ఇంకా… అవునింకా…విలవిల్లాడుతూనే ఉన్నది…ప్రజా తెలంగాణా!

వేలాది యోధుల
బలిదానాల
నెత్తుటి త్యాగాల
పునాదులపై..

మొలిచి నిలిచిన
తెలంగాణా కు
పట్టిన చీడలే
పాలకు లెల్లా..!

బతుకంతా
నిత్య గాయాల
కన్నీటి ఘోషలే
వారసత్వంగా..

ఈ నేల తల్లి బిడ్డలు
కన్న కలలూ
పెట్టుకున్న ఆశలూ
సాకారం కోసం కాకుండా..

కేంద్ర రాష్ట్రాలోక్కటై
ఏకంగా బరితెగించి
అన్యాయాన్నెదిరించే
విముక్తి ఉద్యమాలనూ..

సర్వస్వం వొదిలేసి
ప్రాణాల్నే పోరాటాలకు
చిరునామాలుగా
మలుచుకున్న వీరులనూ..

నేల కూల్చి
రూపుమాపే
అడ్డమైన ఆపరేషన్లకు
కొవ్వెక్కి కాలుదువ్వే..

అరాచక రాజ్య
ఉన్మాద మూకల
హంతక ముఠాల
కబంద హస్తాల్లో..

ఇంకా..అవునింకా..
విలవిల్లాడుతూనే ఉన్నది..
విముక్తం కావాల్సే ఉన్నది..
ప్రజా తెలంగాణా..!!

పుట్టిన ఊరు కొల్లాపూర్ - వరిదేలవీధి(1960లో), ఇప్పటి నాగర్ కర్నూల్ జిల్లా. నేపథ్యం: దోయబడ్డ బాల్యం, కష్టాలు కన్నీళ్లు, ఆకలి అవమానాలే తోబుట్టువులు. చెమట సౌరభాల మడి అమ్మవడే బడిగా... తలాపున నల్లమల అడవే ఆట మైదానంగా... ఎలుగెత్తి పారే కృష్ణా నది చేతికందే దూరంలో ఉండీ గొంతు తడవని దాహంతో ఏళ్లకేళ్లు కురవని మేఘాలతో పరుగు తీసే మేకలతో, చెట్టు పుట్టలతోచెట్టా పట్టాలేసుకు సాగిన సాహచర్యం. వృత్తి: న్యాయవాదం. ప్రవృత్తి : సాహిత్య అధ్యయనం. 1978 నుండి కవిత్వం, పాట, వ్యాసం, కథా, చిత్ర, నాటిక రచన, నటన. రచనలు : 1. 'స్పందన'( కవితా సంకలనం) 1985 గద్వాల్ విరసం రాష్ట్ర సభల్లో ఆవిష్కరణ. 2. 'సేద్యం' (కవితా సంకలనం), 3. 'కఫన్' (కథా సంకలనం), 4. సాంగ్ ఆఫ్ ఫర్రోస్ (కవిత్వం) ( ఆంగ్లానువాదం: అర్విణి రాజేంద్రబాబు గారిచే), 5. 'రాహేc', 6. 'జాబిలి ఖైదు', 7. 'దగ్ధ స్వప్నం' (కవితా సంకలనాలు ప్రచురించారు.)

One thought on “ఇంకా… అవునింకా…విలవిల్లాడుతూనే ఉన్నది…ప్రజా తెలంగాణా!

Leave a Reply