ఇప్పుడు మనుషులు మాట్లాడే మాటలు కావాలి

ఇప్పుడు మనుషులు మాట్లాడే మాటలు కావాలి
ఇప్పుడు మాటలు మూటలుగా వెల్లువెత్తే మనుషులు కావాలి

మంచి ముత్యాలు జల్లులుగా కురిసే
మాటల మమతలు కావాలి

పెదాల అంచుల్లో పూసే సుగంధ పరిమళాలు కావాలి
గాలి సయ్యాటల్లో తేలియాడే
పరిమళాలు వెదజల్లే పూదోటలు కావాలి

ఆప్యాయంగా పలకరించే
హృదయపు ఆలింగనాలు కావాలి

అశాంతి వెల్లువై పారే మనుషుల వృక్షాల
కొమ్మ కొమ్మనూ వంచే
తేటతేట తేనె పలుకులు మల్లెలుగా కురవాలి

కన్నుల సందిట పూసే సరిగమలు సిరిమువ్వల గజ్జెలుగా రాలాలి
కాలాన్ని కావ్యం చేసి నవ్వించే మాటలు పాటలు కావాలి

మానవ స్పర్శలు పెంచే హృదయ వీణలు మీటే
గట్టిమాటలు మూటలు గట్టే మనుషులు కావాలి

వెల్లువల్లో కొట్టుకు పోయే మనుషుల్ని ఆపి కూర్చోబెట్టి
సేదతీర్చే మాటల లేపనాలు కావాలి
అవి ప్రసరించే ఎల్లలు లేని ఆనందాలు కావాలి

మనిషి మనిషిగా మారే మాటలు జల్లులుగా రాలాలి
మనిషి మనిషిగా ఆనందంగా పక్షుల్లా ఎగిరే మాటలు కావాలి

పుట్టింది కలికివాయ, సింగరాయకొండ మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. కార్యక్షేత్రం: ఉపాధ్యాయుడు పి. నాయుడుపాలెం, చీమకుర్తి మండలం, ప్రకాశం జిల్లా. సాహిత్యం: కవితలు 'వసంతాల ఊసెత్తకు', 'నీటి పొద్దు', 'మేం పావురాల్ని ప్రేమిస్తాం' సంకలనాలు. కథలు: 'మిత్తవ', 'మారాజులు' సంకలనాలు. 'గబ్బగీమీ చీకటి' నవల. ప్రస్తుతం పి. నాయుడు పాలెం గ్రామంలో పిల్లలతో విద్య పై ప్రయోగాలు.

Leave a Reply