పాకం!

పోలీసు స్టేషన్ నుండి వస్తూ యిలా యింట్లో అడుగు పెట్టానో లేదో అలా అందుకుంది మా ఆవిడ “మీకైమైనా మెంటలా?” అని, అదీ యేడుపు గొంతుతో.

నిజానికి నాక్కూడా చాలా రోజులుగా మెంటలెక్కినట్టేవుంది. అందుకే నాలోని అయోమయం నాకళ్ళలో ప్రతిఫలించినట్టుంది.

“ఆ చూపులేంటి? పోలీసులేమైనా థర్డ్ డిగ్రీగాని ప్రయోగించారా?” అని తను సినిమాలు చూసిన నాలెడ్జ్‌తో నా వొళ్ళంతా కళ్ళతో తడిమింది. గాయాలు యేమీ లేకపోవడంతో యేదో ఆలోచనల్లో పడింది. ఈమధ్య తను ఓటీటీల్లో సైకలాజికల్ థ్రిల్లర్స్ చాలానే చూసిన విషయం నాకెందుకో గుర్తొచ్చింది.

థర్డ్ డిగ్రీలేం లేవన్నట్టు అడ్డంగా తలూపాడు మా మావయ్య, నా వెనుక దాక్కున్నట్టు నిలబడ్డ వాడల్లా పక్కకి వచ్చి నిలబడ్డాడు. ఆయనే నన్ను విడిపించుకొచ్చాడు. నాకు నిజంగానే మతి స్థిమితం లేదని చెప్పి పోలీసుల్ని నమ్మించాడు.

మా ఆవిడ నా ముఖంలో ముఖంపెట్టి కళ్ళలో కళ్ళుపెట్టి “మీరు యేమి చేస్తున్నారో మీకు తెలుసా?” అని గుడ్లురిమి చూసింది. అంతలోనే చూపు తిప్పి “యిది నాన్ బెయిలబుల్ కేసని యీ వెర్రి మనిషికి మీరైనా చెప్పలేదా?” అని ఆమె వాళ్ళ నాన్నని నిలదీసింది. ఆయన పోలీసుల్ని నమ్మించడానికి చాలా నటించి అలసిపోయాడు. ఆ సంగతి మా ఆవిడకి తెలీదు.

నాకు నవ్వొచ్చింది. దాచాలేకపోయాను. “ఎందుకు మీకా పొంగు?” అని పట్టనలవికాని కోపంతో చూసింది. “పిచ్చోడు అలానే నవ్వుతాడు, నువ్వు పట్టించుకోకు వదిలేయమ్మా,” అని వాళ్ళ నాన్న ఆవిడకు వత్తాసు పలికాడు. ఆయన పోలీసు స్టేషన్లో పోషించిన క్యారక్టరులోంచి యింకా బయటకు రాలేదు. ఏమో నేను కూడా దిమాక్ ఖరాబ్ అయిన క్యారక్టర్లోనే వున్నానేమో.

“పోలీసు కేసులంటే యెక్కడ తిరుగుతాం కోర్టులచుట్టూ?, దేశభక్తులు చితక్కొడితే యెక్కడ తిరుగుతాం హాస్పిటల్స్‌‌చుట్టూ?” మా ఆవిడ గిజగిజలాడిపోతోంది. “వాళ్ళు అక్కడికక్కడ చంపేస్తే?” మా మావయ్య అప్పుడేం చేస్తావన్నట్టు చూశాడు. దిద్దుకోవడానికి యేమీ వుండదన్నట్టు తలను అడ్డంగా వూపాడు.

నన్ను నేనే ప్రమాదంలోకి తోసేసే పనులు యేమి చేశానా- అని నాలో నేను మల్లగుల్లాలు పడ్డాను. రీల్ వెనక్కి తిప్పాను.

ఓపెన్ చేస్తే, స్వీట్ షాప్ ముందు వున్నాను. అంతవరకూ నేను బూతులు మాట్లాడతానని నాక్కూడా తెలీదు. అసలది బూతని తెలీనే తెలీదు. తెలీకపోయినా బూతు బూతే అన్నారు. ఎవరూ? నా మూతిమీద గుద్దినవాళ్ళు. “ఏక్ కిలో మైసూర్ పాక్,” అన్నాను. ‘నహీ’ ‘జావో’ షాపువాడు కళ్ళతో హెచ్చరిస్తుంటే, నేను అతని తలపాగాని చూస్తున్నాను. కాసేపటికి అర్థమయ్యింది, అది తలకు చుట్టిన బ్యాండేజ్ అని. దానికి కృష్ణుడి నెమలిపించంలాగ వొక కాషాయజెండాని కూడా తగిలించారు.

“ఏం కావాలి?” ప్రశ్న విన్నాను. ఎట్నుంచి వచ్చిందో గ్రహించలేకపోయా, అలవాటుగా “మైసూర్ పాక్” అనేసి నాలుక కరచుకున్నాను. “పాకిస్తానుకు పోతావ్‌బే,” అడిగారు. నేను కంగారులో అవునని తలాడించినట్టున్నాను. “తూ మాకి…” వొకడు తిడుతుంటే, మరొకడు “నువ్వేడున్నావో సమజైతందా?” అడిగాడు. నన్ను నేను దిద్దుకున్నట్టు “మైసూర్ శ్రీశ్రీ” అన్నాను. మహాకవి శ్రీశ్రీని కాదండి బాబూ మైసూర్ ‘శ్రీ’ని వొత్తి పలకబోయి రెండుసార్లు అన్నాను. “నువ్వేడున్నావో ముందు గది చెప్పు,” మళ్ళీ అన్నాడు. కాంపిటీషన్లో జాబ్ కొట్టిన బుర్ర  కొట్టించుకోడానికి రెడీ అయినట్టు “ఇండియాలో,” అన్నాను. “అరే బేవకూఫ్… ఆపరేషన్ సిందూర్‌లో బే,” అంటే బుద్ధిగా తలాడించాను. “అది అయిపోయిందిగా?” మెల్లగానే అన్నాను. “బోర్డర్‌లో అయిపోయింది, యీడ నీలాంటోళ్ళమీద అవుతోంది,” అన్నారు. డామేజ్ కంట్రోల్ కోసం “పాకిస్తాన్ డౌన్ డౌన్…” అని చూశా. లాభం లేకపోయింది. “మైసూర్ శ్రీ మైసూర్ శ్రీ…” వందసార్లు అన్నాను. అయినా నామీద మొదటి కేసు నమోదు అయింది, ఆ సంగతి నాకు తెలీదు. నన్ను ఇంటలిజెన్స్ వాళ్ళు ఫాలో అవుతున్న విషయం కూడా.

నాకు నోరుండదు. నా తప్పులూ వున్నాయ్. పాన్ షాప్ వాడి దగ్గరా బూతులే మాట్లాడానట. “లేత తమలపాకు వెయ్యి” అన్నాను. షాపు వాడు నా గూబ గుయ్‌మనిపించాడు. అందువల్ల అతడు దెబ్బలు తప్పించుకున్నాడు. వెరీగుడ్ అనిపించుకున్నాడు. ‘తమల శ్రీ’ ‘తమిళ శ్రీ’ అని ప్రాక్టీసు చేశాను. లాభం లేదు. నా మీద రెండో కేసు కూడా నమోదు అయిపోయింది. ఇంటలిజెన్స్ వాళ్ళు యేదేదో రాసేసుకుంటున్నారు.

రైతుబజారుకు వెళ్ళాక, చాలా ఎలర్ట్‌గా వుండి “కరివేశ్రీ యివ్వు” అన్నాను. ‘నీకూ పట్టిందా పిచ్చి?’ అని ముసల్ది గొణుగుతుంటే, పోలీసులు ఆవిడని వేన్ యెక్కించేశారు. నామీద మూడో కేసు పెట్టారు నిఘా పోలీసులు. “నేను సరిగ్గానే అన్నాను కదా?, కరివేశ్రీ” అని డంగైపోయాను. “నువ్వో భారతీయుడిగా నీ దేశభక్తితో ఆమెని ఇన్స్‌పైర్ చేయాల్సింది, ఆపని నువ్వు చెయ్యలేదు, అందుకే…” అంటుంటే, యింకెక్కువ మాట్లాడితే నా పౌరసత్వం రద్దయిపోతుందని మూసుకున్నాను.

ఎటు అడుగువేసినా యేమి పెదవి విప్పినా అయిపోతానని అనిపించి బుద్ధిగా యింటికి వచ్చేశాను. అప్పుడే మా ఆవిడ పక్కింటి ఆవరణలోంచి వచ్చింది. ఆమె చేతిలో వున్నది చూసి నోరు విప్పకముందే మా ఆవిడ ముందు జాగ్రత్త తీసుకుందేమో “వేపశ్రీ, పొట్ట శుద్ధికి” అంది. నేను తనను చూసి నవ్వాను. నువ్వు అప్ డేట్ వున్నావని మెచ్చుకున్నాను. చెట్టు చాటునుండి వచ్చిన నిఘావాళ్ళు నామీద అవాల్టికి నాల్గో కేసు నమోదు చేశారు. మా ఆవిణ్ణి యింటి లోపలకు వెళ్ళనిచ్చి నిఘావాళ్ళతో గొడవపడ్డాను. నాల్గో కేసు యెలా పెడతారని. దేశంపట్ల భక్తి లేనివాళ్ళే ‘వేపశ్రీ’ అంటే నవ్వుతారని, రేపు ‘న్యాయసంహిత’ అన్నా నవ్వుతారని, నవ్వు వెక్కిరింతకు సంకేతమని, వెక్కిరింత దేశద్రోహానికి చిహ్నమని చెప్పి నా మాటలు వినిపించుకోకుండా వెళ్ళిపోయారు.

మా ఆవిడ అడిగినదానికి సమాధానం యివ్వలేదు. ఆవిడకు లేనిపోని ఆందోళన పెంచడం యెందుకు అనుకున్నాను. టీవీ పెట్టాను. మంచి సినిమా చూద్దాం అన్నాను, డైవర్ట్ కావచ్చని. మా ఆవిడ వొప్పుకోలేదు. ఈ పరిస్థితుల్లో న్యూస్ చూడాలి, అదే అవసరం అని గట్టిగా అంది. రిమోట్ ఆమె చేతిలో పెట్టాను.

బిగ్ బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. ‘ప్రతీ అడ్డమైనదీ బ్రేకింగ్ న్యూసే’ అని నేనంటే మా ఆవిడ కొరకొరా చూసింది. ఆ అందమైన కళ్ళను అలా చూడడం యిష్టంలేక టీవీలోకి చూశాను. టెర్రరిస్టుల స్థావరాలపై నిఘా అని పెద్దపెద్ద అక్షరాలు వచ్చిపోతున్నాయి. అక్కడ చూస్తే సందుల్లో పిల్లలు గోళీలు ఆడుకుంటున్నారు. ‘బాల ఉగ్రవాదులు’ అని చూపిస్తున్నారు. నా బట్టతలమీద వున్న నాలుగు వెంట్రుకలూ పీక్కున్నాను. “వాళ్ళ గొంతుని వినండి, దేశమేగతి బాగుపడునోయ్- అని మీరే అనుకుంటారు…” న్యూస్ రీడర్ అంటోంది. మా ఆవిడ వాల్యూమ్ పెంచింది. “ఆక్ పాక్ కరివే పాక్… ఆక్ పాక్ కరివే పాక్…” వచ్చిందే వస్తోంది, చూపించిందే చూపిస్తున్నారు.

నా బుర్ర గిర్రున తిరుగుతుండగా ఫోను మోగింది. ఊళ్ళో వున్న అమ్మానాన్నా నుండి. రెండ్రోజులకు వొకసారి వచ్చే ఫోనే. కాని యెందుకో తెలీని ఆందోళన. అర్థం చేసుకున్నట్టు మా ఆవిడ టీవీ పాజ్‌లో పెట్టి ఫోను స్పీకర్ ఆన్ చేసింది. “అమ్మా… అయ్యా… బాగున్నార్రా? ఎప్పుడు వస్తున్నారు?” అని అమ్మ అడిగింది. “పిల్లాడి సెలవులకి,” మా ఆవిడ స్టాకు డైలాగు చెప్పింది. “అమ్మా నీకు అరిసెలు యిష్టం. మీ ఆయనకు పొంగడాలు యిష్టం… యివికొన్ని అవికొన్ని కడతాను. మీ కోసమే కలాయి యేసినాను. మన సతీష్ అయిదరాబాదు వస్తున్నాడు కదా, ఆలక్కని చూడడానికి… ఆడితో పంపిద్దామని…” మాట పూర్తి కాలేదు. “అమ్మా మేమేం పిల్లలమా? నీ మనవడికి యిష్టం కదా, పాకుండలు చేసి పంపించు. వేరుశనగ గుడ్లు, కొబ్బరి ముక్కలు వేసి,” అన్నాను. మా ఆవిడ చూపుని నేను గమనించలేదు. “వసే, పాకుండలకీ అదే పాకం, సర్లే…” అమ్మ అంటోంది. “పాకుండలు…” అమ్మ మాట్లాడుతూ వుండగా మా ఆవిడ ఫోను కట్ చేసింది. ఏమయింది అన్నట్టు చూశాను.

మన ఫోను ఖచ్చితంగా ట్యాప్ అయ్యుంటుంది అని మా ఆవిడ వో ఫీలయింది. కొన్ని పదాలు వాడితే, ఫోను ఆటోమేటిక్‌గా రికార్డ్ అయిపోయి వారి దృష్టికి పోతుందని తనకున్న జ్ఞానమంతా కలిపి చెప్పింది. ఎందుకో యేదో అయిపోతున్నట్టు వెన్ను వణికింది, చలి జ్వరం వచ్చినట్టు. నాకు బుద్ధిలేదని మా ఆవిడ తిడుతోంది. ‘పాకుండలు’ అనేది మన శ్రీకాకుళంజిల్లా వంటకం, దానికి భయపడడం దేనికి? అని పైకి గాంభీర్యంగానే మాట్లాడాను. మీ నోటికి ప్లాస్టర్ వెయ్యాలి అంది మా ఆవిడ. అలా వేసినా బాగుణ్ణు. మరి కొన్ని ప్రమాదాలు తప్పిపోను.

ఆ మర్నాటి పొద్దున్న మా అబ్బాయి బ్రెష్ చేసి, “నాన్నా” అని పిలిచి ‘యీ’ అని నాకు వాడి పల్లు చూపించాడు. “తళుక్కున పల్లమీద మెరుపు మెరవాలి,” అన్నాను. “యాడ్‌లో లాగా?” అని అడిగి, “అదంతా గ్రాఫిక్స్” అన్నాడు మావాడు. “నువ్వు శుభ్రంగా తోమడం లేదు, పల్లమీద పాకు పట్టి పోతోంది,” అన్నాను. నేను ఆమాట మామూలుగానే అన్నాను. మైకు లేకుండా. కాని యేదో డీటీయస్‌ డాల్బీలో వచ్చినట్టు ‘పాకు’ ‘పాకు’ ‘పాకు’ …. అని వొకటికి పదిసార్లు ఎకోలా నాకే కాదు, యింటిల్లిపాదికీ వినిపించింది. ఉలిక్కిపడ్డాను. చూస్తే, యింటి ముందు యెవరో తచ్చాడుతున్నట్టు అనిపించింది. చూడడానికి దైర్యం చాలలేదు. అసలు యేమి జరుగుతోందో కనిపెడదామని మేడమీదికి వెళ్ళాను. చూస్తే, యెవరూ కనిపించలేదు. నాదంతా భ్రమో భ్రాంతో తెలియలేదు. అనుకోకుండా నా చూపు వాటర్ ట్యాంక్ మీద పడింది. వంగి చూశాను. “పాకు పట్టీసింది, క్లీన్ చెయ్యాలి,” అనుకున్నానో అన్నానో తెలీదు. నిఘావాళ్ళు నా పక్కన చేరి మళ్ళీ యేదో ఆగకుండా రాసేసుకుంటున్నారు.

ఇది నామీద యెన్నో కేసో లెక్కకడుతూ వుండగా “యేమిటి లెక్కపెడుతున్నావ్?” అని మా మావయ్య నన్ను అడిగాడు. ఫ్లాష్ బ్యాక్‌లోనుంచి బయటకొచ్చి నన్ను నేను చూసుకుంటే, అచ్చం పిల్లల్లానే రెండు చేతులూ అయిపోయి కాళ్ళకున్న వేళ్ళు లెక్కపడుతూ వున్నానన్నమాట.

“రేపు కోర్టులో వొకసారి హాజరు కావాలి,” అని మా మావయ్య మా ఆవిడకు పేపర్లు యిచ్చాడు.

తరువాత రోజు కోర్టులో బోను యెక్కించే ముందు పోలీసులు నన్ను తనికీ చేశారు. నా చేతి సంచిలో నోట్ బుక్కుతో పాటు వొక నవల దొరికితే, దాని శీర్షిక చదివి నా పని అయిపోయిందన్నట్టు వొక చూపు చూశారు సిబ్బంది. జడ్జిగారు పైకే చదివారు ‘పాకుడురాళ్ళు’ అని. అందరూ నన్ను వుగ్రవాదిని అన్నట్టే చూశారు.

ఇంతలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అర్జెన్సీగా వొకటి బెంచి మీదకు వచ్చింది. నన్నూ నా కేసునూ కాసేపు పక్కన పెట్టారు. ‘పాక్ ఆక్రమిత కాశ్మీరు’ అనడం సరికాదని, కావాలంటే దానిని ‘భారత ఆక్రమిత కాశ్మీరు’ అని పిలవొచ్చు అని నివేదన వినిపించారు. ‘పాక్’ నిషేధం ఆదేశ పీచమనిచే చర్యగా అభివర్ణించారు. ‘మనం ఆక్రమించాక ఆ పేరున పిలవొచ్చు కాని ముందే…’ అని ఆగి ఫైల్ చదివి, ‘పాక్ తీసెయ్యండి, ఆక్రమిత కాశ్మీరు’ అంటే సరిపోతుందని జడ్జిగారు సూచన చేశారు. ఆపై కమిటీ వొకటి వేశారు.

నన్ను మళ్ళీ బోనెక్కించారు. “మీరు మీ ఆవిడ్ని యేమని పిలుస్తారు?” పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడిగారు. నేను తలదించుకున్నాను. “సిగ్గు పడకయ్యా చెప్పు” మళ్ళీ అన్నారు. “అంటే…” తడబడ్డాను. “చెప్పవయ్యా” గద్దించారు. “పాకు” అన్నాను. ఎంక్వయిరీలో ఆ విషయం ఆధారాలతో బయటపడిందని పీపీగారు అందుకు సంబంధించినవి జడ్జిగారిముందు వుంచారు.

“మీకు పాకు అంటే యిష్టమా?” జడ్జిగారు అడిగారు. “యస్సార్,” అన్నాను. పీపీ “కోర్టు టైం వృధా తప్ప యింకేం లేదు, యితను యాంటీ నేషన్,” కాస్త గట్టిగానే అన్నారు. నేను వులిక్కిపడ్డాను. “అది కద్సార్, మా ఆవిడ పేరు ‘పావనీ కుమారి’, సో షార్ట్ కట్‌లో ‘పాకూ’ అంటాను, అది కూడా బాగా యిష్టమైనప్పుడూ కోపమొచ్చినప్పుడూ అంతే,” అన్నాను.

మధ్యలో పీపీ “యువరానర్, యితను యాంటీ నేషన్ అని ప్రూవ్ చెయ్యడానికి మరొక్క అవకాశామీయండి మిలార్డ్,” అనేసరికి జడ్జిగారు “ప్రొసీడ్,” అన్నారు. “ఆరోజు కరాచీ బేకరీ పేరు మార్చమని కొందరు గొడవ చేస్తున్నప్పుడు మీరు అక్కడే వున్నారా?” పీపీ మాటలకు “ఊ… అక్కడే వున్నాను,” అన్నాను. “అందరూ కరాచీ బేకరీలోంచి స్నాక్స్ అన్నీ చేతికి దొరికింది దొరికినట్టు పట్టుకుపోయారా?” పీపీ మాటలకు “ఊ… పట్టుకుపోయారు,” అన్నాను. “మరి మీరెందుకు ఆ పని చేయలేదు?” వొకసారి నార్మల్‌గా మరోసారి గట్టిగా వొకే ప్రశ్న వేశారు పీపీగారు. నాకు మాటలు రాలేదు. అర్థం కూడా కాలేదు.

“మిలార్డ్ యితని ముందు తన దేశభక్తిని నిరూపించుకొనే బంగారు అవకాశం వున్నా నిరూపించుకోలేదు. భావోద్వేగాలు లేకుండా వొక జంతువులా యెలా వుండగాలిగాడు?, అతని ఇంటెన్సన్ యేమై వుంటుందో ఆలోచించండి యువరానర్…” పీపీ యింకా యేదేదో మాట్లాడుతున్నట్టే అతని పెదవుల కదలికలను బట్టి తెలుస్తోంది, అయితే నాకేమీ వినిపించడం లేదు.

నేను ఎరుకలోకి వచ్చేసరికి సెల్‌లో వున్నాను. నన్ను నాలుగు వారాల కస్టడీకి యిచ్చినట్టు తెలిసింది. నన్ను చాలా అదృష్టవంతుడనని కొందరు అన్నారు. అదే నువ్వు ముస్లిమ్ అయ్యుంటే, యే టెర్రరిస్టుల పక్కనో నీ ఫోటో వుండుండేది అన్నారు.

ఆ రాత్రి నాకు దేవుడు ఆకారం లేకుండా వెలుగులా కనిపించాడు.

స్ట్రెయిట్‌గా అడిగాను, “నువ్వు యే దేవుడివి?” అని. నా ప్రశ్న అర్థంకానట్టు దేవుడు బేలగా చూశాడు. “నీకు ఆకారం లేదు కాబట్టి అల్లా అనుకోనా?” అడిగాను. “అనుకో,” అని నవ్వాడు దేవుడు. “వద్దు, నిన్ను పూజిస్తే, నేను మతం మారినట్టు అవుతుంది కదా?” నే అడిగితే దేవుడు యెందుకో కాదనలేదు.

కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత అన్నాను, “మీరు పాకిస్తాన్ ప్రతినిధి అని నామీద మరిన్ని కేసులు పెట్టకముందే దయచేసి మీరు యిక్కడినుండి మాయమయిపోండి,” అన్నాను. అవకాశమిస్తున్నట్టు గట్టిగా కళ్ళు మూసుకున్నాను.

కొద్దిసేపటి తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచాను. ఎదురుగా శ్రీరాముడు వున్నాడు. “మీరు భారతదేశ ప్రతినిధి, మీరు మాత్రమే నామీద కేసులు తీయించగలరు,” అన్నాను. రాముడు చిన్నగా నవ్వాడు. కళ్ళు పులుముకు చూశాను.

మనసులో ప్రతిష్టించుకున్న విగ్రహమే యెదురుగా వున్నట్టు భ్రమిస్తున్నానా… అనుమానంగా చూసి, ఆగలేక అడిగేశాను. “రాముడా? అల్లానా?”

“రెండూ వొకటే,” అన్నాడు దేవుడు.

నవ్వాను. “హు… భారతదేశం పాకిస్తాన్ వొకటే అన్నట్టుంది,”

“డబ్బైయెనిమిది యేళ్ళకు ముందు భారతదేశమూ పాకిస్తానూ వొకటే. ఆమాటకొస్తే భూమి అంతా వొక్కటే, సరిహద్దులు యీ భూమిని దేశాలుగా విడగొడుతున్నాయి…” దేవుని గొంతు యెందుకో బొంగురుపోయింది.

“ఏం… మీ దేవుళ్ళు మతాలుగా భక్తులని విడగొట్టడం లేదా?”

నా మాటతో దేవుడి ముఖం మాడిపోయి నోరు మూగవోయింది.

కొద్దిసేపటి తర్వాత అడిగాను. “రాముడు నేనే అల్లా నేనే అంటే కూడా నమ్మొచ్చేమో, దేవుడు వొకడే అని. కాని, భారతదేశమూ పాకిస్తానూ వొకటే దేశం కాదు గాక కాదు,” అన్నాను.

దేవుడికి కోపం వచ్చినట్టుంది. ఆడెవడో తెల్లవాడు గీసిన పెన్సిల్ గీతని దేవుడు ఆవేశంగా చెరిపేశాడు. సరిహద్దులు చెరిగిపోయాయి.

ఇప్పడు దేశం వొకటే.

జెండా వొకటే.

ఆజన్మ శత్రువులు కారు, అన్నదమ్ములే.

నిద్రో మెలకువో తెలీని కళ్ళని విప్పాను. అప్పటికే తెల్లవారింది. పేపరు తీసి చూశాను.

“అఖండ భారతాన్ని నిర్మిద్దాం!” దేశభక్తులు అల్లర్లకు దిగారని వార్త!

పుట్టింది శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ. నివాసం హైదరాబాద్. చదివింది ఎం.ఏ తెలుగు, ఎం.ఏ పాలిటిక్స్. వృత్తి -ప్రవృత్తి రచనే. అయిదు వందల కథలు, వంద జానపద కథలు, పాతిక వరకూ పిల్లల కథలు రాశారు. కథా సంపుటాలు: రెక్కల గూడు, పిండొడిం, దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ, మట్టితీగలు, హింసపాదు, రణస్థలి, మనువాచకం. జానపద కథా సంపుటాలు: అమ్మ చెప్పిన కథలు, అమ్మ చెప్పిన కయిత్వం, అనగనగనగా, పిత్తపరిగి కత, అనగా వినగా చెప్పగా, ఊకొడదాం. పిల్లల కథా సంపుటం: అల్లిబిల్లి కథలు. ఒక్కో కథా ఒక్కో పుస్తకంగా వచ్చిన మరో పన్నెండు పుస్తకాలూ- యింకా జాతీయాల మీద వచ్చిన ‘పురాణ పద బంధాలు’, పిల్లల సమస్యల మీద వచ్చిన ‘ఈ పెద్దాళ్ళున్నారే’, మంచిపుస్తకం తానా ప్రచురణ ‘నువ్వేమిస్తావు?’ తో కలిపి మొత్తం యిరవైతొమ్మిది వచ్చాయి. కొన్ని కథలు హిందీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ భాషల్లోకి అనువాదమయ్యాయి.

బాసలో ‘కతలు కతలు’, మాతృకలో ‘కతలు వెతలు’, సారంగలో ‘మహారాజశ్రీ’ ‘కరోనా కహానీలు’, విరసం డాట్ ఆర్గ్‌లో ‘మెయిల్ బాక్స్’ ‘బుర్ర తిరుగుడు కథలు’, మనంలో ‘వాట్సప్ కథలు’, రస్తాలో ‘ఈ పెద్దాళ్ళున్నారే’, ప్రజాతంత్ర ‘శోభ’లో ‘మెరుపు తీగెలు’ కాలమ్స్‌కు తోడుగా ‘కాదేదీ కథకనర్హం’ కొలిమి కోసం ప్రత్యేకం.

3 thoughts on “పాకం!

  1. కరాచీ బేకరీని కొల్లగొడుతూ దేశభక్తుడన్న మెడల్ కొటాటేయవచ్చు.

Leave a Reply