అడవి బిడ్డ కుంజ కళ్యాణి ఆదివాసీ కోయ కవిత్వం గురించి మాట్లాడాలంటే ఆదివాసీ ప్రాకృతిక జీవితం గురించి వారి జీవన తాత్వికత గురించి తెలిసి వుండాలి. విత్తు నాటిన నాటినా విత్తు మొలకెత్తినా మొగ్గ తొడిగినా పూత పూసినా కాయ కాసినా కోత కోసినా పండగ చేసుకునే కోయ జన జీవన సంస్కృతి తెలిసి వుండాలి. సమ్మక్క సారలమ్మ పగిడిద్ద రాజుల సాహసం తెలియాలి. జంపన్న వాగు లోతు తాకి రాగలగాలి. పడిగెల్లోని ప్రతీకల వెనక దాగివున్న చరిత్రని అధ్యయనం చేయాలి. కోయ డోలీలు పుక్కిటబట్టి చెప్పే పూర్బం కథల సారాన్ని పట్టుకోవాలి. డెస్క్ దగ్గర కూర్చొని సాహిత్యాన్ని ఆస్వాదించే నాలాంటి వాళ్లకు అలవికాని పని అది. కళ్యాణి మాట కాదనలేక ఆమె కవిత్వాన్ని చేతుల్లోకి తీసుకున్నాను. ఏదైనా రాయడానికి చేతులాడలేదు.
కళ్యాణి కవిత్వంతో నా ప్రయాణం యెంతో వేదనాభరితం. అనుదినం ఆదివాసీల మరణవార్తల మధ్య సాగింది. నాలుగు మాటలు రాద్దామనుకున్న ప్రతి సందర్భంలోనూ యెన్నో కవితల దగ్గర వర్తమాన కల్లోలం తోసుకొచ్చి గుండె పట్టేసినట్టయింది. వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేసే నెపమ్మీద సొంత దేశ పౌరులపైనే యుద్ధం ప్రకటించి వైమానిక పదాతి దళాలతో పాలకులు చేస్తున్న అమానవీయ దాడుల మధ్య అక్షరాలు ఘనీభవించి ముందుకు కదలమని మొరాయించాయి. అడవి నుంచి చావు వాసన ముక్కు పుటాలకు ఘాటుగా తాకి వూపిరాడనితనం యెదురైంది. అడవి చెట్టూ పుట్టా గుట్టా గూడెం సమస్తం రక్తమోడుతూ ముంగిట నిలిచింది. ట్రాక్టర్లలోకి యెత్తివేస్తున్న గుట్టలకొద్దీ శవాలు కాళ్ళకి అడ్డుతగిలాయి. అమరుల నెత్తుటి త్యాగాలతో కళ్ళు చెమర్చాయి. పాలకుల శవరాజకీయాలు జుగుప్స కలిగించాయి. సామాజిక సంపదని వ్యక్తులకు కట్టబెట్టడానికి జాతి హననానికి పూనుకున్న దుర్మార్గం పట్ల అనేక సందర్భాల్లో ఆమె కవితల్లో వ్యక్తమైన అలవికాని క్రోధమే నన్నూ ఆవహించి యీ అడవి బిడ్డకు సన్నిహితం చేసింది.
కంక పిడాల్ని మాయం చేసినంత సులువుగా
ప్రాజెక్టుల పేర నా జాతినంతా
మాయం జేయ జూస్తున్న
ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఎన్నో (ఆదివాసీ)
అన్నప్పుడు కుంజ కళ్యాణి గొంతులో పలికిన సహజమైన ఆగ్రహం ఆమె కవిత్వం లోపలికి పయనించడానికి దారులు పరిచింది. దాదాపు పదిహేను సంవత్సరాలకు పైగా ఆమె రాస్తున్న కవిత్వాన్ని అర్థంచేసుకోడానికి తోడ్పడింది.
నా తల్లి పచ్చని అందాలను
ప్రాజెక్టులు కింద పూడ్చిపెట్టి
మానని మానసిక గాయాల గోడలు పేర్చి
అటు ఇటు కాకుంట
మా బతుకులనాగం జేస్తుండ్రు (ధ్వంసం)
అని ప్రభుత్వాల బూటకపు అభివృద్ధి ముసుగుల్ని తొలగించి చూపడంలో ఆమెలోని దృక్పథ స్పష్టత నన్ను మరింతగా కట్టిపడేసింది. ఆదివాసీ కవయిత్రిగా ఆమె ఆవిష్కరించిన కొండంత సజీవ కఠోర వాస్తవికతకు అద్దంపట్టే చిన్న ప్రయత్నం యిది.
***
అడవిలో యెత్తైన భారీ నీటి ప్రాజెక్టులు లోతైన మైనింగ్ ప్రాజెక్టులు విశాలమైన రోడ్లు పొడవైన పైప్ లైన్లు .. పేరు యేదైనా అభివృద్ధికి తొలి బలి పశువులు ఆదివాసీలే. అభివృద్ధి విస్తీర్ణత పెరిగే కొద్దీ విధ్వంసం పెరుగుతుంది. కుట్ర పూరితమైన యీ అభివృద్ధి నమూనాను కళ్యాణి తన కవిత్వంలో తిరస్కరించింది. అభివృద్ధి అంటే ఆదివాసీని అడవికి దూరం చేయడమే. అభివృద్ధి అంటే ఆదివాసీని అంగడి సరుకు చేయడమే. అభివృద్ధి అంటే బతుకుల్ని ఆగం చెయ్యడమే. అభివృద్ధి అంటే అడవి బిడ్డల వుసురు తీయడమే అని కళ్యాణి ఖరాఖండిగా తేల్చి చెప్పింది.
కళ్యాణి కవిత్వంలో రెండు ప్రధాన పాయలున్నాయి. ఒకటి ఆత్మగౌరవ స్వరం. మరొకటి ఆగ్రహ స్వరం. రెండింటిలోనూ పలికేది ప్రతిఘటనే. అది కొన్నిసార్లు వాచ్యమై ప్రకటితమౌతుంది. మరికొన్నిసార్లు ధ్వనిగర్భితమై అప్రకటితమౌతుంది. తరచి చూస్తే సాక్షాత్కారమౌతుంది.
‘నేనిప్పుడు మనిషిని కాదు. అంగడిలో సరుకుని. నా సంస్కృతి సరుకు. షోరూంలో డిస్ ప్లే గా మొత్తం నా బతుకు అమ్మకం కొనుగోలు మార్కెట్లో సరుకైనప్పుడు నా చావు మీ లాభాలకు పెట్టుబడి అయినప్పుడు నా రాతలన్నీ మీకు లోకువే. అయినా నా మొఖం నాది. పరాయి మొఖాన్ని తగిలించుకోను. నా మాట నాది. దాన్ని నాకు తెలిసిన అభివ్యక్తిలో పొదుగుతాను. నా భాషలోనే నేను రాస్తాను. నా గొంతుతోనే పలుకుతాను. మీ సాహిత్య ప్రమాణాల్లో నేను వొదగను. మీ ఆలంకారికత మీది. నా సహజత్వం నాది. అడవీ అడవిలో వెన్నెలా మీకు కాల్పనిక కవితా వస్తువు. కానీ అవి నా బతుకులో భాగం.’ ఇదీ అడవిబిడ్డ ఆత్మగౌరవ స్వరంలో బలంగా వినిపించే కవిత్వపు అంతస్సారం.
ఆదివాసీలను అమాయకులని అనడం వారిని చిన్నచూపు చూడటమే. ఆదివాసీలకు తమవైన జ్ఞాన వ్యవస్థలున్నాయి. మానవీయమైన సామాజిక నిర్మాణాలున్నాయి. ఊహకందని జీవన నైపుణ్యాలున్నాయి. జెకుముకి (జక్కముక్క) రాయితో నేలపైన నిప్పు రవ్వల నక్షత్రాలు మొలిపించి దునియాకి వెలుగు నేర్పిన అపారమైన ‘సాంకేతిక’ సంపద వుంది. నాగరికులకు ఆహారాన్నీ ఆరోగ్యాన్నీ అందించి వారి బతుకుల్ని కాపాడటం కోసం తమ జీవితాల్ని పణంగా పెట్టి చేసిన ‘శాస్త్రీయ’ ప్రయోగాలున్నాయి. ఈ స్పృహతో అవగాహనతో ఆదిమ కాలం నుంచి యిప్పటివరకూ తన జాతి చేసిన అసమాన త్యాగాల్ని కళ్యాణి యెత్తిపట్టి కొనియాడింది.
గుజ గుజ రేకుల నోటి పాటలు దిష్టానకుండ
నిప్పులు కనుగొని వండితే నేర్పిన మేము ..
ఏ పండు ఏ కాలంలో దొరుకునో
ఏ దుంప ఎన్ని పోషక విలువలున్నదో
ఏ యేరు ఏ రోగాన్ని నయంజేత్తదో..
ఎరుక జేసింది నా జాతే..
అని సగర్వంగా ప్రకటించింది. అదే సమయంలో ‘నాగరికతను అభివృద్ధి చేసిన మాకు / అనాగరిత్వాన్ని అంటగడతాండ్రు’ అని నిరసన తెలియజేస్తుంది. పుట్టల్లో పుట్టే ఉసుళ్ళు దగ్గర నుంచి గునుగు దగ్గలి తుమ్మి తూటి కూరలు పురోడు గొర్రెంకలు కంజులు వంటి గువ్వల మాంసం వరకూ ఆదివాసీల ఆహార వైవిధ్యం గురించి, ‘జెరం జెంత రానీయని తెల్ల చెన్న దుంపల’ గిరిజన వైద్యం గురించి ప్రస్తావించడంలో స్వీయ గరిమత్వాన్నీ ‘అడవి సల్లగా జూత్తే అన్నుండు మాకు’ అని ముక్తాయించడంలోని అతివేలమైన ఆర్తినీ గమనించండి. ఆర్థికంగా సాంస్కృతికంగా పరాయీకరణకు గురౌతున్న తన మూలాల్ని తడిమి చూసుకోవడం కళ్యాణిలో ప్రధానంగా గోచరిస్తుంది. గొడ్ల కొట్టంలో గొనె సంచి మీద తెరుచుకున్న ‘మూడో నేత్రం’ అయిన చదువును జీవితానికి దిక్సూచిగా వేగుచుక్కగా వెలుతురు చూపే దివిటీగా భావించినప్పటికీ తన మూలాలనుంచి అదే చదువు వేరు చేయటానికి కారణమైందన్న యెరుక కూడా కళ్యాణిలో స్ఫుటంగా కనిపిస్తుంది. ఆ క్రమంలో ఆమె తనను తాను ప్రతి నిమిషం అప్రమత్తం చేసుకుంటుంది. అందుకే ఆమె కవిత్వంలో నోస్టాల్జియాతో సమంగా నడుస్తోన్న చరిత్ర ప్రతిఫలిస్తుంది. వాక్యంలో ఆవేదనతో పాటు ఆవేశం పెల్లుబుకుతుంది. అందులో ఫిర్యాదు కన్నా నిరసనే యెక్కువ. అది ముక్కుసూటిగా వుంటుంది.
***
అడివంత ఎర్రగ పూసిన మోదుగ పువ్వు కళ్యాణి కవిత్వం. పజ్జొన్న ఊసలు బుక్కిన పసి జ్ఞాపకాలు ఆమె వాక్యాలు. అయిట్ల కప్పతల్లి పాట ఆమె మాట. పసిపిల్లల అరచేత ఎర్రగా పండే గోరింటాకు ఆమె వ్యక్తీకరణ. ఆధునికత సోకుతో అత్యాధునిక బడాయితో తెచ్చి పెట్టుకున్న అమూర్త ఔపమ్యాలు, అసంబద్ధ రూపకాలు, అస్పష్ట వుత్ప్రేక్షాలు అర్ధ రహిత అలంకారాలు ఆమె కవితలో కానరావు. ప్రకృతికి దగ్గరగా పరిసరాల్లో చుట్టూ అలుముకొని వున్న దైనందిన జీవితం కల్యాణి కవిత్వానికి వస్తువు. సరళత నిసర్గత స్వాభావికత ఆమె కవితా శిల్పం. స్వభావోక్తికి మించిన అలంకారం యేముంది? స్వభావోక్తి అంటే సత్యమే. కల్యాణి కవిత్వంలో అది నిప్పై రగులుతోంది. నెగడై మండుతుంది. కారుచిచ్చై కాలుతోంది. ఆ క్రమంలోనే పోలవరం నీళ్ళ కింద మరిగే ద్రోహ చరిత్రని నిష్పాక్షికంగా నిర్భయంగా బహిర్గతం చేయగలిగింది.ఏడు మండలాల బతుకు ఆనావాళ్ళని నిట్టనిలువుగా ముంచే హక్కు కోసం పంపకాలు వేసుకునే వ్యవస్థీ కృత రాజకీయ దుర్మార్గాన్ని గుండె లోతుల నుంచి ఖండించింది (బతుకు బీడు). ‘పంచుకొనీకి మేము సొంత ఆస్తులమా’ అని రెండు రాష్ట్రాల దొరల్ని ప్రశ్నిస్తుంది(ధ్వంసం). ఫ్యాక్టరీ నిర్మాణాల కింద పునాదుల్లో పూడ్చిపెట్టిన తన జాతి అస్తిపంజరాలను కలం గునపంతో తాటి గేగుల్ని తవ్వినట్టు తవ్వి వెలికితీస్తుంది.
నగరం, నాగరికత కళ్యాణిని కరప్ట్ చేయలేదు. అందువల్లే ఆమె తన ఆదివాసీ స్వభావాన్ని కోల్పోకుండా కవిగా మనగలిగింది. ఆదివాసిగా కొనసాగుతోంది. ఇప్పటికీ అడవి ఆమె ఆలోచనల్లో అలుముకొని వుంది. గూడెం ఆమె గుండెలో గూడు కట్టుకొని వుంది. కొండ ఆమె కొంగు ముడిలో యిమిడిపోయి వుంది. అందుకే యీ కవిత్వ భాష ఆదిమ వ్యక్తీకరణకు దగ్గరగా వుంది. ఆమె విశిష్ట విలక్షణ కవిత్వ నిర్మాణం లోతుల్లోకి వెళ్లే శక్తి నాకు లేదు గానీ ‘మట్టితానం’ ‘కొత్తల పండుగ’ ‘జోడెడ్ల జాతర’ లాంటి కవితలు యింతకు ముందు యితరులెవరూ రాయనివి, రాయలేనివి – అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. కవిత్వ డిక్షన్ ని స్వీయ ఆదివాసీ జీవితం నుంచి ఆమె వొంపుకున్న తీరు అబ్బురపరుస్తుంది. దాని ద్వారా తనదైన శైలిని ఆమె నిర్మించుకుంది. ఆదివాసీ జీవితంతో ముడివద్ద ‘ఇప్ప చెట్టు’ చుట్టూ అల్లిన మాటలు గమనించండి:
‘ఇప్ప ఇంటికి దూలమై మొగరమై బండి నొగై పండగా పబ్బాల్ల సారై ఉడికిన ఉలవలకు తోడై పజ్జొన్న కుడుముల పాకమై భద్రాద్రి రామునికి నైవేద్యమై పొమ్మలమ్మకు నెలవై గూడిపోళ్ళ అరుగుల వెలిగే దీపమై .. ఇంటిల్లిపాదిలో ఒకల్ల లెక్క’ – యిది మచ్చుకు మాత్రమే. విద్యాసాగర్ పొల్లా అనువదిస్తోన్న భారతీయ భాషల ఆదివాసీ కవిత్వాన్ని శ్రద్ధగా చదవండి. ‘అడవి గాసం’ వంటి కవితలు యెక్కడా యెవరూ రాసిన దాఖలాల్లేవు. ఆదివాసీదనం కోయదనం అమ్మదనం నిండుగా కలబోసుకున్న కళ్యాణి మాత్రమే చెప్పగల యిలాంటి పద్యాలెన్నో!
బతుకులో రుతువుకో వేట
కాలానికో పండుతో
అడవి అమ్మయి ఆకలి తీర్చుతుంది.
అని చెప్పింది గానీ నిజానికి అడవి ఆమెకు కవిత్వ దాహం తీర్చే చెలిమ అయింది. కొత్త తోగయ్యింది
చూడండి: కుమ్ములో ఉడికిన దోర బొబ్బెరకాయలు, నెగడు నిప్పులో కాలిన మక్కకంకులు, గడ్డివాములో మక్కిన సీతాఫలక్కాయలు, చిక్కుడు బూడిదలో ఉడికిన నల్ల చెన్నగడ్డలు, డొల్లల్ల తెచ్చిన జిన్న పండ్లు జిట్టీతలు, చెట్టు తొర్రలో పూసిన తొడిది పూలు, ఆకుపచ్చ చీరకు పసుపంచు నేసినట్టు చేనంతా నవ్వే జనుంపూలు, జీలగ చెట్ల జిగురు పండ్లు, అనప తీగలల్లుకున్న పజ్జొన్న, ఇర్స గంపల నిండా ఇప్పపూలు, గుట్ట జాలుకు ఎడ్లగాసుకుంటా ముల్లుగర్రతో తవ్వి తిన్న జాలోరు గడ్డలు, కుట్టు లేని విస్తర్ల వంటి తామరాకులతో నిండి ఉండే చెరువు, తొలాయిటికి తొలకరి జల్లు కురిస్తే సుట్టపోడొచ్చినట్టు మనసు నింపే మట్టి తల్లి వాసన .. యిలా అడవి చుట్టూ అల్లుకొని వున్న సమస్త ప్రపంచం నైసర్గిక వైవిధ్యం ప్రాకృతిక సంపద కళ్యాణి కవిత్వం నిండా చిక్కగా దట్టంగా పరచుకొని వుండి మనల్ని అడవి అంచున సబ్బండ కులాల వాళ్ళందర్నీ కలుపుకున్న గూడెం గుండెకు దగ్గరజేస్తాయి. బతుకు తెరువు కోసం ఆదివాసీ గూడేనికి వచ్చి సిన్నవ్వ పెద్దియ్య అని వరసలు కలుపుకునే తెనుగు మల్లయ్యకి చాకలెల్లయ్యకి తెగదారి మాదిగకి ఒడ్ల కమ్మర్లకీ తురక సాయిబుకీ ‘కలగూర గంప లాంటి గూడెం పెద్దక్కై ఆకలి తీర్చేటి గింజై ఆదరించింది’ అన్నప్పుడు ఆదివాసీ కవిగా కళ్యాణి యెక్కడ యే సామాజిక శక్తులతో కలిసి నడుస్తుందో స్పష్టంగా బోధపడుతుంది.
అయితే వీటన్నింటినీ దూరం చేసే దళారీల కుట్రల పట్ల కూడా యీ అడవిబిడ్డ మనల్ని అప్రమత్తం చేసింది. అడవిలో చెట్టూ చేమా మాయ చేసిందెవరు సెలయేళ్లు ఎండిందాక చూసిందెవరు అని ప్రశ్నిస్తోంది. ప్రశ్నలకు పరిష్కారం దిశగా ఆలోచనలు చేస్తోంది.
కంపన గట్రన ఎదిరెదిరు తెచ్చిన
తునికాకుని కట్టలు గడితే
కల్లెదార్లు కాసులు కట్టలు గట్టుకుండ్రు గానీ
అవ్వ, కొంగంచున రూపాయి అయినా కట్టనిది
అచ్చంగా అవ్వలాగనే మా గూడెం
దేవుళ్ళతో పాటు అందర్ని ఆదరించిన మా గూడెం
ఇయ్యాల అవ్వలాగనే మూగబోయింది
మంచమీద వడిసెలేస్తే పిట్టల్లా
ఎగిరిపోతున్న మా గూడాలు
ఇప్పుడిప్పుడే కొత్త తోగుల్ని వెతుక్కుంటున్నాయి.
***
స్వీయ అస్తిత్వం – పరాయీకరణల మధ్య ఘర్షణలో యెటువైపు మొగ్గుతారు అన్నదాని మీదే రచయితని అంచనా కట్టగలం. ఆదివాసీ వునికికి ప్రమాదమయ్యే అభివృద్ధి వెల్లువ సామాన్యమైంది కాదు. పీల గుండెలు అందులో పడి కొట్టుకుపోతాయి. కానీ కళ్యాణి వంటి తెగుదారి కవులు వెల్లువకు యెదురీదుతారు. సొంతదనాన్ని నిలుపుకుంటారు అనడానికి యీ సంపుటిలో కవితలే సాక్ష్యం. అయితే కవిగా కళ్యాణిలో భిన్న అస్తిత్వాలున్నాయి. ఆదివాసీ అస్తిత్వం స్త్రీ అస్తిత్వం అక్కడ సైతం ఆదివాసీ మహిళగా మరో వుప అస్తిత్వం. ఈ అస్తిత్వాల్నీ ఆమె శకలాలుగా గాక మొత్తంలో భాగంగానే చూస్తుంది. నిర్దిష్టంగా వుంటూనే సాధారణికతను స్వీకరించే దృష్టి ఆమెది. అందువల్లనే అన్నిటికీ వుమ్మడి శత్రువుని పసిగట్టగలిగింది. అవ్వ అవ్వలాంటి అడవి గూడెం కొంగంచున యెన్నడూ రూపాయిని కట్టలేకపోడానికి కారణం గ్రహించింది.
కాలమేదైనా సమూలంగా
మాయమయ్యేది నా అస్తిత్వమే
అక్షరం రానితనానికి వేలి ముద్ర సాక్ష్యంగా నిలిచి
వ్యాపారానికి తాకట్టు అయింది
సంస్కృతి సంపద
పారే ఏరుల ఆకుపచ్చదనం
దూరమై అక్కడేదో ఫ్యాక్టరీ మొలిచింది
అభివృద్ధి పేరిట నేడు
చెట్లన్నీ సిలువల్ని మోస్తున్న అస్తిపంజరాలు (అడవే కావాలిప్పుడు)
టైగర్ జోన్ల పేరు పెట్టి తల్లి నుంచి తరిమి
ఏకాకులుగా సేయజూసి
ప్రకృతి రక్షకుల్ని పారిపొమ్మంటుంది పెబుత్వం
మంచి సెబ్బర అన్నింటినీ అందరినీ ఆదరించిన అడవి
పచ్చి గాయాల దేహమై పరులకు చిక్కి
గనుల తవ్వకాల్లో గోడ మీద వేలాడే బొమ్మై
పచ్చగా చిగురించడం తప్పిపోయింది ఇప్పుడు (పచ్చి గాయాల దేహం)
అది అరకు కావచ్చు పోలవరం కావచ్చు టూరిజం కోరల్లో చిక్కుకున్నాకా చెట్టూ చేమా కొండా కోనా జీవ వైవిధ్యం వంటి పర్యావరణ విధ్వంసానికి మించి మానవావరణం నాశనమౌతుందన్న విషయాన్ని కళ్యాణి యెంత హృదయవిదారకంగా పట్టుకుందో!
నా సంస్కృతిని ప్రకటనలకు పరిమితం చేసి
నా చేతే నిరోధులకు నీళ్లు ఎలా వదలాలో
పాటలు పాడించి నృత్యాలు చేయించి
డాక్యుమెంటరీలకు దగుల్బాజేషాలకి
నా నృత్యం నచ్చిన వస్తువయిద్ది (కావళ్ళ నీళ్ళు)
ఆదివాసీలపై అమలవుతోన్న సామాజిక సాంస్కృతిక ఆర్థిక దోపిడీ పట్ల స్పష్టమైన అవగాహన వున్నప్పుడే యిటువంటి కవిత పుడుతుంది. అటువంటి రాజకీయ దృక్పథం వుండబట్టే విస్థాపనతో అడవికి దూరమవుతున్న ఆదివాసినీ రాజ్యం రాజేసిన అప్పుల కుంపట్లో ఆత్మహత్యల పాలవుతున్న పల్లె రైతునీ ఆమె వొక ‘వర్గం’గా చూసింది. మేడారం సమ్మక్క తెలంగాణ బతుకమ్మలను ముడివేయగలిగింది. గూడాన్నీ వూరినీ కలిపింది.
***
స్త్రీగా అందునా ఆదివాసి స్త్రీగా ఆమె వ్యక్తిగతంగా యెదుర్కొన్న పరాయితనాన్ని కవిత్వంలోకి అనువదించింది. చుట్టూ మనుషులు వున్నా అంతులేని అగాధ తీరాల్లో వొంటరితనం ముసిరినప్పుడు, మనసు పొరల్లోంచి బాధ ఘనీభవించిన మేఘమై కళ్ళు వర్షించాలనుకున్నప్పుడు, మసకబారిన అద్దాల్లో మానవ సంబంధాలు మట్టిలో కలుస్తున్నప్పుడు, పైసా పైసా పోగయి పోగాలం దాపురించి మనిషి మమతకు దూరమై మసలుతున్నప్పుడు, ఉండి లేని తనం యెరుకై బతుకు యిరుకైనప్పుడు ఆమె కవిత్వమై పలవరించింది.
గడిచిపోయిన జ్ఞాపకాలని పరిగేరినట్టో రేగు పళ్ళేరినట్టో యేరుకొని తెచ్చి కళ్యాణి కవిత్వ వాక్యాలుగా అల్లింది. తన చిన్నప్పటి నీడని తానే తొక్కుకుంటూ వాకిట్లో జ్ఞాపకాల ముగ్గుల్ని నింపి గొబ్బెమ్మయి పూచింది. అలా అన్జెప్పి అన్నీ మధుర స్మృతులే కావు; ‘పొద్దాంన్క రెక్కలు ముక్కలైనా తవామ్ లేనప్పుడు తౌడు బుక్కిన’ చేదు యాదులు కూడా వున్నాయి. మనసుతో పనిలేని సజీవ దహనాలున్నాయి. మూగ రోదనలున్నాయి.
అమ్మ మీద నాన్న మీద రాసిన కవితలు చూడండి. వాళ్ళ ప్రేమైక వ్యక్తిత్వాలు ప్రతి పదంలోనూ యెంతో ఆత్మీయంగా స్పృశిస్తున్నప్పటికీ వాళ్ళు కేవలం వ్యక్తులుగా మిగిలిపోకుండా మొత్తం ఆదివాసీ సముదాయానికీ ప్రతీకలుగా ప్రాతినిధ్యం వహిస్తూ సామాజికతను సంతరించుకుంటారు. అది కళ్యాణి కవిత్వంలో సాధించిన పరిణతి. వైయక్తికతని సామాజిక తలంలోకి తీసుకెళ్లే అనితరమైన కయిగట్టే నేర్పుని ఆమె సొంతం చేసుకుంది.
ఆధునిక యుగంలో సైతం స్త్రీల ప్రమేయం లేకనే తయారైన పురుష పురాణాల్ని కళ్యాణి నిర్ద్వంద్వంగా యెండగట్టింది.. అయితే ‘మహిళలందు ఆదివాసీ మహిళలు వేరయా’ అన్నట్టు దేశంలో అడవి బిడ్డలపై జరిగే అనేక అత్యాచార ఘటనలు యెక్కడా రికార్డు కావు. ఒకవేళ అయినా న్యాయానికి నోచుకోవు. అందుకే నిర్భయ చట్టాలు అభయ హస్తాలు ఆదివాసీలకు అందవని నిష్ఠుర నిజాన్ని చెబుతూనే
ప్రేమోన్మాదంలో ..
యాసిడ్ దాడులు కత్తుల పోట్లు
మర్మాంగాల్లో మాయని మచ్చలు ..
దాహం తీరని కామపిశాలపై వేటబాణం అవుతానని హెచ్చరిస్తుంది. స్త్రీవాదానికి అందని కోణాల్ని యెన్నిటినో కళ్యాణి ఆదివాసీ మహిళగా ‘అడవిబిడ్డ’లో ఆవిష్కరిస్తోంది. రాయీ రప్పా తుమ్మా తుప్పా నరికి పోడు సాగు చేసినట్టే మూడు కాలాలూ కవిత్వమై జీవిస్తోంది.
***
ఒక ఆదివాసీ కవయిత్రి నుంచి తెలుగులో వస్తోన్న తొలి కవితా సంపుటి యిది. దేశమంతటా పేరుగాంచిన జెసింతా కర్కెట్టా పూనం వాసం సావిత్రి బడాయిక్ వందనా టేటే ప్రతిభా తిగ్గా ఒరాన్ గులంచో కుమారి వంటి ఆదివాసీ కవయిత్రుల సరసన యిప్పుడు కవయిత్రి కుంజ కల్యాణికి విశిష్టమైన స్థానం లభిస్తోంది.
కల్యాణి విశిష్టతకు కారణాలు రెండు. ఒకటి: ఆమె స్వీకరించిన వస్తువు. అది ఆమె జీవితం నుంచి వచ్చినది. కోయ ఆదివాసీ జీవితంలోని అనేక సామాజిక రాజకీయ పార్శ్వాలను స్పృశించింది. రెండు: సజీవమైన భాష. అది సాంస్కృతిక జీవితంతో ముడివడి వున్నది. అది మట్టి పరిమళం అద్దుకున్న అచ్చమైన అమ్మ నుడి. సంస్కృతీకరణకి గురికాని జనవ్యవహారంలో ‘వినిపించే’ ప్రాదేశిక పదజాలం మౌఖిక వుచ్చరణతో సహా కవితల్లో సహజంగా వొదిగిపోయింది. సాంప్రదాయిక సాహిత్య వ్యవస్థలు నిర్మించిన చట్రాల్ని ధ్వంసించి నిశ్చిత నిశ్చయాల్ని ఛేదించి కవిత్వ భాషకే కొత్త నిర్వచనాలు రచిస్తోంది. కళ్యాణి కవిత్వ భాష తెలంగాణా తెలుగును సంపద్వంతం చేసిందని చెప్పడానికి నేను సంకోచించను. కొత్త పనిముట్లు వెతుక్కొని వ్యాఖ్యానించవలసిన బాధ్యత యిప్పుడు విమర్శకులదే. విలక్షణమైన తనదైన కవిత్వ వ్యక్తీకరణతో ఆలస్యంగానైనా సంపుటి రూపంలో వస్తున్న ‘అడవి బిడ్డ’ను స్వాగతిస్తూ అభినందిస్తూ చివరిగా ఒక మాట – దేశమంతటా మరీ ముఖ్యంగా మధ్య భారతంలో ఈశాన్య రాష్ట్రాల్లో జల్ జమీన్ జంగిల్ నినాదంతో ఆదివాసీలు చేస్తున్న కార్పొరేట్ వ్యతిరేక పోరాటాలు వాస్తవానికి తమ వునికిని కాపాడుకోడం కోసం కాదు; ఆకుపచ్చని అడవిని కాపాడటం కోసం, దేశాన్ని కాపాడటం కోసం. దేశంలో పుట్టబోయే బిడ్డల భవిష్యత్తుకు ఆదివాసీలు హామీపడుతున్నారు. తమ ప్రాణాల్ని పణంగా పెట్టి దళారీ రాజ్యంతో మడమ తిప్పని యుద్ధం చేస్తూ వున్నారు. అడవి బిడ్డ కవయిత్రి కళ్యాణి మాటల్లోనే చెప్పాలంటే –
ఎప్పుడైనా..
నా జాతి రక్తాలోడితేనే
సాగు రవ్వంత జీవనం
.. .. ..
మేము అడవిని కాస్తున్న కాపరులం
తల్లినమ్మి బతకం .. నమ్మే బతుకుతం
మా తావుల పొంటి మేమె తిరగవడితిమి
ఎవల తెరువుకు ఎందుకని బోతము
తెగబడి తగువుకు వత్తే
తరిమి తరిమి కొడతం
యుద్ధం మేమెరిగిన విద్య కదా!! (యుద్ధం)
అందులో భాగమౌదాం.