. ఈ అందరూ ఒకే రకమైన శారీరక కొలతల మధ్య బిగించబడి అంతర్జాతీయ స్థాయిలో స్త్రీల బూటకపు సమానత్వాన్ని ప్రదర్శించారు.
ఆకర్షణీయమైన స్త్రీలను ఒకచోటకు చేర్చే బాధ్యత భుజాన వేసుకొని ఎరిక్ మోర్లీజూలియా దంపతులు 1951లో ప్రారంభించిన ‘మిస్ వరల్డ్’ సంస్థ ఆధ్వర్యంలో గత నలభై ఐదేళ్ళుగా ప్రపంచ సుందరి పోటీలు జరుగుతున్నాయి. ఈసారి ఈ పోటీల నిర్వహణకు అమితాబ్ బచ్చన్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఎబిసిఎల్) ముందుకు రావటంతో భారతదేశం దీనికి రంగస్థలం అయింది. ఈ సందర్భం మనముందుకు ఎన్నో విషయాలను చర్చకు తెచ్చింది. భారతీయ కళలను, సంస్కృతిని ప్రపంచం ముందుకు తీసుకురాగలిగిన సదవకాశంగా, భారతదేశానికి విదేశీ మారకద్రవ్యం సంపాదించి పెట్టగల సందర్భంగా, అంతర్జాతీయ సౌమనస్యాన్ని సాధించగల సన్నివేశంగా, స్త్రీల ఆత్మవిశ్వాసాన్ని అధికార శక్తిని నిలబెట్టి చూపగల సంఘటనగా కొందరు దీనిని అభివర్ణించారు. అంతేస్థాయిలో స్త్రీలను ప్రదర్శన వస్తువుగా, వ్యాపారపు సరుకుగా చేస్తున్నాయని అందాలపోటీలకు వ్యతిరేకత కూడా పెల్లుబికింది. నిరసన ప్రదర్శనలు, కోర్టు కేసులు నడిచాయి.
ఇన్నేళ్ళుగా అందాల పోటీలు జరుగుతుంటే, స్థానికంగా కూడా అనేక సంస్థలు అందాలపోటీలను నిర్వహిస్తుంటే ఎప్పుడూ రాని వ్యతిరేకత ఇప్పుడే ఎందుకు రావాలని పోటీని సమర్థించేవారు ప్రశ్నించటమే కాక అందాలపోటీ వ్యతిరేకోద్యమం వెనుక రాజకీయా లున్నాయని ఆరోపించారు. అందాలపోటీ వ్యతిరేకోద్యమం వెనుక దేశీయ రాజకీయాలుంటె, అందాల పోటీల నిర్వహణ వెనుక అంతర్జాతీయ రాజకీయాలున్నాయని చాలామంది ఆందోళన కారులు అభిప్రాయ పడ్డారు. ఈ రాజకీయాల స్వరూప స్వభావాలను సూచించే వార్తా రచనలు ప్రపంచసుందరి పోటీలకు ముందు వెనుకలుగా అనేకం వచ్చాయి. ప్రపంచ సుందరి పోటీల సందర్భాన్ని, ఆ సందర్భంగా మన ఆలోచనా ప్రపంచాన్ని కుదిపివేసిన అందం, స్వేచ్ఛ, సమానత్వం మొదలైన భావనలను, లైంగిక రాజకీయ దృక్పథం నుండి, రాజకీయార్థిక దృక్పథం నుండి ఏకకాలంలో విశ్లేషిస్తే తప్ప అందాల పోటీ వ్యవస్థలో వున్న మాయాజాలం అర్థం కాదనిపించింది. ఈ మాయాజాలన్ని అర్ధం చేసుకొనే క్రమంలో పొందిన మా అవగాహనను మీతో పంచుకొనటానికే స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ పక్షాన ఈ చిన్న పత్రం ప్రచురిస్తున్నాం.
1
అందాల పోటీలకు వ్యతిరేక ఉద్యమాలు ఇప్పుడే ప్రారంభమైనవికావు. వీటి చరిత్ర మరీ తక్కువదేమీ కాదు. స్త్రీలు ప్రపంచ సంబంధాలలో తమను చూచుకొంటూ తమ అభివృద్ధిని అంచనావేసుకొనే నూతన చైతన్యంతో ఎదుగుతున్న అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో 1968లో మొదటిసారిగా అందాల పోటీకి వ్యతిరేకత వచ్చింది. 1963లో బెట్టీ ఫ్రైడన్ వ్రాసిన ‘ఫెమినైన్ మిస్టేక్’ అనే పుస్తకం వచ్చి స్త్రీల విషయంలో ఆమోదిత విలువలను, నమూనాలను ప్రశ్నించటం నేర్పింది. ఈ సాంస్కృతిక చైతన్యం నుండి అందానికి, స్త్రీల శరీరానికి పోటీ నిర్వాహకులు ఇచ్చిన నిర్వచనాలను తిరస్కరించటం మొదలైంది. 1975 అంతర్జాతీయ మహిళా సంవత్సరం. ప్రపంచ వ్యాప్తంగా మహిళల అభివృద్ధి అభ్యుదయాల గురించిన అంచనాలు ఒక కొలిక్కి వచ్చి స్త్రీల స్థాయీ హోదాలను మెరుగు పరచటానికి చేయాల్సినదెంతో వుందని స్పష్టం చేశాయి. తత్ఫలితంగా ఆ చేయాల్సినదానికి ఒక ప్రారంభంగా ప్రకటించబడిన అంతర్జాతీయ మహిళా సంవత్సరం ఆ తరువాత 1985 వరకు మహిళా దశాబ్దంగా కొనసాగింది. ఈ పదేళ్ళలో జరిగిన పరిశోధనలు, సమీకరించబడిన స్త్రీల సంఘాలు, నిర్మించబడిన మహిళా ఉద్యమాలు స్త్రీల చైతన్యంలో గుణాత్మకమైన పరిణామాన్ని తీసుకొని వచ్చాయి. అందులో భాగంగా భారతీయ మహిళలు అనేకానేక సమకాలీన సమస్యల మీద స్పందించినట్లుగానే, పూర్వ నిర్ధారిత నిర్మాణల మీద తిరగబడ్డట్లుగానే తమను తమనుగా మిగలనీయకుండా ప్రదర్శన వస్తువుగా చేసిన అందాల పోటీలకు వ్యతిరేకంగా స్థానికంగా ఉద్యమాలు నిర్మించారు.
ఈ చరిత్రను తడిమినప్పుడు వరంగల్లులో అందాల పోటీలకు వ్యతిరేకంగా 1983 లో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ చేపట్టిన ప్రతిఘటనా కార్యక్రమం గుర్తుకు వస్తుంది. గ్రామీణ సాంస్కృతిక నేపథ్యం గల వరంగల్లులో హైదరాబాదు నమూనాలో ‘ఎగ్జిబిషన్’ ను నిర్వహిస్తూ అందులో భాగంగా అందాల పోటీ కార్యక్రమాన్ని చేర్చారు. ఒకరోజు పువ్వుల ప్రదర్శన, ఒకరోజు కుక్కల ప్రదర్శన, మరొక రోజు అందాల ప్రదర్శన-ఇది వాళ్ళ కార్యక్రమం. అందులోని అమానవీయతను, స్త్రీలను హీనంగా చేసిన సంస్కృతి లక్షణాన్ని వివరిస్తూ అందాల పోటీకి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని మలచటానికి ఒక కరపత్రం ప్రచురించి, అందాల పోటీలను ఆసివేయవలసిందిగా ఎగ్జిబిషన్ కమిటీకి విజ్ఞప్తి చేయటం జరిగింది. దానికి అనుకూలంగా స్పందించి ఎగ్జిబిషన్ కమిటీ అప్పుడా పోటీలను ఆపి వేసింది కూడా. దాదాపు ఆ సమయంలోనే విజయవాడలో జరిగిన అంచాలపోటీలను వ్యతిరేకిస్తూ ఆంధ్రదేశంలోని మహిళా సంఘాల వాళ్ళు పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు. అప్పటినుండి నిన్న మొన్నటి హైద్రాబాద్’ ప్రేరణ’ వంటి సంస్థలు నిర్వహించే. మిస్ ఆంధ్ర పోటీలను ఎవరో ఒకరు ఎక్కడో ఒకచోట ప్రతిఘటిస్తూనేవున్నారు.
1980వ దశకం ఆంధ్రదేశంలో స్త్రీల ప్రతిఘటనా చరిత్రకు స్పష్టమైన రూపు రేఖల నియ్య టమే కాదు, సాహిత్యరంగాన్ని స్త్రీవాదోద్యమంతో ఆనస్యంగా ప్రభావితం చేసింది.భావజాల ప్రసారానికి అనువైన సాధనం సాహిత్యమే కదా! సమాజం స్త్రీ అంటే ఇచ్చిన నిర్వచనాన్ని స్త్రీకి నిర్దేశించిన సామాజిక కౌటుంబిక సాంస్కృతిక పాత్రలని నిరాకరిస్తూ తమను తాము నిర్వచించుకొంటూ కథలు, నవలలు, కవిత్వం వ్రాశారు. అందాల పోటీల వ్యతిరేక చైతన్యాన్ని పెంచే సాహిత్యానికి విమల వ్రాసిన ‘సౌందర్యాత్మకహింస’ ప్రతినిధి రచన. 1988 లో వచ్చింది.
అందాల పోటీ వ్యవస్థ 34,24,35 కొలతల మధ్య స్త్రీని నిర్వచించింది. మొటిమలు రాకుండా ముఖ సౌందర్యాన్ని కాపాడుకొనటం, జుట్టురాలకుండా కేశ సంపదను సంరక్షించుకొనటం, నడుం లావెక్కకుండా అనునిత్యం శరీర స్పృహతో జాగరూకులై వుండటం స్త్రీల జీవితమని నిర్వచించింది. తనకంటే భిన్నమైన ఒక వ్యవస్థ నిర్వచించిన పరిధిలో స్త్రీ తనను కుంచించుకొని జీవించటం ఒక హింసా ప్రక్రియ. వ్యవస్థ నిర్వచించిన పద్ధతిలో సౌందర్యాన్ని పొందే క్రమంలో క్షణక్షణం శరీరం గాయపడుతుంది. సౌందర్యం కోసం వెంపర్లాట స్త్రీ సహజ లక్షణమని, సహజాతమని అనుకొనేంతగా మాయ కమ్ముకొంటుంది. మనసు బాధపడుతుంది. దీనిని సౌందర్యాత్మక హింస అని చెబుతూ విమల అందం పోటీయైన చోట అందం సరుకైన చోట అందాల వ్యాపారాన్ని ద్వేషిద్దాం” రండి అని పిలుపునిచ్చింది.
అందాల పోటీల వ్యతిరేక చైతన్యం ఒకవైపు అభివృద్ధి చెందుతూనే వున్నా‘అందం’ ఒక సహజాతాంశమని స్త్రీలను పురుషులను నమ్మించటంలో వ్యాపారప్రపంచ సంస్కృతి తగినవ్యూహాలతో విస్తరిస్తూనే వుంది. చర్మ సౌందర్యాన్ని
ఇనుమడింపచేసే తమ ఉత్పత్తులను, సబ్బులను, క్రీములను, వాడితే పిల్లల తల్లులు కాలేజీ అమ్మాయిల్లాగా, పెళ్ళికాని కన్నె పిల్లల్లాగా కనబడతారని, పెళ్ళికాని అమ్మాయిలు అబ్బాయిలను ఆకర్షించ గలుగుతారని, అలాగే కేశ పోషణకు తమ ఉత్పత్తులను వాడితే ప్రౌఢ వయస్కులు (ఆంటీలు) అమ్మాయిల్లాగా కనబడతారని, భర్తల ఆదరానికి పాత్రులవుతారని చెప్పి చూపించే వ్యాపార ప్రకటనలు ఈ కాలంలోనే కోకొల్లలుగా వచ్చాయి. అందాన్ని పరిపోషించే బ్యూటీ పార్లర్లు చిన్న నగరాలలో సైతం వీధి వీధినా వెలిశాయి. ఉన్నత మధ్యతరగతి స్త్రీల జీవితంలోకి శారీరక సౌందర్య స్పృహను అత్యంత ప్రధానాంశంగా ప్రవేశపెట్టాయి. స్త్రీలను ప్రక్కదారులు పట్టించే ఈ వ్యాపార సంస్కృతి పట్ల మహిళా ఉద్యమకారులలో నానాటికీ పెరుగుతున్న ఆందోళన, స్త్రీల జీవితాలను నియంత్రిస్తున్న వ్యవస్థలను భావజాలాన్ని అర్థం చేసుకొనటానికి అందివచ్చిన లైంగిక రాజకీయ సిద్ధాంతాల అవగాహనకలిసి ఇటు ఆంధ్రదేశంలోను, అటు మొత్తం భారత దేశంలోను ప్రపంచ సుందరి పోటీల పట్ల, అవి భారత దేశంలో జరగటం పట్ల వ్యతిరేక ఉద్యమరూపాన్ని తీసుకొనేట్లు చేశాయి.
2
అబద్ధాలు మూడు రకాలు అంటారు. అవి: 1. అబద్ధాలు 2. శుద్ధ అబద్దాలు 3. స్టాటిస్టిక్స్ అంటే గణాంకాలు. ఈ మూడో రకానివి అత్యున్నత స్థాయి అబద్దాలు. అంతేకాదు ఎవరూ ప్రశ్నించటానికి వీల్లేని వ్యవస్థీకృత అబద్ధాలు. సంఖ్యాపరమైనవి కావటం వలన శాస్త్రీయంగా చెప్పినట్లనిపిస్తాయి. సంక్లిష్టంగా వుండటం వలన సామాన్యులు ప్రశ్నించలేరు. అందువలన ఎటువంటిదాన్నయినా గణాంక వివరాలతో సమర్ధించటానికి వీలుంది. తిమ్మిని బమ్మిని చేయటానికి వీలుంది. ప్రపంచ సుందరి 96 పోటీలపై ప్రజాభిప్రాయాన్ని సేకరించటానికి జరిగిన సర్వేలలో నిగ్గుతేలిన నిజం వెనుకవున్న అసలు నిజం అదే. ప్రపంచ సుందరి పోటీలు బెంగుళూరులో జరగటానికి వీల్లేదంటున్న స్వచ్ఛంద సంఘాల, మహిళా సంఘాల అభిప్రాయం మీద జనాభిప్రాయ ప్రతిస్పందనలు ఎలా వున్నాయో తెలుసుకోవటానికి దక్కన్ హెరాల్ట్ దిన పత్రిక, ఆప్ట్ రీసెర్చి గ్రూపు కలిసి బెంగుళూరులో, బళ్ళారిలో ఒక సర్వేను నిర్వహించి అందాల పోటీలకు సర్వత్రా ఆమోదం లభించిందని 75.7 శాతం మంది ఆనుకూల్యాన్ని చెప్పారు. 78.8 శాతం మంది ఈ పోటీలు కొనసాగాల్సిందేనని పట్టు పట్టినట్లు పేర్కొన్నారు. ఓటు వేసింది ఎంతమంది అన్నది కాక, వెయ్యబడిన ఓట్లలో ఎవరికి ఎక్కువ వచ్చాయన్న దానిమీద ప్రజాస్వామ్య ప్రభుత్వాలు మనుగడ సాగిస్తున్నట్లే సర్వేలో ఎంతమంది పాల్గొన్నారన్నది కాక, పాల్గొన్న వాళ్ళలో ఎక్కువ మంది ఏ అభిప్రాయాన్ని ప్రకటించారన్న దానిమీద నిజాల నిగ్గు తేల్చటం జరుగుతుంటుంది. శాంపిల్ సర్వేలలోని బండారం ఇదే. ప్రపంచసుందరి -96 పోటీలు జరగాలా వద్దా అన్న దానిమీద జరిగిన ఈ సర్వేలో పాల్గొన్నవాళ్ళు దాదాపు 600 మంది. వీరిలో పురుషుల శాతం ఎక్కువ. అత్యధిక శాతం (29.8) నెలకు పదివేలు సంపాదించే ఆదాయవర్గాల వాళ్ళు. వ్యాపారస్తులు. ఇతర వ్యాపకాల వాళ్ళు ఎక్కువమంది (12+21.8 శాతం) -బెంగుళూరు నగరానికి వున్న కాస్మోపాలిటిన్ ప్రతిష్టపట్ల వున్న భ్రమా విశ్వాసాల నుండి ప్రపంచసుందరి -96 పోటీలు బెంగుళూరులో జరగటాన్ని గర్వంగా, గౌరవంగా భావించిన వర్గం వాళ్ళ అభిప్రాయమిది.
సంఘర్షిస్తున్న ఈ భావాల అభిప్రాయాల వర్తమానం పై రేపటి మహిళల ప్రతిస్పందన ఎలావుందో తెలుసుకొందామని స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వరంగల్లులో 1996 నవంబరు 23న కాలేజీ విద్యార్థులతో “అందాల పోటీలు విభిన్న దృక్పథాలు” -అనే అంశం మీద ఒక సదస్సు నిర్వహించింది. అవును కాదు వంటి జవాబులు చెప్పాలని నిర్దేశించే ప్రశ్నావళిని ఇయ్యటం కాక, అందాల పోటీల మీద తమ అభిప్రాయాలను తాము అనుకొన్న పద్ధతిలో చెప్పటానికి వీలుగా జరపబడింది ఈ సదస్సు. ఇందులో 20మంది అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి విద్యార్థులు పాల్గొన్నారు. మధ్యతరగతి నేపథ్యం వాళ్ళది. ఇప్పుడిప్పుడే అభిప్రాయాలు ఏర్పరుచుకొంటున్న వయస్సు వాళ్ళది. వాళ్ళలో ఇద్దరు మాత్రం అందాల పోటీలను సమర్ధించారు. పురుషులతో సమానంగా స్త్రీలు కూడా వుండాలంటే నాలుగు గోడలనుండి బయటపడి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనటమే మార్గమని, ఇన్నాళ్ళు ఈ పోటీలు జరుగుతూనే వున్నపుడు ఇప్పుడు నిరసించట మెందుకని, ఇది వదిలి మిగిలిన స్త్రీల సమస్యల మీద దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుందని, తమకు ప్రత్యేకంగా లభించిన అందాన్ని ప్రదర్శించుకొనే హక్కు స్త్రీలకు వుందని వాళ్ళు అభిప్రాయపడ్డారు. సమానత్వం గురించి, హక్కుల గురించి అరకొర అభిప్రాయాలు ఏర్పరిచే సినిమాలు, సాహిత్యం మొదలైన వాటి ప్రభావం ఇక్కడ పరిగణనలోకి తీసుకోవటం అవసరం. పోతే మిగిలిన పద్దెనిమిది మందిలో ముగ్గురు మాత్రం భారతీయ సంస్కృతికి ఇవి వ్యతిరేకం కనుక వద్దన్నారు. బాహ్య సౌందర్యం కంటే ఆత్మిక సౌందర్యం ముఖ్యమన్నారు.
మిగిలిన పదిహేను మంది అందాన్ని వ్యాపారపు సరుకుగా మార్చటాన్ని గుర్తించి, బహుళ జాతి సంస్థల ప్రయోజనాలను కాపాడే ఇలాంటి పోటీలకు ప్రభుత్వం మద్దతు నివ్వటాన్ని నిరసిస్తూ మాట్లాడారు. పురుషులకులేని అందాల పోటీలు స్త్రీలకెందుకు అని ప్రశ్నించారు. వ్యక్తి కృషితో సంబంధంలేని బాహ్యసౌందర్య ప్రాధాన్యాన్ని నిరాకరించారు. మూడవ ప్రపంచ దేశాల స్త్రీలను బహుళజాతి సంస్థల ఉత్పత్తుల అమ్మకాన్ని పెంచే సాధనాలుగా మార్చే అందాల పోటీలను ఏవగించుకొన్నారు. స్త్రీల మనోభావాలను కించపరచటమేకాక టూరిజం పేరిట స్త్రీలను వ్యభిచారులుగా కూడా చేసే ప్రమాదం వీటిలో వుందని ఆందోళన పడ్డారు. ఈ పోటీలలో పాల్గొనటం వలన స్త్రీకి లభించే స్వేచ్ఛ వట్టి బూటకమని తేల్చేసారు. మధ్యతరగతి వర్గం మీద అందాల పోటీ సంస్కృతి ప్రసరించే ప్రతికూల ప్రభావాన్ని గురించి హెచ్చరించారు. దేశం అభివృద్ధి అందాల పోటీల నిర్వహణ మీద ఆధారపడిలేదని, ఇందుకోసం ఖర్చు పెట్టే డబ్బుని సంక్షేమ పథకాలకు, ఉత్పత్తుల పెరుగుదలకు ఉపయోగించటం న్యాయమని స్పష్టం చేశారు.
‘అందాలపోటీలు – విభిన్న దృక్పథాలు’ అన్న అంశం మీద 1996 నవంబరు 23 నాడు జరిగిన ఆ సదస్సులో పాల్గొన్న వాళ్ళ అభిప్రాయాలను బట్టి చూస్తే మొత్తం మీద 90 శాతం మంది, అందాలపోటీలకు వ్యతిరేకతనే వ్యక్తం చేశారు. భారతీయ సంస్కృతికి వ్యతిరేకమని అందాల పోటీలను తిరస్కరించిన ముగ్గురిని కూడా మినహాయించినా అందాలపోటీలను వ్యతిరేకించిన వారి శాతం 75శాతం అవుతుంది. ప్రపంచ సుందరి పోటీలకు 75 శాతం మంది అనుకూలతను సంపాదించి చూపిన గణాంక వివరాలను సమాంతరంగా ప్రపంచసుందరి పోటీలకు అదే 75 శాతం మంది వ్యతిలేకతను ప్రాతినిధ్యం వహించే ఈ గణాంక వివరాలను నిలబెట్టినప్పుడు ఒకవిషయాన్ని గురించిన అవగాహనకు సంఖ్యాబలం కంటే దృక్పథం చాలా ముఖ్యమని స్పష్టమవుతుంది.
3
అందాల పోటీలను ఎందుకు వ్యతిరేకించాలో అర్థం కావాలంటే అందం నిర్వచించబడినతీరు, దాని పరిమితి తెలియాలి. అసలు అందం అంటే ఏమిటి ? అందం అనే భావన ఎలా మారుతూ వచ్చింది? అది స్త్రీ పరంగానే ఎందుకు నిర్వచించబడు తుంది ? అది పోటీ రూపాన్ని ఎప్పుడు తీసుకున్నది ? ఎందుకు తీసుకొన్నది – అనేవి ఇప్పుడు మనముందున్న ప్రశ్నలు.
అందం అంటే వెంటనే స్ఫురించేది బాహ్య రూపం. బాహ్యరూపమంటే కనుముక్కు తీరు, ఎత్తు, లావు, రంగు, సౌష్టవమైన అంగనిర్మాణం. భౌగోళిక భిన్నత్వాన్ని బట్టి ఈ అందం ప్రాంతానికి ప్రాంతానికి, దేశానికి దేశానికి మారుతూ వుంటుంది. జాతిని బట్టి కూడా ఈ అంశాలు విభిన్నంగా వుంటాయి. అందుకే అందానికి విశ్వజనీన నిర్వచనం లేదు.అందం అసలు బయటి విషయం కానేకాదు. ప్రకృతితో మనిషికి ఏర్పడ్డ సంబంధ క్రమంలో రూపొందిన భావన అది. ప్రకృతిలోని ఏ వనరులయితే తమ ఆకలి దప్పులు తీర్చాయో, వేటి మీదయితే తమ జీవిత సమస్తం ఆధారపడి వుందో వాటిని గూర్చిన ఆత్మీయ భావ ప్రపంచం నుండి తొలి మానవులలో ‘అందం’ అనే భావన కదలాడివుంటుంది. నింగీ, నేలా, కొండా, కోనా, చెట్టు, చేమా, గాలి, నీరు ఆ విధంగా అందానికి తొలి ప్రతీకలయినాయి. ప్రకృతితో తమకున్న సజీవ సంబంధ జీవితానుభవం నుండి మనిషి తనను తాను నిర్వచించుకొనే క్రమంలో పొందిన మానసికోద్వేగం నుండి ‘అందం’ ఒక నిర్దిష్ట భావనగా రూపొందటం మొదలైవుంటుంది.
ఆహారోత్పత్తి దశలో ప్రకృతికున్న ఉత్పత్తి శక్తి స్వభావం స్పష్టమవుతూవచ్చింది. దానితో అందానికి సంబంధించిన మానవ భావన క్రమంగా స్పష్టమైన రూపాన్నితీసుకొని నిర్దిష్టమైన ఆకృతి రూపంలో ఆరాధనీయమైంది. సమస్త ప్రకృతి పూజనీయమైంది. ఆ ఒరవడిలోనే ఉత్పత్తి పునరుత్పత్తి సంబంధాలలో వుండే స్త్రీ పురుషుల యవ్వన సహజమైన ఆకర్షణ బలం, ఆరోగ్యం ప్రాతిపదికలుగా మానవజీవన సంబంధాలలోకి అందం అనే భావన ప్రవేశించి వుంటుంది. ఉత్పత్తి శక్తులు ఎదుగుతున్న క్రమంలో వచ్చిన మిగులు వర్గాలను సృష్టించింది. ఈ వర్గాల ప్రాతిపదికగా ఏర్పడిన బానిస సమాజపు ప్రధాన లక్ష్యం మిగులు ఉత్పత్తిని పెంచుకొనటం, అందువల్లనే బలం ఆరోగ్యం ఆ సమాజంలో కూడా అందానికి ప్రతీకలయ్యాయి. ఉత్పత్తి సాధనాల మీద పురుషుడి అదుపు పెరిగేకొద్దీ – స్త్రీని ఉత్పత్తి ప్రక్రియ నుండి దూరం చేసి పునరుత్పత్తి విధులకే పరిమితం చేయటం జరిగింది. ఆ చారిత్రక ఘట్టంలోనే ప్రకృతితోను, స్త్రీ పురుషులిద్దరి జీవనంతోను ముడిపడి వున్న ‘అందం’ అనే భావన సహజ సంబంధాలనుండి విడదీయబడి పురుషుని దృష్టికోణం నుండి స్త్రీ పరంగా కొత్త నిర్వచనాన్ని తీసుకొంది. ఉత్పత్తి నుండి విడదీయబడిన స్త్రీని బలంతో నిమిత్తం లేని అందంతో అంచనా వేయటం మొదలయింది. భూస్వామ్య వ్యవస్థ పితృ స్వామ్య నిర్మాణాలతో విస్తరిస్తూ అందాన్ని స్త్రీ పరంగానే చూచే భావజాలాన్ని విపరీతంగా పెంచింది.
ఋగ్వేద కాలంలో ప్రారంభమైన ఈ ప్రక్రియా పరిణామాలు మధ్య యుగాల సాహిత్యంలో ప్రతిఫలించి కనబడతాయి. ఋగ్వేదంలో శచీసూక్తం శత్రునాశకుడైన కొడుకును, సుందరి అయిన కూతురిని ప్రస్తావిస్తుంది. వీరత్వం, బలం మగవాళ్ళ లక్షణంగా, సౌందర్యం ఆడవాళ్ళ లక్షణంగా విడిపోవటం మొదలైంది అక్కడే. పురాణేతిహాసాల దగ్గరకు వచ్చేసరికి అందం స్త్రీ శరీర అంగాంగ సంబంధి అయింది. శరీర నిర్మాణం, ముఖ వర్చస్సు, వక్షోజ సౌందర్యం, కేశ సంపద, నడుము నాజూకు తనం – ఇవన్నీ స్త్రీ అందాన్ని నిర్వచించే అంశాలయ్యాయి. భాగవతం ఈ చట్రంలోనే రుక్మిణి సౌందర్యాన్ని వర్ణించింది. వర్ణనా ప్రధానమైన ప్రబంధాలు స్త్రీల అందాన్ని ఈ చట్రంలోనే చిలవలు పలువలు చేసి వర్ణించాయి. ప్రబంధయుగానికి పరాకాష్ట రూపం ‘విజయ విలాసం’. మను వసుచరిత్రల మార్గాన్ని మరింత విస్తరించి కొనసాగిస్తూ కళ్ళు, ముక్కు, పలువరుస, పెదవులు, గోళ్ళు, చెక్కిళ్ళు, నుదురు, గడ్డం, పిక్కలు, తొడలు, పాదాలు అన్నీ సౌందర్య స్థానాలుగా వైన వైనాలుగా వర్ణించింది. స్త్రీలో అందమంటే శరీర నిర్మాణామే. అదీ పురుష భోగానుకూలమైన యవ్వన దశా విశేష లక్షణ యుక్తమైన శరీరమే అన్న భావం స్థిర పడింది.
అంతే కాదు పురుషుడిపై ఆధారపడి వుండటమే స్త్రీకి లక్షణంగా లక్ష్యంగా చేసి పితృస్వామిక సమాజం ఆమె అధీనత్వాన్ని పెంచి పోషించే అంశాలే ‘అందం’ అని నిర్వచించింది. పురుషుడిని ఆలంబనగా చేసుకొని పైకి వచ్చే లతలాంటిదని స్త్రీకి నాజూకు తనమే అందమన్నారు. కుటుంబాధికారాన్ని ప్రశ్నించని అణుకువే ఆడదానికి అందం అన్నారు. తనను తాను వ్యక్తీకరించుకోకుండా సిగ్గుపడటమే స్త్రీకి అందం అన్నారు. పునరుత్పత్తి విధులే కుటుంబ స్త్రీ లక్ష్యం కనుక మాతృత్వమే స్త్రీకి అందం అన్నారు. ఇట్లా పునరుత్పత్తి విధులకే పరిమితం చేయబడి కుటుంబ నిర్మాణ చట్రంలో ఒదిగి, ఇంటిపనులతో సతమతమవుతూ భార్య స్థానంలో వున్న స్త్రీ అన్ని వేళలా అనుభవ యోగ్యంగా వుండదు. అందువల్ల పురుషుడి భోగానికి వీలుగా కుటుంబ వ్యవస్థకు సమాంతరంగా వేశ్యా వ్యవస్థ ఏర్పడింది. కుటుంబ వ్యవస్థలో స్త్రీకి అణుకువ, సిగ్గు అందమైతే వేశ్యా వ్యవస్థలో స్త్రీ అందం సిగ్గు నుండి, అణుకువ నుండి వేరుచేసి నిర్వచించబడింది. ఆట నైపుణ్యం, పాట మాధుర్యం, మాటచాతుర్యం వేశ్యా స్త్రీకి అందమని చెప్పబడింది. కుటుంబ స్త్రీ అందంలో భాగం కాని అలంకరణకు వేశ్యా స్త్రీ జీవితంలో అనితర ప్రాధాన్యత లభించింది. వేశ్యా స్త్రీ అందం పురుషులకు ఆనందం కలిగించే ఉమ్మడి సొత్తయింది. ఈ అందమైన తెరచాటున గాయపడే వాళ్ళ మనశ్శరీరాల బాధ ఎవరికీ పట్టనిదే అయింది.
ఇట్లా కుటుంబం లోపల స్త్రీ అందానికి, కుటుంబం బయట స్త్రీ అందానికి ఒకే వ్యవస్థా చట్రంలో రెండు భిన్న నిర్వచనాలుండటం ఒక వైరుధ్యం. అందానికి ఈ రెండు సందర్భాలలో ఇచ్చిన నిర్వచనాలు పూర్తిగా పరస్పర విరుద్ధంగా వున్నప్పటికీ, అవి ఏకకాలంలో పురుషుని ప్రయోజనాలను నేరవేర్చటానికే ఉద్దేశించబడ్డాయి. ఇది ఇందులోని అంతర్గత వైరుద్యం. ఈ రకంగా విశ్రాంతి వర్గాలకు చెందిన పురుషుల ప్రయోజనాల దృష్ట్యా అందం నిర్వచించబడింది. అందానికియ్యబడిన నిర్వచనాలు, సందర్భానుసారం మారుతూ వస్తున్న నిర్వచనాలు – అన్నిటికీ పురుషుని అవసరమే గీటురాయి అయింది. విశ్రాంతి వర్గానికి చెందిన స్త్రీలు పితృస్వామ్య సమాజం అందానికిచ్చిన ఈ నిర్వచనంలోని సారాన్ని తమ జీవిత సహజాతంగా మలుచుకొని ఆ పరిధిలోనే తమ అందాన్ని పెంచి పోషించుకొనే పనిలో నిమగ్నం కావటానికి శిక్షణ చిన్నప్పటి నుండే ప్రారంభమవుతుంది. కనుక ‘అందం’ అనేది విలువల రాహిత్యంతో గాని, విలువల తటస్థతతోగాని సంబంధం వున్న అంశం కాదు. పాక్షిక విలువలతో, పక్షపాత వైఖరితో ముడిపడి వున్న భావన అది.
పురుషుని కోణం నుండి స్త్రీపరంగా అందం ఈ విధంగా నిర్వచించబడిన చారిత్రక క్రమంలో అసంఖ్యాకంగా వున్న వేశ్యలనుండి ‘అందం’ నాట్యగాన కళా ప్రావీణ్యం కలిగిన స్త్రీని ‘నగర వధువు’ గా ఎంపిక చేసుకొనటానికి భూస్వామ్య రాచరిక వ్యవస్థల్లో పోటీ కార్య క్రమాలు నిర్వహించటం జరిగేది. రాజనర్తకి పదవి ఈ పోటీల ద్వారానే సంక్రమించేది. రాజ్య నియంత్రణలో రాజ్యం తరపున సాంస్కృతిక రాయబారుల పాత్ర నిర్వహించే స్త్రీలు వీళ్ళు. అందాల పోటీలకు ప్రారంభం అక్కడే జరిగివుంటుంది. ఈ విధంగా భూస్వామ్య రాచరిక వ్యవస్థ స్త్రీ అందాన్ని ప్రాథమిక స్థాయి ప్రాంతీయ పోటీ వస్తువుగా చేసింది.
పెట్టుబడులు విస్తరిస్తూ ప్రపంచ మార్కెట్టు రూపొందుతున్న నేపథ్యంలో ఇంతకు ముందుకంటే విస్తృత స్థాయిలో అందాన్ని నిర్వచించే ప్రయత్నం మొదలైంది. అందాన్ని గురించిన ఒక విశ్వజనీన భావనను రూపొందించి దానిని అంతర్జాతీయ విపణిలోకి ప్రవేశట్టే ప్రయత్నం కొనసాగుతున్నది. పోటీ ప్రధానంగా గల పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రారంభ దశలో వ్యయాన్ని కనిష్ఠం చేస్తూ ఉత్పత్తులను ఎలా గరిష్ఠం చేయాలన్నదే లక్ష్యం. ఈ దశలో స్త్రీలు కూడా బయటకు వచ్చి ఉత్పత్తి ప్రక్రియలో భాగస్వాములయ్యారు. అట్లా ఆనాడు కేవలం శ్రమ మాత్రమే అమ్మకపు సరుకయింది. ఇందులోని పోటీ ఉత్పత్తులను పెంచిందేకానీ కొనుగోలుశక్తిని, వినియోగ సామర్థ్యాన్ని పెంచలేకపోయింది. అందువల్ల ఏర్పడిన ప్రపంచ ఆర్థిక మాంద్యం రెండవ ప్రపంచ యుద్ధానికి దారితీసింది. పారిశ్రామిక దేశాల ఉత్పత్తి విధానం గుత్త పెట్టుబడిదారి రూపాన్ని సంతరించుకోగా వలసలు తృతీయ ప్రపంచ దేశాలుగా ఆవిర్భవించాయి. వీటిపై రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అదువు సంపాదించటం కోసం వివిధ అంతర్జాతీయ సంస్థలు ఏర్పడ్డాయి. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు ఏర్పడిన సందర్భంలో భాగంగానే అందాలపోటీలు నిర్వహించటానికి ఒక అంతర్జాతీయ సంస్థను 1951 లో ఎరిక్ మోర్లే స్థాపించాడు. . అంతర్జాతీయ పెట్టుబడిదారీ వర్గాన్ని, అంతర్జాతీయ కార్మిక వర్గాన్ని సృష్టించిన ఆధునిక రాజకీయార్థిక సందర్భం అంతర్జాతీయ అందాన్ని నిరూపించటానికి రంగం సిద్ధం చేసింది. దీనితో పురుష ప్రయోజనాలకు అనుగుణంగా స్త్రీ పరంగా నిర్వచించబడిన అందం పెట్టుబడి దారీ వ్యవస్థ ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవస్థీకృత రూపం తీసుకొనటం మొదలయింది.
వస్త్ర పరిశ్రమలో వచ్చిన విప్లవాత్మకమైన పరిణామాల ఫలితమైన పారిశ్రామిక విప్లవం పెట్టుబడిదారీ వ్యవస్థకు వస్త్ర పరిశ్రమను కీలకమైందిగా చేసింది. పెరిగిన వస్త్ర ఉత్పత్తులను ప్రపంచ వ్యాప్తంగా వినిమయం చేయగల మార్కెట్టును వెతుక్కొనే క్రమం మొదలయింది. వస్త్ర ఉత్పత్తులకు అనుబంధంగా దుస్తుల తయారీలో వచ్చిన మార్పులు కూడా మార్కెటు విస్తృతిని, స్థిరీకరణను ఒక అవసరంగా ముందుకు తీసుకువచ్చాయి. ఈ పరిణామాల ఫలితంగానే వస్త్ర ధారణలో మెళుకువలు నేర్పేమిషతో ‘మిస్ వరల్డ్’ పోటీలకు అంకురార్పణ జరిగింది. అందాన్ని స్త్రీల ప్రత్యేక లక్షణంగా చేసి ఆలంకరణ ద్వారా మరింత ఆకర్షవంతంగా దానిని ప్రదర్శించి పురుషుడిని ఆకట్టుకొనటం స్త్రీల ధర్మంగా నిర్ధారించిన పితృస్వామ్య సామాజిక విలువను పెట్టుబడిదారి వ్యవస్థ తన అభివృద్ధికి, ప్రయోజనాలకు అనుకూలంగా మలుచుకొన్నది. అందువల్లనే ఈ అందాల పోటీలకు సంబంధించిన అంశాలన్నింట్లో పితృ స్వామిక సంస్కృతీ సారమే ఆధునిక రూపంలో చోటుచేసుకొని కనిపిస్తుంది.
4
ప్రపంచ సుందరి పొటీ నిబంధనలను, పోటీలు జరిగే తీరును పరిశీలించి చూస్తే పితృస్వామిక రాజకీయాలలో భాగంగానే ఈ పోటీలు జరుతున్నాయని స్పష్టమవుతున్నది. పెళ్ళి కావలసిన ఆడపిల్ల అర్హతలకు ప్రపంచ సుందరి పోటీలో పాల్గొనే స్త్రీలకు నిర్దేశించిన నిబంధనలకు పెద్ద తేడా కనిపించదు. పెళ్ళి కావలిసిన పిల్లకు యవ్వనం ఒక ఆవశ్యకత అంశం. ప్రపంచ సుందరి పోటీలలో పాల్గొనే స్త్రీకి యవ్వనం ఒక ప్రధానమైన అర్హత. 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు వాళ్ళే ఈ పోటీలో పాల్గొనాలి అనే నిబంధన దానినే సూచిస్తుంది. పెళ్ళికి ముహూర్తం పెట్టినట్లే ప్రపంచసుందరి ఎంపికకు ఒక ముహుర్తం -అర్ధరాత్రి 12 గంటలు – వుంది. ఈ ముహూర్తం వేళ ప్రపంచసుందరి తలపై కిరీటం పెడతారు. కిరీటం భూస్వామ్య రాచరిక విలువలకు ప్రతీక. దీనిని పెట్టుమడిదారీ వ్యవస్థ వాడుకోవటం ఒక వైరుధ్యం.
ప్రపంచ సుందరి పోటీలు ఫైనల్స్ కు చేరుకున్న దశలో పోటీలో పాల్గొనే ఆ స్త్రీలను సూటూ బూటూ వేసుకున్న యువకుడు చేయిపట్టి తీసుకువచ్చి వేదికమీదకి వదిలేసి తాను నిష్క్రమిస్తాడు. ఆడవాళ్ళు తమంతటతాము నడవను కూడా లేని నాజూకు బొమ్మలు. వాళ్ళకు కావల్సింది పురుషుడి ఆలంబన అన్న పితృస్వామిక భావాన్ని ఈ సన్నివేశం ప్రతిఫలిస్తుంది. స్త్రీల జీవితాన్ని నాలుగు గోడలకు పరిమితం చేసి, ఇంటికి కుదించిన పితృస్వామిక సంస్కృతిలో పెళ్ళిచూపులు, పెళ్ళి మొదలైన ప్రత్యేక సందర్భాలలో ఎవరో ఒకరి ఆలంబన లేకుండా స్త్రీకి నడకే వుండదు. ఇదే సంస్కృతిని ప్రపంచసుందరి పోటీ కూడా ప్రతిబింబిస్తుంది.
ప్రపంచసుందరి పోటీలో కేవలం అందమే ప్రాతిపదిక కాదని దయా నిష్కల్మషత, నిండైన వ్యక్తిత్వం, ప్రతిభాపాటవాలు కూడా ప్రాముఖ్యం వహిస్తాయని అంటారు. నిజానికి 70 శాతం వ్యక్తిత్వానికి 30 శాతం మాత్రమే అందానికి ప్రాముఖ్యత వుందని చెప్పే ఈ పోటీలో నూటికి నూరుపాళ్ళు ప్రముఖంగా వుండేవి శరీర ప్రదర్శన దుస్తుల ప్రదర్శన, కేశాలంకరణ, నవ్వులు, నడకలు. స్త్రీ అందాన్ని అవయవాల సంబంధంలో నిర్వచించిన భూస్వామ్య పితృస్వామిక విలువలే ఇక్కడకూడా కొనసాగటం స్పష్టమవుతూనేవుంది. ప్రతిభా పాటవాల నిర్ధారణకు, వ్యక్తిత్వ నిరూపణకు వేసేది ఒకే ఒక్క ప్రశ్న. అది కూడా ఫైనల్స్ కు చేరుకొన్న అయిదుగురికి మాత్రమే వేస్తారు. అవి కూడా వేరు వేరు ప్రశ్నలు. ఈసారి పోటీలలో పితృస్వామిక సంస్కృతిని స్థిరపరిచే సమాధానం చెప్పిన ‘ఇరేనే స్క్లవే’ అనే గ్రీకు యువతికి ప్రపంచ సుందరి కిరీటం లభించటం గమనించవలసిన విషయం. వర్తమాన సమాజంలోస్త్రీ ఎప్పుడూ ఒక తల్లిగా, చెల్లిగా, భార్యగా, సహచరిగా, సలహాదారుగా వివిధ పాత్రలను సమసామర్థ్యంతో నిర్వహిస్తుందని చెప్పిన సమాధానం ఆమెను ప్రపంచ సుందరిగా నిలబెట్టింది. పితృస్వామిక సమాజం స్త్రీని నిర్దేశించిన మూస నమూనా పాత్రలను ఆమోదించిన స్త్రీని ప్రపంచసుందరిగా చేసిన ఈ సందర్భం దానినే ప్రపంచ సంస్కృతిగా ప్రచారంలోకి తెచ్చినట్లయింది. స్త్రీల లైంగికతను పితృస్వామ్యం నిర్వచించిన పద్ధతిలోనే యథాతథంగా స్వీకరించి ప్రపంచసుందరి పోటీలకు ప్రధానమైన నిబంధనగా చేసుకొన్న మిస్ వరల్డ్ లిమిటెడ్ సంస్థ ఇట్లా కాక మరొకరకమైన సంస్కృతిని ప్రచారం చేస్తుందనుకొనటం పెద్ద భ్రమ.
స్త్రీవాద ఉద్యమ భావజాలం స్త్రీల శరీరం మీద, లైంగికత మీద స్త్రీల హక్కును ప్రతిపాదించి ప్రచారం చేసింది. అయితే ప్రపంచ సుందరి పోటీలలో పాల్గొనే స్త్రీలకు కన్యాత్వం ఒక షరతు. విడాకులకు, పునర్వివాహానికి, వివాహంతో నిమిత్తం లేని స్త్రీపురుష సంబంధాలకు, సంతానానికి చట్టబద్ధతను, సామాజిక ఆమోదాన్ని సంతరించి పెట్టే భావ జాలం ఈనాడు బలం పుంజుకొంటున్నది. స్త్రీవాద ఉద్యమనేపథ్యంలో అందాలపోటీలకు వీటిని అనర్హతలుగా ప్రకటించటం గమనించవచ్చు. పెట్టుబడిదారి వ్యవస్థ చట్రంలో పితృ స్వామిక విలువల ప్రభావానికి, ఆధిక్యతకు వున్న ప్రాధాన్యాన్ని ఇది స్పష్టం చేస్తుంది.
సమాజాల అభివృద్ధి క్రమంలో స్త్రీలు తమ అభ్యుదయంకోసం సాధించుకున్న లైంగిక హక్కులను తిరస్కరిస్తున్న ఈ పోటీలు అదే సమయంలో ఆ హక్కులతో పాటే ఆవిర్భవించిన స్త్రీలకు తమ శరీరం మీద తమకు హక్కు – అన్న అంశాన్ని మాత్రం ఆమోదించటం ఒక వైరుధ్యం. స్త్రీలకు తమ శరీరం మీద తమకు హక్కు దానిని ప్రదర్శించటం వరకే. ఆ శరీరం ఏ కొలతల మధ్య ఒదిగి, ఏ విధంగా ప్రదర్శించబడాలో మాత్రం నిర్దేశించేది అందాల పోటీ వ్యవస్థే. ఈ శరీరాన్ని నిర్దేశిత విలువల ప్రకారం ప్రదర్శించటానికి చేయవలసిన అలంకరణ ఎంతో వుంటుంది. ఇదంతా వాళ్ళకు శ్రమకలిగించేది. శరీరాన్ని గాయ పరిచేదికూడా అయి వుంటుంది. ఈ నిర్దేశిత కొలతలను, శరీర సౌష్టవాన్ని పరిపోషించుకోవటానికి తగిన వ్యాయామం చేస్తూ, తిండిని నియంత్రించుకుంటూ, నిరంతర సౌందర్య స్పృహతో నిద్రాహారాలకు దూరం కావలసి వస్తుంది. గత సంవత్సరం ప్రపంచ సుందరిగా ఎన్నికైన మిస్ వెనిజులా తననడిగిన ఒక ప్రశ్నకు జవాబుగా హాయిగా తిని, సుఖంగా నిద్రపోతానని చెప్పిన విషయం ఇక్కడ గమనించవలసిన అంశం. శరీరాన్ని ప్రదర్శించే హక్కు, ఎన్ని నిర్భంధాల మధ్య, ఎన్ని నియంత్రణల మధ్య అమలవుతుంటుందో స్పష్టం చేసింది ఈ సంఘటన. తమ శరీరం మీద తమకు హక్కు అన్న సూత్రం ప్రాతిపదికగా అందాలపోటీలను స్త్రీవాదులలో ఒక వర్గం సమర్థిస్తుంది. కాని తమ శరీరాన్ని తమ అనుభవం కోసం ఆనందంకోసం కాకుండా ఇతరులకు కనువిందు చేయటం కోసం, వ్యాపార ప్రయోజనాలకు వస్తువుగా చేయటం, బహుళ జాతి సంస్థల నియంత్రణలో, పురుషుల అధికారం క్రింద ప్రదర్శించాల్సిరావటం స్త్రీకి తన శరీరం మీద హక్కు అనే భావనను అభావం చేస్తున్న స్థితినే సూచిస్తాయి.
ఈ అందాలపోటీ వ్యవస్థ స్త్రీ స్వేచ్ఛకు సంబంధించిన అంశాన్ని కూడా చర్చకు తెచ్చింది. పెట్టుబడి దారి వ్యవస్థకు పునాది అయిన వ్యక్తి స్వేచ్ఛ అందాల పోటీలలో పాల్గొనటం ద్వారా స్త్రీలకు కూడా లభ్యమవుతుంది అంటున్నారు. స్త్రీకి అందాల పోటీలలో పాల్గొనే స్వేచ్ఛ అభివృద్ధికరమైందని భావిస్తున్నారు. కాని ఇది వాస్తవంకాదు. పెట్టుబడిదారీ వ్యవస్థలో వ్యక్తి స్వేచ్ఛ వుందనుకోవటం ఎంత భ్రమో స్త్రీ స్వేచ్ఛ వుంటుందనుకోవటం కూడా అంతే భ్రమ, వ్యక్తి తన ఇష్టం వచ్చినప్పుడు, ఇష్టం అయిన చోట ఇష్టమైన పనిని యధేచ్ఛగా చేసుకోవచ్చంటారు. కానీ ఉత్పత్తి సాధనాలనుండి దూరమైన వ్యక్తులకు తమ ఇష్టంతో నిమిత్తం లేకుండా యజమాని ఇష్టం మేరకు, యజమాని నిర్దేశించిన పనిని, నిర్దేశించిన వేతనానికి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అదే విధంగా ఏ శరీరం తనదనుకొని తన ఇష్టం వచ్చినప్పుడు ఇష్టమైన రీతిలో ఆ శరీర సౌందర్యాన్ని ప్రదర్శించవచ్చునని ఈ పోటీలలో పాల్గొనే స్త్రీలు భావిస్తున్నారో ఆ శరీరమే తమనియంత్రణలో లేకుండా పోతున్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. స్పాన్సర్ చేసిన సంస్థలనియమానుసారం తమ సౌందర్యాన్ని ప్రదర్శించాల్సి రావటం ఆ స్వేచ్ఛ ఎంత భ్రమాన్విత సత్యమో స్పష్టం చేస్తున్నాయి. ఐశ్వర్యారాయ్ ఒక కిలో బరువు పెరిగిందనీ, ఆ విషయంలో అప్రమత్తంగా వుండక పోయినట్లయితే టైటిల్ వాపస్ తీసుకుంటానని స్పాన్సరింగ్ సంస్థ బెదిరించటం ఇక్కడ గమనించాల్సిన విషయం.
అందాల పోటీ వ్యవస్థ చర్చకు తెచ్చిన మరొక అంశం సమానత్వం. దేశాల జాతుల భేదం లేకుండా స్త్రీలందరిని ఏక వేదిక మీదకు తెచ్చే అందాలపోటీలు సమానత్వ సంస్కృతిని పెంచి పోషిస్తాయని అనుకొంటారు. కానీ అది నిజం కాదు. అసలు అందాల పోటీల వేదిక మీదకు రావటానికి ముందు అందం సంపాదించటానికి పెట్టాల్సిన పెట్టుబడి చాలా పెద్దది. ప్రత్యేక ఆహారం, ప్రత్యేక శిక్షణ, ప్రత్యేకంగా కనిపింపచేసే అలంకరణ, దుస్తులు అన్నీ ఖర్చుతో కూడిన వ్యవహారాలే. శరీరం మెరుపు కోసం, చర్మ సంరక్షణ కోసం, కేశ సంరక్షణ కోసం, ఉపయోగించాల్సిన ద్రవ్యాలు, ద్రవాలు వేల రూపాయల ఖర్చుతో కొనుగోలు చేయాల్సినవి. మిస్ నైజీరియా తన కనురెప్పలను వెడల్పుగా కనిపింప చేయటానికి 48 రంగుల్ని అయిదు కుంచెల్నీ ఉపయోగిస్తానని చెప్పిన విషయం అందం సంపాదనకు పెట్టుబడి ఎంత స్థాయిలో వుంటుందో సూచిస్తుంది. అందాల కుందనపు బొమ్మలు కావాలంటే స్త్రీలు కాసులు కుమ్మరించాల్సిందే. అందం అంటే ‘డెకరేషన్’ అయిపోయిన ఈ స్థితిలో స్త్రీలందరూ సమానంగా అందం కొనుక్కోగలిగిన వాళ్ళేనా అన్న ప్రశ్న ఉదయించక మానదు. పై వర్గాల స్త్రీలు మాత్రమే అందం కొనుక్కోగలిగిన స్థాయిలో వుండగా పెట్టుబడిదారీ వ్యవస్థలో వుండే బోలుతనాన్నంతా ప్రతిఫలించే ఈ అందాల పోటీ వ్యవస్థ మిరుమిట్లు గొలిపే తన ఆకర్షణ లక్షణం చేత, లాంఛనంగా అంగీకరించి ప్రచారంలోకి తెచ్చిన సమానతా సూత్ర లక్షణం చేత మధ్యతరగతి స్త్రీలను తనదైన భ్రమాన్విత సత్యంలోకి లాగుతుంది. అందమే జీవిత మనకుకొనేట్లు చేస్తుంది. అందాన్ని కొనుక్కొనేందుకు ప్రోత్సహిస్తుంది. అందుకొసమే వీధి వీధినా బ్యూటీ పార్లర్లు సృష్టిస్తుంది.
నూతన ఆర్థిక విధానాల ఫలితంగా కాస్మటిక్ పరిశ్రమలో వచ్చిన పరిణామాలు స్త్రీలను శాశ్వతమైన వినియోగదారులుగా చేసుకొనే క్రమంలో అందం గురించిన మోహ మాయాజాలాన్ని సృష్టించాయి. ఈ మోహ మాయాజాలం చివరికి స్త్రీలను కాస్మటిక్ శస్త్ర చికిత్సలద్వారా శరీర నిర్మాణ చర్మకేశ సౌందర్యాలను పరిపోషించు కొనే కృత్రిమ జీవిత లాలసలోకి నెడుతుంది. పై వర్గాలలోకి చేరేందుకు తహతహలాడుతూ, గుర్తింపుకోసం తాపత్రయ పడే మనస్తత్వాన్ని మధ్యతరగతి మహిళలలో పెంచి పోషిస్తుంది. ఈ క్రమంలో అందం ఒక సమానతా ప్రాతిపదిక సూత్రమై ఉన్నత మధ్య తరగతి స్త్రీల మధ్య అగాధాన్ని పూడ్చేస్తుందన్న భ్రమను సృష్టిస్తూనే వాస్తవంలో వాళ్ళ మధ్య అంతరాలను మరింత పెంచుతుంది. ఎంత తాపత్రయపడ్డా ఏ నాటికి తాము అందాన్ని కొనుక్కొనే విషయంలో పై వర్గం స్త్రీలతో పోటీ పడలేక మధ్యతరగతి స్త్రీలు నిరాశా నిస్పృహలకు లోనవుతూ పక్కదారులు పట్టడమో, పలాయన వాదాన్ని ఆశ్రయించటమో జరుగుతుంది.
శ్రామిక స్త్రీలు ఎలాగూ ఈ రెండు వర్గాల స్త్రీల కంటే భిన్నంగా తమ నిత్య జీవన పోరాటాలలో తాము నిమగ్నమయ్యే వున్నారు. కనుక ఉన్నత మధ్య తరగతి శ్రామిక వర్గ స్త్రీల మధ్య వున్న వర్గ వైరుధ్యాలు కొనసాగి వస్తూనే వుంటాయి. అప్పుడు ‘స్త్రీలుగా స్త్రీలంతా ఒకటే జాతి’ – అనే స్త్రీవాద సూత్రం కూడా అందాల పోటీల వ్యవస్థలో అన్వయదశకు రాకుండానే పోతుంది.
23- 11-96 నాటి ‘వార్త’ దిన పత్రికలో ప్రపంచసుందరి 96 పోటీలకు బెంగుళూరు వచ్చిన వాళ్ళలో ఒక తెల్ల జాతి సుందరి, నల్లజాతి సుందరి కలిసి వున్న ఫోటోను ప్రచురించింది. ఆ ఫోటోకు ‘తెలుపో నలుపో జానేదేవ్- ఆ తేడాలిక్కడ లేనేలేవ్’ – అన్న వ్యాఖ్యానాన్ని కూడా ఇచ్చింది. అందాన్ని కొనుక్కోగలిగిన వాళ్ళ సమానత్వాన్ని మాత్రమే చెబుతుందీ సందర్భం. ప్రపంచ వ్యాపితంగా అతి తీవ్రస్థాయిలో వున్న జాతి వివక్షలను, ఆర్థిక అసమానతలను కప్పిపుచ్చే సమానత్వమిది. ఈ పోటీలలో మూడవ ప్రపంచ దేశాల స్త్రీలు, వల్లజాతి స్త్రీలు ప్రపంచ సుందరులుగా ఎన్నికయినా అభివృద్దిచెందిన దేశాల సరసన తమ దే శాలను నిలపలేరు. దేశాల అభివృద్ధికి ప్రపంచసుందరి ఎంపికకులేని సంబంధాన్ని ఊహించటం, అంతర్జాతీయ సమానతకు దానినొక ప్రతీకగా చెప్పటం – రెండూ కూడా సమానత్వానికి సంబంధించిన భ్రమల కల్పనలో భాగాలే. పారంలో ఇవి అగ్ర దేశాలకు మూడవ ప్రపంచదేశాలకు, శ్వేతవర్ణ జాతులకు, నల్లజాతులకు మధ్య అధికార అధీన సంబంధాలను కొనసాగించటానికి, అభివృద్ధి చెందిన దేశాల ఆధిపత్యాన్ని స్థిరీకరించటానికి తోడ్పడతాయి. అందువలన అందాల పోటీలలో వుంటుందని చెప్పబడే స్త్రీ స్వేచ్ఛా సమానత్వాలు నేతిబీరకాయలో నెయ్యివంటివే కాని మరొకటి కాదు. స్త్రీల లైంగిక హక్కులు, పునరుత్పత్తి స్వేచ్ఛా పూర్తిగా నిరాకరించబడిన స్థితిలో కృత్రిమ అలంకరణలతోటి, అతికించుకొన్న నవ్వులతోటి స్త్రీలను నిలబెట్టే ప్రపంచసుందరి పోటీలు సారం లో స్త్రీ స్వేచ్ఛకు పూర్తిగా వ్యతిరేకమైనవి.
5
పెట్టుబడిదారీ వ్యవస్థ స్థిరీకరణ పొందుతూ విస్తరించిన క్రమంలో స్థానిక మార్కెట్టు కుంచించుకు పోతే మార్కెట్ విస్తరణకు వలసలను అభివృద్ధి చేయాల్సివచ్చింది. తూర్పు ఇండియా కంపెనీ తన పెట్టుబడులతో మార్కెటును వెతుక్కుంటూ భారతదేశానికి వచ్చిన క్రమం అలాంటిదే. అది భారతదేశాన్ని వలస దేశంగా మార్చింది. 1857లో భారతదేశం బ్రిటిష్ ఇండియాగా మారటంతో తదితర కంపెనీలకు కూడా భారతదేశానికి పెట్టుబడులు తరలించే అవకాశం దొరికింది. వలసల విస్తరణ వలన ప్రపంచమంతటా ఇటువంటి పరిణామాలే సంభవించాయి. జాతిపోరాటాలు వలస విముక్తి పోరాటాలుగా సాగి దేశాలు స్వతంత్రమైన తరువాత కూడా బ్రిటన్, అమెరికా వంటి అగ్రరాజ్యాలు తమతమ పెట్టుబడులను ఆయా దేశాలలోని పరిశ్రమలలో పెట్టి వెళ్ళాయి. ఏదో ఒక విదేశీ కంపెనీ పెట్టే పెట్టుబడి గానీ, ఏ రెండు మూడు విదేశీ కంపెనీలయినా కలిసి పెట్టే పెట్టుబడిగానీ బహుళ జాతి సంస్థల పెట్టుబడి అవుతుంది. తమతమ పెట్టుబడుల నిష్పత్తుల మేరకు ఆయా దేశాలనుండి మిగులు విలువలు బహుళజాతి సంస్థలకు తరలించబడతాయి. తమ పెట్టుబడి ద్వారా దేశీయ పరిశ్రమల మీద నియంత్రణను, మిగులు విలువలో వాటా ద్వారా దేశీయ సంపద మీద హక్కును బహుళజాతి సంస్థలు కలిగి వుంటాయి. బహుళజాతి సంస్థలు తమ ఉత్పత్తులకు సమాజంలోని భిన్న వర్గాల నుండి వినియోగదారులను సమకూర్చుకొనటానికి, తాము ఉత్పత్తి చేస్తున్న వస్తు వినిమయానికి, అనుకూలంగా ప్రజల అభిరుచులను మలచటానికి ప్రచార ప్రకటనా మాధ్యమాన్ని అభివృద్ధి చేశాయి. వస్తువుల గురించి వాటి ఉపయోగ ప్రయోజనా విలువల గురించి చెప్పటానికి కావలసిన మోడల్స్ ను తయారు చేయటానికి అందాలపోటీ వ్యవస్థను ఆవిష్కరించాయి. అందువలన అందాల పోటీలలో ఎంపిక అయ్యే స్త్రీల మీద నియంత్రణాధికారం బహుళ జాతి సంస్థలదే అవుతున్నది.
భూస్వామ్య వ్యవస్థలో స్త్రీని నియంత్రించేది, పురుష ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించేది వివాహ వ్యవస్థ అయితే పెట్టుబడిదారీ వ్యవస్థలో కూడా పురుష ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించేది బహుళజాతి సంస్థలు. భూస్వామ్య వ్యవస్థలో స్త్రీల నడకను, నడతను కట్టు బొట్టు తీరును ఎవరితో ఎప్పుడు ఎట్లా ప్రవర్తించాలి అన్న అంశాలన్నింటినీ నియంత్రించేది భర్త, కుటుంబం అయితే ఈ పోటీలలో గెలిచిన స్త్రీలు ఏం తినాలి. ఎలా వుండాలి, ఎలా నవ్వాలి, తన అంగ సౌందర్యం వ్యక్తమయ్యే రీతిలో ఎలా నడవాలి, ఏ సంస్థతో మోడలింగ్ కు ఒప్పందం కుదుర్చుకోవాలి అనే అంశాలన్నీ నియంత్రించే అధికారం పోటీలను స్పాన్సర్ చేసిన బహుళ జాతి సంస్థలదే. పెళ్ళితో స్త్రీ భర్తకు జీవిత కాలపు బందీ అవుతుంది. అదే విధంగా ప్రపంచ సుందరిగా ఎంపికయిన స్త్రీ బహుళజాతి సంస్థల చేతిలో బందీ అవుతుంది. ఫ్యూడల్ వ్యవస్థలో పురుషుడి ఆస్తిగా వున్న స్త్రీ పెట్టుబడి దారీ వ్యవస్థలో గుత్తపెట్టుబడి సంస్థల అదుపు క్రింద ప్రపంచపు ఆస్తయింది.
స్త్రీకి తన శరీరం గురించి, సౌందర్యం గురించి నిర్వచించుకొనే హక్కు, అవకాశం భూస్వామ్యపు వ్యవస్థలో లేనట్లుగానే పెట్టుబడిదారీ వ్యవస్థలో కూడా లేదు. బహుళ జాతి సంస్థల వ్యాపార ప్రయోజనానికి అనుకూలంగా పితృస్వామిక సమాజం ఇచ్చిన నిర్వచన పరిధిలోనిదే అయింది స్త్రీ సౌందర్యం. బహుళజాతి సంస్థలు ఉత్పత్తి చేసే కాస్మటిక్స్, ఫ్యాషన్ టెక్నాలజీని వినియోగంలోకి తీసుకు రాగల అందమే స్త్రీల అందంగా నిర్వచించబడింది. ఇదే స్త్రీల నిజమైన అందమని స్త్రీలు భ్రమపడి ఆ నిర్వచన పరిధిలోని అందానికి సంబంధించిన ప్రమాణాలను తామందుకొనటానికి నిరంతరం ఆరాట పడుతూ తమనుతాము తమకు తెలియకుండానే ఈ వ్యవస్థకు బానిసలను చేసుకుంటారు. అందుకే అక్కడ గృహబానిస అయిన స్త్రీ ఇక్కడ ప్రపంచ బానిస అయింది.
అందం శక్తికి మూలమని, తద్వారా మొత్తం ప్రపంచాన్ని నియంత్రించవచ్చని ఒక భావం వుంది. అందాలపోటీల నిర్వహణలో కీలక పాత్ర వహించే అంశం అదే. ప్రపంచ మార్కెట్ మొత్తాన్ని గుప్పిట్లోకి తీస్కుకొనటానికి స్త్రీ అందంలోని శక్తి ఒక మూల వనరు అయింది. ఫ్యూడల్ వ్యవస్థలో పురుషుడి జీవితానందానికి ముఖ్యాంశాలుగా కీర్తి, కాంత, కనకాలు పేర్కొనబడ్డాయి. ఆ మూడింటిని పురుషులు విడివిడిగానే సాధించుకొని తద్వారా సమగ్ర జీవితాన్ని అనుభవించాలి. కాని పెట్టుబడిదారీ వ్యవస్థలో అందాల పోటీ ద్వారా కాంత మీద సంపాదించే అదుపు కనకాన్ని స్వంతం చేసుకొనటానికి ఉపకరిస్తుంది. కీర్తి అంటే ఇక కాంత ద్వారా వస్తువుకు సంపాదించే ప్రచారమే. ఈ క్రమంలో స్త్రీ అందం లాభాల నార్జించి పెట్టే వస్తువయింది. శ్రామికుల శ్రమతో పాటు స్త్రీ అందం కూడా వస్తువుకు అదనపు విలువను సంపాదించి పెడుతుంది. ఆ అదనపు విలువ శ్రామికులకు చెందనట్లుగానే స్త్రీలకూ చెందదు. ఈ క్రమంలో శ్రమ పరాయీకరణకు శ్రామికులు గురయినట్లుగానే అందం నుండి స్త్రీలు పరాయీకరణకు గురవుతారు. సరుకుల్లో సరుకై తమకు తామె కరువవుతారు.
ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగే అందాల పోటీలలో స్త్రీలను ఆయా ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే వస్తువులుగా చూస్తారు తప్ప ప్రత్యేకమైన పేరున్న మనిషిగా గుర్తించరు. మిస్ హైద్రాబాద్, మిస్ ఆంధ్రా, మిస్ ఇండియా, మిస్ గ్రీస్ ఈ రకంగా వాళ్ళు సుందరులుగా ఎంపికయిన సంవత్సరంతో కలిపి చెప్పబడుతుంటారు. ఇల్లలుకుతూ పేరు మరిచిపోయిన ఈగ చందంగా ఇంటి చాకిరిలో నిమగ్నులైన స్త్రీలు తమ పేరును ఉనికిని మరిచిపోయి గృహిణులుగా మాత్రమే మిగిలిపోతున్నారు. అదే విధంగా తమ శరీరాన్ని సాధనంగా చేసుకొని బహుళ జాతి సంస్థల ఉత్పత్తులకు ప్రచారం కల్పిస్తున్న సుందరీమణులు కూడా తమ పేరు నుండి, ఉనికి నుండి పరాయీకరింపబడుతున్నారు.
ఇకపోతే ఈ పోటీలలో పాల్గొనటంద్వారా సాంఘిక, ఆర్థిక హోదాను పొందుతామని, సామాజిక శక్తిగా రూపొందుతామని, అటువంటప్పుడు తాము అందాల పోటీలలో పాల్గొన టానికి ఎవరికి మాత్రం ఎందుకు అభ్యంతరం వుండాలని ఈ పోటీలలో పాల్గొనే వాళ్ళు అంటున్నారు. కానీ నిజానికి ఈ పేరుమీద స్త్రీల అందం సులభమార్గాన డబ్బు సంపాదనా సాధనమవుతున్నది. తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ రకమైన పోటీలలో పాల్గొనటానికి ప్రోత్సహించటం వెనుకవున్నది కూడా డబ్బు సృష్టించిన మాయాజాలమే. ఈ విధంగా స్త్రీల అందాన్ని సాధనంగా చేసుకొని భౌతిక అవసరాలు తీర్చుకొనటానికి, వస్తుజాలాన్ని సమకూర్చుకొనటానకి జరిగే ఈ ప్రయత్నక్రమం వస్తుజాలం యొక్క శక్తిని, పెత్తనాన్ని తీవ్రతరం చేస్తుంది. వస్తు వినిమయం కోసం స్త్రీల అందం వాడుకోబడుతున్నదా ? లేదా తమ అందం ద్వారా స్త్రీలు వస్తువులు సమకూర్చుకొంటున్నారా ? వస్తువులకోసం అందమా, అందంవల్ల వస్తు సమీకరణా ? వీటిలో ఏది ముందో, ఏది వెనుకో తెలియనంతగా విషవలయాన్ని సృష్టించిందీ పెట్టుబడిదారీ వ్యవస్థ. ఈ విషవలయంలో చిక్కుకొని, ఇందులో భాగంగానే వుంటూ ఇదే తమ ప్రగతికి గీటురాయని అనుకొంటూ స్త్రీలు అవమానాల అణిచివేతల చరిత్రను మరిచిపోవటానికి ప్రయత్నిస్తున్నారు.
అందాల పోటీలలో పాల్గొని ప్రపంచసుందరిగా ఎంపికయి, ప్రాముఖ్యతగల వ్యక్తులుగా గుర్తింపును పొంది, గుర్తింపుకు తగ్గ హోదాను అనుభవిస్తూ అంతులేని డబ్బు సంపాదించే స్త్రీలు అణచివేతకు అవమానాలకు గురవుతారంటే చాలామంది నమ్మకపోవచ్చు. కానీ వాస్తవంలో సరుకుల నమ్మేక్రమంలో తానొక లైంగిక ప్రతీక అయిన స్త్రీ అణచివేతకు గురయిందంటే అందులో అసహజాంశం ఏమీలేదు. మిస్ మనీలా ప్రపంచ పర్యటన జరిపిన తరువాత తన అనుభవాలను వ్రాస్తూ “Daizi World of Travel & Excitement” లో ప్రపంచసుందరికి చివరకు మిగిలేది చిరాకు అణిచివేత అవమానాలు అని స్పష్టంగా పేర్కొన్నది. అందాల పోటీలలో పాల్గొనే మహిళలు అణచివేతకు గురవుతారని ఈ పోటీలను వ్యతిరేకించే ఆందోళనకారులు భావించటం వారి అవగాహనాలోపానికి నిదర్శమని మిస్ ఇండియా 1996 రాణి జేరాజ్ అనటం (నవంబర్ 20, 1996, ఈనాడు) ఎంత అసంబధ్ధమైందో మిస్ మనీలా అనుభవం చెప్పకనే చెబుతుంది.
మిస్ వరల్డ్ పోటీలకు అనుబంధమైన మాట ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’. సామాజిక మంచికోసం. ప్రపంచమంతటా చేపట్టే బృహత్ కార్యక్రమాలకు వేలకొలది యు ఎస్ డాలర్ల నిధుల సమీకరణ జరుగుతుంటుంది. సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణ ఆదర్శమే అందం కానీ, అందం తో దానికి పనేమిటో అర్ధం కాదు. అందాల పోటీలు వ్యాపార ప్రయోజనాలకు కావు సామాజిక సేవా దృక్పథ ప్రచారానికి అని మన్నించే ప్రయత్నమా ఇది?
6
‘రెవలాన్’ విప్లవాత్మకమైన ముఖాలంకరణ సౌందర్య ద్రవ్యాలను ఉత్పత్తి చేసే సంస్థ. ఆ ముఖాలంకరణ సౌందర్య సాధనాలకు ప్రచారం చేసే మోడల్ మెహర్ భాసిన్-‘రెవలాన్ అమ్మాయి’ గా ప్రసిద్ధురాలు. అందం వ్యక్తికి ఆత్మ విశ్వాసాన్ని కలిగిస్తుందని, వ్యక్తి వికాసానికి తోడ్పడుతుందని అంతకంటే కాస్త ఎక్కువగా ఒకళ్ళు మిగిలిన అందరికంటే భిన్నంగా ప్రత్యేకంగా ఎదగటానికి దోహదపడుతుందని అంటుంది. అందం వ్యక్తి ప్రత్యేకతను నిలుపుతుంది. నిజమే కాని వ్యక్తి ప్రత్యేకత ప్రజాస్వామ్య విరుద్ధం. వ్యక్తి తన సృజనాత్మక ప్రతిభతోగాని, భావుకత్వ లక్షణం చేత గాని ప్రయత్నంతో సాధించగలిగింది కాదు అందం, అయితే అది ఆజన్మ సిద్ధం. కాకపోతే పోషణ ద్వారా మేకప్ ద్వారా పొందేది. మొదటి పద్ధతిలో అందం పొందటం ఎవరి చేతిలోనూ వున్నది కాదు. రెండవరకం అందం పొందటానికి అది చాలా ఖరీదయింది కనుక అందరికీ అవకాశాలుండవు. ఇటువంటి అందానికి ప్రాధాన్యత ఇయ్యటం ఆధునిక ప్రజాస్వామ్య సంస్కృతికి విరుద్ధం, అందానికి ఇంత గుర్తింపు, ప్రాధాన్యం వున్నాయంటే దానికి అవతలివైపున అందవిహీనం ఒక సమస్య అయితీరుతుంది. ఈ సమస్య గురించి 1940 లనుండి తీవ్రంగా ఆలోచించి రకరకాలుగా తన కథలల్లో, నవలల్లో చర్చించిన రచయిత కొడవటిగంటి కుటుంబరావు. సాంఘిక పరిణామం యొక్క తొలి దశలలో ఈ సమస్య ఒక్కొక్క దశే గడిచిన కొద్ది వ్యక్తిగతమైన సమస్యగా రూపొంది పదునెక్కుతున్నదని, భూర్జువా సంస్కృతిలోనే అది ఒక సమస్యగా పైకి తేలిందని ‘ కురూపి’ నవలకు వ్రాసిన ఉపోద్ఘాతంలో చెప్పాడు కొడవటిగంటి కుటుంబరావు. సామాజిక జీవితం భౌతికంగా సుప్రతిష్ఠితమయ్యేకొద్ది మానవుడి ఆధ్యాత్మికశక్తులు పెరిగి తీరుతాయని, మనిషి నుంచి మనిషి పొందే లక్షలాది అనుభూతులలో అందం ఇచ్చే అనుభూతి ఒకటి మాత్రమేనని అంతకంటే గాఢమైన అనుభూతులు చాలా వుంటాయని ఆయన స్పష్టం చేశాడు.ఆలోచనలో ,ఆచరణలో అనాకారితనాన్ని మించిన దౌర్భాగ్యం లేదని, ఆలోచన, ఆచరణ సహజమైన మానవీయ స్వభావంతో వ్యక్తీకరించబడటమే అందం అని ఆయన సాహిత్యం చెప్తుంది.
అయితే 21 శతాబ్దంలోకి అడుగుపెడుతున్న ఈ భారతీయ సమాజం భౌతికంగా ఇంకా సుప్రతిష్టితం కాలేదా అని అనుమానించే పరిస్థితులు ఈనాడున్నాయి. మనిషి నుంచి మనిషి పొందగల మిగిలిన సమస్త అనుభూతుల విషయం విస్మరించి స్త్రీనుండి అందం ఒక్కటే కీలకాంశంగా అనుభూతిని పొందే ప్రయత్నం చేయటం జరుగుతున్నది. ఇక్కడ స్త్రీ అనుభూతితో అసలు ప్రమేయమే లేదు. స్త్రీ పురుషుల మధ్య వున్న అసమానతలు సమానతాభావాన్ని పెంచుకొనటానికి అవరోధంగా వున్న పితృస్వామిక అధికార అహంకార అహంభావాల అడ్డుగోడలు స్త్రీ పురుషులను అనుభవాలు అనుభూతులును సమ స్థాయిలో పంచుకోగలిగిన స్థితిలో వుంచలేదు. పురుషుడు మాత్రమే అనుభూతిని పొందగల మానవ జీవి. స్త్రీ పురుషుడి అనుభూతికి ఆధారం ఈ నాడు సమాజంలో వున్న ఈ విలువే అందాల పోటీల వ్యవస్థను సృష్టించింది. వస్తువిలువను ప్రచారం చేయగల అనుభూతిని కలిగించే అంశంగా స్త్రీ అందాన్ని మిగిల్చింది.
స్త్రీ పురుషుల మధ్య వున్న మిగిలిన అనేకానేక వివక్షతలు అభావం అయ్యేకొలదీ అందానికి వున్న విలువ కూడా క్రమంగా తగ్గిపోతుంది. అందాన్ని మించి మానవీయ సంబంధాల అనుబంధాల భావనలు బలపడతాయి. ఇప్పటికీ తల్లి అందం గురించి ఆలోచనే పిల్లలో రాకపోవటం గమనించవచ్చు. సహజ మానవ సంబంధాలలోని మానవీయ చైతన్య సౌందర్యం తల్లి అందవిహీనతను దృష్టి పథంలోకే రానీయదు. అందువలన ఉత్తమ మానవ సంస్కృతిని పెంపొందించటం ఒక్కటే అందానికి ఈ కాలంలో లభించిన అనితర ప్రాధాన్యానికి ప్రత్యామ్నాయంగా చూపగల మార్గం. అందువలననే కొడవటిగంటి కుటుంబరావు తన రచనలలో అందాన్ని మించిన హృదయ సౌందర్యాన్ని ప్రదర్శించిన వాళ్ళకు ఉన్నత స్థానం ఇచ్చాడు. మనిషిలోని ప్రేమించే లక్షణం, జీవిత లాలస, ఆపేక్ష, ఎదుటి వాళ్ళ కష్టానికి స్పందించగల హృదయ సౌకుమార్యం వీటిని గొప్పగా ఆవిష్కరించి అందవిహీనులను కూడా ప్రేమించగలిగిన కథా పురుషులను సృష్టించాడు.
స్త్రీ పురుషుల మధ్య ఇప్పుడుండే గోడలు పడిపోయినాక అతీతమైన అనుభూతులు స్త్రీ పురుషుల అనుభవంలోకి వస్తాయని నలభై ఏళ్ళ క్రితం ( ఇప్పటికి 68 ఏళ్ళ క్రితం) కొడవటిగంటి కుటుంబరావు ఊహించాడు. దానినిప్పుడు జీవిత వాస్తవంగా చేసుకోవలసిన అవసరాన్ని ఈ చారిత్రక సందర్భం గుర్తుచేస్తున్నది. ఇప్పుడున్న గోడలు స్త్రీలకు హానికరమైనవి అవమానకర మైనవి కనుక గోడలు పగులగొట్టే పనికి స్త్రీలే పూనుకోవాలి.
(తొలి ప్రచురణ 3-3-1997)