యజీద్

సాదత్ హసన్ మంటో
ఉర్దూ మూలానికి ఇంగ్లీషు అనువాదం: రఖ్షందా జలీల్
తెలుగు అనువాదం: సుధా కిరణ్

1947 అల్లర్లు ముగిశాయి. అతివృష్టి, అనావృష్టి ఋతువులలాగా అల్లర్లు కూడా మొదలయ్యాయి, ముగిసిపోయాయి. అలాగని, ఏది జరిగినా అది దైవ నిర్ణయం అని కరీందాద్ సరిపెట్టుకోలేదు. కష్టాలు, పరీక్షలు అన్నిటినీ స్థిరంగా తట్టుకున్నాడు. స్థైర్యంతో ఎదుర్కొన్నాడు. శత్రువులతో ముఖాముఖీ తలపడ్డాడు. యుద్ధంలో కలబడి ఓడించామా, లేదా అనేదాని కంటే పోరాటంలో ఎదురు నిలబడి తలపడడం ముఖ్యమని అనుకున్నాడు. తనకంటే బలమైన వాడని తెలిసినా, సవాలు ఎదురైనప్పుడు శత్రువు ముందు లొంగిపోతే అది వ్యక్తిగతంగా తనకే కాదు, మనుషులందరికీ అవమానమని అనుకున్నాడు. నిజం చెప్పాలంటే, తన గురించి ఇతరులు అనుకునే మాట ఇది. అత్యంత క్రూరమైన ప్రత్యర్థులని సైతం ధైర్య సాహసాలతో ఎదిరించాడు. ఆ తెగింపు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. శత్రువు సవాలు విసిరినప్పుడు మారుమాట లేకుండా తలవంచుకుని ఓటమిని అంగీకరిస్తే, ఆ అవమానం తనకా, మొత్తం మానవ జాతికా అని ప్రశ్నిస్తే మాత్రం కరీందాద్ దగ్గర సమాధానం ఉండదు. మనమేదో చిక్కులెక్కల ప్రశ్న వేసినట్లు సమాధానం చెప్పకుండా మౌనంగా ఆలోచనలో మునిగిపోతాడు.

కరీందాద్ కి లెక్కలు – కూడికలు, తీసివేతలు, హెచ్చవేతలు, భాగహారాల ఇవేవీ తెలియవు. 1947 అల్లర్లు ముగిశాక మిగతా అందరూ ఆస్తి, ప్రాణనష్టాల లెక్కలు వేసుకున్నారు. కానీ కరీందాద్ కి మాత్రం ఇవేవీ పట్టలేదు. తనకి సంబంధించినంతవరకూ తండ్రి రహీందాద్ ఈ యుద్ధంలో చనిపోయాడన్నదొక్కటే ముఖ్యమైన విషయం. తండ్రి శవాన్ని భుజాలపైన మోసుకుపోయి, ఒక బావి పక్కన దేహాన్ని ఖననం చేశాడు.

ఆ ఊళ్ళో చాలామంది చనిపోయారు. వేలమంది పిల్లలనీ, ముసలివాళ్ళనీ చంపేశారు. చాలామంది ఆడపిల్లలు కనిపించకుండా పోయారు. చాలామందిని అమానుషంగా చెరిచారు. బాధితులు కన్నీళ్ళు కార్చారు. తమ దురదృష్టాన్ని తలచుకున్నారు. కనికరం లేకుండా హత్యలకీ, అత్యాచారాలకీ పాల్పడిన కరకు గుండెల దుండగులని తలచుకుని దీర్ఘశోకంలో కుంగిపోయారు. కానీ, కరీందాద్ ఒక్క కన్నీటిబొట్టు కూడా కార్చలేదు. చివరివరకూ ధైర్యంగా పోరాడిన తండ్రిని తలచుకుని గర్వపడ్డాడు. కత్తులు, గొడ్డళ్ళతో దాడిచేసిన 25-30 మంది దుండగులని కరీందాద్ తండ్రి ఒంటిచేత్తో ఎదిరించాడు. దాడిచేసిన దుండగులతో తండ్రి ధైర్యంగా కలబడి మరణించాడని తెలిశాక కరీందాద్ మాట్లాడిన మాటలు ఇవీ, ‘ఇలాగైతే కుదరదు, చేతిలో కనీసం ఒక్క ఆయుధమైనా ఉంచుకోమని ఎన్నిసార్లు నీకు చెప్పాను.’

ఆ నాలుగు మాటలు మాట్లాడి, తండ్రి రహీందాద్ శవాన్ని భుజాల మీద మోశాడు. బావి పక్కన గొయ్యి తీసి అందులో ఖననం చేశాడు. సమాధి స్థలం దగ్గర నిలబడి ప్రార్ధించాడు, ‘భగవంతుడు మంచి పనులనీ, చెడ్డపనులనీ లెక్క తీసుకుంటాడు. నీకు స్వర్గమే లభించుగాక.’

అల్లర్లలో దాడి చేసిన దుండగులు రహీందాద్ ని దారుణంగా చంపారు. రహీందాద్ కన్నతండ్రి మాత్రమే కాదు, కరీందాద్ కి ప్రియమైన స్నేహితుడు కూడా. క్రూరమైన ఆ హత్య గురించి విన్నవాళ్ళు హంతకులకి శాపనార్ధాలు పెట్టేవాళ్ళు. కరీందాద్ మాత్రం ఎవరినీ పల్లెత్తు మాట అనలేదు. చేతికి అంది రాబోయే పంట కూడా నాశనమై పోయింది. అంతకుముందే, తన రెండు ఇళ్ళని కూడా తగలబెట్టారు. అయినా తండ్రి మరణానికి ఈ నష్టాలని కలిపి లెక్కలు వేసుకోలేదు కరీందాద్. ‘అంతా మన పొరపాటు మూలంగానే జరిగింది’ అని మాత్రమే చెప్పేవాడు. ఆ పొరపాటేమిటని ఎవరైనా అడిగితే, మారు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయేవాడు.

మిగతా ఊరంతా అల్లర్లలో నష్టపోయి, శోకంలో మునిగిపోయివుంటే, కరీందాద్ మాత్రం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. చాలాకాలంగా ఒక అమ్మాయిపై మనసు పారేసుకున్నాడు. ఆ అమ్మాయి నల్లగా, అందంగా ఉంటుంది. ఆమె పేరు జీనా. జీనా కూడా విషాదంలోనే మునిగివుంది. తన అన్నని అల్లర్లలో చంపేశారు. బలంగా ఉండే ఎత్తైన మనిషి. అమ్మ, నాన్నలు చనిపోయాక, జీనాకి మిగిలిన అండ ఆ అన్న ఒక్కడే. జీనాకి కూడా కరీందాద్ అంటే ఇష్టమే. అన్న చనిపోవడంతో, ఆ ప్రేమ కూడా విషాదంగా మారిపోయింది. ఎప్పుడూ నవ్వుతూ వున్నట్లుండే ఆమె కళ్ళు, దుఃఖంలో కూరుకుపోయాయి.

కరీందాద్ కి ఏడవటమంటే అస్సలు నచ్చదు. జీనా విచారంగా కనిపిస్తే అతనికి కోపం వచ్చేది. కానీ తనని ఎప్పుడూ కసురుకోలేదు. ఆడపిల్ల, తిడితే తన మాటలకి మరింతగ నొచ్చుకుంటుందని ఎన్నడూ విసుక్కోలేదు. ఒకసారి ఇద్దరూ చేలో ఉన్నపుడు, ఆమెతో అన్నాడు, ‘చనిపోయిన వాళ్ళని మనం సమాధి చేసి సంవత్సరం గడిచిపోయింది. అమ్మాయీ, ఆ దుఃఖాన్ని ఇంక వదిలేయి. ముందు, ముందు మరెన్ని చావులని చూడాల్సి ఉందో. భవిష్యత్తు కోసం కాసిన్ని కన్నీళ్ళైనా దాచుకో.’

జీనాకి అలా మాట్లాడటం అసలు నచ్చలేదు. కానీ, కరీందాద్ అంటే ప్రేమ కాబట్టి, అతని మాటలనే తలుచుకుంది. ఒంటరిగా కూర్చుని ఆ మాటలలో అర్ధం గురించి బాగా ఆలోచింది. చివరికి కరీందాద్ మాటలు సరైనవేనని అనుకుంది.
కరీందాద్, జీనాల పెళ్ళి ప్రస్తావన తేగానే మొదట్లో ఊరిపెద్దలు ఆ ప్రతిపాదనని వ్యతిరేకించారు. అయితే, ఆ వ్యతిరేకతలో పెద్దగా బలం లేదు. నిరంతర శోకంలో ఆ వ్యతిరేకతని దృఢంగా కొనసాగించే పరిస్థితి లేదు. అలా, కరీందాద్ పెళ్ళి జరిగింది. పాటగాళ్ళనీ, మేళగాళ్ళనీ పిలిచారు. పెళ్ళి ఆచారాలన్నీ పాటించారు. జీనా, కరీందాద్ ఇంటి ఇల్లాలుగా అడుగుపెట్టింది.

అల్లర్ల తర్వాత ఊరే ఒక పెద్ద స్మశానంగా మారిపోయింది. ఊళ్ళో అరుపులు, కేకలతో పెళ్లి ఊరేగింపు మొదలయినప్పుడు కొంతమంది భయపడ్డారు. అదేదో దెయ్యాల ఊరేగింపు అనుకున్నారు. స్నేహితులు ఆ మాట చెబితే కరీందాద్ బిగ్గరగా నవ్వేశాడు. అదే మాట కొత్త పెళ్లికూతురుకు కరీందాద్ నవ్వుతూ చెబితే, ఆమె మాత్రం భయంతో వణికిపోయింది.

జీనా ఎర్రగాజుల చేతిని తన చేతులలోకి తీసుకున్నాడు కరీందాద్. ‘ఈ దెయ్యం నిన్ను జీవితాంతం వెంటాడుతుంది. ఊరి మంత్రగాడు కూడా నన్ను వదిలించలేడు.’

గోరింటాకుతో ఎర్రగా పండిన చేతులతో నోరు మూసుకుంది జీనా. ‘కీమే, నీకు అస్సలు భయమన్నది లేదేం.’

కరీందాద్ నలుపు, గోధుమవన్నె మీసాలని పెదవులతో సవరించుకుంటూ చిరునవ్వు నవ్వాడు, ‘దేనిగురించైనా నేనెందుకు భయపడాలి?’

జీనాకి దుఃఖభారం తగ్గిపోయింది. ఇప్పుడు తల్లి కాబోతున్నది. బిడ్డ కడుపులో పడిన విషయం కరీందాద్ కి తెలిసి సంబరపడ్డాడు. ‘జీనా, నువ్వు ఇంతకుముందెన్నడూ ఇంత అందంగా కనిపించలేదు! పుట్టబోయే వాడికోసమే నువ్వింత అందంగా మారావంటే, పుట్టాక వాడితో నాకింక ఎప్పుడూ గొడవే’ అన్నాడు.

సిగ్గుపడిన జీనా, ఉబ్బెత్తుగా పెరిగిన కడుపు మీద దుప్పటి కప్పింది. అది చూసిన కరీందాద్ నవ్వి, ఇంకా ఆటపట్టించడం మొదలుపెట్టాడు. ‘ఎందుకు దాస్తావు? పుట్టబోయే ఆ పందిపిల్లాడి కోసం నువ్వింత ఇబ్బంది పడుతున్నావన్న విషయం నేను తెలుసుకోలేననుకున్నావా?’

జీనా అకస్మాత్తుగా గంభీరంగా మారిపోయింది. ‘సొంత బిడ్డని అలాంటి పిచ్చి మాటలు అంటారా ఎవరైనా?’

కరీందాద్ చిరునవ్వుతో నలుపు, గోధుమవన్నె మీసాలు కూడా నవ్వాయి. ‘మరి కరీందాద్ అందరికంటే పెద్ద పంది.’

మొదటి ఈద్ పండుగ వచ్చింది. ఆ తర్వాత రెండవ ఈద్ పండుగ కూడా వచ్చింది (ఇస్లాం సంప్రదాయంలో ప్రధానంగా రెండు ఈద్ పర్వదినాలు ఉంటాయి. మొదటిది, ఈదుల్ ఫితర్, రమజాన్ మాసపు ఉపవాసాలకి ముగింపుగా జరుపుకునే పండుగ. ఇస్లామిక్ క్యాలెండరులో పదవ మాసపు ఆరంభ దినం. రెండవది, ఈదుజ్జహా, ఇస్లామిక్ క్యాలెండరులో చివరి, పన్నెండవ మాసపు పదో రోజున జరుపుకునే పర్వదినం – అనువాదకుడు). కరీందాద్ రెండు పర్వదినాలనీ ఉత్సాహంగా జరుపుకున్నాడు. అంతకు ముందు ఈద్ పండుగకి పన్నెండు రోజుల ముందు ఆ వూరిపై దుండగులు దాడి చేశారు. కరీందాద్ తండ్రి రహీందాద్, జీనా అన్నయ్య ఫజల్ ఇలాహి ఇద్దరూ ఆ దాడిలో చనిపోయారు. కానీ, ఎలాంటి విషాద జ్ఞాపకాల జాడలనీ దగ్గరకు రానివ్వని కరీందాద్ తోడుగా ఉండడంతో, జీనా వాళ్ళని ఎక్కువగా తలచుకోలేక పోయింది.

ఒక్కసారి ఆగి తలచుకుంటే, తన జీవితంలోనే అత్యంత భారమైన విషాదాన్ని ఎంత త్వరగా మరచిపోతున్నానా అని జీనాకి ఆశ్చర్యం కలుగుతుంది. తనకి తల్లిదండ్రులు చనిపోయిన జ్ఞాపకమే లేదు. అన్నయ్య ఫజల్ ఇలాహీ తనకంటే ఆరేళ్ళు పెద్ద. అమ్మ, నాన్న, అన్న అన్నీ తానే. అన్నయ్య తన కోసమే పెళ్లి చేసుకోలేదని జీనాకి తెలుసు. చెల్లెలిని కాపాడటం కోసమే ఫజల్ ఇలాహీ చనిపోయాడని వూరిలో అందరికీ తెలుసు. అలాంటి అన్న మరణం జీనా జీవితంలోనే పెద్ద విషాదం. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా, రెండవ ఈద్ పండుగకి సరిగ్గా పన్నెండు రోజుల ముందు ఆ విషాద సంఘటన జరిగింది. ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తే, ఆ విషాద సంఘటన దుఃఖం నుంచి, దిగ్భ్రాంతి నుంచి కోలుకుని తాను ఇంతదూరం ఎలా రాగలిగిందో తనకీ ఆశ్చర్యమే.

ముహర్రం రాబోతున్నది. చూలాలిగా ఉన్న జీనా కరీందాద్ ని మొదటికోరిక కోరింది. ముహర్రం ఊరేగింపులో గుర్రాన్నీ, తాజియానీ చూడాలని జీనాకి చాలా కోరికగా ఉంది (ముహర్రం ఊరేగింపులో తెల్ల గుర్రం (ఇమామ్ హుసేన్ జ్ఞాపకం), తాజియా (ఇమామ్ హుసేన్ సమాధి చిహ్నం) ప్రదర్శిస్తారు. ఇమామ్ హుసేన్ అమరత్వానికీ, త్యాగానికీ అవి ప్రతీకలు – అను). ముహర్రం ఊరేగింపు గురించి స్నేహితుల దగ్గర చాలా, చాలా విన్నది జీనా. ‘నాకు ఒంట్లో బాగా వుంటే, నన్ను ఊరేగింపు దగ్గరకు తీసుకుపోతావా?’ అని కరీందాద్ ని అడిగింది.

‘నీకు బాగా లేకున్నా తీసుకుపోతాను… ఇదిగో కడుపులో ఉన్న ఈ పందిపిల్లాడితో సహా నిన్ను తీసుకుపోతాను’ అని కరీందాద్ జవాబు చెప్పాడు.

కడుపులో పెరుగుతున్న బిడ్డని అలా పిలిస్తే జీనాకి కోపం వస్తుంది. ఆ మాట అన్నప్పుడల్లా అలిగి కూర్చుంటుంది. కానీ, కరీందాద్ మాటలలో ప్రేమ ఉట్టిపడుతుంది. దాంతో, జీనా కోపం కాస్తా మాటలలో వర్ణించలేని సంతోషంగా మారిపోతుంది. అసలు అసహ్యకరమైన ‘పంది పిల్లాడు’ అన్న పిలుపులో అంతటి ప్రేమ ఎలా వ్యక్తం అవుతుందా అని జీనా ఆశ్చర్యపోతూ ఉంటుంది.

ఇండియా, పాకిస్తాన్ ల మధ్య యుద్ధం జరుగుతుందనే వదంతులు కొద్ది రోజులుగా వినిపిస్తూ ఉన్నాయి. నిజానికి, పాకిస్తాన్ ఏర్పడిన కొద్ది రోజులకే యుద్ధం దాదాపు ఖాయం అనిపించింది. యుద్ధం ఖచ్చితంగా ఎప్పుడు మొదలౌతుందనేది ఊళ్ళో ఎవరికీ తెలియదు. ఎవరైనా ప్రశ్నిస్తే, ‘యుద్ధం ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది. దాని గురించి మనం ఆలోచించడం ఎందుకు?’ అని కరీందాద్ సమాధానం చెప్పేవాడు.

యుద్ధం అన్నమాట రాగానే జీనా బెంబేలెత్తిపోయేది. స్వతహాగా శాంతిని కోరుకునే మనిషి. ఇద్దరు స్నేహితుల మధ్య చిన్న గొడవ తలెత్తినా బాధపడేది. అదీగాక, ప్రాణం లాంటి అన్నని పొట్టనబెట్టుకున్న అల్లర్లలో లూటీలనీ, హత్యాకాండనీ కళ్ళారా చూసి వున్నది. ఒకరోజు, కరీందాద్ ని అడిగింది, ‘కీమే, ఇంతకీ ఏం జరుగుతుందంటావు?’

కరీందాద్ నవ్వుతూ జవాబిచ్చాడు, ‘పుట్టేది మగ పిల్లవాడో, ఆడపిల్లో నాకెలా తెలుస్తుంది’.

ఇదిగో ఇలాంటి సమాధానాలతో జీనాకి కోపం వచ్చేది. అంతలోనే, ఉడికించే మాటలని అర్ధం చేసుకుని, యుద్ధం గురించిన భయాన్ని మర్చిపోయేది. కరీందాద్ బలమైన వాడు, భయం ఎరగని మనిషి. జీనా అంటే వల్లమాలిన ప్రేమ. ఒక రైఫిల్ కొనుక్కువచ్చాడు. గురి చూసి కాల్చడం నేర్చుకున్నాడు. వీటితో జీనాకి ధైర్యం వచ్చేది. కానీ, అంతలోనే స్నేహితులు ఎవరైనా యుద్ధం వదంతులతో భయపెట్టగానే మళ్ళీ భయపడిపోయేది.

మంత్రసాని బఖ్తో ప్రతిరోజూ జీనాని చూడడానికి ఇంటికి వచ్చిపోయేది. ఒకరోజు బఖ్తో, ఇండియా వాళ్ళు నదిని ‘మూసేయబోతున్నారనే’ కబురుతో వచ్చింది. జీనాకి ఆ మాట అర్ధం కాలేదు. బఖ్తోని అడిగింది, ‘నదిని మూసేయడమంటే ఏమిటి?’

‘మన పొలాలలో పంటలకు నీళ్లు పారించే నదిని ఆపేయడం.’

జీనా ఒక్క క్షణం పాటు ఆలోచించి, నవ్వింది. ‘నువ్వు పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు… నదిని ఆపే శక్తి ఎవరికుంది? అదేమీ చిన్న మురికి కాలవ కాదు కదా?’

నెలలు నిండిన జీనా కడుపుని సున్నితంగా మర్దిస్తూ, ‘నాకు తెలియదు. నేను విన్న మాటలే నీకు చెప్పాను. పత్రికల నిండా అవే వార్తలట’ అని అంది బఖ్తో.

‘పత్రికల నిండా వార్తలంటే, ఏం వార్తలు’ అనుమానంగా అడిగింది జీనా.

బఖ్తో ముడతలుపడిన చేతులతో జీనా కడుపు నిమిరింది. ‘వాళ్ళు నదిని మూసేస్తారన్న వార్తలు.’ జీనా కడుపుమీద వస్త్రాన్ని కిందకు లాగింది. బయలుదేరేందుకు నిలబడింది. ‘అంతా సవ్యంగా ఉంటే, ఇవాళ్టికి పదో రోజున ప్రసవం’ అని నమ్మకంగా చెప్పింది.

కరీందాద్ ఇంట్లోకి అడుగుపెట్టగానే, నదిని మూసేస్తారట కదా అని అడిగింది జీనా. ముందు ఆ ప్రశ్నని దాటవేయడానికి ప్రయత్నించాడు కరీందాద్. జీనా పట్టు విడవకుండా అడుగుతుండేసరికి, ‘నేను కూడా ఆ వార్తలే విన్నాను’ అని జవాబిచ్చాడు.

‘నువ్వు విన్న వార్త ఏమిట?’ని గట్టిగా అడిగింది జీనా.

‘ఇండియా వాళ్ళు నదిని మూసేస్తారట.’

‘కానీ, ఎందుకు?’

‘మన పంటలకి నీళ్ళు లేకుండా నాశనం చేయడానికి.’

దాంతో జీనాకి నదిని నిజంగానే మూసేస్తారని నమ్మకం ఏర్పడింది. ‘ఈ మనుషులు ఎంత క్రూరమైన వాళ్ళో కదా’ అని నిస్సహాయంగా నిట్టూర్చింది

ఆ మాటలు విన్న కరీందాద్ నవ్వాడు. ఒక్కక్షణం ఆగి, ‘నువ్వు వీటన్నిటినీ మర్చిపో. బఖ్తో వచ్చి, వెళ్లిందా లేదా?’ అని అడిగాడు.

‘ఆ వచ్చి వెళ్ళింది’ నిరాసక్తంగా జవాబిచ్చింది జీనా.

‘బఖ్తో ఏమన్నది?’

‘ఇంకో పది రోజులలో బిడ్డ పుడుతుందట.’

‘బిడ్డ చిరాయువుగా జీవిస్తాడు’ అని బిగ్గరగా, ఉత్సాహంగా కేక పెట్టాడు కరీందాద్.

జీనా చికాకు పడింది. ‘చూడు, ఇలాంటి సమయంలో సంబరపడుతున్నావు. దేవుడా, ఎలాంటి ఉపద్రవం రాబోతుందోనని నేను హడలి చస్తుంటే.’

కరీందాద్ ఊరి చావడి దగ్గరకు వెళ్ళాడు. దాదాపు వూళ్ళో మగవాళ్లందరూ అక్కడ పోగయ్యారు. నదిని మూసేస్తారన్న వార్త గురించి ఊరి పెద్ద చౌధరీ నాథ్ ని అందరూ అడుగుతున్నారు. ఒకరు పండిట్ నెహ్రూని బూతులు తిడుతున్నారు. ఇంకొకరు నెహ్రూకి శాపనార్థాలు పెడుతున్నారు. నది ప్రవాహ దిశని ఇష్టానుసారంగా మార్చడం సాధ్యపడదని ఇంకొకరెవరో గట్టిగా చెబుతున్నారు. జరగబోయేది మన పాపాలకి భగవంతుడు విధించిన శిక్ష అనీ, ముంచుకొస్తున్న విపత్తుని తప్పించుకోవాలంటే మసీదుకు వెళ్ళి ప్రార్ధన చేయడమొక్కటే మార్గమనీ ఇంకొకరు చెబుతున్నారు.

కరీందాద్ ఒక మూలన కూర్చొని, తన చుట్టూ ఆవేశంగా జరుగుతున్న చర్చలని మౌనంగా విన్నాడు. భారతీయులని బాగా తిడుతున్న వాళ్ళందరిలో చౌధరీ నాథ్ ఎక్కువ ఆవేశంగా మాట్లాడుతున్నాడు. చికాకుతో అటూ, ఇటూ అశాంతిగా చూశాడు కరీందాద్. అందరూ నదిని మూసేయడం నీచమైన, నికృష్టమైన పని అన్నారు. అది నీతి, నియమాలకు విరుద్ధమైన, అధమమైన, పరమ క్రూరమైన చర్య అనీ, యజీద్ చేసిన పాప కార్యంతో పోల్చదగిన చర్య అనీ తీర్మానించారు. (ఉమయ్యద్ ఖలీఫాగా ఉండిన మొదటి యజీద్, కర్బలా యుద్ధం సందర్భంగా హుసేన్, తన అనుచరులకు చుక్క నీరు అందకుండా యూఫ్రటీస్ నది పొడవునా సైనికుల్ని నియమించాడు. యజీద్ దుర్మార్గానికి ఇది ప్రస్తావన – అను).

ఏదో మాట్లాడాలని ఉన్నట్టు కరీందాద్ ఒకటి రెండు సార్లు దగ్గాడు. చౌధరీ నాథ్ నోటి వెంబడి మరొక మారు బూతుల వరద మొదలయింది. కరీందాద్ ఇక ఆపుకోలేక పోయాడు. ‘చౌధరీ, బయటివాళ్ళని తిట్టవద్దు’ అంటూ అరిచాడు.
అమ్మనా బూతులు అందుకున్న చౌధరీ నాథ్ మాట గొంతులోనే ఆగిపోయింది. కరీందాద్ వైపు తిరిగి వింతగా చూశాడు. కరీందాద్ తన తలపాగాని సరిచేసుకున్నాడు.

‘ఏమంటున్నావు నువ్వు?’

‘బయటివాళ్ళని తిట్టవద్దు అంటున్నాను’ అంటూ కరీందాద్ మెల్లగా, దృఢంగా జవాబు ఇచ్చాడు.

చౌధరీ నాథ్ మళ్ళీ బూతులు లంకించుకున్నాడు. విసురుగా కరీందాద్ వైపు తిరిగాడు. ‘నేను తిడుతున్నదెవరిని? వాళ్ళతో నీకేమి చుట్టరికం?’ చావడిలో కూర్చున్న జనం వైపు చుట్టూ చూసి, ‘వింటున్నారా అందరూ? నేను వాళ్ళని తిట్టకూడదట… మీరందరూ అడగండి, వాళ్ళతో అతనికేమి బంధుత్వం ఉందని?’

కరీందాద్ ఓపికగా జవాబు ఇచ్చాడు, ‘వాళ్ళతో నాకేం బంధుత్వం? వాళ్ళు నాకు శత్రువులు. అంతకు మించి ఏముంటుంది?’

చౌధరీ నాథ్ బిగ్గరగా, బొంగురు గొంతుతో నవ్వేసరికి మీసాలు అటూ ఇటూ ఊగాయి. ‘విన్నారా? వాళ్ళు తనకి శత్రువులట. అయితే, మరి మనం శత్రువులని ప్రేమించాలా ఏమిటీ?’

కరీందాద్ పెద్దమనిషికి కొడుకులాగా ఒద్దికగా సమాధానం చెప్పాడు. ‘లేదు చౌధరీ, నేను అలా అనలేదు. ఇతరులని తిట్టవద్దని మాత్రమే అన్నాను.’

కరీందాద్ పక్కనే కూర్చుని వున్న బాల్య స్నేహితుడు మీరాన్ బక్ష్ అడిగాడు, ‘ఎందుకు?’

కరీందాద్ నేరుగా మీరాన్ బక్ష్ కి సమాధానం చెప్పాడు, ‘ఇందులో ఏముంది? వాళ్ళు నదిని మూసేసి, మన పంటల్ని ఎండబెట్టి నాశనం చేయాలని చూస్తున్నారు. వాళ్ళని తిడితే చెల్లుకిచెల్లు అవుతుందని మీరనుకుంటున్నారా? మన తిట్లకి ఏమైనా అర్ధం ఉందా? మన దగ్గర సరైన జవాబు లేనప్పుడే తిట్లకి లంకించుకుంటాం.’

‘అయితే నీ దగ్గర సమాధానం ఉందా?’ మీరాన్ బక్ష్ అడిగాడు.

కరీందాద్ ఒక్కక్షణం ఆలోచించాడు. ‘ఇది నా ఒక్కడి సమస్య కాదు. ఇందులో వేలమంది సమస్య ఉంది. నా ఒక్కడి సమాధానం అందరి సమాధానం కాలేదు. అలాంటి పరిస్థితులలో అన్ని విషయాలూ జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత మాత్రమే సంతృప్తికరమైన సమాధానం దొరుకుతుంది. నది ప్రవాహ దిశని వాళ్ళు రాత్రికిరాత్రే మార్చలేరు. ఆ పని చేయడానికి వాళ్ళకు కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ మాత్రం మీరు ఒక్క క్షణంలో బూతులు తిట్టి మీ కోపాన్ని వెళ్ళగక్కుతున్నారు.’ మీరాన్ బక్ష్ భుజం మీద ఆప్యాయంగా చేయి వేసి, నాకు తెలిసిందల్లా ఒక్కటే, ఇండియా నీతికి కట్టుబడడం లేదనీ, కొంచెపు బుద్ధి ప్రదర్శిస్తుందనీ, క్రూరంగా వ్యవహరిస్తుందనీ అనడం తప్పు.’

మీరాన్ బక్ష్ కి బదులు చౌధరీ నాథ్ అరిచాడు, ‘ఈ మాటలు కూడా వినండి’.

కరీందాద్ మాత్రం మీరాన్ బక్ష్ కే సమాధానం చెబుతున్నాడు. ‘శత్రువు నుంచి జాలినీ, సహాయాన్నీ ఆశించడం మూర్ఖత్వం మిత్రమా. యుద్ధం బద్దలయితే, వాళ్ళు పెద్ద గొట్టాలున్న తుపాకీ వాడుతున్నారని, వాళ్ళు పెద్ద పెద్ద బాంబులు వేస్తుంటే మనం చిన్న, చిన్న బాంబులు వేస్తున్నామని ఏడిస్తే, అలాంటి ఏడుపులకి నిజంగా విలువ ఉంటుందా? చంపాలంటే చిన్న కత్తితోనైనా, పెద్ద కత్తితోనైనా చంపవచ్చు. నా మాటల్లో నిజం ఉందా, లేదా?’

మీరాన్ బక్ష్ కి బదులు చౌధరీ నాథ్ లో ఆలోచన మొదలయింది. అంతలోనే చికాకు పడ్డాడు, ‘ఇక్కడ వాళ్ళు మనకి నీళ్ళని ఆపేయాలని చూడడం అసలు సమస్య.. వాళ్ళు మనల్ని ఆకలి, దప్పులతో చంపివేయాలని చూస్తున్నారు.’

కరీందాద్, మీరాన్ బక్ష్ భుజం మీద నుండి చేయి తీసి, చౌధరీ నాథ్ కి సమాధానం చెప్పాడు, ‘ మనం ఒకరిని శత్రువు అని ప్రకటించాక, వాళ్ళు మనని ఆకలి, దప్పులకు గురిచేసి చంపుతున్నారని ఫిర్యాదు చేయడం ఎందుకు? వాళ్ళు మనని ఆకలి దప్పులకు గురిచేసి చంపకుండా ఎందుకుంటారు? పచ్చని పంట పొలాలని ఎండిపోయిన బీడు భూములుగా మార్చకుండా ఎందుకుంటారు? వాళ్ళు మనకి పళ్లెంలో పలావు తీసుకొచ్చి తినిపిస్తారా? తీయటి షర్బత్ పానీయాలు తీసుకొస్తారా, మన విశ్రాంతి కోసం వాకిట్లో పూల మొక్కలనీ, పండ్లతోటలనీ నాటుతారా?’

దీంతో, చౌధరీకి కోపం నసాళానికి అంటింది, ‘ఏమిటీ చెత్త వాగుడు?’

మీరాన్ బక్ష్ ది కూడా మృదువుగా అదే మాట, ‘మిత్రమా, ఏమిటీ చెత్త వాగుడు?’

కరీందాద్ నచ్చచెబుతున్నట్టు వివరించాడు, ‘ఇది చెత్త వాగుడు కాదు మీరాన్ బక్ష్. యుద్ధంలో రెండు పక్షాలూ ఒకదానిని మరొకటి ఓడించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తాయి. మల్ల యుద్ధంలో రంగంలోకి దిగే ముందు లంగోటీ బిగించుకుని, పోటీదారుని పడగొట్టడానికి అన్ని రకాల ఎత్తులూ ప్రయోగిస్తారు. ఇక్కడ కూడా అంతే.’

మీరాన్ బక్ష్ గుండు గీసిన తన తలని ఊపుతూ, ‘అవును, అదీ నిజమే’నని ఒప్పుకున్నాడు.

కరీందాద్ చిరునవ్వు నవ్వాడు. ‘అయితే, వాళ్ళు నదిని మూసేయాలనుకోవడం కూడా సరైనదే. మనకి అది క్రూరత్వంలా అనిపించవచ్చు. వాళ్ళ దృష్టిలో మాత్రం అది సరైనదే.’

‘దాహంతో నీ నాలుక పిడచగట్టుకుపోయి, నువ్వు నేలమీద కూలబడిపోయినప్పుడు కూడా నదిని మూసేయడం సరైనదేనని అంటావా? నీ పిల్లలు ఆకలికి అల్లల్లాడుతూ, గుక్కెడు మెతుకులకోసం ఏడుస్తున్నపుడు కూడా వాళ్ళు నదిని మూసేయడం సరైనదేనని అంటావా?’

ఎండిపోయిన పెదవులని నాలికతో తడుపుకుంటూ కరీందాద్ సమాధానం చెప్పాడు, ‘చౌధరీ, అప్పుడు కూడా నేను ఆ మాటే అంటాను. వాళ్ళు మనకు శత్రువులు అంటే మనం కూడా వాళ్లకి శత్రువులమేనన్న విషయం ఎందుకు మర్చిపోతున్నావు? అవకాశం ఉంటే, మనం కూడా వాళ్లకి తిండి, నీళ్ళు దొరకకుండా చేస్తాము. కానీ అవకాశం ఇప్పుడు వాళ్ళ చేతిలో వుందిగనక వాళ్ళు నదిని మూసేయబోతున్నారు. మనం దీనినుంచి బయటపడే ఉపాయమేదో ఆలోచించాలి కానీ, బూతులు తిడితే ఉపయోగం ఏముంది? శత్రువు నీకోసం పాలు, తేనెలు పంపించబోడు. అవకాశం ఉంటే, ప్రతీ నీటిబొట్టులో విషాన్ని నింపుతాడు. నువు దీనిని క్రూరత్వం అంటావు. ఇట్లా ప్రాణాలు తీయడం నీకు ఇష్టం లేదుగనక ఇది బర్బరత్వం అని కూడా అంటావు. ఇది నీకు వింతగా అనిపించడం లేదా? యుద్ధం మొదలుపెట్టే ముందు రెండు పక్షాలు ‘నిఖా’ ఒప్పందం లాంటిది చేసుకోవాలా? నియమాలని నిర్ణయించుకోవాలా? ఆకలి, దప్పులతో గాకుండా మనల్ని తుపాకులతో, అదీ ఫలానా రకం తుపాకులతోనే చంపవచ్చని మనం వాళ్లకి చెప్పాలా? అర్ధం లేని చెత్త అంటే అదీ.. జాగ్రత్తగా, ప్రశాంతంగా ఆలోచించు.’

కోపం తారాస్థాయికి చేరి చౌధరీ నాథ్ అరిచాడు, ‘ఎవరైనా ఒక మంచుగడ్డని తీసుకొచ్చి పెట్టండి. కోపాన్ని చల్లార్చండి.’

‘నన్నే ఆపని చేయమంటావా ఏమిటి?’ అని కరీందాద్ నవ్వాడు. మీరాన్ బక్ష్ భుజాన్ని తట్టి, చావడి నుంచి బయలుదే రాడు.

ఇంటి వాకిట్లోకి అడుగు పెట్టబోయే సరికి, బఖ్తో ఇంట్లో నుంచి బయటకు వస్తున్నది. ఆమె కూడా కరీందాద్ ని చూసి, బోసినోటితో నిండుగా నవ్వింది.

‘శుభాకాంక్షలు కీమే. నీకు మంచి మగబిడ్డ పుట్టాడు. బిడ్డకి తగిన మంచి పేరు ఆలోచించు.’

‘పేరా?’ క్షణం కూడా ఆలోచించకుండా, ‘యజీద్, యజీద్’ అన్నాడు కరీందాద్.

బఖ్తో ఆశ్చర్యంగా నోరు తెరిచింది.

కరీందాద్ సంతోషంతో కేరింతలు కొడుతూ ఇంట్లోకి అడుగు పెట్టాడు. నులకమంచం మీద పడుకుని ఉంది జీనా. మునుపటికంటే ముఖం మరింతగా పాలిపోయివుంది. అందమైన బిడ్డ తన పక్కనే నోట్లో వేలు పెట్టుకుని పడుకున్నాడు. బిడ్డని చూసే కరీందాద్ కళ్ళలో ప్రేమ, గర్వం తొణికిసలాడాయి. చూపుడు వేలితో సుతారంగా బిడ్డ బుగ్గని నిమిరాడు. ‘నా చిన్నారి యజీద్’ అని పిలిచాడు.

జీనా ఆశ్చర్యంతో బలహీనమైన గావుకేక పెట్టింది, ‘యజీద్’ నా?

కరీందాద్ బిడ్డ ముఖాన్ని తదేకంగా, శ్రద్ధగా చూస్తూ, ‘అవును, వాడి పేరు, యజీద్’ అని అన్నాడు.

జీనా గొంతు చాలా బలహీనంగా ఉంది. ‘ఏమంటున్నావు కీమే, వాడి పేరు యజీద్ నా?’

కరీందాద్ చిరునవ్వు నవ్వాడు, ‘ఏముంది అందులో, అది ఒక పేరు మాత్రమే.’

జీనా మెల్లిగా గొణిగింది, ‘కానీ ఎలాంటి పేరు?’

కరీందాద్ స్పష్టంగా, నిశ్చయంగా సమాధానం చెప్పాడు, ‘అదే యజీద్ కానవసరంలేదు. ఆ యజీద్ నదిని మూసేశాడు. మన బిడ్డ దానిని తెరుస్తాడు.’

పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాలో. ఇంజనీరింగ్ చదువూ, ప్రస్తుత ఉద్యోగమూ హైదరాబాద్ లో. అప్పుడప్పుడూ రాసే కవిత్వంతో పాటు, సాహిత్యం, రాజకీయాలు, ఆర్థిక అంశాలు, టెక్నాలజీ ధోరణుల పైన విశ్లేషణ వ్యాసాలు, తెలుగు, ఇంగ్లీషు అనువాదాలు వివిధ పత్రికలలోనూ, పుస్తకాలలోనూ అచ్చయ్యాయి.

Leave a Reply