నిఖిలేశ్వర్ సాహితీ సంగమం

13-08-2023 న హైదరాబాదులో ప్రముఖ విప్లవ కవి శ్రీ నిఖిలేశ్వర్ రెండు రచనలు నిఖిల లోకం[ఆత్మకథ],సాహితీ సంగమం అనే పుస్తకాల ఆవిష్కరణ జరిగింది.11 ఆగస్టు న 85 సంవత్సరాలు పూర్తి చేసుకుని 86వ పడిలో ప్రవేశించిన ఆ సీనియర్ కవికి జన్మ దిన శుభాకాంక్షలు. అగ్ని శ్వాసలతో కాలాన్ని అధిగమించి, తన రచనలలో యుగ స్వరా న్ని వినిపిస్తున్నందుకు అభినందనలు. దాదాపు ఆరు దశాబ్దాలకు పైగా రచనా రంగం లో క్రియాశీలంగా రాణిస్తూ, స్ఫూర్తిదాయకమైన సాహిత్య సృజన కొనసాగిస్తూ వుండటం చాలా అభినందనీయం, మరీ ముఖ్యంగా తాను ఏర్పరచుకున్న ప్రజానుకూల సాహితీ సాంస్కృతి కోద్యమ లక్ష్యాల కనుగుణం గా సుదీర్ఘకాలం ఆ కలం కవితాయానం కొనసాగిస్తున్నది. ఒకే జాతి, ఒకే సంస్కృతి, ఒకే జీవనవిధానం అంటూ భారత దేశం లోని వైవిధ్యభరిత సంస్కృతీ వికాసాన్ని పాలకులు గుర్తించ నిరాకరిస్తున్న నేటి కాలంలో నిఖిలేశ్వర్ లాంటి ఆలోచనా పరులైన కవుల జీవితం, కృషి, యువతరానికి ఆదర్శప్రాయం గాను, ఆలోచనాత్మకం గాను ప్రేరణ కల్పిస్తుంది. ఆయన జీవిత కథలోని అనేక భాగాలు పరోక్షంగా నేటి సమాజానికి కర్తవ్యాన్ని గుర్తు చేస్తాయి.

“నీ స్నేహితుల గురించి చెప్పు, నీవు ఎలాంటి వాడి వో నేను తెలుసు కుంటాను” అని మనం ఒక నానుడి తరచుగా వింటూ ఉంటాము. 1960 ల నుంచి తనకు తారసపడిన రచయిత లు, కళాకారులు, సామాజిక ఉద్యమ కార్యకర్తలు, ప్రముఖ వ్యక్తులలో కొందరు పరిచయ స్థులుగా మిగిలారు, కొందరు సన్నిహితులయ్యారు. కొందరు స్నేహితులయ్యారు ఆత్మీయు లయ్యారు. కొందరు మార్గదర్శకు లయ్యారు. అలాంటి 35 మంది వ్యక్తుల గురించి శ్రీ నిఖిల్ వివిధ సందర్భాలలో రాసిన వ్యక్తిత్వ పరిచయాలు, స్నేహపూర్వక పరామర్శలను ఇప్పుడు గుది గుచ్చి ‘సాహితీ సంగమం’ అన్న పుస్తకం గా డాక్టర్. డి. చంద్రశేఖర రెడ్డి గారి సంపాద కత్వంలో ఎమెస్కో ప్రచురణగా వెలువరించారు. ఇది ఒక ప్రణాళికా బద్దమైన రచన కాదు. అనేక వ్యాసాలు ఆయా వ్యక్తులకు నివాళిగా రాసినవి. కొన్ని ఆ వ్యక్తుల జీవితాలలోని ప్రత్యేక సందర్భాలకు ప్రతిస్పందించి అభినందన పూర్వకంగా రాసినవి. అందువల్ల ఇవి సమగ్రమూ కావు, సర్వ గుణదోష విచారణలూ కావు. నిఖిలేశ్వర్ కు ఆయా వ్యక్తుల పట్ల వున్న స్నేహ మూ, గౌరవమూ, అభిమానమూ వ్యక్త పరచుకున్న సందర్భాలు మాత్ర మే. అయినప్పటికి ఆయా వ్యక్తులూ, అభిప్రాయాలు చెప్పిన రచయితా తెలుగు సాహిత్య రంగంలో, తెలుగు సమాజంలో ప్రభావ శీలమైన పాత్ర పోషించిన వారు కావటంతో, ఈ సమాగమం అత్యంత ఆసక్తి దాయకంగా వుంది.

ఒక అరవై ఏళ్ల చరిత్రకు పాక్షికంగా అద్దం పడుతున్నది. కొన్ని విశేషాలను, సన్నివేశాల ను రికార్డు చేస్తున్నది. అప్పటికి అవి వ్యక్తిగతమే అయినా ఇప్పుడవి మనం తెలుసుకో వలసిన చరిత్రలో భాగం అయ్యాయి కదా! నిర్మొహమాటంగా, నిర్మోహంగా, నిష్కల్మషంగా, నిజాయితీగా నిఖిలేశ్వర్ చెప్పిన అంశాలు ఉన్నాయి ఈ వ్యాసాల నిండా. మనం వాటిని నిస్సంశయంగా వాస్తవ చరిత్రగా స్వీకరించవచ్చు. మనకు తెలిసిన చరిత్రలో వ్యక్తుల పాత్ర గురించి తెలియని ఒక తెలివిడి పెరుగుతుంది ఈ పుస్తకం చదివితే.

అంతకుముందు కె. యాదవరెడ్డి గా అనేక రచనలు చేసినప్పటికీ ఆరుగురు దిగంబర కవు లలో ఒకరిగా నిఖిలేశ్వర్ ప్రత్యేక ప్రస్థానం మొదలయ్యింది. ఆ అరుగురిలో శ్రీ నిఖిలేశ్వర్, నగ్నముని మాత్రమే నేడు జీవించి వున్నారు. మిగిలిన నలుగురు- చెరబండరాజు, మహా స్వప్న, జ్వాలాముఖి, భైరవయ్య. వారు గతించిన సందర్భాలలో వారి గురించి, వారి కవితల విశేషాల గురించి, దిగంబర కవితోద్యమం లో వారి పాత్ర గురించి నిఖిలేశ్వర్ క్లుప్తంగానే అయినా సాధికారంగా, ఆర్ద్రంగా నమోదు చేశారు. “సమిష్టి గానమైన దిగంబర కవుల్లో ఎవరి కవితా శైలి వారిదే, వ్యక్తీకరణలో ఎవరి బలం, బలహీనతలు వారివే” అని నిక్కచ్చిగా చెప్పారు. “అగ్నిశిఖలు-మంచు జడులు” కవిత్వంగా కురిపించిన కమ్మిశెట్టి వెంకటేశ్వర రావు “కాలం వాయులీనం మీద కమాను నై, చరిత్ర నిద్రా సముద్రం పై తుఫాను నై వస్తున్నాను” అని ప్రకటించిన మహాస్వప్నగా మారినప్పటికి, జీవన శైలి, నైరాశ్యం, నిర్లిప్తత మూలంగా కవిత పరంగా ఆగిపోయాడు. అవివాహితునిగా మిగిలిపోయి, వ్యవసాయం చేసుకుంటూ 2019 లో మరణించారు. కైవల్య పేరుతో రాత్రి సంపుటిలో కవితలు వెలిగించిన మన్మోహన్ సహాయ్ “గుండెల తీరాన్ని కొట్టుకునే సహజ మైన భావాన్ని వొడుపుగా పట్టడం, నిజాన్ని నిజంగా నగ్నం గా చెప్పడం” కోసం దిగంబర కవి భైరవయ్యగా మారాడు. ఈ ప్రపంచం అయోమయంలో లయ మవుతుందని, ఈ జీవితమే ఒక మిస్టరీ అని భావించే అతను చివరికి సన్యాసాశ్రమం పుచ్చుకున్నాడు. భైరవానంద స్వామి గా 19-12-2019 న తనువు చాలించాడు. మిగిలిన నలుగురు నక్సల్ బరి, శ్రీకాకుళ గిరిజన, రైతాంగ సాయుధపోరాటాల స్పూర్తితో విప్లవ కవులుగా రూపాంతరం చెంది 1970 లో ఏర్పడిన విరసం లో లయ మయ్యారు. ఈ ఆరుగురిలో ముందుగా మరణించింది శ్రి చెరబండరాజు. విరసం భావధారను అందిపుచ్చుకుని అనేక అజరామర ఉద్యమ గీతాలను రాసి “బొట్టు బొట్టుగా నా నెత్తుటిని ఈనేల విముక్తి కోసం విత్తనంగా చల్లుతాను ” అని తపించిన ప్రజాకవిగా చిరకాల యశస్సును ఆర్జించాడు ఆయన. ‘మా నెత్తురు కంకరగా ప్రాజెక్టులు కట్టినం’ అనే శ్రామిక వాస్తవాన్ని అమరం చేశాడు. నిఖిలేశ్వర్ కంటే వయసులో చిన్నవాడు, చిన్ననాటినుండి తెలిసిన బద్దం భాస్కర్ రెడ్డి, చెరబండ రాజుగా వందేమాతర గీతం వరస మార్చి, చివరకు మెదడు ట్యూమర్ తో 6 సంవత్సరాలు బాధపడి 38 ఏళ్లకే మరణించాడు. “స్పృహ వున్నంతవరకు విప్లవ చైతన్యంతో జీవించి”, “ప్రతి పాట తో ఎదిగి నాకు సీనియర్ అయ్యాడు” అని తన బాల్య స్నేహితునికి ఎంతో ఆర్తితో వినమ్రంగా నివాళి అర్పించారు నిఖిలేశ్వర్.

ఇక 1991 లో గుండెకు ఆపరేషను జరిగినా ఆవిశ్రాంతంగా, నిరంతర సంచారిగా విప్లవ చైతన్య ప్రసారం గావిస్తూ, 2008 లో లివర్ వ్యాధితో మరణించిన జ్వాలాముఖి (ఏ. వి. రాఘవాచారి) తో నిఖిలేశ్వరుకు ప్రత్యేక అనుబంధం. విప్లవ సాహిత్యోద్యమం లో “జ్వాల-నిఖిల్”జంట ను విడదీసి చూడలేని పరిస్థితి వుండేది. వ్యక్తిగత జీవితంలోనూ వారి కుటుంబాలు అంతే దగ్గరగా వుండేవి. ఆ కలం యోధుడు మహావక్త గురించి నిఖిల్ అనేక సందర్భాలలో రాశారు. ఈ సంపుటి లోని రచనలో తమ అర్ధశతాబ్ది స్నేహాన్ని తలచుకుంటూ జ్వాల పలు సంస్థలతో కలిసి, పలుకోణాలలో సాగించిన ఉద్యమకృషిని వివరించారు. “అక్షరం పదునెక్కితేనే కవిత్వం. రాజ్యాన్ని నిలదీస్తేనే రచన పరమార్థం” అని విశ్వసించిన జ్వాలాముఖి “లక్ష నక్షత్రాలు రాలందే ఉజ్వల ఉదయం ప్రవహించదు” అని ఒక క్రియాశీల కవిగా అలుపెరగని కృషితో ప్రజాఉద్యమాల వెంట నడిచిన వాడు. ఆయన కొత్త తరాలకు “తిరుగు బాటు వేదాంతం” కవిగా మిగిలిపోయాడు అని నిఖిల్ తన మిత్రునికి శ్రద్దాంజలి ఘటించారు.

తనతో పాటు జనారణ్యంలో జీవిస్తున్న నగ్నముని తో గల సంబంధాన్ని స్నేహపుస్తకం పుటలు తెరిచి మన ముందు పరిచారు స్వల్ప భేదాభిప్రాయాలతో సహా. విరసం ఆవిర్భావం తరువాత విరసంలో చేరి కూడా దిగంబర కవుల ఐడెంటిటీ కోల్పోకూడదని నగ్నముని భావించినట్లు నిఖిలేశ్వర్ రాశారు. అలాగే దిగంబర కవుల సంపుటాల ప్రచురణకు కావలసిన సొమ్ము ఆయనే ముందుగా చొరవ చేసి అప్పుచేసి డబ్బు తెచ్చి ప్రెస్ పనులు చూసే వాడని, తాము ప్రూఫులు చూసే వాళ్ళమని తన జ్ఞాపకాలు పంచుకున్నారు నిఖిలేశ్వర్. ఆధునిక తెలుగు కవులలో నగ్నమునికి ఒక ప్రత్యేక స్థానం వుందని భావిస్తున్నారు నిఖిలేశ్వర్.

ఇక దిగంబరకవుల సంచాలకుడు సుబ్రహ్మణ్యం గారి గురించి నివాళి పలుకుతూ “మా ఆరంభం, వికాస పరిణామానికి ఆయన అద్దె ఇల్లు ఒక ఆశ్రయం.” దివారాత్రులు కొన్నేళ్ళు మా చర్చలకు ఆయన అబిడ్స్ ఇల్లు- సెంట్రల్ పాయింట్ ఒక చిరునామా. ఆయన లో ప్రొఫైల్ లో వుంటూ ఎక్కడా రాజీ పడకుండా తన అభిప్రాయాలు వినిపించేవాడు” అని ఆత్మీయంగా తలచుకున్నారు. సుబ్రహ్మణ్యంగారు స్వయంగా కవి “వుయ్ ఆర్ ద నేషన్ ఆఫ్ కవర్డ్స్” అని ఆంగ్ల కవితల సంపుటి వెలువరించారు. రాడికల్ హ్యూమనిజం నుండి మార్క్సిజం వైపు అడుగులు వేసినవాడు. తరువాత ఆయన వో.పి.డి.అర్ కార్య వర్గ సభ్యునిగా ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకై కృషిచేశారు అని ఆయనతో తమ అనుబంధం అక్షరాల అవినాభావమే అని నిఖిలేశ్వర్ స్నేహంతో ఆయనను గుర్తు చేసుకున్నారు .

ఇక ఏడవ దిగంబరకవి అని కొందరు భావించేటంత గా వీరితో సన్నిహితత్వం, స్నేహం గల మరో వ్యక్తి శ్రీ కె. కె. రంగనాధాచార్యులు. జ్వాలాముఖి ఆయన ఒకే ఆవరణలో పెరిగిన చిన్ననాటి స్నేహితులు. సదా కలిసి తిరిగినవారు, అందువల్ల నిఖిలేశ్వర్ కు కూడా అతి దగ్గర స్నేహితునిగా మారినవారు. హేతువాద, మార్క్సిస్టు చింతనతో విమర్శనారంగం లో శిఖరంగా నిలిచినవాడు. భాషాపరంగా మరో చూపునిచ్చినవాడు. తమిళ వైష్ణవ బ్రాహ్మణ కుటుంబం లో పుట్టి పెరిగినప్పటికి, ఆలోచనలో ఆధునికత ను అలవరచుకుని, విద్వత్తుచే పరిశోధనా రంగంలో విద్యార్ధులకు మార్గ దర్శకునిగా నిలిచినవాడు, విశేషించి తన దగ్గర చదువుకున్న దళిత విద్యార్ధులకు ఎంతో ఆప్తుడైన వాడు. ఆ 57 సంవత్సరాల స్నేహం తాత్విక అనుబంధం తో ఆత్మీయ అనుబంధంగా మారిపోయిన దశను వివరిస్తూ- ఆయన నుంచి తాను భాష, సంస్కృతి, ఆధునికతల గురించి ఎంతో నేర్చుకున్నాను, అని ఆ ‘సమాంతర సాహిత్య వేదిక’ గురించి స్నేహంగా వివరిస్తూ, విరసానికి ఆయన బాహ్యమిత్రు నిగానే ఉండిపోయారని వివరించారు.

తన జీవితం లోని మరో దశ విరసం. ఆ సంస్థలో నూ, ఉద్యమం లోనూ భాగస్వాములైన కొందరు మిత్రుల గురించి రాశారు. విరసం అధ్యక్ష పదవి తనకు దేశ అధ్యక్ష పదవి కన్న గొప్పదని ప్రకటించుకున్న మహాకవి శ్రీ శ్రీ గురించి కొన్ని జ్ఞాపకాలు సరదా సంగతులు పంచుకున్నారు. “శ్రీశ్రీ వ్యక్తిత్వం విలక్షణమైనది. ఆయనలో ఒక పసి పిల్లవాడు, నిరంతర పాఠకుడు, ఒక విదూషకుడు, అక్షర ప్రహేళికలతో క్రీడించిన వ్యక్తిని చూశాను” అంటారు. కొన్ని వైరుధ్యాలకు లోనయినా, ధిక్కార స్వరంగా నిలిచి పోయారు. ఆనాటి స్తబ్ద వాతావరణంలో చరిత్రాత్మక పాత్ర పోషించారు అని శ్రీ శ్రీ జ్ఞాపకాలను నిక్షిప్తం చేశారు. మరణం లేని అక్షర శిల్పి గా రావిశాస్త్రిని గౌరవిస్తూ ఆయన “మానవ సంబంధాలకు అల్లుకున్న ఆత్మవంచనను, అనేక రకాల మానసిక వికారాలను అద్భుతంగా అక్షర బద్ధం చేసి” భారతీయ సాహిత్యంలోనే అపురూప రచయితగా మిగిలిపోయారని శ్లాఘించారు. ఉద్యమ సహచరుడిగా వరవరరావుతో 1961-62 ల నుండి ఏర్పడిన పరిచయం, నాటి నుండి నేటి వరకు కొనసాగుతున్న స్నేహం, పరస్పర గౌరవం గురించి చెబుతూ విప్లవ పంథా రాజకీయ విభేదాల మూలంగా విడిపోయినప్పటికి, ఆయనతో శతృ పూరిత వైరుధ్యం ఏనాడూ లేదని అంటారు. వరవరరావు అధ్యయనం, నిజాయితీ, చిత్తశుద్ది, నాయకత్వం, ఆయనలోని రాజకీయ ఎత్తుగడలు, నమ్మిన పంథా పట్ల పట్టుదల ఆకట్టుకునేవి. కవిగా, విమర్శకునిగా, రాజకీయ విశ్లేషకుడి గా, వక్తగా ఉన్నత స్థాయిలో నిలిచినవాడు అని గౌరవం ప్రకటించారు.

ఆధునిక తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానం గల కె. వి. రమణారెడ్డి గారి తో గల ఉద్యమ స్నేహానుబంధం తలచుకుంటూ అనేక ఆసక్తికర సంగతులు చెప్పారు. కె.వి. అర్. రచనా శైలి భాష, వాక్య నిర్మాణం కొంత క్లిష్టంగా వుండేవి. కానీ విమర్శనా పటిమ, లోతైన అవగాహన, పరిశోధన ఆశ్చర్య పరుస్తాయి అంటారు. మొదటి దశలో ఆయన దిగంబర కవులను ఆమోదించలేక పోవటం; తప్పో, ఒప్పో, నా దేశమే ఆరాధ్యమన్న ఉన్మాదాన్ని నేను దూరం పెట్టుకున్నాను, అని చెప్పటం, విరసం లో ఆయన నిర్వహించిన క్రియాశీల పాత్ర గురించి నిర్మొహమాటంగా ఎన్నో విశేషాలు చెప్పారు.

ఇక విరసం తో విభేదించి బయటకు వచ్చిన సహచరులు కూడా కాలక్రమంలో అనేక భిన్న మార్గాల లోకి వెళ్లిపోయారు. అలాటి వారిలో రాయల సీమ ఉద్యమ శీలి, కార్మిక నాయకునిగా వుంటూనే, గొప్ప అనువాద రచనలు, ఆక్సిజన్ సిలెండర్ల ద్వారా శ్వాస తీసుకుంటూ కూడా సృజనాత్మక సాహిత్యం సృష్టిస్తూ తీక్షణమైన మేధస్సుతో అరుదైన సాహితీ వేత్త గా ఆమోఘమైన కృషి చేసిన ప్రొద్దుటూరు ఎం. వి. రమణారెడ్డి; రాయలసీమ ప్రాంతీయ రాజకీ యాలలో తనదైన ముద్ర వేసిన భూమన్; జనసాహితి ప్రధాన కార్యదర్శి గాను, ప్రజాసాహితి ప్రధాన సంపాదకుని గాను వ్యవహరించిన కె. రవిబాబు; విప్లవ గ్రూపులలోని వైరుధ్యాలను ఎత్తి చూపి, ప్రతి విమర్శలకు ఏనాడూ బెదరిపోక సీనియర్ లాయరు గా నిలదొక్కుకున్న చెరుకూరి సత్యం; ప్రజాతంత్ర న్యాయవాది కంఠమేనని రవీంద్రరావు; ట్రాట్స్కీయిస్ట్ భావజాలం తో ప్రభావితుడై విప్లవ నిబద్దతతో సామాజిక ఉద్యమాలలో నిజాయితీ గా నిమగ్నమైన కామ్రేడ్ మోహన్ రెడ్డి వంటి వారిని తలుచుకున్న లఘు వ్యాసాలు వారి వారి వ్యక్తిత్వాల లోని విశేషాలను వెలికి తీస్తాయి.

పౌరహక్కుల నాయకులు ఎం. టి ఖాన్ ను సూఫీ సాధువుల వారసుని గాను, మార్క్సిస్టు మేధావి గాను బొమ్మ కట్టారు. మానవ హక్కులకై జీవించిన కె. బాలగోపాల్ సిద్ధాంతాన్ని పిడివాదం గా కాక హేతుబద్దంగా, యదార్ధ నిర్దిష్ట పరిస్థితులకు అన్వయించి తన శక్తి యుక్తులను సార్ధకం చేసుకున్న ఒక రాజీ పడని మేధావిగా, క్రియాశీలి గా అభివర్ణించారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకై జీవితాంతం పోరాడిన నిష్కళంక మిత్రుడు అర్ వి కె సత్య నారాయణకు కన్నీటి నివాళి సమర్పిస్తూ ఒ పి డి ఆర్ ప్రధాన కార్యదర్శిగా, భారత ఛైనా మిత్రమండలి జాతీయ కార్యదర్శు లలో ఒకరిగా ఆయన చేసిన నిరంతర కృషిని గుర్తు చేసుకుంటూ ఒక సామాన్య సైన్సు టీచరు జనసామాన్యపు గొంతుగా మారిన జీవితాన్ని పాఠకుల ముందుంచారు. అలాగే ఉరికంబం నీడలో నుంచి వెలువడిన బహుజన రచయిత, జర్నలిస్టు కె. రాజన్న ఆత్మ కథను నిఖిలేశ్వర్ చదివి తాను కదిలిపోయి పాఠకులను కదిలించే రీతిలో సవివరంగా చిత్రించారు. వెట్టిచాకిరికి వ్యతిరేకంగా పోరాడిన స్వామి అగ్నివేష్, ప్రత్యామ్నాయ సంస్కృతికోసం తపించిన బహు గ్రంధకర్త సి. వి, సంస్కృతి మూలాల అన్వేషి ఆచార్య జయధీర్ తిరుమలరావ్, రాజనీతి శాస్త్ర నిష్ణాతుడు, నిర్మొహమాటంగా తన రాజకీయ విశ్లేషణలు వ్యక్తంచేసే ప్రొఫెసర్, సుదీర్ఘకాలం కమ్యూనిస్టు ఉద్యమాలతో సంబంధం గల శ్రీ శేషాద్రి ; అసమాన రచయిత, దేశోద్ధారక గ్రంధమాల వ్యవస్థాపకుడు ప్రజలమనిషి వట్టికోట ఆళ్వార్ స్వామి, ప్రవహించిన జీవ కవిత్వమై నిలిచిన సౌమ్యుడు, అభ్యుదయవాది, సౌందర్యాత్మక రచయిత, చిత్రకారుడు శీలావీర్రాజు ; నిరంతరం గా కొత్త తరంతో సంభాషిస్తూ తన భావాలను, తాత్వికతను పంచుకుంటూ పోతున్న కవి, ఆధునిక తెలుగు కవితాభివ్యక్తికి లభించిన నూతన స్వరం కె. శివారెడ్డి; దళితుల జీవితాలపై భూస్వామ్య పీడనలో నలిగిన వ్యవసాయ కూలీలు, గిరిజనుల జీవన సమరం పై ఎనిమిది నవలలు రచించిన దళితేతర రచయిత, నవలాకారునిగా తన విశేష ప్రతిభను నిరూపించు కున్న డాక్టర్ కేశవరెడ్డి రచనలపై పరిశీలన, కొ.కు, శ్రీశ్రీ, గోపీచంద్ సంపుటాలకు సంపాదకత్వం వహించిన సాహిత్య పిపాసి, మార్క్సిస్టు మేధావిగా నూతన పరిణామాలను ఆకళింపు చేసుకున్నా, చారు మజుందార్ రాజకీయ పంథా పట్ల ఎందుకో విశ్వాసం సడలని నిరంతర అధ్యయన శీలి చలసాని ప్రసాద్; భాషాశాస్త్ర వేత్తగా అంతర్జాతీయ ఖ్యాతి నార్జించిన శ్రీ భద్రిరాజు కృష్ణ మూర్తి గారి విమర్శనా దృష్టి, ఆధునిక దృక్పథం అధ్యయనాల గురించి ఎన్నో విశేషాలు; రాసిన కొద్ది కథలతోనే తెలుగు కథకు ఒక ప్రత్యేక తను సంతరించి పెట్టిన రచయిత, ఇంగ్లీషు బోధించే ఆచార్యుడు, త్రిపుర గురించి నిఖిలేశ్వర్ గారు పంచిపెట్టిన అనేక సాహిత్య, వ్యక్తిగత అనుభవాలు తెలుగు పాఠకులకు ముందెరగని రుచిని చూపిస్తాయి. “విశ్వాసాలు నియంత్రణకు లోను కావు, విశ్వాసాల మూలంగా ఎవ్వరినీ నిర్బంధించ రాదు” అని తీర్పునిచ్చి భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడిన న్యాయమూర్తి జస్టిస్ చిన్నప రెడ్డి-నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, చెరబండరాజు లపై 1971 లో పెట్టిన పి.డి . యాక్ట్ కేసును కొట్టివేశారు. “కలాలకు సంకెళ్ళు లేవు” అనే ఉత్తేజాన్ని నింపేన ఆ తీర్పు నేడు రచయితలు, కార్యకర్తలు ఉపా చట్టాల కింద జైళ్ళలో మగ్గుతున్న నేపధ్యంలో, ఆలోచించే బుర్రలే ఎక్కువ ప్రమాదకరమని తీర్పులిస్తున్న సందర్భంలో ఎంతో స్పూర్తిని ఇస్తుంది.

ఈ పుస్తకంలో కనిపించే ఇద్దరు విశిష్ట వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఒకరు కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి కాగా మరొకరు కామ్రేడ్ దేవులపల్లి వేంకటేశ్వరరావు గారు. మామూలు అర్ధం లో వీరు రచయితలు కారు కానీ సాహిత్య ఉద్యమానికి దిక్సూచిగా నిలిచిన వారు. ఆనాటి సామాజిక ఉద్యమాలకు, విప్లవ ఆలోచనా పంథాలకు రూపురేఖలు కల్పించినవారు. భారత విప్లవ పంధాకే రూపమిచ్చిన వారు. నిఖిలేశ్వర్ గారికి రాజకీయ తత్వశాస్త్రంలో మార్గదర్శకులు. వారి సాన్నిహిత్యం మూలాన మార్క్సిస్టు, లెనినిస్టు సిద్దాంతాల పరంగా చాలా నేర్చుకోగలిగాము అని వారిపట్ల గౌరవాన్ని ప్రకటించారు నిఖిలేశ్వర్. నాగిరెడ్డి గారు 1976 లోనే మరణించటం వల్ల ఇద్దరిలోనూ కామ్రేడ్ దేవులపల్లి [డి. వి.] తో వీరి ప్రయాణం ఎక్కువకాలం నడిచింది. “తెలుగు క్షేత్రాన సాహిత్య కళా రంగాలను అధ్యయనం చేసి తమదైన అవగాహన తో ఒక శాస్త్రీయ వివేచన అందజేసిన విప్లవ నాయకుల్లో డి.వి. ముఖ్యులు.”

“విప్లవం అనేది ఒక దేశం, జాతి జీవితంలో అత్యంత సమగ్రమైన, అన్ని రంగాలను ఆకళింపు చేసుకుని నడిపించే జీవ చైతన్యం. రాజకీయ, ఆర్ధిక రంగాలతోపాటు సాహిత్య సాంస్కృతిక దిశలో ఒక శాస్త్రీయ అవగాహన వున్నపుడే విప్లవం సమగ్రమవుతుంది” అని నిఖిలేశ్వర్ అంటారు . ఆ అవగాహన పెరగటానికి ఈ చిన్న పుస్తకం తోడ్పడుతుంది. నిఖిలేశ్వర్ ఎవరి సాంగత్యంలో వున్నారు? ఎవరి తో కలిసి వివిధ ప్రజాసంఘాలలో పనిచేశారు? వారి ఆలోచనా క్రమం ఏ పరిణామాలు చెందుతూ వచ్చింది? అనే విషయాలు కూడా పరోక్షంగా ఈ సంగమం తెలియ జేస్తుంది. ఆయన తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పారు. ఎన్నో ఆసక్తికర విషయాలు సాహిత్య సంగమం లో ఉన్నాయి. అయితే ఒక కాల క్రమం గానీ, విశేష ప్రాతిపదికపై విభజన కానీ లేక పోవటం వల్లనూ, కొందరి విషయంలో రచనా సందర్భం ఏమిటో తెలియకపోవటం వల్లనూ పాఠకునికి కొంత అసౌకర్యం అనిపిస్తుంది. అంతే కాదు, కొన్ని విషయాలను ఆయన చాలా క్లుప్తంగా ప్రస్తావించారు. అందువల్ల అపారానుభవం గల నిఖిలేశ్వర్ గారి నుంచి ఆయా సంఘటనలకు సంబంధించి మరింత వివరంగ తెలుసుకోవాలనుకునే వారి ఉబలాటం ఉపశమించదు. అయినప్పటికీ సాహితీ ప్రియులందరూ చదవ తగ్గ పుస్తకం సాహితీ సంగమం. సామాజిక, సాంస్కృతిక, సాహిత్య అంశాల సంగమం ఇది.

పుట్టింది,పెరిగింది కొత్తగూడెం టౌన్. వైద్య విద్య చదివింది,వృత్తి సాగిస్తున్నది హైదరాబాదు నగరం లో. విద్యార్ధి దశ నుండి ప్రజాసాంస్కృతిక ఉద్యమ గమనంలో పాలు పంచుకుంటున్న వేకువ పూలు నవల, ఖలీల్ గిబ్రాన్ రచనల అనువాదాలు- ప్రవక్త, తిరుగు బాటు స్వరాలు కథలు, సోవియట్ సాహిత్య భాస్కరులు పుస్తక రూపం లో వెలువడ్డాయి. సామాజిక సాంస్కృతిక అంశాల పై అనేక వ్యాసాలు. మన తెలంగాణ, ఆంధ్రజ్యోతి, సాక్షి తదితర దిన పత్రికలలోనూ, ఉపాధ్యాయ ప్రగతి, ట్రెండింగ్ తెలుగు న్యూస్, కౌంటర్ కరెంట్ వంటి వెబ్ పత్రికలలోనూ తరచుగా కనిపిస్తాయి. సాహిత్య విశ్లేషణ అభిమాన పాత్ర మైన అంశం;. జ్వాల ప్రచురణల సంపాదక సభ్యునిగా ప్రముఖ విప్లవకవి జ్వాలాముఖి రచనలను ఐదు సంపుటాలుగా వెలువరించటం సంతృప్తి కలిగించిన అంశం.

Leave a Reply