సనాతన ధర్మ మర్మం విప్పిన కొడవటిగంటి కుటుంబరావు కథలు

కొడవటిగంటి కుటుంబరావు సాహిత్యం అంతా 1931 – 1980 మధ్యకాలంలోది. చదివిన ఫిజిక్స్ బిఎ, 1930 లలో అందివచ్చిన మార్క్సిస్టు అవగాహన ఆయన ఆలోచనలకు శాస్త్రీయమైన చూపును ఇచ్చాయి. ఆ క్రమంలోనే అరసం (1942) విరసం (1970) సహజంగా ఆయన చిరునామా అయినాయి. తనకు తెలిసిన మధ్యతరగతి జీవితాన్నే సృజనసాహిత్య వస్తువుగా స్వీకరించిన కుటుంబరావు సమాజంలో అధిక సంఖ్యాకులైన మధ్యతరగతిని చైతన్యవంతం చేయటం లక్ష్యంగా మొదటి నుండి అందులోని వైరుధ్యాలను శాస్త్రీయంగా విశ్లేషించటంలో శ్రద్ద చూపుతూ వచ్చాడు. సాహిత్యాన్ని భావవిప్లవ సాధనంగా పదునెక్కించాడు. భారత సమాజ ఆధునికీకరణ అనివార్యంగా సనాతనధర్మంపై తిరుగుబాటు కాక తప్పదని సంస్కరణోద్యమాలు నిరూపించాయి. ఆ నేపథ్యంలో మధ్యతరగతి ఆలోచనలలో,అంతరాత్మలో,ఆచారాలలో,అలవాట్లలో భాగమై లౌకిక మానవ ఆకాంక్షలకు,ఆశలకు అవరోధం అవుతూ జీవితాన్నిదుఃఖభాజనం చేస్తున్న సనాతన ధర్మంతో సాంస్కృతిక రంగంలో చేయవలసిన యుద్ధం ఎలా ఉండాలో చూపించే కర్తవ్యాన్ని తనసాహిత్య సృజన ప్రారంభకాలం నుండే స్వీకరించినవాడు కొడవటిగంటి కుటుంబరావు. నిత్యం,నిరంతరం సనాతనధర్మం పేరు మీద అసమానతలకు ఆమోదముద్ర వేస్తున్న సమకాలీన సాంస్కృతిక రాజకీయ సందర్బం నుండి ఆ కథలు ఇప్పుడు చదువుకోవలసినవి. అన్వయించుకోవలసినవి.

1

“వాళ్ళు వాళ్ళు అనేక విషయాల గురించి అనుకుంటున్న మాటలన్నీజ్ఞాపకం వుంచుకొని వాటిని నిజం కింద అంగీకరించి వాటి ప్రకారం ఆచరించటం బుద్ధిని ఉపయోగించటం కాదు. దేని గురించైనా నీ అభిప్రాయం ఒకటి ఏర్పరచుకోటం ‘బుద్ధి’ “ సూరి సిద్ధాంతం (1934) కథలో వాక్యం ఇది. సూరిసిద్ధాంతం శీర్షికతో కొకు వ్రాసిన కథలు నాలుగు. కథకుడికి అతని స్నేహితుడు సూరి కి మధ్య సంవాదాత్మక శైలిలో లో నడిచే ఉత్తమపురుష కథనాలు ఇవి. మతానికి, ఆచారాలకు, నీతి అవినీతులకు సంబంధించి గతానుగతికంగా వస్తున్న భావాలను విమర్శకు పెట్టటం ద్వారా స్వతంత్ర బుద్ధి వికాసానికి దారులు తీసాడు కొకు.

మతం ఎవరికి వారు సృష్టించుకోవలసిందే తప్ప తాత తండ్రుల మతాలను యధాతథంగా అనుపరించరాదన్నది సూరి అభిప్రాయం. మతం అంటే అతని దృష్టిలో జీవనవిధానం. తమ వరకు అందివచ్చిన జ్ఞాన చైతన్యాలను బట్టి తమ అవసరాలను బట్టి ఎవరి జీవనవిధానం వాళ్ళే నిర్థారించుకొంటారు. ‘మతం కూడా ఆస్తల్లే, గుణాలల్లే, రోగాలల్లే వంశపారంపర్యంగా వస్తుందా ఏమిటి? అని హేళన చేయటంలో అంతరార్థం అదే. మతం వంశపారంపర్యంగా వచ్చేదే అయితే శూద్రులతో భోజనం చేసినప్పుడు, స్టీమరెక్కి విదేశాలకు పోయినప్పుడు, వితంతువును పెళ్ళి చేసుకొన్నప్పుడు ఎలా పోతుందని ప్రశ్నిస్తాడు. మతం వంశపారంపర్యంగా రావటం, కొన్ని పనుల వల్ల పోవటం, ఒక పని వల్ల పోయిన మతం అట్లాగే పోక ఏ పని చేద్దామనుకొన్నప్పుడయినా అడ్డుగావచ్చి నిలవటం ఎంత హాస్యాస్పదమైనవో సూరి మాటల వల్ల స్పష్టమవుతుంది.

ఆచారాలే మతమనుకొనటాన్ని ఖండిస్తూ ఒకప్పుడు ఒక సామాజిక జీవితావసరాలలో భాగంగా రూపొందిన ఆచారాలు యథాతథంగా అన్ని కాలాలకు ఉపయోగపడవని కాలానుగుణంగా మనిషి జీవితంలో రావలసిన వికాసం గురించిన అవగాహన వున్న వాళ్ళెవరయినా గ్రహిస్తారని మనిషి ఉపయోగం కోసమే ఆచారాలు కానీ ఆచారాల కొరకు మనుషులు కాదని సూరి అభిప్రాయం. ఆహారం వంటి ప్రాథమికావసరాలు కూడా తీరని జనానికి వాటికి బదులు మతాన్నిస్తే మూఢనమ్మకాలు వంటి జబ్బులు ప్రబలిపోతున్నాయంటాడు సూరి.

సనాతన ధర్మం అనేది స్త్రీలను అణగ ద్రొక్కటానికి, స్త్రీలపై దౌర్జన్యం జరపటానికి, బ్రాహ్మ ణాధిక్యతను స్థాపిస్తూ తదితర వర్ణాలను ,మరీముఖ్యంగా పంచములను అవమానించటానికి, అణచి వేయటానికి సాంస్కృతిక సమ్మతిని సమకూరుస్తున్నవిషయం కొకు అవగాహనలో ఉంది. మానవ జీవితంలో అభివృద్ధికి, మనుషుల మధ్య సమానత్వానికి, స్నేహానికి సనాతనధర్మం అడ్డు అవుతున్నది కనుకనే కొకు దృష్టిలో చీల్చిచెండాల్సిన అంశాలలో అది ప్రధానం అయింది.

లోకంలోని కుసంస్కారాలు జీవన వికాసానికి అవరోధంగా ఉన్నప్పుడు చూసి చూడనట్లు ప్రవర్తించటం జీవన విధ్వంస కారణం అవుతుంది కనుక వాటిని ఏ కొద్దిగా నైనా మార్చటానికి ఎవరి పద్ధతులలో వాళ్ళు పనిచేయటం అవసరమని కొకు భావిస్తాడు. అలా ప్రయత్నించే వాళ్ళను జీవలక్షణం కలవాళ్ళు , జీవశక్తి కలవాళ్ళు అని అభిమానంగా పేర్కొంటాడు. జీవశక్తి అంటే కొకు దృష్టిలో కర్మశక్తి. సూరి సిద్ధాంతం 3 కథలో బ్రాహ్మణులను జీవశక్తి మందగించిన వాళ్ళుగా, ఇతర కులాలవాళ్ళని జీవశక్తి ఇంకా చావని వాళ్ళుగా వర్గీకరించి చెప్పాడు. భౌతిక కర్మ నుండి ఉత్పత్తి నుండి వైదొలగిన వర్గం బ్రాహ్మణులైతే తదితర కులాలు ఉత్పత్తిసంబంధంలో వున్న వర్గం. విధి నిషేధాల రూపంలో ఉత్పత్తి కులాలను అదుపు చేసే బ్రాహ్మణుల జ్ఞానశక్తిని తీవ్రంగా నిరసించాడీ కథలో.ఆ సందర్భంలోనే సూరి చేత “సనాతన మతం అన్నవాడినల్లా జైలులో పారెయ్యి!” అనిపించాడు.

సనాతన మతం అభివృద్ధి నిరోధకమైంది, అసమానతలను పెంచి పోషించేది అని పూర్తిగా నమ్మాడు కనుకనే సనాతన మతవాదులు సమాజంలో చలామణిలో ఉండదగిన వాళ్ళు కాదని అను కొన్నాడు కొకు. అందువల్లనే సనాతన మతవాదుల జైలు నిర్బంధం ఆయన ఆకాంక్ష అయింది . ఆ ప్రజాస్వామిక ఆకాంక్ష ఈ 88 ఏళ్ళ కాలంలో ఆచరణ వాస్తవం కాకపోగా సనాతన ధర్మాన్ని కాదన్న వాళ్ల తలలకు వెలకట్టే వర్తమానంలో మనం మిగిలాం. అంతేకాదు,సనాతనధర్మం అనేది సామాజిక సాంస్కృతిక ఆవరణలు దాటి రాజ్యాధికారంగా మారితే ఎంత ప్రమాదకరమో అది కూడా ఇప్పటి మన అనుభవం. ఆ ప్రమాదాన్నికొకు 1943 నాటికే గుర్తించాడు అనటానికి నిదర్శనం ‘దేశభక్తుడు’ అనే కథ. వర్తమాన సామాజిక ప్రజాస్వామిక చింతనకు , దానిని సహించలేని రాజకీయార్థిక అధికార వికృతికి మధ్య వైరుధ్యాలను వ్యాఖ్యానించగల జీవశక్తి గల ఆ కథ మనం ఇప్పుడు తప్పక అధ్యయనం చేయవలసినది.

2

కథ శీర్షిక దేశభక్తుడు. అది 1943 మార్చ్ లో ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం మహా సభల ప్రత్యేక సంచికలో ప్రచురించబడింది.బ్రిటిష్ పాలకులు ఇండియాను వదిలివెళ్లటం, దేశానికి సంపూర్ణ స్వరాజ్యం లక్ష్యంగా జరిగిన ప్రచార కార్యక్రమం- క్విట్ ఇండియా ఉద్యమం అప్పుడే ముగిసింది. పదమూడు పదునాలుగేళ్లుగా జాతీయోద్యమాన్ని సన్నిహితంగా చూస్తూ, భిన్నకోణాలనుండి అర్ధం చేసుకొంటూ విలువకడుతూ వస్తున్న కొకు సమకాలీన జాతీయోద్యమ స్వభావాన్ని అంచనా వేస్తూ , స్వతంత్ర భారత భవిష్యత్తును దర్శిస్తున్నట్లుగా నిర్మించిన కథ ఇది. దీనిని గొలుసు కథ అన్నాడు కొడవటిగంటి కుటుంబరావు. సాధారణంగా గొలుసు కథ అన్నా, గొలుసు నవల అన్నా అవి సామూహిక సృజన ప్రక్రియలు. ఒకరు రచన ప్రారంభిస్తారు. వాళ్ళు ఆపినచోట ప్రారంభించి మరొకళ్ళు కథను నడిపిస్తారు. వాళ్ళు ఆపిన చోట మరొకరు కథను కొనసాగిస్తారు. ఇలా ఒకళ్ళ కంటే ఎక్కువమంది చేత భాగాలు భాగాలుగా వ్రాయబడే కథలు, నవలలు గొలుసు కథలు, గొలుసు నవలలు. అయితే నాలుగున్నర పేజీల దేశభక్తుడు కథ కొకు ఒక్కడే వ్రాసాడు. మరి గొలుసు కథ అని ఎందుకు అన్నట్లు? కథ పూర్తయ్యేసరికి మనకు ఆ విషయం అర్ధం అవుతుంది.
దేశ స్వతంత్ర ప్రతిపత్తిని, దేశప్రజలందరి సంక్షేమాన్ని కాంక్షించి అందుకు దారులు వెతికే వాళ్ళు, నమ్మిన మార్గంలో నడిచేవాళ్ళు దేశభక్తులు. కొడవటిగంటి కుటుంబరావు కథలో దేశభక్తుడు అల్లాంటివాడే. దేశం కోసం ఏదో సాధించాలనుకొని తపస్సు చేసాడు. తపస్సు ఫలించి దేశమాత ప్రత్యక్షం కావటం ఆమెకు, దేశభక్తుడికీ మధ్య జరిగిన సంభాషణ ఈ కథలో మొదటి భాగం. తపస్సు ఎందుకు అన్న దేశమాత ప్రశ్నకు దేశ క్షేమం కోసం, అభ్యుదయం కోసం అన్నది అతని జవాబు. ఇప్పుడు దేశానికి వచ్చిన ముప్పేమిటి అన్నది ఆమె ప్రశ్న. దాస్యం అన్నది అతని సమాధానం దేశ వాసులకు దాస్యవిమోచనం అతని ఆకాంక్ష. దాస్యం ఎవరి వల్ల అన్నది ఆమె ప్రశ్న. పాశ్చాత్యుల వల్ల అన్నది అతని జవాబు. వాళ్ళు నీ ప్రజల కాళ్ళూ చేతులూ కట్టేశారా? అన్నది ఆమె ప్రశ్న. కాదు కానీ వాళ్ళవల్లే దేశప్రజలకు దారిద్య్రం అని అతని సమాధానం. వాళ్ళు రాకముందు దారిద్య్రం లేదా అని ఆమె రెట్టించి అడిగింది.అందరూ డబ్బు న్యాయంగానే సంపాదించారా అని నిలదీసింది. కొద్దిమంది దుర్మార్గులు సంఘంలో ఎప్పుడూ ఉంటారు. వాళ్ళు మిగిలినవాళ్లను దోచి ధనికులు అవుతారు అని నిజాయితీగా జవాబిచ్చాడు దేశభక్తుడు. వారి తరఫునే కదా నువ్వు తపస్సు చేస్తున్నది అని ఆంతర్యాన్ని ఆరా తీసింది ఆమె. కాదు కాదు నిజంగా దారిద్య్రం అనుభవిస్తున్న కోట్లకొద్ధి ప్రజల కోసం అని వివరణ ఇచ్చాడు అతను. నువ్వు కోరే దేశవిముక్తి ఏ విధంగా వాళ్ళ దారిద్య్రం తొలగిస్తుంది అన్న ఆమె ప్రశ్నకు అతని దగ్గర జవాబు లేకపోయింది. జవాబు తెలుసు కొనటానికి అతను మళ్ళీ తపస్సు ప్రారంభించాడు.

ఈ సంభాషణ ద్వారా కొకు ఏమి చెప్పదలచుకొన్నాడు? స్వాతంత్య్ర ఉద్యమ నాయకులు , కార్యకర్తలు పాల్గొంటున్న ప్రజలు అందరూ దేశభక్తులే. దేశ క్షేమం , అభ్యుదయం కోరుతున్నవారే. దేశమంటే మట్టి అనుకొంటే బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని వదిలి పోయి దేశీయులు పాలన చేపడితే సరిపోతుంది.దేశమంటే ప్రజలు అనుకొన్నప్పుడు దేశం క్షేమం, అభ్యుదయం అనేవి వాళ్లకు భద్రమైన గౌరవ కరమైన జీవిత వనరులను సమకూర్చటం అవుతుంది. అప్పుడు అభ్యుదయానికి గీటురాయి ప్రజలు దారిద్య్రం నుండి విముక్తులు కావటం.అయితే అది పాశ్చాత్యుల పాలన అంతం కావటంతో సాధ్యమవుతుందనుకొనటం భ్రమ అని చెప్పదలచుకొన్నాడు కొకు. అందుకే దేశమాత చేత పాశ్చాత్యులు రాకపూర్వం నీ దేశంలో దరిద్రులు లేరా అన్న ప్రశ్నను వేయించాడు. డబ్బు సంపాదన, సంపదల సమీకరణలో న్యాయం పాత్ర చరిత్రలో ఎంతో తరచి చూడాలన్న సూచన ఇప్పించాడు. మిగిలినవాళ్లను దోచుకొనటంలోనే కొద్దిమంది దుర్మార్గులు ధనికులు అవుతుంటారన్న వివేకం ఉండటం వరకు సరే .. ఆ వివేకం కలిగిన దేశభక్తుల కార్యదీక్ష దోచుకొనే దుర్మార్గుల ప్రయోజనాలకొరకా, దోపిడీకి గురవుతున్న ప్రజల ప్రయోజనాల కొరకా అన్న ప్రశ్న దేశభక్తుడు ఎవరో నిర్ణయించటానికి అసలైన గీటురాయి. కథలో దేశభక్తుడు నిజంగా దారిద్య్రం అనుభవిస్తున్న కోట్లకొద్దీ ప్రజల కోసం తన తపస్సు అని చెప్పి అసలైన దేశభక్తుడు అయినాడు. బ్రిటిష్ వలస పాలన నుండి విముక్తితో ఆ సమస్య తీరేది కాదన్న కొసమెరుపు సూచనతో ముగుస్తుంది ఈ భాగం.

ఆనాటి ఆ దేశభక్తుడు బహుళమై ఈ నాడు దేశద్రోహులుగా బెదిరింపులకు, నిఘాలకు, నిర్బంధాలకు, బహిష్క రణలకు, హత్యలకు గురి అవుతుంటే దారిద్య్ర సృష్టి కర్తలైన దోపిడీవర్గం దేశభక్తులుగా అధికార స్థానం ఆక్రమించి ఉండటం విషాదవాస్తవం.

ఇక ఈ కథ రెండవ భాగంలో దేశభక్తుడి తపస్సు దేశవాసుల దారిద్య్రం అంతమొందించ టం లక్ష్యంగా సాగింది. లక్ష్మీ దేవి ప్రత్యక్షం కావటం వాళ్ళిద్దరి మధ్యా సంభాషణ యథాపూర్వకమే. డబ్బంటే బీదలు పోగొట్టుకొని వస్తువు, ధనికులు దాచుకొనే వస్తువు. అని నిర్వచించి లక్ష్మీ దేవి వర్గతత్వం, కులతత్వం ఉన్న సాంఘిక వాతావరణంలో మళ్ళా మళ్ళా అట్లాగే ధనికులూ, బీదలూ ఏర్పడతారు అనిచెప్తుంది. కొందరు దరిద్రంలో ఉంటె తప్ప ఫ్యాక్టరీలలో పని చేయటానికి, రోడ్లు ఊడవటానికి, పాకీదొడ్లు కడగటానికి మనుషులు దొరుకుతారా అనుకొనే పెట్టుబడి దారీ వర్గతత్వం ఒకవైపు , ఒకవేళ ఆర్ధిక సమానత్వం సాధ్యమైనా డబ్బుతో కొనరాని వాటన్నిటిని కిందికులాలకు అందకుండా దాచిపెట్టుకొనే పైకులాల ఆధిపత్య తత్వం మరొకవైపు సమానత్వానికి సవాళ్లు అవుతాయని మహాలక్ష్మి ముఖంగా చెప్పించాడు కొకు. సాంఘిక జీవితంలో స్వార్ధం తెచ్చిపెట్టిన కులతత్వాన్ని సంబోధించకుండా దారిద్య్రం నుండి జనాన్ని విముక్తం చేయటం, విముక్తం చేసినా దానిని నిలబెట్టటం సాధ్యం కాదన్న అవగాహనను ఇస్తుంది ఈ భాగం. ఇక దేశభక్తుడికి కులతత్వాన్ని అంతం చేయటమే తక్షణ కర్తవ్యం అయింది.

అందుకోసం తపస్సు చేయటం ప్రత్యక్షమైన శక్తితో సంభాషణ కథలో మూడవ భాగం. ఈ సారి ప్రత్యక్షమైన శక్తి అతి ముసలి వెధవముండ. పళ్లూడిపోయిన బోసినోరూ పొరలుగమ్మిన కళ్ళు పెట్టుకొని కనిపించింది.ఆమె దేశమాత లాగా, మహాలక్ష్మి లాగా ఒంటరిగా రాలేదు. వందిమాగధులతో వచ్చింది. ఆ దృశ్యాన్ని కథకుడు ఇలా వర్ణించాడు“ఆవిడ తన కాళ్ళ మీద నిలబడలేదనో ఏమో, పాపం దండ కమండలాలు ధరించిన ఒక సన్యాసీ, దర్భకట్టా, పంచాంగమూ చంకలో పెట్టుకున్న శుద్ధ శ్రోత్రియుడూ ఆమె చెరొక రెక్కా పట్టుకొన్నారు. వెనుకగా వజ్రాల ఉంగరాలు ధరించిన ఒక వైశ్యుడూ, అధికారి దుస్తులు ధరించిన ఒక శూద్రుడూ ఉన్నారు. ఇంకా వెనకగా కత్తులూ , తుపాకులు ధరించి చింకి గుడ్డలు కట్టుకొని వొట్టి అమాయకపు మొహాల వాళ్ళు కొందరున్నారు. “ ఈ దృశ్య చిత్రణ ద్వారా రచయిత ఏమి చెప్పదలచుకొన్నాడు? ఆమె కులదేవత అని దేశభక్తుడి ముఖంగా వాచ్యం చేసాడు. సనాతన ధర్మం లో భాగంగా చెప్పబడుతున్న కులం చాలా పూర్వకాలం నుండి ఉన్నది కనుక ఇప్పటికి ముసలిదై ఉంటుంది కదా!? ఆ వూహ మీద ఆమెను పళ్లూడిపోయిన పోయిన బోసినోటి ముసలవ్వగా, దట్టంగా పొరలు కమ్మిన కళ్ళ పెద్దవ్వగా బొమ్మగీసాడు. ఆ తరువాతి కథలో కూడా ఆమె ముసల్ది అనే సంబోధించబడింది. ఆ రకంగా కులదేవత వికృత రూపీ, అశుభ మూర్తి. కాలం చెల్లిన ముసలమ్మను నిలబెడుతున్నది ఎవరు? సన్యాసులు బ్రాహ్మణులు. సంపన్న వర్గం, శూద్రవర్గం ఆమె సేవలో తరిస్తున్నది. ఇదంతా కలిసి ఒక అధికార వ్యవస్థ. దీని రక్షణకు సాయుధ సైన్యం కూడా తయారు చేయబడ్డది. సైన్య సమీకరణ బీద సాధారణ జనం నుండి జరిగిందని ‘చింకి గుడ్డల అమాయక మొహాలు’ అన్న విశేషణాలను బట్టి ఊహించవచ్చు.

కులతత్వం అంతం కావాలని, దేశం బాగుపడాలని తపస్సు చేస్తున్నట్లు దేశభక్తుడు చెప్పగానే వర్ణసంకరం కావటం దేశం బాగుపడటమా అని ఎద్దేవా చేసిన సన్యాసి , బ్రాహ్మడు చాతుర్వర్ణాలను నేనే సృష్టించాను అన్న భగవద్వాక్యాన్ని వల్లెవేయటమే కాక వర్ణాశ్రమ ధర్మాలు పోతే మనుష్యులకూ, పశువులకూ తేడా ఉండదని తేల్చేశారు. వర్ణాశ్రమ ధర్మాలు పాటించాలనే మహానుభావుల ఆజ్ఞలు పాటించే మనుష్యులకూ పశువులకూ మాత్రం తేడా ఏముందని దేశభక్తుడు వాళ్ళ వెనుక ఆయుధాలు పట్టుకొని నిలబడ్డ మూఢుల మొహాలు చూపిస్తూ వేసిన ప్రశ్నను విననట్లే కులదేవత ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని రామకృష్ణా అని ఇంత దైవ చింతన చేసుకో అని దేశభక్తుడికి హితోపదేశం చేసింది. తన మోక్షం గురించి అంత అక్కర ఉన్నవాళ్లకు దేశ ప్రజల దుర్దశ పట్టనిది ఎందుకవుతున్నది అని అతను నిలదీయటం ముసలి కుల దేవతకు సహించ రానిది అయింది. తమదారికి అడ్డం వస్తున్నాడు కనుక అతనిని దేశద్రోహిగా ప్రకటించింది. దేశవాసుల ప్రతినిధులంతా కూడా అదే అంటున్నారని తన వెనుక నిలబడ్డ వాళ్ళను చూపింది. దారిద్య్రం సంగతి పట్టించుకోకుండా కులాన్ని నిలబెట్టటానికి తాత్వికతను, జ్ఞానాన్ని, ధనాన్ని, సేవలను, అందించటానికి నిలబడినవాళ్లు దేశ వాసుల ప్రతినిధులు కాజాలరు అన్నది దేశభక్తుడి అవగాహన, నిర్ధారణ. అతని ఈ ధిక్కారం అధికారానికి సవాల్ అయింది. కులతత్వం అంతం కావా లన్న లక్ష్యంతో తపస్సు ప్రారంభించిన అతనిని ఆ ప్రయత్నం నుండి విరమించు కోమని ఒత్తిడి చేసింది.

కులతత్వం అంతం అయ్యే మార్గాన్ని అన్వేషించటంలో దేశభక్తుడి తపస్సు ఒక మజిలీ. కులతత్వ నిర్మూలనకు ఆచరణ కార్యక్రమం ఇంకా రూపొందవలసే ఉంది. అయితే కుల అధి కారవ్యవస్థ దృష్టిలో కులం పోవాలని ఆలోచన చేయటం కూడా తప్పే. ఆలోచించేవాడి మెడ మీద తలకాయ లేకుండా చేయటమే దానికి శిక్ష. ఆయుధపాణులను ఆజ్ఞాపించి దేశభక్తుడిని చంపించటం తో ఈ కథ ముగుస్తుంది. ఈ కథలోని మూడుభాగాలు క్రమంగా దాస్యం, దారిద్య్రం, కులం అనే మూడంశాల మధ్య గొలుసు సంబంధాన్ని స్థాపిస్థాయి. ఒకదాని పరిష్కారం మరొక దానితో ముడిపడి ఉండటాన్ని నిరూపిస్తాయి కనుక కొకు దీనిని గొలుసు కథ అని ఉంటాడు.

దారిద్య్రం దగ్గరనుండి కుల మత తత్వాలవరకు అన్నిటి నుండి తన జాతి విముక్తి కోరుకొన్నవాడు దేశద్రోహి అని తీర్పు ఇచ్చింది కులాన్ని ముందుపెట్టుకొన్న బ్రాహ్మణాధికారం. తల తీసెయ్యమని ఆయుధపాణుల ను ఆజ్ఞాపించింది ముసలిదైన కులదేవత. ‘చింకి గుడ్డల అమాయక మొహాలు’ కల ఆయుధపాణులలో తొలుత అందుకు నిరాకరించి వెనక్కు తగ్గిన వాళ్ళిద్దరి తలలు ఒరా నుండి కత్తి తీసి నరికేశాడు అధికారి. దానిని దేశభక్తుడు ప్రాణం అన్నిటికన్నా తియ్యనిది అనే సూత్రం మీద సంస్కారం ప్రచారం అవుతున్నదన్నమాట అని వ్యాఖ్యానించాడు. ‘శరీర మాంద్యం ఖలు ధర్మ సాధనం’ (ధర్మసాధనకోసం శరీరమే కదా మొదటిది / ప్రధానం) అన్న వాక్యంతో సన్యాసి దానికి ధర్మబద్ధతను సమకూర్చే ప్రయత్నం చేసాడు. ధర్మ సాధన అంటే సనాతన ధర్మ సాధనే. అందుకు ఉపయోగపడని శరీరం విలువలేనిది.నిర్దాక్షిణ్యంగా నిమిషాలలో అంతం చేయవలసినది. అలా అంతం చేయటం ద్వారా సనాతన ధర్మ రాజ్యం ఆజ్ఞ అనుల్లంఘనీయమన్న భయాన్ని సృష్టించటంతక్షణ ప్రయోజనం. బ్రాహ్మణీయ హిందూ మత ఫాసిజం ఎలా ఉంటుందో మచ్చు చూపిన కథ ఇది.

అదే సమయంలో చావైనా బతుకైనా విలువల కోసం అన్న విషయాన్ని సౌకర్యవంతంగా మరిచిపోతున్న జాతి ఏ విలువలనైనా వదిలేసి ఎలాగైనా బతికెయ్యటమే సంస్కారం అనుకొనే స్థాయికి దిగజారుతున్నస్థితిని గురించిన విషాద స్పృహను దేశభక్తుడి వాక్యంలో ధ్వనింప చేసింది ఈ కథ. అంతే కాదు. దేశభక్తుడి మరణాన్ని కుల రాజ్యం లోక కంట కుడి మరణంగా ప్రకటించటం చూస్తాం. “యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత , అభ్యుద్ధనామ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం” అని సన్యాసి చదివిన భగవద్గీతా శ్లోకం ఈ కథకు అసలైన ముగింపు. ఎప్పుడెప్పుడు ధర్మానికి క్షీణత, అధర్మానికి అభివృద్ధి జరుగుతాయో అప్పుడు నేను అవతరిస్తాను అన్న శ్రీకృష్ణ వాక్యం అది. దారిద్య్రం, కులతత్వం నశించాలనటం అధర్మం అయి , అందుకు ఆలోచిస్తున్న వాడిని చంపటం ప్రభుత్వ ధర్మం అయిన తలకిందుల వ్యవస్థకు న్యాయ సంబద్ధతను సమకూర్చే శక్తిగా మతం రాజకీయంతో జతకట్టటం ఇలా జరిగిందన్నమాట.

కులం ఒక సామాజిక అసమవ్యవస్థకు కారణం. కులం స్థానంలో స్త్రీపురుష భేదం, మతం ఉత్పత్తి నమూనాలు, సంబంధాలు ఏవైనా పెట్టుకోవచ్చు. అవి కారణంగా ఏర్పడిన సామాజిక అసమానతలు పోవాలని, పోయే మార్గం ఏమిటా అని ఆలోచించే వాళ్ళు ప్రజల పక్షాన నిలబడ్డ వాళ్లు. అందువల్లనే రాజ్యాధికార వ్యవస్థకు ప్రమాదకారులు. కనుకనే వాళ్ళను దేశద్రోహులుగా చెప్పి ఉసురు తీయటం. దేశప్రజల కనీసావసరాలు తీరాలని, హక్కులు అందరికీ సమానంగా అనుభవానికి రావాలని, ప్రజలందరూ ఆత్మగౌరవంతో జీవించే అవకాశం వుండాలని కోరుకొనటం, అలాగని చెప్పటం, వ్రాయటం, దానిని వాస్తవీకరించే ఆచరణ మార్గాలను ఎన్నుకొని క్రియాశీలురు కావటం దేశ భద్రతకు, సమగ్రతకు,శాంతికి భంగకరమైనవిగా చెప్పబడుతున్నాయి. అసమానత లను,వైషమ్యాలను పెంచిపోషించే సనాతన మత సాంస్కృతిక వారసత్వాన్ని, ఆధునిక గుత్త పెట్టుబడుల బహుళజాతి ఆర్ధిక ప్రయోజనాలను కలగలిపి పాలకవర్గాలు రూపొందించుకున్న విధానాలకు సామాజిక సమ్మతిని సంపాదించుకొనటం వర్తమాన రాజకీయ సమయం. దేశానికి స్వాతంత్య్రం రావటానికి నాలుగేళ్ల ముందే అధికారం చేపట్టబోయే వర్గం స్వభావాన్ని వూహించాడా అన్నట్లుగా ఈ కథకు కొకు ఇచ్చిన ముగింపే స్వాతంత్య్ర అమృతోత్సవ కాల ముఖ చిత్రం కావటం కళ్ళముందరి వాస్తవం.

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

Leave a Reply