…. అనుంది

ఎటు చూసినా…
కంటికి గుత్తులు గుత్తులుగా
పూస్తున్న అశ్రువులు
అసహాయతలో
నానిన శనగలల్లే
ఉబ్బిన జతల జతల చూపులు
అపహాస్యాల, అసహ్యాల జ్వాలలో
ఆహుతైన ఆత్మలు
కొలతలను చేరలేక భంగపడ్డ ఆశలు
శిథిలమౌతున్న మూలాల్లో
మగ్గుతున్న బంధాలు
వేకువ కూడ
వెలుగునివ్వలేని వేదనలు
అన్నింటి మధ్య
ఒక్కసారి ఒకేఒక్కసారి
నిటారుగా నిలవాలనుంది
అవనతమౌతున్న ఆత్మలను మళ్ళీ ఎగిరేయాలనుంది
బలంగ స్వచ్ఛంగ ఒక్కసారి ఉక్కులాంటి ఒక్కమాట పలకాలనుంది
‘నేనున్నానని’

పుట్టింది కర్నూలు. కవయిత్రి, కథా రచయిత, అధ్యాపకురాలు. శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ నుంచి ఎం.ఏ(తెలుగు), ఎం.ఫిల్ (కళ్యాణసుందరీ జగన్నాథ్ కథలు - ఒక పరిశీలన), ఎం.ఈడీ(అన్నామళై యూనివర్సిటీ) చదివారు. వివిధ పత్రికల్లో కవితలు, కథలు ప్రచురితమయ్యాయి. 13కథలు రేడియోలో ప్రసారమయ్యాయి. ప్రస్తుతం కర్నూలులో ఓ ప్రైవేట్ పాఠశాలలలో ప్రధానోపాధ్యాయినిగా పనిచేస్తున్నారు.

Leave a Reply