మా వసంతాన్ని యెవర్నీ తాకనిచ్చే ప్రసక్తే లేదు…

అమండా!
నీవు నీ సొంత వీధిలో సైతం
అనుమానాస్పదంగా నడవకు!

**

పర్వాలేదు,
యిది మా వొక్క దేశం సమస్యే కాదు
యిది మా ఒక్క ప్రాంతం గోడే కాదు
యిది విస్తరిస్తోన్న ప్రపంచ స్మశానవాటిక.
శవాలు కాలుతోన్న వాసన మిమ్మల్ని తాకాక
తప్పదు, యేదో వొకరోజు మీరూ మాతో చేరతారు.

‘మేం ప్రపంచ పౌరులం
స్వేచ్ఛ కోసం వధించబడిన వాళ్ళం’
కోసేసిన నాలుకల్తో
తెంచేసిన తలల్తో
అప్పటిదాకా మేం యెలుగెత్తి పాడుతూనే వుంటాం.

అప్పటిదాకా, మీరు మీ యిళ్ళల్లోనే
సురక్షితంగ వుండండి
వార్తలు చూడండి
ఆన్లైన్ షాపింగ్ చెయ్యండి
మీ భాగస్వామిని యెలా మోసగించాలో ఆలోచిస్తూ
వుండండి”

— జియా

**

“వారు తలపై కాల్చి చంపుతారు. కానీ విప్లవం హృదయంలో వుంటుందని వాళ్ళకి తెలియదు.”

మయన్మార్ లో ఫిబ్రవరి1 తిరుగుబాటు తర్వాత జుంటా మిలటరీ బలగాలు మరో కవిని కాల్చి చంపాయి. సాగింగ్ ప్రాంతంలో సెంట్రల్ టౌన్ ష్వెబో లో ఐస్ క్రీమ్ పార్లర్ నిర్వహించే ‘ఖాట్ థీ’ మే 9 వ తేదీన విచారణ పేరిట తీసుకెళ్ళి కాల్చి చంపారు. మార్చి 3 వ తేదీన నిరసన ప్రదర్శనలో కాల్చి చంపబడిన కె జా విన్ కి ఖాట్ థీ మంచి స్నేహితుడు. యింజనీరింగ్ చదువుకున్న ఖాట్ థీ ప్రభుత్వ వుద్యోగం చేస్తూ 2012 లో దాన్ని మానివేసి ఐస్క్రీమ్ పార్లర్ నిర్వహిస్తున్నాడు.

” నేను కథానాయకుడ్ని కావాలనుకోవడం లేదు,
నేను అమరవీరుడినీ కావాలనుకోవడం లేదు
అయితే
నేను బలహీనుడిగానో, మూర్ఖుడిగానో వుండటానికి యిష్టపడటం లేదు.
నా ప్రజలు కాల్చి చంపబడుతున్నప్పుడు
నేను కవితల్ని మాత్రమే విసిరి పారేయగలను.
యిన్ని కోట్లమంది గొంతులూ సరిపోవడం లేదని కచ్చితంగా నేను తుపాకీనే అందుకుంటాను”

— ఖాట్ థీ

చరిత్రలో యెక్కడైనా, యెప్పుడైనా నియంతకు ప్రధాన శత్రువు కవే ! కవిత్వం స్వేచ్ఛ వుంటేనే వికసిస్తుంది. ఆ స్వేచ్ఛ, సమాజ స్వేచ్ఛతో విడదీయరానిదిగా వుండాలి. వో పౌరుడిగా, వొక వ్యక్తిగా, వొక కవిగా వుండటం జాతీయ స్వేచ్ఛకి సంబంధించిన విషయం. అంటే గుండెకు రక్తం ప్రవహించడంలాంటిది. యే దేశంలోనైనా సరే ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలకోసం జరిగే పోరాటాల్లో కవులు, కవుల సంఘాలు, కవిత్వ ప్రేమికులే ఐక్యంగా ముందుంటారు.

కవులకు పదాలు వుంటాయి. ప్రభుత్వానికి తుపాకులు వుంటాయి. కవులు తమవద్ద వున్న సాధనాలతో వారు చేయగలిగింది చేస్తారు. అంటే రాయడం, మాట్లాడటం, నిరసన వ్యక్తపర్చడం లాంటివి. ప్రభుత్వం తన వద్ద వున్న సాధనాలతో తనకి తెలిసిన యేకైక పని చేస్తుంది. అయినా కవుల మాటలు, ఆలోచనలు, నిరసనలూ యెప్పుడూ ప్రభుత్వాన్ని అధిగమిస్తూనే వుంటాయి.

**

అధికారపు లోగిళ్ళలో స్వేచ్ఛని సంకెళ్ళతో కట్టేసుకోవాలని వాళ్ళు ప్రయత్నించిన ప్రతి సందర్భంలో కవిత్వం కట్టేసిన సంకెళ్ళు తెంచి ప్రజలకి విముక్తి శ్వాసని అందించిన కవులు మానవ చరిత్రలో యెందరో.

కల్లోల సమయాల్లో కవుల స్వరాలకి జవసత్వాలనిచ్చి యేమి రాయాలి, యెవరికోసం రాయాలనే స్పష్టత నిచ్చిన వుద్యమాలు యెన్నో. గత కొన్నేళ్లుగా స్వేచ్ఛ కోసం… అక్షరాలని గొంతెత్తే ప్రతి సారీ సాహిత్యం ప్రపంచంలో నెత్తుటి గాయాలు యెన్నో…

ప్రపంచం మొత్తం మానవ సమూహాలని రక్షించుకోవాలని వైరస్ తో యుద్ధం చేస్తోన్న సమయాన్ని మనం దాదాపు సంవత్సరం పైగా చూస్తూనే వున్నాం. ప్రపంచమంతా వొక్కసారే వొకే కల్లోలాన్ని యెదుర్కొంటున్న సమయంలో మరో వైపు అధికారం అనేక స్వేచ్ఛలకి సంకెళ్ళని వేస్తునే వుంది.

సంకెళ్లను వేసినా ధిక్కార కవిత్వం వుదయించక మానలేదు. హృదయమున్న కవిత్వం జీవన సమూహాలని వుత్తేజపరుస్తోనే వుంటుంది…

కవితలు ఆలోచనల్ని పదునైన పదాన్ని కలిగి వుంటాయి… అలాంటి కవిత్వం రాస్తూ… ఖచ్చితంగా ప్రజల వైపు నిలబడిన కవులంటే చాల భయం.. అసహనం అధికారానికి…అసలు యిదంతా యేమిటి?! యెందుకిలా?!

యిప్పడు యేమి జరుగుతుంది మయన్మార్ లో…

అక్కడ మళ్ళీ కవుల్ని చంపడం మొదలైంది. సాయుధ దళాల తిరుగుబాటుకి నిరసనగా మార్చి 3, 2021 న మోనివా నగరంలో జరిగిన వో భారీ నిరసన ప్రదర్శనలో ‘ మైంట్ మైంట్ జిన్, కె జా విన్’ అనే యిద్దరు యువ కవులు అందరూ చూస్తుండగానే నడివీధిలో నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపబడ్డారు. యిద్దరూ వుపాధ్యాయులే. మైంట్ మైంట్ జిన్ ని మిత్రులు’ కైలిన్ అయే’ అని పిలుస్తారు. వొక వుపాద్యాయురాలు, కవి, కార్యకర్త. ఆమె విద్యార్థుల అభిమానాన్ని చూరగొన్నారు. ఆమె సోషల్ మీడియాని వో ప్రచారసాధనంగా శక్తివంతంగా వుపయోగించుకున్నారు. కవిత్వం, ప్రజలకు యెప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాల మీద స్పష్టత నివ్వడం, దిశానిర్దేశం చేయడం చేస్తుండే వారు. మిలటరీ తిరుగుబాటు జరిగాక ‘ మయన్మార్ లో తిరిగి ప్రజాస్వామ్యం నెలకొనేందుకు తన ప్రాణాల్ని సైతం అర్పిస్తాను’ అని ఆమె ఫేస్ బుక్ లో రాసుకున్నారు. ఆమె మార్చి 3 నిరసన ప్రదర్శనలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొవాలని పిలుపునిచ్చారు. గాయపడిన ప్రజలకు యెవరికైనా రక్తం యెక్కించాల్సిన అవసరం వస్తే తాను రక్తాన్ని ఇస్తానని చెబుతూ తన బ్లడ్ గ్రూప్ ని తన చేతిమీద రాసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసారు.

**

మోనివా నిరసన ప్రదర్శనలో కాల్చి చంపబడిన మరో యువకవి ‘కె జా విన్’. 1982లో మోనివా సమీపంలోని లాట్ పాడాంగ్ లో వో రైతు కుటుంబంలో జన్మించాడు. వాస్తవానికి ‘లాట్ పాడాంగ్’ వో అత్యంత వివాదాస్పద ప్రాంతం. ఆ ప్రాంతంలో విస్తారమైన రాగి గనులు వున్నాయి. చైనా కి చెందిన ‘ వాన్ చావో కాపర్ మైనింగ్ లిమిటెడ్’ సంస్థ యీ ప్రాంతంలో రాగి మైనింగ్ ని ప్రారంభించి ఆ ప్రాంతంలోని వందలాది గ్రామాలకు చెందిన ప్రజల్ని బలవంతంగా వారి గ్రామాల్నించి తరిమివేసి నిర్వాశితుల్ని చేసేసింది. 2010 లో లాట్ పాడాంగ్ ప్రజలు చైనా దౌష్ట్యానికి యెదురుతిరిగి పెద్ద యెత్తున పోరాటం చేశారు. ఆ ప్రజా పోరాటాన్ని మయన్మార్ పోలీసులు అత్యంత హింసాత్మకంగా అణిచివేశారు. వందలాది మంది అమాయక రైతులు, కూలీలు ప్రాణాల్ని కోల్పోయారు. మయన్మార్ ప్రభుత్వ ‘ప్రజాస్వామ్య పరివర్తన’ చీకటి కోణాన్ని యీ ఘటన ప్రపంచానికి వెల్లడించింది. యీ పోరాటంలో పాల్గొన్నందుకు గానూ కె జా విన్ ప్రభుత్వ దళాలచే తీవ్రంగా వేటాడబడ్డాడు. అతని కుటుంబం తీవ్ర చిత్రహింసలకు గురైంది.

**

‘విద్యా సంస్కరణల కోసం లాంగ్ మార్చ్’ పేరిట 2015 లో మోండలే నుంచి యాంగోన్ వరకు ప్రచార ప్రదర్శన నిర్వహించిన విశ్వవిద్యాలయ విద్యార్థుల్లో కె జా విన్ వొకరు. దానిలో పాల్గొన్నందుకు అతడు 13 నెలల పాటు కఠిన కారాగారవాసం గడిపాడు.

మార్చి 3 ప్రజా నిరసనకు ముందు అతడు తన ఫేస్ బుక్ లో “అవసరమైతే నేను మీ అందరికోసం నా ప్రాణాల్ని అర్పిస్తాను” అని రాసుకున్నాడు. వుపాద్యాయుడుగా పనిచేస్తున్న కె జా విన్ చెప్పినట్టుగానే తన మాటని నిలబెట్టుకున్నాడు. వీరిద్దరితో పాటు మరెంతమంది కవులు, రచయితలు, పాత్రికేయుల ప్రాణాల్ని మిలటరీ జుంటా ప్రభుత్వం తీసేసిందో లెక్కలేదు. మరో తొమ్మిది మంది కవుల్ని వివిధ ప్రాంతాల్లో అరెస్ట్ చేసి తీవ్ర చిత్రహింసలకు గురిచేసి రెండేసి సంవత్సరాల కఠిన కారాగారవాసం విధించింది. యా నా థాన్ న్ని మాండలే లో, మాంగ్ యు పై న్ని మైక్ లో, సు ఖేత్ యింట్ యాంగోన్ లో, నాయ్ విన్ న్ని మిఖ్తీలా లో, ఆర్ర్ స్వే మోనివాలో, ఫ్యూ సూ న్ని, ఐన్ మ్యు నైన్ న్ని, పే థో న్ని , సిట్ నాయింగ్ న్ని యాంగోన్ లో అరెస్ట్ చేశారు.

యీ తొమ్మిది మంది మయన్మార్ లో పేరున్న కవులు. కవుల సంఘాల్లో కార్యకర్తలు. పలు పుస్తకాలు రచించిన వారు. అలాంటిది వారిపై యెలాంటి అభియోగాలు లేకుండానే కవిత్వం రాసి ప్రజల్ని రెచ్చగొడుతున్నారనే సాకుతో అరెస్ట్ చేసి , చిత్రహింసలకు గురిచేసి క్షణాల మీద రెండేళ్ళపాటు కఠిన కారాగార శిక్షని విధించేశారు.

యింత దారుణ పైశాచిక కాండ జరుగుతున్నా ప్రపంచం యెందుకు పట్టించుకోవడం లేదు? ఆ వైపు యెందుకు తలతిప్పి చూడటం లేదు? గొంతువిప్పి మాట్లాడటం లేదు? కేవలం ఆ దేశ సరిహద్దు దేశమై వుండీ కూతవేటు దూరంలోనే వున్న మన దేశానికి ఆ ఆర్తనాదాలు యెందుకు వినిపించడలేదు? అంతగా మొద్దుబారిపోయామా? కోవిడ్ ప్రాణభయం మనలోకి మనల్ని అంతగా ముడుచుకుపోయేలా చేసిందా? గుర్తుంచుకోండి కోవిడ్ కన్నా ప్రమాదకరమైనది ‘రాజ్యం’! కోవిడ్ మన వూపిరినే ఆటంకపరుస్తుంది. రాజ్యం మన సమస్థానికీ అడ్డుపడుతుంది. అక్కడి కవి ఆక్రోశించినట్టుగా ‘యింట్లోనే కూర్చొని వార్తలు చూసుకుందాం. యింట్లో నే కూర్చొని ఆవిరి పట్టుకుందాం. ఆనక అవకాశం వస్తే అవార్డుల కోసం క్యూలో నిలబడదాం!

**

ప్రజల్ని అత్యంత ప్రభావితం చేసే ముగ్గురు కవులు మయన్మార్ లో కాల్చి చంపబడ్డారు . కానీ… “వారు తలపై కాల్చి చంపుతారు. కానీ విప్లవం హృదయంలో వుంటుందని వాళ్ళకి తెలియదు.”

**

1948 వరకు బ్రిటిష్ పరిపాలనలో వున్న మయన్మార్ దేశం స్వాతంత్ర్యం పొందాక యేనాడూ రాజకీయ నిశ్చింతని యెరిగివుండదు. అనేక అగ్ర దేశాలకి సరిహద్దుగా వుండటం ఆ దేశానికి ప్రధాన సమస్య. ఆయా దేశాల ప్రభావం, పెత్తనం, రాజకీయ జోక్యం యెక్కువ. 1988 లో జరిగిన సైనిక తిరుగుబాటులో లక్షలాదిమంది పౌరుల్ని సైనికులు కాల్చి చంపేశారు. ‘నేషనల్ లీగ్ ఆఫ్ డెమోక్రసీ’ నాయకురాలు ‘ఆంగ్ సాన్ సూకీ’ ని సుదీర్ఘ కాలం పాటు నిర్బంధంలో వుంచారు. నిర్బంధంలో వున్నప్పుడే ఆమెకి నోబెల్ శాంతి బహుమతి లభించింది. గత యేడాది నవంబర్ లో జరిగిన యెన్నికల్లో నేషనల్ లీగ్ ఆఫ్ డెమోక్రసీ గెలుపొందింది. ప్రజల తీర్పుని గౌరవించడానికి, ప్రభుత్వాన్ని యేర్పాటు చేయడానికి ఆ పార్టీ ముందుకొచ్చింది. అయితే ఆ దేశ సాయుధ దళాల కమాండర్ – యిన్ – చీఫ్ ‘ మిన్ ఆంగ్ హ్లాయింగ్’ ప్రజాభిప్రాయాన్ని గుర్తించలేదు. 1 ఫిబ్రవరి2021 న దేశవ్యాప్తంగా సైనిక తిరుగుబాటుని జరిపి ఆంగ్ సాన్ సూకీ ని బంధించారు. ఆమెని యెక్కడ బంధించి
వుంచారో యిప్పటివరకు యెవరికీ తెలియదు. ఆ రోజు నుంచీ దేశమంతటా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

కోవిడ్ – 19 పాండమిక్ భయంకరమైన వాతావరణాన్ని సైతం లెక్కచేయకుండా లక్షలాది మంది ప్రజలు రోడ్లమీదికి వచ్చి పెద్ద యెత్తున నిరసన ప్రదర్శనలు శాంతియుతంగా నిర్వహిస్తున్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని, మిలటరీ జుంటా అధికారంలోంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తమ నిరసనల్లో కవిత్వాన్ని, కళాప్రదర్శనల్ని, గ్రాఫిక్స్ ని పెద్ద యెత్తున వుపయోగిస్తూ ఆకట్టుకుంటున్నారు. మిలటరీ ప్రభుత్వం యింటర్నెట్ నిషేధించింది. దేశీయ వార్తాపత్రికలు, అంతర్జాతీయ మీడియా మీద ఆంక్షలు పెట్టింది. దీంతో ఆ దేశంలో యేమి జరుగుతుందో యెవరికీ తెలియని పరిస్థితి. అంతటా తీవ్ర అంధకారం నెలకొని వుంది. సరిహద్దు దేశాల మీదే వార్తల కోసం ప్రపంచం ఆధారపడాల్సిన పరిస్థితి. 3 మే 2021 నాటికి అనధికార లెక్కల ప్రకారం 766 మంది నిరసన కారులు, పౌరులు చంపబడ్డారు. వారిలో 44 మంది పిల్లలున్నారు. కనీసం 3,614 మందిని అదుపులోకి తీసుకున్నారు. సరిహద్దు దేశాల అనధికార లెక్కల ప్రకారం చంపబడిన వారి సంఖ్య, నిర్బంధించబడిన వారి సంఖ్య లక్షలు దాటిపోయింది. “ఆ దేశం నెత్తుర్లో తేలుతున్న ద్వీపంలా వుంది.”

**

మయన్మార్ సహజంగా కవులు, కళాకారుల దేశం. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ప్రజాస్వామిక పరిపాలన లో యిప్పటివరకు 28 మంది కవులు ప్రజాప్రతినిధులుగా యెన్నికై మంత్రి పదవుల్ని చేపట్టారు. బహుశా యే దేశంలోనూ యింత మంది కవులు ప్రభుత్వంలో వుండి వుండకపోవచ్చు. బహుశా ఆ దేశం ప్లేటో రచనలతో ప్రేరణ పొంది వుం డొచ్చు ! 2013 లో ఆ దేశంలో జరిగిన అంతర్జాతీయ పోయిట్రీ ఫెస్టివల్ ని ప్రారంభించిన అప్పటి దేశ నేత ఆంగ్ సాన్ సూకీ ఆ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ దేశాలకు చెందిన వెయ్యిమంది కవులు, రచయితల నుద్దేశించి మయన్మార్ ప్రాచీన సాహిత్యం నుంచి, వర్డ్స్ వర్త్ కవిత్వం దాకా అనర్గళంగా ప్రసంగించి సభికుల్ని ఆశ్చర్య చకితులను చేశారు. ఆ సమావేశంలోనే ఆమె తొలిసారిగా మౌనం వీడి తమ దేశంలో జరుగుతున్న రోహింగ్యా మారణకాండని తీవ్రంగా ఖండించారు. ఆమె ప్రకటనకు, ఎం యెంచుకున్న వేదికకు యావత్ ప్రపంచం అంతా విస్మయం చెందింది. ఆ సమావేశంలోనే పాల్గొన్న వో మయన్మార్ కవి మాట్లాడుతూ ‘ ఆంగ్ సాన్ సూకీ, ఎన్. ఎల్.డి. పార్టీ లేకపోతే దేశం యింకా మరో వందేళ్లు వెనుకబడే వుండేది.’ అని అభిప్రాయ పడ్డారు.

మున్ముందు యేమి జరుగుతుందో అర్ధంకావడంలేదు కానీ, దశాబ్దాల సైనిక క్రూరత్వాన్ని మౌనంగా భరించిన మయన్మార్ ప్రజలు యిప్పుడు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి దూసుకొచ్చి పెద్దబ్యెత్తున నిరసనని తెలియజేస్తున్నారు. నిరసన అనేది యెప్పుడూ కచ్చితంగా బలమైన సాధనమే. అయితే వందలాది మంది అమాయక ప్రజలు నడి వీధుల్లోనే నిర్దాక్షిణ్యంగా చంపబడుతున్నారు. సైనిక జుంటా శక్తులు ఆంగ్ సాన్ సూకీ తో పాటు పలువురు నేతల్ని, విపక్ష నాయకుల్ని అదుపులోకి తీసుకుని, వారిని యెక్కడ బంధించి వుంచారో కూడా తెలియనివ్వడం లేదు. అన్ని ప్రచార, ప్రసార సాధనాల్నీ నిలిపేశారు. యే సమాచారం తెలియకపోయినా ప్రజలు మాత్రం ప్రతీరోజూ వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేస్తూనే వున్నారు. ఎన్. ఎల్.డి. పార్టీ చిహ్నం అయిన యెర్రజెండాల్ని పట్టుకొని వందన చిహ్నం అయిన మూడు మధ్య వేళ్ళ బొమ్మల్ని, ప్లే కార్డుల్ని, నినాదాలు రాసిన బోర్డుల్ని పట్టుకొని ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. సైనిక దళాల (టాట్మాడా) తిరుగుబాటుకి పరోక్ష మద్దతునిస్తున్న చైనా, రష్యా ప్రభుత్వాలని సైతం యెండగడుతున్నారు. దీంతో కవులు, కళాకారులు, రచయితలు, పాత్రికేయులు, పౌరులు, పిల్లలు సైతం తరుచుగా టాట్మాడా లక్ష్యంగా మారుతున్నారు. యిప్పటికి బయట ప్రపంచానికి తెలిసినంత వరకూ యిద్దరు కవులు అత్యంత దారుణంగా కాల్చి చంపబడ్డారు. తొమ్మిది మంది కవుల్ని అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురిచేసి రెండేళ్లపాటు కఠిన కారాగారవాస శిక్షని విధించారు. అసలు సంఖ్య యెంత వుంటుందో యిప్పుడే తెలిసే అవకాశం లేదు. దేశంలోని చాలామంది రాజకీయ నాయకులు, కవులు, రచయితలు, పాత్రికేయులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారి కోసం తీవ్రమైన వేట కొనసాగుతోంది.

**

మార్చి 3 వ తేదీన మైంట్ మైంట్ జిన్, కె జా విన్ అనే వుపాధ్యాయులైన యువ కవులు చంపబడ్డారు. వీరు కాల్చి చంపబడిన వీధి పేరు యాదృచ్చికంగా “అమరుల వీధి “. అంతకుముందు ఆ ప్రధాన రహదారిని ‘శ్వేదాగన్ పగోడా రహదారి’ అని పిలిచేవారు. 1988 లో మయన్మార్ లో సైన్యం జరిపిన వూచకోతలో యీ ప్రధాన మార్గం అంతా రక్తంతో తడిచిపోయింది. వెయ్యిమంది విద్యార్థులతో పాటు పాతిక వేలమంది వరకు ప్రజలు చనిపోయారప్పుడు. ఆ తర్వాత నెలల తరబడి ఆ వీధిని శుభ్రం చేయలేదు. యెండిన నెత్తురుతో అలా యెర్రగా మెరుస్తూనే వుండేది. ప్రజలు ఆ యెర్రని నెత్తురుమీద పువ్వులుంచి నివాళులర్పించేవారు. ఆ దేశ ప్రజలు అప్పటినుంచి ఆ ప్రధాన వీధిని “అమరుల వీధి” అని పిలవడం మొదలుపెట్టారు. తిరిగి యీ యేడాది మార్చి 3 వ తేదీన ఆ వీధి కవుల, ప్రజల రక్తంతో తడిచి యెరుపెక్కింది. మార్చి 9 వ తేదీన మయన్మార్ కి చెందిన అగ్రశ్రేణి కవి ” మాంగ్ యు” ని అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురిచేసి, యెలాంటి విచారణ లేకుండానే రెండేళ్లు జైలు శిక్ష విధించారు. ఆయన్ని అరెస్ట్ చేసిన వెంటనే అతని న్యాయవాది నాయి మైక్ మీద దాడిచేసి అరెస్ట్ చేసి, జైలు శిక్ష విధించారు. ఫిబ్రవరి 1 నుంచీ మయన్మార్ పట్టణాలు, గ్రామాలు అంతటా రాత్రిపూట దాడులు నిత్యకృత్యమైపోయాయి. ప్రజల స్ఫూర్తిని అణచివేసేందుకు, ధైర్యాన్ని దిగజార్చేందుకు, వొంటర్లని చేసేందుకు సైన్యం విశ్వప్రయత్నం చేస్తోంది. యాభై యేళ్ల క్రితం అప్పటి జనరల్ ‘ నేవిన్’ క్రూర పాలనని మరిపించేట్టు యిప్పటి ‘మిన్ ఆంగ్ హ్లాయింగ్’ క్రౌర్యం కొనసాగుతోంది. ప్రతీరోజూ గ్రామాలు, పట్టణాల్లో దాడులు జరుపుతూ ప్రజల్ని భ్రయబ్రాంతుల్ని చేస్తున్నారు. దొరికిన నిరసన కారుల్ని దొరికినట్టు వూచకోత కోసేస్తున్నారు.

**

టాట్మాడా నియంతృత్వ అణచివేతకు నిరసనగా కేవలం మయన్మార్ ప్రజలే కాకుండా, వొకప్పుడు మయన్మార్ సమాజం చేత తీవ్రంగా వుపేక్షించబడిన రోహింగ్యా సమాజం సైతం ముందుకొచ్చి నిరసన ప్రదర్శనల్లో పాల్గొని ప్రాణాల్ని విడుస్తోంది. ” రోహింగ్యా హత్యాకాండ” యీ యుగంలోనే అత్యంత నేరపూరితమైన దారుణకాండ. వారు తమ సొంత దేశం నుంచీ, సొంత మట్టి నుంచీ, సొంత యిళ్ళ నుంచీ, సొంత వూళ్లనుంచీ, సొంత రక్తం నుంచీ వెలివేయబడ్డారు. తరిమితరిమి వేటాడబడ్డారు. పౌరసత్వాల్ని కోల్పోయి, యే దేశమూ ఆదరించక శరణార్థి శిబిరాల్లో తలదాచుకొని వుంటున్నారు. తలమీద యింత నీడ కోసం లక్షల ప్రాణాల్ని మూల్యంగా చెల్లించుకున్నారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, పౌరహక్కుల నాయకురాలు, అప్పటి దేశ పాలకురాలు ప్రపంచ ఛీత్కారానికి గురైంది. ఆ మౌనానికి గానూ, ఆ నేరానికి గానూ ఆమె అంతర్జాతీయ న్యాయస్థానం ముందు దోషిగా హాజరుకావాల్సి వచ్చింది.

అంతటి అవమానాన్ని, మయన్మార్ సమాజ తిరస్కారాన్ని దిగమింగి రోహింగ్యా సమాజం సైతం నిరసన ప్రదర్శనల్లో పాలుపంచుకుంటోంది. యాంగోన్ లో జరిగిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్నందుకు గానూ ‘ మా అయే ఖినే’ అనే 22 యేళ్ళ రోహింగ్యా యువతిని కాల్చి చంపేశారు. వేలాదిమంది రోహింగ్యాలను అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురిచేస్తున్నారు.అలాగే బామా వర్గానికి చెందిన ముస్లిం తెగకు చెందిన ప్రజల్ని వేటాడి చంపుతున్నారు. ఎన్. ఎల్.డి. నాయకురాలిగా ‘ యు ఖిన్ మాంగ్’ ని హింసించి యెత్తయిన భవనం మీద నుంచి తోసి చంపేశారు. అలాగే 15 యేళ్ళ వయస్సున్న వో విద్యార్థి తలకి నేరుగా రైఫిల్ గొట్టం ఆన్చి కాల్చి చంపేశారు. ఆ విద్యార్థి తల ఆనవాలు పట్టలేనంతగా ఛిద్రమైపోయింది. అలాగే యేడేళ్ళ ‘ఖిన్ మైయా చిట్’ అనే బాలికని కాలిస్తే తండ్రి వొడిలో వాలి మరణించింది. యింకా యిలా యెంత మంది మరణం వొడిలో వొదిగిపోవాలో? యింకెంత మంది రక్తంతో ఆ దేశం తెలియాడాలో తెలియదు.

ఆ భయంకర హింసాకాండ మధ్య నుంచి సైతం, యేమాత్రం వెలుగులేని ఆ చీకటి మధ్య నుంచి సైతం అక్కడి ప్రజల ధిక్కార గొంతుకలు వినిపిస్తూనే వున్నాయి. సరిహద్దుల ముళ్ళకంచెల్ని అధిగమించి యెగిరివస్తూనే వున్నాయి. కోవిడ్ పాండమిక్ ని లెక్కచేయకుండా వొకరు వొరిగిపోతే మరొకరు వొలికిపోయిన గీతాన్ని యెత్తిపట్టుకొని నిరసన ప్రదర్శనల్లోకి దూసుకొస్తూనే వున్నారు. వీధుల్లోకి వచ్చి రక్తాన్ని చిందిస్తూనే వున్నారు. అవును అణచివేత వున్న చోట ప్రతిఘటన మిగిలే వుంటుంది. ప్రతిఘటన బతికున్న చోట కవులు, రచయితలు బతికే వుంటారు. అక్కడ కచ్చితంగా స్వేచ్ఛ బతికి వుంటుంది.

“మా దగ్గర ఆయుధాలు లేవు
మా దగ్గర కుండలు, చిప్పలు మాత్రమే వున్నాయి

మా దగ్గర శక్తి కూడా లేదు
మా దగ్గర కేవలం కుండలు,చిప్పలు మాత్రమే వున్నాయి

నువ్వు ఆయుధాల్ని పేలుస్తావు
మేం కుండల్ని బద్దలు కొడతాం, చిప్పల్ని మోగిస్తాం
యిదే మా విప్లవం !”

— వై యాన్ ఆంగ్ దాన్

**

“శీతాకాలపు పువ్వులు మీపై కోపంగా వుంటాయి
రుతుపవనాల జలాలు మిమ్మల్ని ముంచెత్తుతాయి
న్యాయమైన కారణం కోసం
మా రక్తాన్ని ధారలుగా చిందిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం
యికపై
మా వసంతాన్ని
యెవర్నీ తాకనిచ్చే ప్రసక్తే లేదు!”
— షే పో ఈన్

**

రోహింగ్యాల పైన అమానుషత్వానికి అప్పటి ప్రభుత్వం, కొన్ని ఆధిపత్య తెగలు పాల్పడినప్పుడు, మయన్మార్ సమాజానికి చెందిన ప్రతీ కవీ, రచయిత తీవ్రమైన నిఘాలో వుంచబడ్డారు. గొంతెత్తిన కవులు, రచయితలు అరెస్ట్ చేయబడ్డారు. రోహింగ్యా వూచకోత సమయంలో వారి కోసం మాట్లాడని, కనీసం పెదవి కదపని సమాజానికి యిప్పుడు సంఘీభావం తెలుపుతూ తమ ప్రాణాల్ని సైతం తృణప్రాయంగా యిచ్చేస్తున్న రోహింగ్యా కవులు, కార్యకర్తలు తమని తాము క్షమించుకోగలరా? యింకా కాక్స్ బజారు శరణార్థి శిభిరాల్లోని ప్లాస్టిక్ గుడారాల కింద కుక్కుకొని కిక్కిరిసి బతుకుతున్న రోహింగ్యాలు మయన్మార్ సమాజానికి సంఘీభావం ప్రకటిస్తున్నారు యెందుకు? యెందుకంటే అది వారి మాతృభూమి కూడా. చంపబడుతున్న వారు, ఖైదు చేయబడుతున్న వారు… వారి కుటుంబీకులు కూడా. వాళ్ళది వొక్కటే రక్తం కూడా!

మయన్మార్ లో యీ విప్లవ ఆత్మ దాని సామూహిక బలాన్ని బట్టి మరింత ప్రభలంగా మారే అవకాశం వుంది. టాట్మాడా కి తెలియకుండానే దేశంలో ఐక్యత శక్తివంతంగా మారుతోంది. రాఖైన్ కవి ‘వొన్ రో’ రాసినట్టు…” గాలిలో, అరుపులు ప్రతిధ్వనిస్తాయి.”

**

జైలు నుంచి ఉత్తరం
— కె జా విన్

ప్రియమైన నాన్నా!
నది దాని కడుపుని తెరచి
దాని వొడ్డునున్న మన చిన్న యింటిపై యుద్దాన్ని ప్రకటించింది.
యిక అప్రమత్తంగా వుండాల్సిందే.
నదిని నిటారుగా ఉం వుంచడానికి
వొడ్డుకు అది చేసే రంద్రాల్ని యిసుక సంచులతో పూడ్చడానికి
సహాయపడే వ్యక్తుల కోసం నువ్వు వెతుకుతూ వుండాల్సిందే
వెదురు గుబురుల్లాగా వొక్కసారిగా యెగసిపడే
మురికి నీటిలో మునిగిపోకుండా నువ్వుల చేల వైపు
నువ్వు కునుకెయ్యకుండా అలా చూస్తూ వుండాల్సిందే
పంటతో నిండిన పండ్లతోట ముంపుకు గురికాకుండా
నువ్వు వురవకట్టవి కావాల్సిందే.
కేవలం ఒక్క పిడికెడు అన్నం నీ నోటికీ, నీ బిడ్డల నోటికీ
అందితే చాలనుకునే సామాన్య రైతుకూలీవి నువ్వు
బహుశా నువ్వు మతంలో వోదార్పు పొందుతావు
దేవుడి మీద భారం వేస్తావు.

చేతికంది వచ్చిన బిడ్డల గురించి నువ్వు ఆలోచిస్తావు
వాళ్ళు పంచుకోబోయే నీ శ్రమని గురించి సంతృప్తి పడతావు
నాన్నా! నీ నలుగురు పిల్లలూ నీకు శత్రువులే!

నీ పెద్ద కొడుకు జైలులో వున్న కవి
నీ పెద్ద కుమార్తె వుపాధ్యాయురాలు
నీ రెండో కుమార్తె పాకవిద్యా శాస్త్రవేత్త
నీ చిన్న కుమారుడు విద్యార్థి.

మీ కవి కొడుకు
నువ్వు కలుపుతియ్యడానికి వుపయోగించే లిక్కి లాంటివాడు
మరి అతడు వుద్యోగం చెయ్యగలడా?
నీ భుజం మీది నాగలిని అందుకోగలడా?
క్షమించు నాన్నా! యేమీ చేయలేడు.

వో సారి ఫోన్ చేసినప్పుడు నువ్వడిగావు గుర్తుందా?
‘నీ వెనుక వినిపిస్తోన్న ఆ శబ్దాలు ఏమిటని?’
‘నేను పత్రికకు రచనని పోస్ట్ చేసేందుకు బస్టాప్ వద్ద వేచివున్నాను’ అని అబద్ధం చెప్పాను.
నాన్నా! ఆరోజు రేవులో రైతుల వూరేగింపులో వున్నాను.

‘మా లబ్ధిదారులైన రైతులకు…’ అంటూ
వారు మిమ్మల్ని వెనకనుంచి దోచుకోవాలనుకుంటారు
వారు తీయగా మాట్లాడుతూనే ద్వేషిస్తారు నాన్నా!
వారు అందర్నీ ద్వేషిస్తారు.

వొక దొంగ యెప్పుడూ నిరాయుధుడే
అదే వొక దుండగుడు దంతాలకు ఆయుధాల్ని కలిగివుంటాడు
దొంగల్నీ, దుండగుల్నీ అదుపు చేయలేనప్పుడు
ప్రభుత్వాలు వుండీ ప్రయోజనం యేమిటీ?
అడవులకు, పర్వతాలకూ యేమి జరిగినా పట్టించుకోని వారు
నదులకు యేమిజరిగినా యెందుకు పట్టించుకుంటారు నాన్నా?
కొబ్బరిపాల కోసం లోపలినుండీ కొబ్బరికాయని
తురమడానికి యిష్టపడే విధంగా
వారు దేశాన్ని ప్రేమిస్తారు.

బుద్ధుడి నుడిటిమీద శిలువ ముద్ర
మీ మతాన్ని నిషేధించినట్లయితే
నువ్వు వాళ్ళ ప్రార్ధనల్లో కూర్చోగలవా?
నన్ను మీ మతాన్ని కోల్పోడానికి అనుమతివ్వగలవా?
నేను నీ తరుపున గాలిని నీలి రంగులోకి మారుస్తాను.

బహుశా నీకు యింకా తెలిసుండదు.
మీ కొడుకు వల్ల సాధారణ పౌరులకు హాని వుందని
పోలీసులు ప్రకటించినట్టు.
కానీ యేదో వొక రోజు తెలుస్తుంది
మీ కొడుకు దొంగో, దుండగుడో కాదని .
కలుపుని తొలగించే నీ చేతిలోని పదునైన లిక్కి లాగా
మంచివాడినని.

నాన్నా! మీరు మీ నగ్నమైనా భుజాలతో దున్నుతున్న
దుక్కులవైపు అలా చూస్తూనే వుండండి.
రైతుకూలీల గీతాన్ని యెలుగెత్తి పాడుతూనే
వుండండి.

మీ
కె జా విన్
సెల్ 1, సెక్షన్ 10
తయవాడ్డి జైలు.

యింత పవర్ఫుల్ కవిత రాసిన కె జా విన్ గత మార్చి 3 వ తేదీన కాల్చి చంపేసిన కవి.

**

మంచు ఫలకం కింద
— మాంగ్ యు పై

వో పెద్ద మంచు ఫలకం కింద
గొప్పదైన నా దేశం సజీవంగా ఖననం చేయబడింది
ఆ గొప్ప దేశంలో
దేవుడికి యిక యే చర్చిలోనూ ఆశ్రయం దొరకదు
ఆ గొప్ప చర్చీ కింద
గొప్ప యుద్దాలు ఆరు అడుగుల కింద గట్టిగా పాతిపెట్టబడ్డాయి
ఆ గొప్ప యుద్దాల కింద
వో గొప్ప శిథిల మ్యూజియంలో సంస్కృతి, గౌరవం, కళలు వుంచబడ్డాయి
ఆ గొప్ప శిథిల మ్యూజియం లో
చెల్లని కరెన్సీ నోట్లు
ఆ నోట్ల కింద
యెముకలు పొడుచుకు వచ్చిన, గుంటకళ్ళ బానిసలు
ఆ బానిసత్వం కింద
రాళ్ళతో మూసివేయబడిన రాతియుగం నాటి గొప్ప గుహ
ఆ రాతియుగం కింద
తిరోగమన పరిణామం
ఆ పరిణామం కింద
సముద్రంలో తల్లి భూదేవి అంతులేని శ్రమతో మరణించింది.
ఆ సముద్రం కింద
యెప్పుడూ వూహలోకి కూడా రానంత
గొప్ప మంచు ఫలకం
ఆ గొప్ప మంచు ఫలకం కింద….

యింత విలువైన కవిత ని మయన్మార్ లో గొప్ప కవిగా పేరుపొందిన ‘ ‘మాంగ్ యు ఫై’ రాశారు. గత మార్చి 9 వ తేదీన ఆయన్ని అరెస్ట్ చేసి, చిత్రహింసలకు గురిచేసి, రెండేళ్ళు జైలు శిక్ష
విధించారు.

**

అమండా! నీ సొంత వీధిలో కూడా నీవు అనుమానాస్పదంగా నడవకు !

‘అమండా గోర్మన్ తన వీధిలో చీకటిలో వొంటరిగా నడిచివెళ్తుంటే వో సెక్యూరిటీ గార్డ్ ఆమెను అనుమానాస్పద వ్యక్తిగా అనుమానించి సోదా చేసే ప్రయత్నం చేశాడు.’ (6 మార్చి, 2021, న్యూయార్క్ టైమ్స్)

‘ఆ సెక్యూరిటీ గార్డ్ చర్య సరైనదే.
అమండా గోర్మన్, మీకు హెచ్చరిక
మీ సొంత వీధిలో కూడా మీరు యికపై అనుమానాస్పదంగా నడవకండి.’
— ప్రభుత్వం సలహా

యిది కవిత్వం రాయడం చదవడం గురించి కూడా ప్రభుత్వం చేసిన హెచ్చరికగా భావించవచ్చు.

మరికొన్ని సలహాలు, సూచనలు

వాస్తవాలు : కవిత్వం దేశద్రోహుల్ని తయారుచేస్తుంది.

క్రియాశీల పదార్థాలు : ఆలోచనలు

వుపయోగాలు : దుఃఖం, నష్టం, అన్యాయం, దిగులు అనుభవించే వారిలో నొప్పి, బాధలను తాత్కాలికంగా తొలగిస్తుంది. తాత్కాలికంగా వైద్యం, సౌఖ్యాన్ని అందిస్తుంది. వాస్తవికత చొరబడే వరకు మానసిక స్థితిని కూడా వూహల్లో ముంచవచ్చు. యెలాంటి వుష్ణోగ్రత వద్దనైనా రాయవచ్చు, చెప్పవచ్చు, చదవవచ్చు.

తెలిసిన దృష్ప్రభావాలు: విచక్షణతో జాగ్రత్తగా వాడండి. కవితలు ఆలోచనల్ని, పదునైన పదాల్ని కలిగివుంటాయి. కొండొకచో పేలుడు పదార్ధం కూడా కలిగుండోచ్చు. యివి తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తాయి. శక్తిని వినియోగించే వారిలో అపరాధ భావనని కలిగిస్తాయి.

దృష్ప్రభావాలు వుంటే చదివేముందు వైద్యుడిని సంప్రదించండి.

— హాస్యం లేదు
— యితర దృక్కోణాల పట్ల ప్రశంసలు లేవు
— తెలియని ఆలోచనల్ని యెదుర్కొన్నప్పుడు కోపం వేగంగా పెరుగుతుంది.
— ప్రపంచం గురించి యెక్కువగా ఆలోచించడం
— వూహలు లేకపోవడం.

కవిత్వం చదివేటప్పుడు సిఫార్సు చేసిన మోతాదుని మించకూడదు

తెలిసిన పరిమితులు లేవు. మీకు నచ్చినంత కాలం చదవండి. అప్పుడు పుస్తకం పక్కన పెట్టేసి, మరో పని మొదలుపెట్టండి.

అధిక మోతాదు విషయంలో:
నడకకు వెళ్ళండి. లేదా సంగీతం వినండి.

వుపయోగం ఆపివేసి వెంటనే స్నేహితుడ్ని సంప్రదించండి.

— నిరాశ, నిస్సహాయత సంభవించినప్పుడు
— 24 గంటల్లో లక్షణాలు మెరుగు పడనప్పుడు

అలాగే కత్తులు, తుపాకులు, రాళ్ళు, మాచెట్లను ధరించి తిరిగే వ్యక్తుల నుంచి కొంచెం దూరంగా వుండండి. ఫండమెంటలిస్టులు, ప్రాసిక్యూటర్లు, పోలీసులు, న్యాయవ్యవస్థలకు సాధ్యమైనంత దూరంగా వుండండి.

పాఠకులకు హెచ్చరిక:

మీరు పదాల అక్షరార్ధం చదివితే యే మాత్రం వుపయోగం వుండదు. పద్యం చీకటిని శాశ్వతంగా తొలగిస్తుందని ఆశించవొద్దు. పదాలు వాటి అర్ధం నుండి తప్పుకోవడానికి వుద్దేశించని టెక్స్ట్, చదవడానికి ముందుగా మీ దగ్గర వుండే పరిస్థితి వుంటేట, పద్యం చదివే ముందు మీ హైస్కూల్ యింగ్లీష్ టీచర్ ని సంప్రదించండి. ‘ హాంపిటి డంపిటి’ చెప్పినట్టుగా ‘ నేను వొక పదాన్ని వుపయోగించినప్పుడు, దాని అర్ధం నేను యెంచుకున్న దాని అర్ధం కన్నా యెక్కువా లేదు తక్కువా లేదు. ‘

కవులకు హెచ్చరిక :

మతం గురించి, అధికారం వున్నవారి గురించి, సంపద వున్న వారి గురించి రాసేటప్పుడు కవులు జాగ్రత్తగా వుండాలి.

కొన్ని వుదాహరణలు చూద్దాం.

మయన్మార్ లో ఇం యింట్లో కూర్చొని కవిత్వం రాసుకోకుండా వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలో పాల్గొన్నందుకు పోలీసులు మైంట్ మైంట్ జిన్, కె జా విన్ అనే కవుల్ని నడి వీధిలో కాల్చి చంపారు. మరో తొమ్మిది మంది కవుల్ని అరెస్ట్ చేసి కీళ్లు విరిచేసి రెండేళ్ల పాటు జైలు శిక్ష విధించారు. యీ సంఖ్య యింకా పెరిగే అవకాశం వుంది.

భారతదేశంలో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు, ప్రధానిని హత్యచేసేందుకు కుట్ర పన్నారు అనే ఆరోపణపై వరవరరావు గారిని (81) కవిని జైల్లో బంధించి వుంచారు. ఆసుపత్రిలో మంచానికి ఆయనకి కలిపి సంకెళ్ళు వేశారు. ప్రో. సాయిబాబా గారికి కవికి మావోయిస్టులతో సంబంధాలు వున్నాయనే ఆరోపణపై యావజ్జీవ శిక్ష విధించారు. కబీర్ నాట్య మంచ్ కళాకారుల్ని భీమాకోరేగావ్ కుట్రకేసుపై జైలులో పెట్టారు. సౌదీ అరేబియాలో అష్రాఫ్ ఫైదా ప్రభుత్వ వ్యతిరేక కవిత్వం రాసినందుకు 800 కొరడా దెబ్బల శిక్షకు గురయ్యాడు. మాజీ సోవియట్ యూనియన్ లో ఒసిప్ మాండేల్సాటం గులాగ్లో ఆ దేశ అధ్యక్షుడిని ఎగతాళి చేస్తూ కవిత్వం రాసినందుకు చంపబడ్డాడు. చైనా లో లియు జియాబు అనే కవి మరణించాక మాత్రమే వైద్య పెరోల్ పై ఆ దేశ ప్రభుత్వం విడుదల చేసింది. ఇజ్రాయెల్ లో దారిన్ టాటూర్ అనే కవి స్వేచ్ఛ గురించి కవిత్వం రాసినందుకు జైలుశిక్ష ని అనుభవిస్తున్నారు. బంగ్లాదేశ్ లో షహజాన్ బచ్చు అనే కవి దేవునిపై నమ్మకం లేదు అని రాసినందుకు కాల్చి చంపబడ్డాడు. ఉగాండా లో స్టెల్లా న్యాన్సీ యోని గురించి రాసినందుకు దేశం నుంచి వెళ్ళగొట్టబడింది. బ్రిటన్ లో సయ్యద్ తలహా హసన్ అనే కవి అమెరికా వ్యతిరేక కవిత్వం రాసినందుకు, స్పెయిన్ లో పాబ్లో హాసెల్ అనే కవి కిరీటాన్ని అవమానించే కవిత్వం రాసినందుకు రెండేళ్ళుగా జైలులో వున్నారు.

బ్రిటన్ లో సయ్యద్ తలహా హసన్ అనే కవి అమెరికా వ్యతిరేక కవిత్వం రాసినందుకు జైలులో వున్నాడు. స్పెయిన్ లో పాబ్లో హాసెల్ అనే కవి కిరీటాన్ని అవమానించే కవిత్వం రాసినందుకు రెండేళ్ళుగా జైలులో వున్నాడు.

కాబట్టి…

అమండా గోర్మన్, మీకు హెచ్చరిక
దయచేసి, మీ సొంత వీధిలో కూడా మీరు అనుమానాస్పదంగా నడవకండి!

(యీ పై అధ్యాయం ప్రముఖ రచయిత, పాత్రికేయులు, పెన్ ఇంటర్నేషనల్ చైర్మన్ ‘సునీల్ త్రిపాఠి’ వ్యాసం నుంచి తీసుకొన్నా. వారికి కృతజ్ఞతలు.)

**

చూసారా…
ఆ హెచ్చరిక వొక్కరి కోసం కాదని అందరికీ తెలుస్తూనే వుంది.

వరవరరావు గారు, సాయిబాబా గారు, చెరబండ రాజు గారు, అమండా వీళ్ళంతా యెవరు?!!
వీళ్ళని కలిపేది యేమిటి?!!

అందికే కవులందరం ఆలోచించాలి… నిలబడాలి… నంగినంగిగా కాదు… ప్రజల స్వేచ్ఛ కోసం.. నిలబడే రవ్వంత నేల కోసం… స్వచ్ఛమైన ప్రాణ వాయువు కోసం కవులందరం ఆలోచించాలి. అలా మాటాడిన కవులు నిర్భద్దం అయినప్పుడు… లేదా అమానవీయంగా వాళ్ళ ప్రాణాలని అధికారం తీసేసినప్పుడు లేదా తీసేస్తున్నప్పుడు కవులందరం మాటాడాలి. నిటారుగా తలేత్తి ప్రశ్నించాలి.

అవును.. మనమిప్పుడు వైరస్ బాధితులమై కనీవినీ లేని అల్లకల్లోలం వున్నాం. స్పర్శ భయం కలిగించే సందర్భంలో కొట్టు మిట్టాడుతున్నాం. ప్రాణవాయువు కోసం నిస్సహాయం పరుగులు తీస్తున్నాం. ప్రపంచమంతా యీ వైరస్ ని యెలా అంతమొందించాలని రేయింబవళ్లు పరిశోధకులు చేస్తున్నారు. ప్రాణాలని పణంగా పెట్టి డాక్టర్స్… సిస్టర్స్… యిలా యెందరో ప్రాణాలు కాపాడటానికి పోరాటం చేస్తున్నారు. యే పోరాటమైనా ప్రాణాలు పొయ్యాలి. ప్రాణాలని నిలబెట్టాలి. అదీ మానవీయత అంటే. అంతే కానీ స్వేచ్ఛని హరిం చటం… వుక్కిరిబిక్కిరిగా వుందన్నప్పుడు అర్ధం చేసుకోడానికి యే ప్రయత్నం చెయ్యకుండా ప్రాణాలని తీయ్యటం లేదా జీవితాల్ని బంధించటం అమానవీయత… యీ అమానవీయ దృశ్యాలని ఆపటానికి మన దగ్గర వున్న కాసిన్ని అక్షరాలకి నిజాయతీగా నిర్భయంగా నిస్వార్థంగా ప్రాణవాయువుని అందించాలి… మన వూపిరితో ఆడుకునే యే అధికారాన్నైనా మనం నిలదీయాలి. ప్రశ్నించాలి. అవును.. మనం కవులం… రచయితలం… మనవైపు చూసే ప్రపంచం వుంది… బాధ్యతగా… మానవీయంగా వుండాలి… యిప్పడు కాకపోతే యింకెప్పుడు?!

కవయిత్రి, కథా రచయిత్రి. నగర జీవనంలో స్త్రీల సంఘర్షణల్ని కథల్లోకి తీసుకువచ్చారు. తొమ్మిది కథల సంపుటాలు, మూడు నవలలు, ప్రేమ లేఖలు, మ్యూజింగ్స్ వెలువరించారు. 'వార్త' దినపత్రికలో దశాబ్దకాలం పాటు 'మైదానం' కాలమ్ నిర్వహించారు. రచనలు: మనసుకో దాహం, సాలభంజిక, మంచుపూల వాన, వాన చెప్పిన రహస్యం, 'మసిగుడ్డ', 'ముక్త', 'ఇన్స్టంట్ లైఫ్', ద లాస్ ఆఫ్ యిన్నోసెన్స్, కుప్పిలి పద్మ కథలు, ముక్త, మంత్రనగరి సరిహద్దుల్లో, పొగమంచు అడివి, 'నెమలీకలు పూసే కాలం' (కవిత్వం), 'మంత్రనగరి సరిహద్దుల్లో (ప్రేమ కథలు), 'పొగమంచు అడవి', 'మోహనదీ తీరంలో నీలి పడవ' (కవిత్వం) సంకలనాలుగా వచ్చాయి.

57 thoughts on “మా వసంతాన్ని యెవర్నీ తాకనిచ్చే ప్రసక్తే లేదు…

  1. చాలా వివరణాత్మకమైన వ్యాసం..ప్రింట్ తీసుకుని నిదానంగా లోపలికి తీసుకుంటూ చదువుకుంటాను..అభినందనలు పద్మగారూ..

    1. Lola Ravi Kumar Kosuri గారు, నమస్తే అండి. అలాగే వీలున్నప్పుడు నిదానంగా చదివి మీ అభిప్రాయం చెప్పండి. మీ అభినందనలు సంతోషంగా అనిపించాయి. థాంక్యూ అండీ.

  2. మయన్మార్ లో జరుగుతున్న మరణకాండకు వ్యతిరేకంగా కలం, గళం విప్పినందుకు అమానుషంగా అత్యంత దారుణంగా ఇద్దరి కవుల్ని చంపడం హేయమైన చర్య.స్వేచ్ఛ కోసం పరితపిస్తున్న దేశ ప్రజలకు తనో కొత్త గొంతుకనై ప్రాణాలు సైతం పోగొట్టుకోవడం వారి నిబద్ధతకు తార్కాణం.ప్రజల పక్షం వహించని కవిత్వం,కవులు బ్రతికి వున్నా జీవచ్ఛవాలే.ప్రస్తుత తరుణంలో ఎక్కడ చూసినా ప్రశ్నించే గొంతులకు ఆంక్షల పేరిట ఉరితాళ్ళు బిగుస్తున్నరు. మన దేశంలో కూడా ఇలాంటి విపరీత ధోరణులు,పోకడలు సంతరించుకోవడం ఆందోళన కలిగించే అంశమే.కవులంతా సంఘటితం కావాల్సిన సందర్భాన్ని ఈ వ్యాసంలో చక్కగా వివరించారు కుప్పిలి పద్మ గారు.మేడం గారికి హృదయ పూర్వక అభినందనలు

    1. ఆది ఆంధ్ర తిప్పేస్వామి గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలండీ.

  3. కవి ధిక్కార స్వరం కలిగి వుండాలి..ప్రజాపక్షం వహించాలి…వర్తమాన పరిస్థితి అందుకు భిన్నంగా వుంటుంది..ఇలాంటి వ్యాసాలు కవులు చేసుకోవాల్సిన
    ఆత్మ పరిశీలనకు దోహదపడతాయి..మంచి రచన
    పద్మా జీ..!!

    1. పెరుగు రామకృష్ణ గారు, నమస్తే.
      థాంక్యూ సర్.

  4. కవులు ఉపాధ్యాయులు అయితే రాజ్యం భయపడుతుందని రుజువయ్యింది అక్కడ. ఇంత వివరణాత్మక వాస్తవాలను అందించినందుకు ధన్యవాదాలు మేడమ్.
    కవులు నంగి నంగిగా నిలడితే కుదరదు గాక కుదరదు.

    1. మల్లిపురం జగదీష్ గారు, హృదయ పూర్వక కృతజ్ఞతలు.

  5. పొన్నాడవరాహనరసింహులు. ఆమదాలవలస. says:

    మయన్మార్లో జరుగు చున్న వాస్తవ సంఘటనలను చాల విశ్లేషణాత్మకంగా కళ్లకు కట్టినట్లు చిత్రించారు. ధిక్కార స్వరం వినిపించే కళాకారులను రాజ్యం హింసించటమనేది అంతటావొకటేనని రూఢి అయింది. మంచి వ్యాసాన్ని రాసినందుకు అభినందనలు, ధన్యవాదాలు.

    1. పొన్నాడ వరాహ నరసింహులు గారు, హృదయ పూర్వక కృతజ్ఞతలు.

  6. Powerful poems. And very good article. All the while reading I was remembering Dhabolkar, Gauri Lankesh and the likes. Here too dissent is suppressed.

  7. పద్మ గారూ,
    ఎంత ఘోరం మన పక్కనే జరుగుతోంది. అసలు అదేం లేదు అన్నట్లు ఈ ప్రపంచ మౌనం ఏంటి?
    చాలా ముఖ్యమైన విషయం చెప్పారు. హాట్స్ ఆఫ్

  8. పద్మా,

    అంతా చదివాక ఏమనాలో తెలీడంలేదు. భూమ్మీద ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో అన్నీ జరుగుతున్నాయి. మ్యన్మార్లో “రక్తం రాజ్యం ఏలుతోంది.” అక్కడి ప్రతిఘటనకు నా జోహార్లు. నిజమే, మన వార్తాపత్రికలలో మ్యన్మార్ వార్తలే కనబడవు.

    ఎంతో ముఖ్యమైన విషయాల్ని మనసుని కరిగించేలాగూ, నెత్తురు మండేలాగూ రాశారు మీరు. మీకు అభినందనలు చెప్పడంకన్నా ఆ యోధులకు సంఘీభావం తెలియజెయ్యడమే నాకు తక్షణకర్తవ్యమని అనిపిస్తోంది. (నా అభినందనలు మీకు ఎప్పుడూ ఉన్నాయి.).

    Noam Chomsky తన రచనల్లో ఎక్కడో అన్నాడు. సైనిక నియంతృత్వాలకన్నా civilian dictatorshipలో తక్కువ ప్రజాహింస ఉంటుందని. “Manufacturing Consent” లో కాబోలు. సైనికనియంత రక్తదాహం భయంలోంచీ వచ్చేదే!

    దీనికి పరిష్కారమేంటోగానీ, It is a moving, and sharp wake-up call to one and all.

    కళ్ళనిండా నీళ్ళతో

    -వాసు-

    1. పరిష్కారం యేమిటో తెలీదు… నిరంతరం యేదో వొక హింసని చూస్తూనే వున్నాం. డిస్ట్రబ్ అవుతూనే వున్నాం.
      మీ స్పందనని పంచుకున్నందుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు వాసు.

  9. రూసో సోషల్ కాంట్రాక్టు ప్రారంభంలో చెప్పినట్టు ” ” అన్న మాటలు ప్రపంచ చరిత్రలో ఏ పేజీ లో చూసినా కనిపిస్తాయి. మనిషి పుట్టుకకు రాజ్యానికి సంబంధం లేదు. అసలు మనిషి పుట్టినప్పటికి రాజ్యం అంటూ ఏమి లేదు. తన అజమాయిషీ కోసం తాను ఒక రూసో సోషల్ కాంట్రాక్టు ప్రారంభంలో చెప్పినట్టు ” ” అన్న మాటలు ప్రపంచ చరిత్రలో ఏ పేజీ లో చూసినా కనిపిస్తాయి. మనిషి పుట్సమూహం తయారు చేసుకుని అలాంటి వేల సమూహాలను ఒక రాజ్యం అంటూ దండోరా వేయించుకున్నాడు. ఎక్కడైనా స్వేచ్ఛగా పుట్టిన మనిషిని రాజ్యం తనవైపు లాక్కుంటుంది. తనలో భాగం చేసుకుంటుంది. అయితే సమస్య అంతా రాజ్యం అందరికీ ఒకేలా కనిపించదు. అందరి మనసుల్లో ఒకేలా అనిపించదు. రవిగాంచని చోటు కూడా కనిపెట్టగల కవుల కు రాజ్యం ఎప్పుడూ ముసుగులో ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ ముసుగును తొలగించే ప్రయత్నం చేసినప్పుడల్లా రాజ్యం విసుక్కుంటుంది. ఇక భరించలేని పరిస్థితుల్లో బందూకు గురి పెడ్తుంది.

    అందరికీ కనిపించని ముసుగు కవులకు కనిపించటంలోనే సమస్య ఉంది ..అక్షరాలతో అలజడి పుట్టించగల కవిని చూసి అంతఃపురంలో నిద్ర పట్టదు. కోట్లజనం నిద్రకోల్పోయిన రాజ్యంలో కవులకూ నిద్ర పట్టదు. అందుకే ఇరువైపులా ఈ చీకటి పోరాటం. అమాయకులైన ప్రజల బలిదానం. ఒక్క కలం కాలిపోతే మరో యుగం ఆవిర్భవిస్తుంది అన్న సంగతి రాజ్యానికి తెలియదు. కొన్ని కలాలు కరిగిన బూడిదలో బుస బుస కొట్టేది గాలి కాదు కవిత్వం అన్న సంగతి అంతఃపురం వరకు చేరదు. మూరఖ్త్వం రాజ్యం ఏలటం అంటే ఇదే…చీకటి శాసనం చేయటం అంటే కూడా ఇదేనేమో ..

    తెల్లవారేసరికి పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చే కవులున్న నేలలో రాజ్యం వణుకుతూ తుపాకులు గురి తప్పించటం సహజమే …అందుకే ఆయుధం ఉన్న చోట యుద్ధం కాకుండా అక్షరం ఉన్నచోట మారణ హోమము సృష్టిస్తున్నారు.
    ఆ దృశ్యం మీరిక్కడ అద్భుతంగా చిత్రిస్తున్నారు. అక్షరం అక్షరం లో ఆవేదన ఉంది …నిలదీత ఉంది. పక్కనే లేస్తున్న మంటల వేడి ఇక్కడా తగులుతుంది. ముసుగు వేసుకోవటం అలవాటు అయిన రాజ్యం దేశం మీద ముసుగు వేసి చల్లగా ఉన్నట్టు భావించ మంది ….కానీ లాభం లేదు …మీ కవిత్వం బయట పడింది …ముసుగులు మెల్లగా జారిపోతున్నాయి. రాజ్యం కళ్లకు కట్టుకున్న గంతలు వీడే సమయం దగ్గరకు వచ్చింది …పొగలు కక్కుతూ ఇటువైపు వచ్చిన మీ అక్షరాలు చూసాక కన్నీళ్లు రావటం లేదు . కడుపుకు అన్నం లేని సందర్భంలో పుట్టిన కవిత చదివితే కన్నీళ్లు వస్తాయి. కాళ్లకు సంకెళ్లు వేసిన సందర్భంలో పుట్టిన కవిత చదివితే రక్త కన్నీళ్లు వస్తాయి. అందుకే ఇప్పుడంతా ఎర్రగా కనిపిస్తుంది …అరచేతి సైజు కొత్త సూర్యుడు చల్లిన ఎర్రని ఉదయంలా …మరో యుగ ఆరంభంలా

    కొట్నాన సింహాచలం నాయుడు …

  10. రూసో సోషల్ కాంట్రాక్టు ప్రారంభంలో చెప్పినట్టు “Man is born free ..and he is everywhere in chains ” అన్న మాటలు ప్రపంచ చరిత్రలో ఏ పేజీ లో చూసినా కనిపిస్తాయి. మనిషి పుట్టుకకు రాజ్యానికి సంబంధం లేదు. అసలు మనిషి పుట్టినప్పటికి రాజ్యం అంటూ ఏమి లేదు. తన అజమాయిషీ కోసం తాను ఒక సమూహం తయారు చేసుకుని అలాంటి వేల సమూహాలను ఒక రాజ్యం అంటూ దండోరా వేయించుకున్నాడు. ఎక్కడైనా స్వేచ్ఛగా పుట్టిన మనిషిని రాజ్యం తనవైపు లాక్కుంటుంది. తనలో భాగం చేసుకుంటుంది. అయితే సమస్య అంతా రాజ్యం అందరికీ ఒకేలా కనిపించదు. అందరి మనసుల్లో ఒకేలా అనిపించదు. రవిగాంచని చోటు కూడా కనిపెట్టగల కవుల కు రాజ్యం ఎప్పుడూ ముసుగులో ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ ముసుగును తొలగించే ప్రయత్నం చేసినప్పుడల్లా రాజ్యం విసుక్కుంటుంది. అహంకారానికి సహనం తక్కువ కాబట్టి బందూకు గురి పెడ్తుంది.

    అందరికీ కనిపించని ముసుగు కవులకు కనిపించటంలోనే సమస్య ఉంది ..అక్షరాలతో అలజడి పుట్టించగల కవిని చూసి అంతఃపురంలో నిద్ర పట్టదు. కోట్లజనం నిద్రకోల్పోయిన రాజ్యంలో కవులకూ నిద్ర పట్టదు. అందుకే ఇరువైపులా ఈ చీకటి పోరాటం. అమాయకులైన ప్రజల బలిదానం. ఒక్క కలం కాలిపోతే మరో యుగం ఆవిర్భవిస్తుంది అన్న సంగతి రాజ్యానికి తెలియదు. కొన్ని కలాలు కరిగిన బూడిదలో బుస బుస కొట్టేది గాలి కాదు కవిత్వం అన్న సంగతి అంతఃపురం వరకు చేరదు. మూరఖ్త్వం రాజ్యం ఏలటం అంటే ఇదే…చీకటి శాసనం చేయటం అంటే కూడా ఇదేనేమో ..

    తెల్లవారేసరికి పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చే కవులున్న నేలలో రాజ్యం వణుకుతూ తుపాకులు గురి తప్పించటం సహజమే …అందుకే ఆయుధం ఉన్న చోట యుద్ధం కాకుండా అక్షరం ఉన్నచోట మారణ హోమము సృష్టిస్తున్నారు.
    ఆ దృశ్యం మీరిక్కడ అద్భుతంగా చిత్రిస్తున్నారు. అక్షరం అక్షరం లో ఆవేదన ఉంది …నిలదీత ఉంది. పక్కనే లేస్తున్న మంటల వేడి ఇక్కడా తగులుతుంది. ముసుగు వేసుకోవటం అలవాటు అయిన రాజ్యం దేశం మీద ముసుగు వేసి చల్లగా ఉన్నట్టు భావించ మంది ….కానీ లాభం లేదు …మీ కవిత్వం బయట పడింది …ముసుగులు మెల్లగా జారిపోతున్నాయి. రాజ్యం కళ్లకు కట్టుకున్న గంతలు వీడే సమయం దగ్గరకు వచ్చింది …పొగలు కక్కుతూ ఇటువైపు వచ్చిన మీ అక్షరాలు చూసాక కన్నీళ్లు రావటం లేదు . కడుపుకు అన్నం లేని సందర్భంలో పుట్టిన కవిత చదివితే కన్నీళ్లు వస్తాయి. కాళ్లకు సంకెళ్లు వేసిన సందర్భంలో పుట్టిన కవిత చదివితే రక్త కన్నీళ్లు వస్తాయి. అందుకే ఇప్పుడంతా ఎర్రగా కనిపిస్తుంది …అరచేతి సైజు కొత్త సూర్యుడు చల్లిన ఎర్రని ఉదయంలా …మరో యుగ ఆరంభంలా

    కొట్నాన సింహాచలం నాయుడు …

    1. సింహాచలం నాయుడు గారు, రూసోని యిక్కడ గుర్తు చెయ్యడం బాగుంది.
      మీ అభిప్రాయం పంచుకున్నందుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు.

  11. ప్రజాస్వామ్యం ప్రపంచ వ్యాప్తంగా ఇబ్బంది పడుతున్న తరుణం లో మయన్మార్ మరికొన్ని కొత్త ప్రశ్నలను కవులు, కళాకారులకు సంధించింది..
    కేవలం 3 నెలల్లో 900 మందిని పొట్టనబెట్టుకున్న అప్రజాస్వామిక విధానంలో ఆ దేశం ఇప్పుడు పీకల్లోతుకష్టాలను కొనితెచ్చుకుంది..

    కవులు, కళాకురాల మీద నిర్బందం “కుప్పిలి పద్మ” గారి మాటల్లో కళ్లకు కట్టినట్లు కనిపించాయి. ఇలాంటి అంశాలను స్పృదించాలి అంటే ఎంతో శక్తి కావాలి.. అంతకు మించి మరింతగా సున్నితత్వం కూడా కావాలి..
    అవన్నీ పుష్కలంగా ఉన్న రచయిత్రి పద్మ గారు..

    ముందు ముందు మరిన్ని విశ్లేషణాత్మక వ్యాసంగాలు పద్మగారు చేస్తారని, చేయాలని కోరుకుందాం..

    – మిత్రుడు

    1. హృదయ పూర్వక కృతజ్ఞతలు క్రాంతి గారు.

  12. సంకెళ్లను వేసినా ధిక్కార కవిత్వం వుదయించక మానలేదు. హృదయమున్న కవిత్వం జీవన సమూహాలని వుత్తేజపరుస్తోనే వుంటుంది…
    పద్మ గారు చాలా మంచి రచన

  13. గుండెల్లో దాగిన మానవ హక్కుల ప్రేమి ఉద్విగ్న, ఉద్వేగ, ప్రభావవంతమైన జలపాతం లాంటి ప్రసంగంలా వుంది నీ వ్యాసం పద్మా. సమకాలీన మయన్మార్ రాజకీయ ముఖచిత్రం ఇదే. గ్రామీణ మిలీషియాల గర్జనలు హంతక బర్మా ప్రభుత్వ గుండెల్లో బర్మారులు పేలుస్తున్నాయిప్పుడక్కడ.

    1. అనంతూ.. హక్కుల ప్రేమీ.. భలే నచ్చింది. నీ అభిప్రాయం పంచుకున్నందుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు.

  14. మంచి ఆర్టికల్ మేడం చాలా బాగా విషధీకరించి చెప్పారు 👏👏

  15. పద్మ గారూ, విస్తృతంగా పరిశోధనచేసి మయన్మార్ పరిస్తితి ని అక్కడి కవిత్వాన్ని మనసు కదిలించేలా రాశారు. రోహింగ్యాల మన దేశానికి కూడా వచ్చారు , ఈ రాక్షస రాజ్యం కూడా వారికి చోటు ఇవ్వలేదు

    మీరు చెప్పినట్టు నిజమయిన కవి అన్యాయాన్ని , దుర్మాగం ని యెదుర్కొనే వాళ్ళు అవ్వాలి.

    చివరలో మీరు చెప్పినట్టు “చూసారా…
    ఆ హెచ్చరిక వొక్కరి కోసం కాదని అందరికీ తెలుస్తూనే వుంది.
    వరవరరావు గారు, సాయిబాబా గారు, చెరబండ రాజు గారు, అమండా వీళ్ళంతా యెవరు?!!
    వీళ్ళని కలిపేది యేమిటి?!!
    అందికే కవులందరం ఆలోచించాలి… నిలబడాలి… నంగినంగిగా కాదు… ప్రజల స్వేచ్ఛ కోసం.. నిలబడే రవ్వంత నేల కోసం… స్వచ్ఛమైన ప్రాణ వాయువు కోసం కవులందరం ఆలోచించాలి. అలా మాటాడిన కవులు నిర్భద్దం అయినప్పుడు… లేదా అమానవీయంగా వాళ్ళ ప్రాణాలని అధికారం తీసేసినప్పుడు లేదా తీసేస్తున్నప్పుడు కవులందరం మాటాడాలి. నిటారుగా తలేత్తి ప్రశ్నించాలి.
    అవును.. మనమిప్పుడు వైరస్ బాధితులమై కనీవినీ లేని అల్లకల్లోలం వున్నాం. స్పర్శ భయం కలిగించే సందర్భంలో కొట్టు మిట్టాడుతున్నాం. ప్రాణవాయువు కోసం నిస్సహాయం పరుగులు తీస్తున్నాం. ప్రపంచమంతా యీ వైరస్ ని యెలా అంతమొందించాలని రేయింబవళ్లు పరిశోధకులు చేస్తున్నారు. ప్రాణాలని పణంగా పెట్టి డాక్టర్స్… సిస్టర్స్… యిలా యెందరో ప్రాణాలు కాపాడటానికి పోరాటం చేస్తున్నారు. యే పోరాటమైనా ప్రాణాలు పొయ్యాలి. ప్రాణాలని నిలబెట్టాలి. అదీ మానవీయత అంటే. అంతే కానీ స్వేచ్ఛని హరిం చటం… వుక్కిరిబిక్కిరిగా వుందన్నప్పుడు అర్ధం చేసుకోడానికి యే ప్రయత్నం చెయ్యకుండా ప్రాణాలని తీయ్యటం లేదా జీవితాల్ని బంధించటం అమానవీయత… యీ అమానవీయ దృశ్యాలని ఆపటానికి మన దగ్గర వున్న కాసిన్ని అక్షరాలకి నిజాయతీగా నిర్భయంగా నిస్వార్థంగా ప్రాణవాయువుని అందించాలి… మన వూపిరితో ఆడుకునే యే అధికారాన్నైనా మనం నిలదీయాలి. ప్రశ్నించాలి. అవును.. మనం కవులం… రచయితలం… మనవైపు చూసే ప్రపంచం వుంది… బాధ్యతగా… మానవీయంగా వుండాలి… యిప్పడు కాకపోతే యింకెప్పుడు?!”

  16. సుబ్రహ్మణ్యం గారు, హృదయ పూర్వక కృతజ్ఞతలు సర్.

  17. ఫోనులో చదివేది కాదు, ఆఫీసులో సిస్టం నుంచి ప్రింట్ తీసుకోవాలి

    1. Sa Kareem garu,
      అవునండీ.. పెద్ద రైట్ అప్. వీలున్నప్పుడు చదివి మీ అభిప్రాయంని పంచుకొంటారని ఆశిస్తున్నాను.
      థాంక్యూ అండీ.

  18. చాలా విస్తృతమైన వ్యాసం బాగా రాశారు. అక్కడ మిలిటరీ ప్రజాస్వామ్య వాదుల్ని తొక్కిపెట్టి జుంతా రాజ్యమేలుతోంది. ఇక్కడ ప్రజాస్వామ్యం ముసుగులో మిలిటరీ ని జేబులో కుక్కుకున్నారు.IT చట్టాలకు భయపడి కవులు ఎవరికీ చిక్కకుండా తమ నిరసన కవిత్వాన్ని పూతరేకుల మడతల్లో గుప్పించి రాస్తున్నారు😆😆 అయితే అగ్నిపర్వతంలో వుడుకుతున్న లావా ఏదో ఒకరోజు బాహర్ ఆజాతా చెప్పడ్ ఫాడ్ కే😆😆😆అభినందనలు💐💐💐

  19. మీ రచనల్లో ప్రత్యేకత ఉంటుంది. ప్రారంభించడమే ఆలస్యం కానీ ప్రారంభించాక అలా తీసుకుపోతుంది. మీ విశ్లేషణ చదువు తున్నంతసేపు మనసు కుదురు గా ఉండలేదు. అత్యంత కిరాతకంగా అన్నిచోట్లా ప్రజాస్వామ్యం అంతరించి పోతుంది. ఈవ్యవస్థలో గొంతెత్తి మాట్లాడే కవులు మూగబోతూనే ఉన్నారు. కానీ అది తాత్కాలికం మళ్ళీ లేస్తూ ధిక్కార స్వరం వినిపిస్తూనే ఉంటారు.
    మీ సాహిత్యం సున్నితమైన భావాలే కాదు సునామీ సృష్టించ గలదని చూపించారు. సామాజిక బాధ్యత నిర్వర్తించారు మేడం.

    1. Sarava Mangala garu, Thank you very much for sharing your opinion and thoughts.

  20. ఈ వ్యాసం చదివాక నాకు కుప్పిలి పద్మ కొత్తగా కనిపిస్తోంది. ఈమెకు పోయెటిక్స్ మాత్రమే కాదు పాలిటిక్స్ కూడా చాలా బాగా తెలుసని అర్థమౌతోంది. It’s really well written.

  21. prapanchamanthaa okelaa …oke adhikara himsalo raktham odche rahadaari avuthunnadi .. amarula veedhulu kaanivi ekkadainaa migilaayaa… gunde baruvekkindi. dukhamgaa undi .

    1. కాత్యాయని గారు, యెటు చూసినా దుఃఖ పడేవే మనందరి చుట్టూ. హింస లేని ప్రపంచం చూడాలనే మన ఆకాంక్ష యెప్పటికి సాధ్యమో..?!!
      మీ అభిప్రాయం పంచుకున్నందుకు కృతజ్ఞతలు.

  22. వైరస్ కల్లోలంలో ప్రాణవాయువు కోసం పరుగులెత్తే ప్రపంచంలో మనమున్నామని గుర్తుచేస్తూనే…
    క్షణక్షణానికోమారు పోతున్న ప్రాణాల్ని దానికి కారణభూతమైన పరిస్థితులను,ఆ పరిస్థితులను నిలదీయలేని నంగిగా నిలబడ్డ రాతగాళ్లను ఏకిపారేస్తూనే,
    ఎన్నో సందర్భాల్లో నిస్సందేహంగా రాజ్యాన్ని నిలదీసిన కవులందరిని ఏకంకమ్మని అనడం బాగా నచ్చింది…

    మయన్మార్ పరిస్థితులను, రోహింగ్యాలకు చోటివ్వలేని రాక్షసరాజ్యపు కుతంత్రాలను కూడా తెలియజేసారు…
    తిరుగుబావుటా ఎగురవేసిన కవులు,రచయితలు ఇప్పుడెక్కడన్నారోనని వెదుకులాడటం కూడా మన ఆలోచనలకు వదిలేయడం ద్వారా సున్నితంగా మనల్ని హెచ్చరించారు…

    మీ విశ్లేషణాత్మక వ్యాసం చాలా బాగుంది పద్మగారు…
    అభినందనలు..

  23. ఎంత మంచి వ్యాసం. ప్రతీ వాక్యం ఆలోచనాత్మకంగా ఉంది. మీకు వేనవేల ధన్యవాదాలు.

  24. చరిత్రలో ఎక్కడైనా ఎప్పుడైనా నియంతకు ప్రధాన శత్రువు కవే..ఎంత నిజం!

    దేశంలో ఎన్నడూ కనీ విని ఎరగని సంఘటనలు జరుగుతున్నాయి.ప్రజాస్వామ్యం ఉత్సవ విగ్రహం అయింది.రాజ్యాంగం అపహాస్యం అవుతుంది.ప్రశ్నించే గొంతులు కటకటాల పాలవుతున్నాయి.రాజ్య నిర్బంధం అన్ని సమూహాలలోకి చొచ్చుకొస్తోంది.

    పొరుగున ఏం జరుగుతుందో..పక్కన ఏం జరుగుతుందో పట్టని ఒక భీభత్స వాతావరణం కమ్ముకొని వుంది.ప్రపంచ ఆధిపత్యాలకి ఎంతకయినా తెగించే మిలటరీ రాజ్యం ఎన్నో దేశాలలో డేగ పహారా కాస్తోంది.ఎదురుతరిగి తలెత్తిన వాళ్లని నిర్దాక్షిణ్యంగా కాల్చి పాడేస్తుంది.

    ఇది ఒక దేశానికి పరిమితం కాదు.పాలస్తీనా, సిరియా, బర్మా,బంగ్లాదేశ్ , శ్రీలంక, ఇండియా ..అన్నీ దేశాలలో రాజ్యకాంక్ష ఒక పాండమిక్ లా వ్యాపించింది. అణచివేత ఏకైక మార్గంగా అది సైనికకాళ్లతో నడుస్తుంది. తెంపులేని హత్యాకాండలతో అది తన ఎజండా అమలు చేస్తుంది.

    ఖాట్ థీ ని చంపుతుంది
    మైంట్ మైంట్ జిన్ ని చంపుతుంది
    కె జా విన్ ని చంపుతుంది.

    గౌరీ లంకేష్, దభోల్కర్ లాంటి ఆలోచనాపరుల్ని చంపి సెలబ్రేట్ చేసుకుంటుంది.

    అబద్దాలు ప్రచారాస్ర్తాలుగా పసారమవుతాయి.
    మూఢత్వం దేశభక్తి ముసుగు వేసుకుంటుంది.

    ఇలాంటి ఒక ఊపిరాడని కాలంలో కుప్పిలి పద్మ గారి వ్యాసం పొరుగు దేశ నిజ స్థితిని కళ్లకు కట్టింది.మయన్మార్ కవుల కవిత్వం నిండా పారుతున్న రక్తపు వాసనని చూయించింది.దుర్భర పరిస్థితిలో కూడా ధిక్కార గానం చేస్తున్న కవుల తెగువని జెండాలా ఎగరవేసింది.

    మయన్మార్ పరిస్థితులు భారతదేశంలో కూడా అమలవుతున్నాయి వరవరరావు, సాయిబాబాల రూపంలో..దళితుల మీద యదేచ్ఛ దాడుల రూపంలో..ప్రజల మీద CAA,NCA ల రూపంలో..
    ఇంకా అనేకానేక ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక చట్టాల రూపంలో..

    జాగో..మన దాకా వచ్చేసింది.

    1. మీరు మీ బాధని, కన్సర్న్ ని వివరంగా పంచుకున్నందుకు మీకు హృదయ పూర్వక కృతజ్ఞతలు శ్రీనివాస్ గౌడ్ గారు.

  25. A wonderful inspiring and awakening article.I have seen a different and violent Padma. Your deep study, your emotional and attacking words and your irrevocable concern on freedom of speech have shacked me . Thank you for this rebel report.

    1. థాంక్యూ ప్రసాద్ మూర్తి గారు.

  26. మంచి వ్యాసం. కృతజ్ఞతలు పద్మ గారూ ..

    మయన్మార్ ప్రజల ఆందోళనకి సుదీర్ఘమైన చరిత్ర వుంది. రెండు పాత సంఘటనల గురించి పంచుకోవాలనిపించింది.

    మొదటిది 1990 నాటి మయన్మార్ కరెన్సీ చాట్ నోట్ రూపకల్పనలో వ్యక్తమైన నిశ్శబ్ద ప్రతిఘటన గురించి. నియంత జనరల్ నెవిన్ సైనిక ప్రభుత్వం ఎలాంటి హెచ్చరికలు లేకుండా 1985, 1987లలో రెండుసార్లు నోట్ల రద్దు (డీమానెటైజేషన్) ప్రకటించింది. 60-80% దాకా వాడుకలో వున్న చాట్ నోట్లను అకస్మాత్తుగా రద్దు చేసింది. ఈ నేపథ్యంలో మయన్మార్ లో ప్రజాస్వామ్యంకోసం 1988 లో ఒక పెద్ద ప్రజా తిరుగుబాటు ముందుకొచ్చింది. ఆగస్టు 8, 1988న సమ్మె ప్రారంభమైంది. దీనిని 1988 తిరుగుబాటు లేదా 8888 తిరుగుబాటు అనో పిలుస్తారు. ఆ వివరాలలోకి ఇక్కడ వెళ్ళడంలేదు. కాగా 1990లో ఆనాటి సైనిక ప్రభుత్వం ఒక కొత్త 1 చాట్ నోటును విడుదల చేసింది. అప్పటికి ఎన్నికలలో పెద్ద మెజారిటీతో ఎన్నికైన నాయకురాలు ఆన్ సాన్ సూచీ ని సైనికప్రభుత్వం నిర్బంధంలోనే ఉంచింది. తన చిత్రాన్ని ఇంటిలోగానీ, బయటగానీ ప్రదర్శించడం నేరంగా చలామణి అవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విడుదల చేయతలపెట్టిన కొత్త కరెన్సీ నోటు రూపకర్త తన రాజకీయ విశ్వాస ప్రకటనకు దాన్ని ఒక అవకాశంగా మల్చుకొన్నాడు. సూచీ తండ్రి జనరల్ ఆన్ సాన్ మయన్మార్ సైన్య నిర్మాత, బ్రిటిష్ వలసవాదుల నుండి స్వేచ్ఛ సంపాందించడంలో కీలకమైన పాత్రని పోషించిన వ్యక్తి. కాబట్టి, జనరల్ ఆన్ సాన్ చిత్రాన్ని కొత్త కరెన్సీ నోటులో ముద్రించక తప్పదు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని నోటులో ముద్రించే ఆన్ సాన్ చిత్రంలో చిన్న మార్పులని చేసి, తండ్రితో పాటు కూతురు పోలికలు కూడా కనిపించేటట్లు రూపొందించాడు. అక్కడితో ఆగకుండా, ఆ నోటుపైన ఒక వృత్తంలో ఎనిమిది పూరేకలు, అటువంటి వృత్తాలు నాలుగు వరసలలో ఉండేవిధంగా రూపొందించాడు. అది 8888 తిరుగుబాటు కు సంకేతం. ఈ రెండింటితో పాటు మొత్తం పదకొండు రహస్య సంకేతాలు ఆ నోటులో ఉన్నాయని కొందరు అంటారు. సెన్సారు అధికారులు ఇవేవీ గుర్తించలేకపోయారు. నోటు విడుదల అయింది. అదొక పెద్ద సంచలనం. మిలిటరీ అధికారులు దీన్నొక అవమానంగా భావించి, ఆ నోటును ఉపసంహరించుకున్నారు. ఆ నోటు ఎవరిదగ్గరైనా ఉంటె అది నేరం అని ప్రకటించారు. అయినా జనం దాన్ని దాచుకున్నారు. దాన్ని ‘ప్రజాస్వామ్య నోటు’ అని పిలుస్తారు!

    రెండవది, 2007 నాటి సంఘటన. సెప్టెంబరు 2007 లో మయన్మార్ లో వేలాది మంది జనం వీధులలోకి వచ్చి సైనిక పాలనకు నిరసన తెలియజేసారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా మొదలైన ఆందోళన, ప్రజాస్వామిక హక్కులని కోరే డిమాండ్లకు విస్తరించింది. సైనిక ప్రభుత్వం జనాలను నిర్బంధించింది, హింసించింది, కాల్పులు జరిపింది. కనీసం ముప్పైఒక్కరు కాల్పులలో మరణించారని అంచనా. ఈ తీవ్ర నిర్బంధాన్ని ఎదిరించడంలో జనం ఒక వినూత్నమైన సృజనాత్మక మార్గాన్ని ఎంచుకున్నారు. మయన్మార్ ప్రజల సంస్కృతిలో కుక్క ఒక హీనమైన జంతువు. ఎవరినైనా కుక్కతో పోల్చి తిట్టడానికి మించిన అవమానం మరొకటి లేదని అక్కడ భావిస్తారు. ముఖ్య నగరం యాంగోన్ తో పాటు ఇతర నగరాలలో హఠాత్తుగా వీధికుక్కల మెదళ్లలో సైనికాధికారుల చిత్రపటాలు వేలాడసాగాయి. వీధికుక్కల మెడలలో సైనికాధికారుల చిత్రాలని ఎవరు వేలాడదీసారో తెలియక అధికారులు జుట్టుపీక్కున్నారు. ఆ వీధి కుక్కలని పట్టుకోవడానికి సైనిక బృందాలు పరుగులు తీసి తంటాలు పడ్డాయి. కుక్కలని పట్టుకోవడానికి సైన్యం పరులు పెట్టేలా చేయడంలో ధిక్కారం విజయం సాధించింది.

    మంచి వ్యాసాన్ని అందించినందుకు మరోసారి కృతజ్ఞతలు..

    1. సుధా కిరణ్ గారు, నమస్తే. యెంతో విలువైన ముఖ్యమైన సంఘటనలని పంచుకున్నందుకు కృతజ్ఞతలు.
      మీకు వ్యాసం నచ్చినందుకు సంతోషంగా అనిపించింది. థాంక్యూ అండీ.

  27. చాలా మంచి వ్యాసం. విశ్లేషణ చాలా బాగుంది. అభినందనలు madam

    1. థాంక్యూ రాజ్యలక్ష్మి గారు.

  28. ఎన్ని మాటలు ..ఎంత ఉద్వేగాన్ని ..ఎంత తిరుగుబాటు ధోరణిని…ఎంత ..ఎంత ఎంత అన్న ప్రశ్నకు సమాధానం కూడా బయటకు రానంత ఉబ్బి తబ్బిబ్బయ్యే వ్యాసాన్ని రాసారు.. ఇంత దుర్మార్గం మయన్మార్ లో జరుగుతుందని వేదన తో సతమతమవ్వాలో..లేక ఇంత హృదయ లావాను ఒక కవియత్రిగా మాతో పంచుకున్నందుకు సంతోషించాలో తెలియక… ఉన్నాను. U r an unique researcher. You are an ultimate poetess.. u r the pioneer to pave the revolution culture. In the society.. నిజంగా రెండు సార్లు చదివాను..అకాడమిక్ రీసెర్చ్ పేపర్ లాగా అనిపించింది.. కవి బాధ్యతలు ఏమిటో చెప్పారు.. అంత చిన్న దేశంలో జరుగుతున్న ఆ దుర్మార్గాలు ఇంకెందరో నియంతలకు మార్గదర్థకం కాకముందే నిరసనల్ని మన దేశ కవులూ తెలపాల్సిన అగత్యాన్ని సూటిగా చెప్పారు..కుడొస్

Leave a Reply